2, ఏప్రిల్ 2015, గురువారం

పోయినోళ్ళు అందరు మంచోళ్ళు

శశిశ్రీ - కడప జిల్లాకు మా రేడియో విలేకరి.


వార్త ఇవ్వడానికి అప్పుడప్పుడు ఫోను చేసేవాడు. వార్తకు ముందు అందర్నీ పేరు పేరునా అడిగేవాడు. చాలా ఏళ్ళ వరకు అతడో మంచి రచయిత అనీ, ముస్లిం అనీ తెలియదు. పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారి ప్రియ శిష్యుడు. ఒకసారి హైదరాబాదు వచ్చి తను ఎడిట్ చేసే ఓ పత్రిక ఇచ్చాడు. అప్పుడు తెలిసింది శశిశ్రీ ఓ రచయిత అని. మంచివాడు కాబట్టే  ముందుగా తప్పుకున్నాడు. ఎవరికి సంతాపం తెలపాలో తెలియని దుస్తితి నాది. అతడు తప్ప అతడి కుటుంబంలో ఎవ్వరూ తెలవదు. జర్నలిస్టులకు ఇలాటి శాపం ఏదో వున్నట్టు వుంది. వాళ్ళు అందరికీ తేలుస్తారు. వారి కుటుంబం వాళ్ళు ఎవ్వరో ఎవ్వరికీ తెలియదు. -  

నవ్వుల్ నవ్వుల్



వంక
విమానంలో పక్క సీట్లో కూర్చున్న అందమైన  యువతితో మాటలు కలపాలనుకున్నాడు ఏకాంబరం.
'మీ వొంటికి రాసుకున్న సెంటు ఏం బ్రాండో తెలియదు కాని అద్భుతంగా వుంది. అదేమిటో చెబితే నేను మా ఆవిడకు కూడా  కొనిస్తాను'
'వద్దు లెండి. ఇది రాసుకుంటే ఏ వెధవో  ఇలాగే మీ ఆవిడతో మాటలు కలపాలని చూస్తాడు'
అదేమరి!
తల్లి : 'టిప్పు సుల్తాన్ ఎవర్రా?'
కొడుకు: తెలియదు మమ్మీ!
తల్లి: అదేమరి చెప్పేది. ఎప్పుడూ ఆటలు పాటలు అని జులాయి తిరుగుళ్ళు మానేసి అప్పుడప్పుడన్నాపుస్తకాల మీద ధ్యాస పెట్టమని చెప్పేది అందుకే' 
కొడుకు :  రీటా ఆంటీ తెలుసా అమ్మా!
తల్లి:  తెలియదురా ఎవరావిడ?
కొడుకు: అదేమరి. ఎప్పుడూ టీవీ సీరియళ్లు అని కాలక్షేపం చేయకుండా అప్పుడప్పుడన్నా నాన్న ఏం చేస్తున్నాడో ఓ కంట కనిపెట్టి చూడమని చెప్పేది అందుకే!
వంకలు 
భార్య" ఈ ముష్టివాడ్ని మన ఇంటికి రానివ్వకండి,  వాడిని చూస్తె నాకు  అరికాలిమంట నెత్తి కెక్కుతుంది
భర్త: ఎందుకే వాడంటే అంత కోపం?
భార్య: ఎందుకేమిటి? నిన్న వస్తే  మిగిలిన టమాటా పప్పు, వంకాయ కూర వాడి గిన్నెలో వేసాను. ఈరోజు పొద్దున్న ఎంచక్కా వచ్చి నా చేతిలో వంటా వార్పూ పుస్తకం పెట్టి వెళ్ళాడు. వొళ్ళు మండదా మరి!
ఆవిడ పుణ్యమే! 
'అయ్యా ధర్మ ప్రభువులు ఓ ఇరవై రూపాయలు ఇలా నా చేతిలో పదేస్తీ  అలా వెళ్లి  హోటల్లో టీ తాగొస్తాను'
'ఇస్తాలే కాని ఒక్క టీ తాగడానికి ఇరవై ఎందుకో అది చెప్పు ముందు'
'మరి నా గర్ల్ ఫ్రెండ్ కూడా నాకూడా  వస్తుంది కదా'
'ఓహో ఇప్పుడు తెలిసింది బిక్షగాళ్లు ఆడపిల్లలతో ఫ్రెండ్ షిప్ చేస్తారని'
'అయ్యా మీరు పొరబడ్డారు. నేను ఫ్రెండ్ ని చేసుకోవడం కాదు. నన్ను మాత్రం బిక్షగాడిని చేసింది'
తెలుస్తూనే వుంది సంబడం 
మొగుడు తాగి ఇంటికి వచ్చాడు. వచ్చీ  రాగానే లాప్ టాప్  ముందేసుకుని ఫేస్ బుక్ ఓపెన్ చేసాడు.
'ఇవ్వాళ కూడా తాగారా' భార్య అడిగింది.
'అబ్బే లేదే. ఎందుకలా అడిగావ్?'
'ఏంలేదు. లాప్ టాప్  అనుకుని సూట్ కేసుమీద వేళ్ళు టకటకలాడిస్తుంటే అనుమానం వచ్చి అడిగాను లెండి'

