6, ఆగస్టు 2020, గురువారం

ఈ జీవితానికి పని పూర్తయింది

పెద్దల ఆశీశ్శులతో, ఆత్మీయుల ఆదరణతో, పిల్లల ప్రేమాభిమానాలతో కరోనా నేపథ్యంలో సైతం మా ఆవిడ ఏడూడి ,(సంవత్సరీకాలు) భగవంతుని దయతో నిర్విఘ్నంగా నేటితో పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల క్రతువులో నేను నిమిత్తమాతృడిని. కొడుకులు, కోడళ్ళు యావత్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు.

మొత్తం కార్యక్రమంలో అందరికీ కళ్ళ నీళ్ళు తెప్పించింది మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి వ్యాఖ్య:

"మాకన్నా ఎంతో చిన్నదైన మా తమ్ముడి భార్యకు దండాలు పెట్టడం ఎంతో బాధ కలుగుతున్నది . ఏటా అమ్మ నాన్నల తద్దినాలకు వెళ్లి, అదే ఇంట్లో ఎన్ని సంవత్సరాలనుంచో దండాలు పెడుతూ ఉన్నాము .అదే ఇంట్లో ఈరోజు ఇలా చిన్న మనిషికి నమస్కరించి రావడం
మనసును కలచి వేసింది .
అమ్మ నాన్నల తద్దినాలు పెట్టినప్పుడు , తమ్ముడి భార్య నిర్మల సర్వం తానుగా అన్ని ఏర్పాట్లు చేసి , పురో హితునితో మాట్లాడటం, వంటమనిషితో మాట్లాడటం ,
ధోవతులు తేవడం ,అందరికీ ఫోన్లు చేయడం , మడి కట్టుకొని అన్నీ ఏర్పాట్లు స్వయంగా, శ్రద్ధగా, నిష్ఠగా చూసుకొనేది .
అటువంటిది ఆ ఇంట్లోనే ఆమె పిండాలకు దణ్ణం పెట్టడం మా దురదృష్టం .మనం దేనినన్న జయించవచ్చు కానీ ,
విధిని మాత్రం జయించలేము .విధికి తలవంచి రాజీ పడటం మాత్రమే మనం చేయకలిగే కర్తవ్యం .
ఆమె పవిత్ర ఆత్మకు
శ్రద్దాంజలి . ఓం శాంతి శాంతి" (05-08-2020)




