చెన్నారెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చెన్నారెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జూన్ 2016, సోమవారం

అప్పుడూ ఇప్పుడూ పులే!


డాక్టర్ చెన్నారెడ్డి.
ఉమ్మడి రాష్ట్రానికి  రెండు పర్యాయాలు తిరుగులేని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తీ. ‘నా మాటే జీవో’ అని  బాహాటంగా  ప్రకటించిన ఉద్దండ రాజకీయ వేత్త. తరువాత కొన్నాళ్ళు  గవర్నర్ గిరీ చేసి ఆ కొలువులు  తన తత్వానికి సరిపడకపోవడంతో రాజీనామాచేసి హైదరాబాదు వచ్చి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్న రోజులవి.
 ఆ క్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి చర్చించే పనిలో తలమునకలుగా వుంటున్న కాలంలో ఒక సీనియర్  జర్నలిష్టు  ఆయన్ని తార్నాకాలోని నివాసంలో కలిసారు. కాఫీలు గట్రా  అయిన తరువాత  ఆ జర్నలిష్టుని మర్యాదపూర్వకంగా అడిగారు రెడ్డిగారు, “What brought you here?”( ‘ఏం పని మీద వచ్చావు ‘ అని అర్ధం వచ్చేలా!)
దాన్ని మరోలా అర్ధం చేసుకున్న ఆ జర్నలిష్టు చెలరేగిపోయాడు. బల్ల మీద చేతితో గట్టిగా చరుస్తూ, ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు.
‘నేను మీదగ్గరకు పని మీద రాలేదు. మీరు పిలిపిస్తే వచ్చాను. నాతొ మీకేమైనా పని వుంటే చెప్పండి.’
దాంతో చెన్నారెడ్డి గారు కాస్త తగ్గి వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేసారు. ఎంతయినా  రాజకీయవేత్త కదా!
ఆ చెన్నారెడ్డి గారు ఇప్పుడు లేరు.
ఆ జర్నలిష్టు పేరు ఆదిరాజు వెంకటేశ్వర రావు.
హైదరాబాదు దత్తాత్రేయ నగర్  లో వుంటున్న డెబ్బయ్ అయిదేళ్ళు పైబడ్డ  ఆ వృద్ధ సింహాన్ని, నిన్న (05-06-20116) కలిసాము. ఢిల్లీ నుంచి వచ్చిన దక్షిణాసియా  విదేశీ జర్నలిష్టుల  క్లబ్  అధ్యక్షుడు ఎస్.వెంకటనారాయణకు  ఆదిరాజుతో  ఢిల్లీలో పరిచయం. కరీంనగర్  జిల్లాలోని ఆయన స్వగామం వెళ్లి వచ్చిన వెంకటనారాయణ ఆదిరాజును కలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడంతో, జ్వాలా నరసింహారావు పూనికతో ఆదిరాజును కలవడం జరిగింది. సాక్షి ఎడిటోరియల్  డైరెక్టర్  కే. రామచంద్ర మూర్తి, 108, 104 పధకాల రూపశిల్పి డాక్టర్ అయితరాజు  పాండు రంగారావు, తెలంగాణా టుడే ఇంగ్లీష్ దినపత్రిక ఎడిటర్ కే. శ్రీనివాసరెడ్డి (పూర్వాశ్రమంలో హిందూ రెసిడెంట్ ఎడిటర్), తెలంగాణా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ సోదరుడు డాక్టర్ సమ్మన్న మా బృందంలో వున్నారు.


వార్ధక్య ఛాయలు మినహాయిస్తే ఆదిరాజు మాకు డెబ్బయిల్లో తెలిసిన ఆదిరాజు లాగానే వున్నారు. భార్య సీతాదేవి పేరుకు తగ్గ ఇల్లాలు.  తలితండ్రులను పిల్లలు కంటికి రెప్పలా  చూసుకుంటున్నారు. ఇలాంటి పిల్లలు వుండడం అనేది జర్నలిష్టులకు వరం. జీవితమంతా ఎవరికీ తలవంచకుండా బతికిన ఆదిరాజు ఇప్పటికీ అలాగే వుండగలుగుతున్నారంటే ఇది ఆ వరం పుణ్యమే.

చరిత్రలో మరుగున పడిపోయిన ఇలాంటి  కొన్ని సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి, అంతే కాకుండా   ఆదిరాజుతో కలయికకు ప్రోద్బలం చేసిన జ్వాలాకు ధన్యవాదాలు.         

14, సెప్టెంబర్ 2010, మంగళవారం

రేడియో రోజులు - 6 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - 6   - భండారు శ్రీనివాసరావు

“ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.

చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.

ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.

అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో – కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.

పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యెక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.

ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టివుంటాయి కానీ, అంజయ్య గారు విషయాలను యెంత నిశితంగా పరిశీలించేవారో నాకు తెలుసు.

ఒకసారి కౌలాలంపూర్ లో తెలుగు మహాసభలు జరిగాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు. విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.

ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.

“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి. ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.

అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.

‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’ – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలావుండేది అంజయ్య గారి వ్యవహారం. (13-09-2010)
   

13, సెప్టెంబర్ 2010, సోమవారం

రేడియో రోజులు - 5 - భండారు శ్రీనివాసరావు

రేడియో రోజులు - 5  - భండారు శ్రీనివాసరావు

“నేను ఏది చెబితే అదే జీవో” అనే వారు 1978 లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు.

