ఈనాడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఈనాడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఆ మూడు పత్రికలు


ఆ మూడు పత్రికలను నేను కొని చదువుతాను. గత కొన్ని దశాబ్దాలుగా నాకిది అలవాటు. ఇదే రంగంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న నాకు - ఈరోజు ఒకే వార్తను ఈ పత్రికలు ప్రచురించిన తీరు చూసిన తరువాత ఉదయం లేవగానే అనూచానంగా చేసుకున్న పత్రికాపఠనానికి ఇక స్వస్తి చెప్పటం మంచిదా అనే ఆలోచన కలిగింది. డెబ్బయ్యవ దశకం మొదట్లో నార్ల గారి సంపాదకత్వంలో వెలువడిన నాటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉపసంపాదకుడుగా చేరినప్పుడు గొప్ప వృత్తిలో ప్రవేశిస్తున్నాను అన్న ఆనందంతో వొళ్ళు పులకరించిన మాట వాస్తవం. మరి ఇన్నేళ్ళ తరువాత పత్రికలే చదవకూడదు అన్న నిర్వేదంలోకి యెందుకు జారిపోతున్నట్టు.
సరే! అసలు విషయానికి వద్దాం.
నామినేషన్ల సందర్భంగా అభ్యర్ధులు తమ ఆస్తులు అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్లు సమర్పించడం ఒక నిబంధన. వాటిని ప్రజలకు తెలియచెప్పడం పత్రికల బాధ్యత.  ఈ క్రమంలో శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ జగన్ మోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ల వివరాలను అన్ని పత్రికలు ప్రచురించాయి. కానీ ఈ మూడు పత్రికలు వాటికి తమదైన రీతిలో వ్యాఖ్యానాలను కూడా జతపరిచాయి. ఆ పత్రికలకు ఈనాటి పరిస్థితుల్లో అలాటి సమాచారం ప్రచురించడం ఒక అనివార్యత కావచ్చు. కానీ నా కెందుకో వార్త రూపంలో ఆ పత్రికలు తమ మనసులోని మాటని చెప్పే ప్రయత్నం చేసాయని అనిపించింది.
ఈరోజు తాపీగా ఇంట్లో కూర్చుని నీతులు చెబుతున్నానని అనిపించవచ్చు  కానీ ఎందుకో ఏమిటో నాకది  సబబుగా అనిపించలేదు.

యేమో! నేను కూడా ఏదయినా పత్రికలో పనిచేస్తూ వున్నట్టయితే  ఆ వాలువేగంలో నేనూ కొట్టుకుపోతూ వుండేవాడినేమో! ఎవరికి ఎరుక?            

15, మే 2013, బుధవారం

ఈ రోజు ఈనాడు మొదటి పేజీ చూశారా?





ఓ నలభై ఏళ్ళక్రితం పేపర్లు ఇలాగే వుండేవి. సమాజానికి కావాల్సిన వార్తలు. చికోరీ తక్కువ కాఫీ ఎక్కువ లాగా అన్నమాట.
ఈనాటి ఈనాడు ప్రధాన శీర్షిక – గాలి సోకుతోంది. ‘గాలి’ వార్తలు చదివీ చదివీ ఇదీ మరో ‘గాలి (జనార్ధన రెడ్డి) వార్త కాబోలు అనుకున్నవాళ్ళు వున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ‘పీల్చే గాలిలో పెరుగుతున్న సీసం – దానివల్ల జనాలకు వాటిల్లే ప్రమాదాలు’ గురించిన సమాచారం చాలా వివరంగా వుంది.
మరో వార్త ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా గురించి. రొమ్ము కేన్సర్ పై ఆమె సాధించిన విజయం గురించి. యెంత గొప్పగా వుందో.
ఇంకోటి-  చిన్నపిల్ల మరణాలకు కారణమవుతున్న  ‘రోటా వైరస్ పై భారతీయ అస్త్రం’ అనే చక్కటి వార్త.
కుడి వైపు పైన ఇంజినీరింగ్ కాలేజీల్లో విదేశీ విద్యార్ధులకు ప్రవేశం కల్పించే అంశం గురించిన వార్త.
సీ.బీ.ఐ. స్వతంత్రత కోసం చట్టం తెచ్చే వార్త.
మండు వేసవిలో పండు వెన్నెల మాదిరిగా సేద తీర్చే వార్తలు.
జన్మానికో శివరాత్రి. రోజూ ఇలాటి వార్తలే వేస్తె ఇంతే సంగతులు.
ఈ సంగతి వారికీ తెలుసు.
అందుకే-
‘లబ్ది పొందింది జగనే – పితాని, దోపిడీ నాయకుడు జగన్- మంత్రి ఆనం, జగన్ స్వార్ధానికి మంత్రులు బలి –కన్నా’ అంటూ సింగిల్ లైన్ లో క్లుప్తంగా ఇచ్చారు. (15-05-2013)