 COURTESY IMAGE OWNER

1, ఏప్రిల్ 2015, బుధవారం

మిషన్ కాకతీయ


(Published by 'SURYA' telugu daily in it's Edit page on 02-04-2015, THURSDAY)

చెరువుకు వూరికి అవినాభావ సంబంధం.
అందుకే చెరువులు లేని ఊళ్ళు సకృత్తుగా కనబడతాయి. చెరువు అనగానే సాధారణంగా పంట పొలాలకు సేద్యపు నీళ్ళు, తాగడానికి మంచి నీళ్ళు  అందించే వనరుగా మాత్రమె పరిగణిస్తారు. నిజానికి ఊళ్ళల్లో చెరువులకు చారిత్రిక ప్రాధాన్యతతో పాటు సాంస్కృతిక నేపధ్యం కూడా వుంది. దసరా వంటి పండుగ దినాల్లో చెరువులు ఆయా గ్రామాలకు తీర్ధ క్షేత్రాలుగా మారిపోతాయి. ప్రత్యేకించి తెలంగాణా ప్రాంతంలో ఆడపడుచుల 'బతుకమ్మలాటకు' వూరి చెరువే ప్రధాన వేదిక.
డెక్కన్ పీఠభూమిగా చరిత్రపుటలకెక్కిన  తెలంగాణా ప్రాంతంలో చెరువులకు యెనలేని ప్రాముఖ్యం వుంది. జీవనది గోదావరి తెలంగాణలో మైళ్ళ కొలది దూరం పారుతున్నా, నైసర్గికమైన కారణాలవల్ల ఆ నది నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి సహజసిద్ధమైన వీలు లేకుండా పోతోంది. అందుకే,  ఆ ప్రాంతం ఎక్కువగా చెరువులవంటి జలవనరులపైనే ఆధారపడాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ కారణం వల్లనే అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలోని వ్యవసాయం చెరువుల కిందనే సాగుతూ వచ్చింది. గతంలో దట్టమైన అటవీ సంపద కారణంగా విస్తారంగా కురిసే వర్షాలు, చెరువుల్ని నిండు కుండలుగా తయారుచేసేవి. ఒక్కసారి చెరువు  నిండిందంటే చాలు ఇక ఆ ఊరివారికి సాలు పొడవునా సేద్యపు నీరు లభిస్తుందనే భరోసా వుండేది. కాలక్రమంలో అడవుల విస్తీర్ణం క్షీణిస్తూ రావడం, వర్షపాతం శాతం తగ్గుతూ రావడం చెరువుల పాలిట శాపాలుగా మారాయి. ఇంతే కాకుండా, పట్టణీకరణ ప్రభావం కూడా చెరువులపై పడుతూ వచ్చింది. భూములకు విలువ పెరగడం, వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడం మొదలైన అంశాలు తెలంగాణా ప్రాంతంలో చెరువుల స్తితిని దయనీయంగా మార్చాయి. చెరువుల్లో నీరు చేరే మార్గాలు మూసుకుపోవడం, చెరువల విస్తీర్ణం నానాటికీ కుంచించుకుపోవడం చెరువుల  భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి.