ఇంటికి చేరిన పుస్తకం - పది భావజాలాలు


ఎస్. జైపాల్ రెడ్డిగారు రాసిన పది భావజాలాలుఅనే పుస్తకం నిన్ననే ఇంటికి చేరింది. ముద్రణ విషయంలోనే కాదు, ఆ పుస్తకాన్ని ఆత్మీయులకు చేరవేసే విషయంలో కూడా వారి కుమారుడు సూదిని ఆనంద్ రెడ్డిగారు చాలా శ్రమ తీసుకున్నారు అనిపించింది.
మితృలు భండారు శ్రీనివాసరావు గారికి కీర్తిశేషులు ఎస్. జైపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్ధంఅంటూ వారి శ్రీమతి లక్ష్మీ జైపాల్ రెడ్డిగారి పేరిట ప్రత్యేకంగా అచ్చొత్తి౦చిన ఒక కార్డును కూడా పుస్తకానికి జతచేసి పంపడంలో వారి సౌజన్యం కనిపించింది.
జైపాల్ రెడ్డిగారు ఎమ్మెల్యేగా వున్ననాటి నుంచి ఒక విలేకరిగా నాకు ఆయనతో పరిచయం. ఆయనది Oxford English అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. అంత చక్కటి ఆంగ్లభాషా పరిజ్ఞానం. ఒక్కోసారి ఆయన మాట్లాడింది రిపోర్ట్ చేయాలంటే డిక్షనరీ చూడాలి అని హాస్యోక్తిగా చెప్పుకునేవారు. అలాంటి ప్రజ్ఞావంతుడు ఇంగ్లీష్ లో రాసిన గ్రంధాన్ని తెనుగు చేయడం అంటే కత్తి మీద సామే. అయితే ఈ పుస్తకాన్ని అనువదించిన ప్రముఖ పాత్రికేయులు కల్లూరి భాస్కరం గారికి ఈ సాముగరిడీలు వెన్నతో పెట్టిన విద్య. జైపాల్ రెడ్డిగారు తమ ఈ పది వ్యాసాలకు వస్తువుగా ఎంచుకున్నది ఆషామాషీ అంశాలు కావు. మొత్తం ప్రపంచ చరిత్రను ఆపోసన పట్టి రాసినట్టుగా అనిపించే సైద్ధాంతిక సూత్రాలను ఆయన తన అనుభవంతో రంగరించి అక్షరరూపం ఇచ్చారు. ఆ రూపానికి తెలుగులో సొగసులు అద్దారు భాస్కరం గారు.
2005 లో జైపాల్ రెడ్డిగారు కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసిన స్నాతకోత్సవ ప్రసంగాన్ని ఆయన తన ముందుమాటలో సవిస్తరంగా ప్రస్తావించారు. ఆ ప్రస్తావనలో ఆయన వినయశీలత కనబడుతుంది. అది ఇలా మొదలవుతుంది.
నా ఇరవైల నుంచి సహ విద్యార్ధుల ముందు, రాజకీయ సహచరుల ముందు,మీడియా నిపుణుల ముందు, విద్యావేత్తల ముందు నేనేదో పెద్ద మేధావిననుకుంటూ పొగరుతో జంకు లేకుండా ఆశుప్రసంగాలు చేస్తుండేవాడిని. అదృష్టం కలిసొచ్చి అలాంటి బడాయి ప్రసంగాలతో నలభయ్ ఏళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడుపుకొచ్చాను. అంతేతప్ప నేను బహుముఖ పాండిత్యం వున్నవాడిని కాదు. పార్లమెంటు సభ్యుడిగా ఎంతోకొంత రాణించడానికి సరిపోయినంత సాధారణ లోకజ్ఞానం వుంటే చాలుననుకునే వృత్తిరాజకీయవాదిని మాత్రమే
సరే! ఇది ఆయన సౌజన్యానికి సంబంధించిన విషయం. నాలుగు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, ఏడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు అంటే జైపాల్ రెడ్డి గారు తానుగా చెప్పుకున్నట్టు ఎంతోకొంత రాణించిన ప్రజాప్రతినిధి ఎంతమాత్రం కాదు.
ఇక పుస్తకంలో ఆయన ప్రస్తావించిన పది భావజాలాలు ప్రజలు ప్రతి రోజూ వింటున్నవే కానీ వాటి మూలాల్లోకి వెళ్లి జైపాల్ రెడ్డి గారు వాటిని వివరించిన విధానం మెచ్చుకోదగ్గది. దాన్ని సరళతరంగా తెనుగు చేయడానికి ఎంతో శ్రమ పడిన కల్లూరి భాస్కరం గారి కృషి అనన్య సామాన్యం.
గోపాల కృష్ణ గాంధీ గారు ముందు మాట రాసారు. ఈ పుస్తకం గురించి శ్రీయుతులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ దీపక్ నయ్యర్ రాసిన పరిచయ వాక్యాలను కూడా పొందుపరిచారు.
ఓరియంట్ బ్లాక్ స్వాన్ వారు ప్రచురించిన ఈ మూడు వందల పైచిలుకు పేజీల పుస్తకంలో ధర గురించిన ప్రసక్తి లేదు. (05-08-2020))



2, ఆగస్టు 2020, ఆదివారం

అంజయ్య గారిపై రాజీవ్ గాంధీకి కోపం ఎందుకు వచ్చింది?

ఓ రోజు మధ్యాన్నం ముఖ్యమంత్రి అంజయ్య యధావిధిగా సచివాలయంలో కొలువు తీరారు. ఇలా కాలక్షేపాలు చేయడానికి కారణం ఆయనే చెప్పారు.  తెల్లారుతూనే రాష్ట్ర పోలీసు హెడ్డు సీఎం ని కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్తితి వివరిస్తారు. ఆర్ధిక శాఖకు చెందిన అత్యున్నత అధికారి ఒకరు అంతకు ముందు రోజే ముఖ్యమంత్రికి  రాష్ట్ర ఖజానా  స్తితి గతులు, అంటే  ఖర్చులూ, పన్ను వసూళ్లు వగైరా ఏరోజుకారోజే తెలియచేస్తారు. ఈ రెండూ బాగుంటే ఇక మనం  చేసేది ఏముంటుందని  రొటీన్ ఫైళ్ళు సంతకాలు చేసుకుంటూ మంత్రివర్గ సహచరులతో, పేషీ అధికారులతో, జర్నలిస్టు మిత్రులతో హాయిగా  పిచ్చాపాటీ కాలక్షేపం చేయడం ఆయనకు రివాజు.  ఆ రోజు అలా సభ సాగుతూ వుండగా మొయినుద్దీన్ (సిఎం ఆంతరంగిక  కార్యదర్శి) వచ్చి అంజయ్య గారి చెవిలో ఏదో చెప్పారు. వెంటనే ఆయన హడావిడిగా లేచి వెళ్లి యాంటీ రూములో ఫోను మాట్లాడివచ్చారు. రమణమూర్తి గారిని పక్కకు తీసుకువెళ్ళి ఏదో చెప్పారు. వూళ్ళో కట్టిన బ్యానర్లు వగైరా వెంటనే తీసేవేసే పని చూడమని చెబుతున్నట్టు అర్ధం అవుతూనే వుంది. (ఇక్కడ ఓ విషయం చెప్పాలి, అంజయ్యగారి ఆంతరంగిక బృందం గురించి వెంకయ్యనాయుడు గారు కాబోలు అసెంబ్లీలో ప్రాసయుక్తంగా ‘ఇంట్లో ఇంద్రసేనారెడ్డి, రూములో రమణమూర్తి, ముంగిట్లో మొయినుద్దీన్, ఇలా ఇంతమందిని దాటుకుని వెళ్ళాలి అంజయ్య గారి దర్శనం కావాలంటే’ అనేవారు. పూర్తి పాఠం పాశం యాదగిరి చెప్పాలి. ఇంద్రసేనారెడ్డి అంటే ఆ రోజుల్లో యువజన కాంగ్రెస్ నాయకుడు).