ఆయన వ్యవహారశైలి విలక్షణంగా వుండేది. తను అనుకున్నది నిమిషాలమీద కాదు క్షణాలలో జరిగిపోవాలని పట్టుబట్టేవారు. యెంత పెద్ద అధికారినయినా ఆయన లెక్కపెట్టేవారు కాదు. ఐ ఏ ఎస్ అధికారి అని కూడా చూడకుండా ‘ఎక్కడ దొరికారయ్యా చావల్ ఖరాబు గాళ్ళు’ అని ఫైళ్లు విసిరేయడం నేను చూసాను. ఆయన ఆఫీసులో వున్నారంటే చాలు – ఆ చాంబర్ అంతా ఒకరకమయిన నిశ్శబ్దం రాజ్యం చేసేది. అధికారులు, అనధికారులు యెంతటి వారయినా సైగలు - మహా అయితే - గుస గుసలు, అంతే కానీ మాట పెదవి దాటేదికాదు.

చెప్పినవెంటనే జరిగిపోవాలనే ఆయన నైజం నిఖార్సయిన అధికారులకు ఒక పట్టాన మింగుడు పడేదికాదు. “రూలు ప్రకారం కుదరదు సార్” అని మొహం మీద చెప్పే ధైర్యం వారికి వుండేది కాదు. ఎందుకంటే చెప్పిన పని కాదన్నవారినీ, చెయ్యనివారినీ ఆయన నలుగురిముందూ మొహమ్మీదే కడిగేసేవారు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో దిట్ట అయిన చెన్నారెడ్డి గారికి అధికారులతో ఆడుకోవడం వెన్నతోపెట్టిన విద్య. పైగా ఫైళ్ళపై ఎండార్స్ మెంట్లు రాయడంలో ఆయనకు ఆయనే సాటి.

సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎస్. ఆర్. రామ్మూర్తి గారు ముఖ్యమంత్రి పేషీలో వుండేవారు. ఆయనకేమో అంతా రూలు ప్రకారం నడవాలి. రూలు పేరెత్తితే రూళ్లకర్ర పట్టుకుని హుంకరించే తత్వం చెన్నారెడ్డి గారిది. ‘ఎవరయ్యా ఈ రూల్స్ పెట్టింది. మనం పెట్టుకున్నవేగా, మార్చుకుంటే పోలా!’ అనే వారు.

‘అలా మార్చుకున్నప్పుడు మాకేమిటి అభ్యంతరం? కానీ, అప్పటిదాకా, ఇప్పుడున్న రూలే మాకు రూలు’ అన్నది రామ్మూర్తి గారి రూలు.

ఏమయితేనేం, కొన్నాళ్ళకి రామ్మూర్తి గారే సర్దుకున్నారు. అంటే రూల్స్ తో సమాధాన పడ్డారని కాదు. రెడ్డి గారి తత్వం అర్ధం చేసుకుని ఒక ఉపాయం కనుక్కున్నారన్న మాట. ముఖ్యమంత్రి గారు ఏదో పని చెప్పి చెయ్యమనగానే మరేదో రూలు చెప్పి కుదరదనే వారితో ఆయనగారికి కుదరదని తెలుసుకున్నారు. అందుకే, ఎప్పటికెయ్యదిప్రస్తుతమన్నట్టుగా – అప్పటికి ఒక్కసారి ‘యస్ సార్’ అంటే పోలా’ అనుకున్నట్టున్నారు. సంబంధిత ఫైలు మళ్లీ సీ ఏం పేషీకి వచ్చేసరికి ఎలాగూ కొంత వ్యవధి పడుతుంది. అప్పుడు నెమ్మదిగా చెబితే ఆయనే వింటారులే అని ఒక మధ్యే మార్గం కనుక్కున్నారు. అప్పటినినుంచి చెన్నారెడ్డి గారు ఏదయినా అడగ్గానే రామ్మూర్తి గారు వెంటనే ‘యస్ సర్’ (తప్పకుండా చేద్దాం సర్) అనేవారు. ఆ ఒక్క మాటతో చెన్నారెడ్డి గారు ఖుష్. ఫైల్ మళ్లీ పేషీకి వచ్చిన తరవాత సీ ఏం గారికి చూపించేటప్పుడు మాత్రం రూలు ప్రకారం ఆ పని చేయడం ఎలా కుదరదో వివరంగా చెప్పి- ‘నో సర్’ (కుదరదు సర్ ) అనేవారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆ ఆనుపానులన్నీ తెలిసిన రెడ్డిగారు కిమ్మనకుండా తలపంకించి వూరుకునేవారు.

ఇదంతా తెలిసిన వారు – ఆయన ఇంటి పేరు ‘యస్ ఆర్’ తో ముడిపెట్టి - ‘ఫైలు రాకముందు యస్ సర్ రామ్మూర్తి - వచ్చిన తరవాత నో సర్ రామ్మూర్తి’ అని సరదాగా అనుకునే వారు. రేడియో రిపోర్టర్ గా ముఖ్యమంత్రి కార్యాలయంలో చనువుగా తిరిగే నాకు ఇలాటి విషయాలు అప్పుడప్పుడు చెవిలో పడేవి. (12-09-2010)