ఈ నేపధ్యంలో, తెలంగాణా సాంస్కృతిక పరిరక్షణ అనండి, పునరుద్ధరణ అనండి, కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో ప్రధాన  భూమిక  'మిషన్ కాకతీయ' అనే పేరుతొ మొదలు పెట్టిన చెరువుల పునరుద్ధరణ పధకం పోషిస్తోంది. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో వున్న తెలంగాణా భూములకు ఆ ప్రాంతంలో పారే నదీ జలాలను ఉపయోగించుకునే సాంకేతికత కొరవైన కాలంలో నాటి కాకతీయ ప్రభువులు చెరువుల కింద సేద్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కారణంగానే తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పధకానికి 'మిషన్ కాకతీయ' అని నామకరణం చేసింది.
ఈ పధక నిర్మాతలు చెప్పే కారణం కూడా సులభగ్రాహ్యం. బచావత్ ట్రిబ్యునల్  వల్ల తెలంగాణకు కృష్ణా గోదావరి నదులనుంచి 275 టీ.ఎం.సీ. ల నీరు వాడుకునే వీలుంది. కానీ అంత నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు లేదు. అందుచేత, రానున్న అయిదేళ్ళ కాలంలో కురిసే ప్రతి వర్షపు బొట్టుని ఒడిసిపట్టి తెలంగాణాలోని  గ్రామాల్లో వున్న ప్రతి ఒక్క చెరువునీ నింపగలిగితే కరవురక్కసి కోరలనుంచి రైతులకు శాశ్విత విముక్తి కలిగించవచ్చన్నది వారి ఉద్దేశ్యం.
తెలంగాణా గ్రామీణ ప్రాంతాలలో పడబాటు పద్దతి ఒకటుంది. చెరువులోని నీటిని తూముల ద్వారా కింద పొలాలకు ఒదులుతారు. వరి పైరు పొట్టకు వచ్చేవరకు పొలంలో నిలవవుండే నీరే దానికి ప్రాణాధారం. పొట్టకు వచ్చిన తరువాత నీరు అలాగే నిలవవుంటే అసలు  పైరుకే ముప్పు. వరికాండం కుళ్లిపోయే ప్రమాదం వుంటుంది. అందుకే ఆ సమయంలో ఆ నీటిని మరో పంటకు పనికి వచ్చేలా ఒదిలిపెడతారు. అలాగే చెరువు నిండినప్పుడు అలుగు ద్వారా నీటిని బయటకు ఒదులుతారు. ఆ నీళ్ళు పొరుగున వున్న మరో వూరి చెరువును నింపడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక రకంగా నదుల అనుసంధానం మాదిరిగా చెరువుల అనుసంధానం అన్నమాట.
చెరువుల పూడిక తీయడంలో రైతులు స్వచందంగా సహకరించే వీలుంది. ఎందుకంటె పూడిక తీయడం ద్వారా లభించే మట్టి అత్యంత సారవంతమైనది. పొలాలకు ఎరువుగా వాడుకోవచ్చు. కుమ్మరులు కుండలు చేసుకోవడానికి అదే మట్టి ఉపయోగపడుతుంది. చెరువులు సమృద్ధిగా వర్షపు నీటితో నిండితే గ్రామంలో మంచి నీటి  కొరత తీరుతుంది. భూగర్భ జల మట్టాలు పెరుగుతాయి. పూడికలు సక్రమంగా తీయగలిగితే చెరువులో నిలవచేసే నీటి  పరిమాణం బాగా పెరుగుతుంది. తద్వారా, చెరువుకింద సాగయ్యే సాగు భూముల విస్తీర్ణం ఇతోధికంగా పెరుగుతుంది. చెరువుల పునరుద్ధరణ అనేది గ్రామస్తుల కళ్ళ ఎదుట జరుగుతుంది కాబట్టి,  పూడికలు తీయడంలో జరిగే ప్రతి పనికీ సోషల్ ఆడిట్ వుండే అవకాశం వుంటుంది.             