జరిగింది ఏమిటంటే రాజీవ్ గాంధీ మొదటిసారి హైదరాబాదు వస్తున్నారు. నగరమంతా ఆయనకు స్వాగతం చెబుతూ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేసారు. ఇలాంటి ఆర్భాటాలు రాజీవ్ కు నచ్చవు అని తెలుసుకున్న కొందరు పార్టీ నాయకులు ఆ విషయాన్ని చిలవలు, పలవలు చేర్చి ఢిల్లీకి మోశారు. ఆ రోజు వచ్చిన ఆ ఫోను పార్టీ అధిష్టాన దేవతల పూజారి నుంచి. తక్షణం అవన్నీ తొలగించాలని హుకుం.

మర్నాడు రాజీవ్ పాసింజర్ ఫ్లయిట్ లో ఒక సాధారణ ప్రయాణీకుడి మాదిరిగా బేగంపేటలోని విమానాశ్రయంలో దిగారు. విషయం తెలియని వందలాదిమంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎయిర్ పోర్ట్ వెలుపల  మేళాలు మోగిస్తూ, డప్పులు కొట్టుకుంటూ, డాన్సులు చేస్తూ, మిఠాయిలు పంచిపెడుతూ, పూలు వెదజల్లుతూ, పుష్పహారాలతో స్వాగతం చెప్పే ప్రయత్నాల్లో వున్నారు. రాజీవ్ బయటకు వచ్చి కారు ఎక్కేటప్పటికి ఇదీ పరిస్తితి. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. అదంతా అంజయ్య గారి మీదికి మళ్ళింది.

సరే! తర్వాత ఏం జరిగింది అన్నది అందరికీ తెలుసు.

ఎయిర్ పోర్టులో రాజీవ్ అకాల ఆగ్రహానికి కారణం ఏమిటన్నది తర్వాత డాక్టర్ ఏపీ. రంగారావు ఇలా విశ్లేషించారు. రాజీవ్ రాజకీయాల్లోకి రాకముందు విమానాల పైలట్. ఎయిర్ పోర్టులో  పక్షి కనిపిస్తే పైలట్లకు పడదు. ఎందుకంటే ఆకాశంలో  ఎగిరే విమానాన్ని ఒక చిన్నపక్షి దీకొట్టినా  దానికి ప్రమాదమే. కాంగ్రెస్ కార్యకర్తలు పూలు, మిఠాయిలతో హడావిడి చేయడం గమనించిన రాజీవ్, వాటికోసం పక్షులు  వచ్చే అవకాసం వుందనుకున్నారు. ఇందుకు ఆ డాక్టర్ చెప్పిన ఉదాహరణ ఏమిటంటే.