6, ఏప్రిల్ 2013, శనివారం

ఈనాడు సిటీ ఎడిషన్ ఎనిమిదో పేజీ చూశారా?




ఈనాటి ‘ఈనాడు’ దినపత్రిక సిటీ ఎడిషన్ ఎనిమిదో పేజీలో ఒక ఫోటో వేసారు. ఆ ఫోటోలో ఒక నడివయసు ఆవిడ తన మనుమడిని భుజాలమీద ఎత్తుకుని వెడుతున్న దృశ్యం వుంది. పల్లెపట్టుల్లో ఇది మామూలే కాని హైదరాబాదు లాటి నగరంలో అపూర్వ దృశ్యమే అని చెప్పాలి. అందుకే అది ఆ ఫోటోగ్రాఫర్ కళ్ళల్లో పడి కెమెరా కంటికి చిక్కి పత్రికలోకి  ఎక్కింది.




ఈ ఫోటోలో వున్న ఆవిడతో మాకు బాదరాయణ సంబంధం వుండడం వల్లనే ఇది రాయాల్సివస్తోంది. 1992 లో మేము మాస్కోనుంచి వచ్చిన తరువాత పంజాగుట్టలోని  దుర్గానగర్ కాలనీలో చాలా ఏళ్ళు వున్నాము. ఆ రోజులనుంచి ఈ ఫోటోలో వున్న యాదమ్మ కుటుంబంతో మాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. యాదమ్మ చాలా కాలం మా ఇంట్లో పనిచేసింది. వాళ్ళాయన మల్లయ్య ఆటో నడుపుతాడు. ఆ రోజుల్లో దూరాభారాలకు మల్లయ్య ఆటోనే మాకు ఆధారం. అలాగే ఆ తరువాత సంవత్సరాలలో యాదమ్మ పిల్లలు – సైదమ్మ, కళ, భాగ్య, సంపూర్ణ , తిరుపతమ్మ మా ఇంట్లో పనిచేస్తూ వచ్చారు. చిన్నపిల్లలు సంపూర్ణ, తిరుపతమ్మ మా ఇంట్లో వుంటూనే చదువుకున్నారు. సంపూర్ణ పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళేదాకా మా ఇంట్లోనే వుండేది. వాళ్ల అక్క  భాగ్య ఇప్పుడు మాకు వంట చేసిపెడుతోంది. ఇదిగో ఈ భాగ్య ‘భాగ్యమే’ ఫోటోలో యాదమ్మ నెత్తికెక్కిన వాడు,  ఆమె  ఏకైక సంతానం గౌతమ్. కాన్వెంటు స్కూల్లో చదువుకుంటున్నాడు.  పోతే, కళ తనకు పుట్టిన పిల్లలకు మా పిల్లల పేర్లే ‘సందీప్,సంతోష్’ అని పెట్టుకుంది. మా పిల్లలు అమెరికా నుంచి ఎప్పుడు ఫోను చేసినా వీళ్ళందరి యోగక్షేమాలు అడుగుతారు. మా ఇంట్లో యే శుభకార్యం జరిగినా మొత్తం కుటుంబం మా చెంతనే  సాయంగా వుండిపోతుంది.   అదీ ఈ ఫొటోకు మాకువున్న లింకు. (06-04-2013)

27, డిసెంబర్ 2012, గురువారం

ఏం భాషరా బాబు!


ఏం భాషరా బాబు!