రాజకీయాలను దరి రానీయకపోతే నిజానికి చెరువుల పునరుద్ధరణ అనేది తెలంగాణకు ఓ వరం వంటిది. పెద్ద ప్రాజెక్టుల వల్ల పెద్ద పెద్ద ప్రయోజనాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే వాటి ఫలితాలు గ్రామాల్లోని రైతులదాకా చేరడానికి ఏళ్ళతరబడి వేచి వుండాలి. పైగా పెట్టుబళ్ళు కూడా  అంతే  భారీ స్థాయిలో అవసరమవుతాయి. వేలాది ఎకరాలు ముంపుకు గురవుతాయి. అదే స్థాయిలో ఇళ్లూ, పొలాలు పోగొట్టుకుని ప్రజలు నిరాశ్రయులవుతారు. ప్రభుత్వాలు ఇవ్వచూపే పరిహారం కోసం  చకోరపక్షుల్లా ఎదురు చూడాల్సి రావచ్చు.
'మిషన్ కాకతీయ' తెలంగాణా అవసరాల ప్రాతిపదికగా రూపొందించిన పధకం. రాష్ట్రంలో ఆక్రమణలకు గురయిన వాటిని మినహాయిస్తే దాదాపు నలభయ్ వేల పై చిలుకు చెరువులు వున్నాయని ఓ అంచనా. ఏడాదికి ఇరవై శాతం చొప్పున అయిదేళ్ళలో మొత్తం చెరువుల సంప్రోక్షణ పూర్తిచేయాలని సర్కారు సంకల్పం.
సంకల్పం బాగుంది. పెట్టుకున్న లక్ష్యం ఆచరణాత్మకంగానే వుంది. అయితే చిత్తశుద్ధిపైనే సందేహాలు, సంకోచాలు.
ఈ యావత్ 'కాకతీయ మిషన్' కేవలం టీ.ఆర్.యస్. నాయకులు, కార్యకర్తల కడుపులు  నింపడానికేకాని, చెరువులను నీటితో నింపడానికి కాదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలకు  మేలు చేయడమే పరమావధిగా ప్రభుత్వాలు పధకాలకు రూపకల్పన చేస్తాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అవి అవినీతి వూటలుగా మారిపోతాయి. ఇది చాలా ఏళ్ళుగా ప్రజలు గమనిస్తూ వస్తున్న వాస్తవం.
ప్రభుత్వాలు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే చివరికి సందేహాలే  నిజమవుతాయి. మొత్తం పధకం స్పూర్తే దెబ్బతింటుంది. ఈ వాస్తవం గుర్తెరిగి వ్యవహరిస్తే మంచి పేరు సర్కారు ఖాతాలో పడుతుంది. లెక్క  చేసేది లేదు అనుకుంటే తదనంతర కాలంలో వీటన్నిటి  లెక్కలు చూసే అవకాశం ప్రజలకే ఇచ్చినట్టు అవుతుంది.
'మిషన్ కాకతీయ' విజయవంతం అయితే మేలు జరిగేది ఒక్క తెలంగాణాకే కాదు, ఈ స్పూర్తిని అంది పుచ్చుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వీలుంటుంది. తద్వారా ఒనగూరే  సత్ఫలితాలు యావత్ దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. దేశానికి ఆదర్శంగా నిలుస్తాయి.        
(01-04-2015)
Courtesy Image Owner 