ఒక రోగి కిందపడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. ఇంటిల్లిపాదీ అతడి చుట్టూ మూగి ఆందోళన పడుతుంటారు. ఈ స్తితిలో అక్కడకు వచ్చిన ఏ డాక్టర్ అయినా బంధువులపై కసురుకుంటాడు. ముందు అక్కడి నుండి వెళ్ళిపొండి, అతడికి గాలి తగలాలి’ అని గట్టిగా కేకలు వేస్తాడు. ఆ వైద్యుడు ఆగ్రహించింది ఒక మనిషిగా కాదు, ఒక డాక్టర్ గా. అలాగే విమానాశ్రయంలో కూడా రాజీవ్ తటాలున ఆగ్రహించడానికి ఇలాంటిదే కారణం కావచ్చని డాక్టర్ రంగారావు అభిప్రాయం. (నిజానికి రాజకీయ కారణాలు కూడా దోహదం చేసిన మాట కాదనలేము)               


1, ఆగస్టు 2020, శనివారం

స్వరయవ్వన రహస్యం

ఒకానొక కాలంలో రేడియో చిన్నక్కగా తన సుస్వరంతో లక్షలాదిమంది శ్రోతలను అలరించిన రతన్ ప్రసాద్ కొద్దిసేపటి క్రితం ఫోను చేశారు. జర్నలిస్ట్ డైరీ ఫేం సతీష్ బాబు రూపొందించిన వీడియో చూసారట. అందులో తన గురించిన ప్రస్తావన వుందని మురిసిపోతూ చెప్పారు. ప్రస్తుతం ఆవిడ ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. సతీష్ కు థాంక్స్ చెప్పు బాబూ అని కోరారు.  

“మేమెవ్వరం రేడియోలో ఉద్యోగం అనుకుని చేయలేదు. కళాకారులకి కావాల్సింది కాసింత ప్రశంశ. అది మంచి టానిక్కులా పనిచేస్తుంది” అని అంటూ కొన్నేళ్ళ క్రితం సంఘటనను గుర్తుచేసుకున్నారు.

రేడియో న్యూస్ రీడర్ డి. వెంకట్రామయ్య గారు ఆకాశవాణిలో చిరకాలం పనిచేసిన వారితో ఒక ఇష్టాగోష్టి సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికి కొద్ది రోజుల క్రితం రతన్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ‘నువ్వు నమ్మవు కానీ బాబూ నేను చావు ముఖంలో అడుగు పెట్టి మళ్ళీ బయటకు వచ్చాను. మా పిల్లలు ఆ మీటింగుకు ఇప్పుడు వెళ్లకపొతే ఏం’ అంటూ అభ్యంతర పెట్టారు. నా పోరు పడలేక తీసుకువచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన నన్ను చూస్తూనే నువ్వొక మాట అన్నావు, ‘ఏమండీ రతన్ ప్రసాద్ గారూ, మీ స్వర యవ్వన రహస్యం ఏమిటో చెబుదురూ’ అని. నిజం చెప్పొద్దూ! నేను ఎనభయ్ ఎనిమిదేళ్ళకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు నువ్వన్న ఆ ఒక్క మాటే కారణం. అది మంచి టానిక్కులా పనిచేసింది. అంతకుముందు అనారోగ్యంతో చాలా అవస్థలు పడ్డాను. కానీ ఆరోజు నుంచి నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను. మా పిల్లలతో ఎప్పుడూ అంటుంటాను, శ్రీనివాసరావు ఆ ఒక్క మాటతో నాకు పునర్జన్మ ఇచ్చాడు అని. రేపోమాపో ఎనభయ్ తొమ్మిది వస్తుంది. ఈ కరోనా కాలం ముగిసి మళ్ళీ హైదరాబాదు ఎప్పుడు వస్తానో తెలవదు. ఈరోజు నీ పోస్టు చూసి ఫోన్ చేయాలనిపించింది. సతీష్ కు కూడా చెప్పు. ఈ వయస్సులోవున్న మాలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని ప్రోగ్రాం లో చేర్చినందుకు. వుంటాను నాయనా! ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆవిడను అడిగానని చెప్పు అనడానికి  నాకు నోట మాట రావడం లేదు. పాపం చిన్న వయసులోనే పోయింది. ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నవ్వుతూ, ఆప్యాయంగా మాట్లాడేది.  ప్రసాద్ గారు పోయిన తర్వాత నాకూ ఒంటరితనంలో బాధ ఏమిటో తెలుస్తోంది”

ఆవిడ అలా మాట్లాడుతూనే వున్నారు. నా ఆలోచనలో నేను వున్నాను.

ఒక మంచి మాటలో ఇంతటి శక్తి ఉందా!  

Image may contain: Ramarao Bondada and Bhandaru Srinivas Rao, people standing and indoor 

(01-08-2020)      

 


"మన రేడియో, మా రేడియో, నా రేడియో"


అయిదేళ్ళ క్రితం కాబోలు నా మితృడు జర్నలిస్ట్ డైరీ సతీష్ రూపొందించిన వీడియోలో నేను.
'రేడియో కార్మికుడు' అని నన్ను పరిచయం చేసిన సతీష్ సహృదయతకు నా ధన్యవాదాలు.

Image may contain: Bhandaru Srinivas Rao