లొడ లొడ



దడ దడ చప్పుడు చేసే మోటారు సైకిల్ మీద ప్రియురాలిని ఎక్కించుకుని ఆవిడ చెప్పే కబుర్లు వింటూ ఝామ్మున షికారు తిరగాలన్నది ఏకాంబరం కోరిక. అందుకే అప్పుచేసి కొత్త బైకు కొన్నాడు. ప్రేయసిని వెనక ఎక్కించుకుని ఆమె చెప్పే ముచ్చట్లు వింటూ వూరంతా తిప్పుతూ కాలక్షేపం చేయాలనే  అతగాడి కోరికకి ఆ మోటారు సైకిల్ చేసే భయంకర ధ్వనులు  అడ్డం పడ్డాయి. ఆ రొదలో స్నేహితురాలు  సన్న గొంతుతో పలికే మాటలు ఓ పట్టాన వినబడేవి కావు. దాంతో,  ఆ రణగొణ ధ్వనుల మోటారు సైకిల్ ని అడ్డమైన ధరకు తెగనమ్మేసి ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో  ఆట్టే చప్పుడు చేయని మరో మోటారు సైకిల్ కొన్నాడు.   ఈ సైకిల్  తిరుగుళ్ళు పెద్దవాళ్ళకు నచ్చక వాళ్ళిద్దరికీ పెళ్ళిచేసి ఒకింటి వాళ్ళను చేసి చేతులు దులుపుకున్నారు. పెళ్ళయిన తరువాత ఏమైందో ఏమో ఏకాంబరం దడ దడ చప్పుడు చేసే పాత సైకిల్ నే ఎక్కువ ధర పెట్టి మళ్ళీ కొనుక్కుని భార్యను ఎక్కించుకుని తిరుగుతున్నాడు. ప్రియురాలిగా చెబుతున్నప్పుడు అదేపనిగా  వినాలనిపించిన ముద్దు ముచ్చట్లే పెళ్ళయిన తరువాత లొడ లొడ వాగుడుగా అనిపించడం ఈ మార్పుకు కారణం.  


(Courtesy Image Owner)

గొయ్యిని తవ్వుట మా వంతు


శాస్త్రవేత్త పేరు గుర్తు రావడం లేదు కాని మా కాలేజి ఇకనామిక్స్ లెక్చరర్ రామనరసింహం గారు ఆ  ఆర్ధిక నిపుణుడి  సూక్తిని తరచూ చెబుతుండేవారు. నిరుద్యోగం నిర్మూలించాలంటే ఒక గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిని పూడ్చాలి. తవ్విన వాడికి ఓ ఉద్యోగం, పూడ్చిన వాడికి ఓ ఉద్యోగం.
రెండు నెలల క్రితం కాబోలు ఏ శాఖవారో తెలియదుకాని మా అపార్ట్ మెంట్ ముందు రెండు గోతులు తవ్వారు. అక్కడితో వారి పని అయిపోయినట్టు వుంది. వాటిని అలాగే ఒదిలేసి వెళ్ళారు.
ఈరోజు ఉదయం నన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చిన టీవీ ఛానల్ వాహనం ఆగోతుల్లో ఒక దానిలో పడిపోయింది. తీయడానికి తాతలు దిగివచ్చారు.
మొత్తం మీద పొద్దున్నే ఓ గండం గడిచింది. ఇంకా  ఎన్ని ఎదురు చూస్తున్నాయో తెలియదు. ఎవరికి పిర్యాదు చేయాలో కూడా తెలియదు. ఇలా గోతులు తవ్వి వాటిని అలా ఒదిలేసి వెళ్ళేవారు అక్కడ తమ సెల్ నెంబరు వివరాలు ఒదిలి వెడితే బాగుంటుంది అనిపించింది.

జంటనగరాల మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్  సోమేశ్ కుమార్ గారికి ఇది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ అవస్థలు పడేవారికి పెద్ద సమస్య.  





(Sai Sree Nilaya Apartments, Oppo. Maharaja Chaat, Madhapur, Hyd. - 500 081)
    

31, మార్చి 2015, మంగళవారం

భగవద్గీత - బొగ్గులబస్తా


తాతయ్య పొద్దున్నే లేచి భగవద్గీత చదువుతుండేవాడు. అది భగవద్గీత అని చాలా రోజులకుగానీ మనవడికి తెలియలేదు. అయితే ఎన్నిసార్లు విన్నా ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. ఆ సంగతి తెలిసి తాతయ్య చెప్పాడు. 'ఇదిగో ఈ ఖాళీ బొగ్గుల బస్తా తీసుకు వెళ్లి  మన ఇంటి దగ్గర వాగులో నుంచి ఓ  బస్తాడు నీళ్ళు పట్రా'
మనమడు వెళ్ళాడు. బస్తాను నీళ్ళల్లో ముంచి తీసాడు. ఒక్క చుక్క కూడా మిగలకుండా  మొత్తం నీళ్ళు  కారిపోయాయి. మనుమడు మళ్ళీ ముంచి తీసాడు. మళ్ళీ తీసాడు. ఎన్ని సార్లు ముంచి తీసినా చారెడు నీళ్ళు కూడా బస్తాలో మిగిలేవి కావు. ఇలా కాదనుకుని ఈసారి బస్తాను  నీటిలో ముంచి క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి చేరేసరికల్లా మళ్ళీ బస్తా ఖాళీ. 'తాతయ్యకు కావాల్సింది నీళ్ళే  అయినప్పుడు బస్తా ఎందుకు బకెట్టు తీసుకువెడితే సరి' అని అది చేత్తో పట్టుకున్నాడు. తాతయ్య ససేమిరా వల్లకదన్నాడు. బస్తాతోటే నీళ్ళు తెమ్మన్నాడు. మనుమడి మళ్ళీ వాగు దగ్గరికి  వెళ్ళాడు. బస్తాను నీటిలో ముంచి తీసి మెరుపు వేగంతో ఉరుక్కుంటూ ఇంటికి వచ్చాడు. ఆయసమే మిగిలింది కాని బస్తాలో చేరెడు నీళ్ళు కూడా లేవు. అన్నీ దోవలోనే కారి పోయాయి. 'ఏమిటి తాతయ్యా ఇదంతా' అని అడిగాడు. తాతయ్య మందహాసం చేసాడు.
'ఒకసారి ఆ బస్తా వంక  చూడు మనవడా' అన్నాడు. మనుమడు చూసాడు. నల్లటి బొగ్గుల బస్తా కాస్తా  ఇప్పుడు మసంతా కొట్టుకు పోయి శుభ్రంగా వుంది.

తాతయ్య చెప్పాడు. 'చూసావా. నాలుగు సార్లు నీళ్ళల్లో ముంచితేనే బస్తాకు పట్టుకున్న  బొగ్గుమసి కొట్టుకు పోయింది. నీళ్ళల్లోముంచి తీస్తుంటే మసి పోతుందని కూడా తెలవకుండా నువ్వు ఇదంతా చేసావు. భగవద్గీత  కూడా అంతే! అర్ధం అయిందా లేదా అనికాదు. చదువుతూ పోతుంటే అది మన మనసుల్లోని కల్మషాన్ని తొలగిస్తుంది. తేరుకున్న నీటిలా మన  మనసును తేటపరుస్తుంది.  అదే భగవద్గీత మహత్యం!' 


29, మార్చి 2015, ఆదివారం

అర్నాబ్ గోస్వామి మార్కు జర్నలిజం



మాట్లాడడానికి స్టూడియోకి పిలిచి మాట్లాడనివ్వకుండా అడ్డుతగలడం -  ఇదో కొత్తరకం జర్నలిజం. ఏమైనా అందామంటే ఇండియాలో నెంబర్ వన్ ప్రోగ్రాం అని వీరతాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువమంది. ఇక ఆయన చర్చకు తీసుకున్న  'ఆప్'  సంగతి. మేధావులు ఎక్కువ అయితే పార్టీ పలచన పడుతుందని కొత్త సామెత.