తిరుపతిలో తెలుగు సభలేమో కాని టీవీ చానళ్ళలో తెలుగు చర్చలు హోరెత్తి పోతున్నాయి. నిన్న ఒక ఛానల్లో పాల్గొన్న  ముగ్గురూ ఓ పక్క తెలుగులో మాట్లాడుతూనే మరో పక్క మీ తెలుగు వేరు మా తెలుగు వేరు అని  వాదించుకోవడం చూసి చూస్తున్న వారికి  మతి పోయింది. ఒకాయన ఏకంగా దేశంలో యే భాషకు లేనివిధంగా ఒక్క తెలుగుకే తెలుగు,తెనుగు, తెనుంగు అని రకరకాల పేర్లు వున్నాయని, కావున రాష్ట్రంలో ఎవరి తెలుగు వారిదేననీ తేల్చేసారు. మరి పొరుగున వున్న తమిళనాడులో అరవం, తమిళం అని ఒకే భాషను రెండు రకాలుగా పిలుస్తున్న సంగతిని ఆయన వాదం కోసం కాసేపు మరచిపోయినట్టున్నారు. పైగా చర్చలో పాల్గొంటున్న వారెవ్వరూ తమ యాసలో తెలుగు మాట్లాడలేదు. అందరూ మాట్లాడే తీరు ఒకేరకంగా వుంది. పక్కవారు మాట్లాడేది అసలు తెలుగే కాదంటారు. వితండవాదం అంటే ఇదే కాబోలు.

ఇలావుంటే ఈ రోజు ఫేస్ బుక్ లో ఓ మిత్రుడు శ్రీ మంచాల శ్రీనివాసరావు  పెట్టిన పోస్టింగ్ తెలుగుకు పట్టిన తెగులుకు అద్దం పట్టేదిగా వుంది. చిత్తగించండి.
    
ఈనాడు" తెలుగీకరణ తెల్లారినట్టే ఉంది... ఖర్మరా బాబూ!!
APPSC
అంటే రాష్ట్ర ప్రజా సేవ సంస్థ అట! అది సర్కారు కొలువులకు నియామక పరీక్షలు నిర్వహించే సంస్థ మాత్రమే... అందులో సేవ అనే పదానికే అర్థముండదు.... కనీసం ఉద్యోగ నియామక సంస్థ అని చెప్పినా ఓ తీరుగా ఉండేది...!
IAS
పదానికి తెలుగీకరణ మరీ ఘోరంగా ఉంది. indian అనగానే భారత్, administration అనగానే పాలన, service అనగానే సేవ... ఇంకేం, భారత పాలన సేవ అని తేల్చేశారు... అది ఒక జాతీయ స్థాయి ఉద్యోగ కేడర్ అనే అర్థమేమైనా స్ఫురిస్తోందా అసలు!?
records
కి తెలుగు పదం నమోదు పత్రమట!! record చేయడం అనగానే నమోదు అనే పదం గుర్తొచ్చి అలా తేల్చేశారు... కానీ ఇక్కడ records అంటే పత్రాలను పదిలపర్చడం.... 
market yard
అంటే విపణి వేదిక అట! market అంటే ఎంతటి విస్తృతార్థం ఉందో తెలిసినవారెవ్వరూ ఈ పదాన్ని మామూలు market yardకి ఉపయోగించరు!!
commission agents
కి ప్రతిఫలాపేక్షదారులు అనే అనువాద ప్రయాస కూడా గుత్తేదారు అనే విఫల ప్రయోగాన్నే గుర్తుకు తెస్తోంది... .
మంచి సంకల్పం ఉన్నా... ఇలాంటి వంకర, సంకర పదాలు సృష్టిస్తే భాషకు మరింత నష్టదాయకం అవుతుంది...!!
NOTE: కార్టూనిస్టుకు ధన్యవాదాలు  

22, ఏప్రిల్ 2012, ఆదివారం

ఇంటర్నెట్ యూజర్లూ! హెచ్చరికోయ్! హెచ్చరిక!!


ఇంటర్నెట్ యూజర్లూ! హెచ్చరికోయ్! హెచ్చరిక!!

ఈనాడు అంటే ఏప్రిల్ ఇరవై రెండో తేదీ 'ఈనాడు' దినపత్రిక మెయిన్ ఎడిషన్ ఐదో పేజీలో ప్రచురించిన వార్త ఆధారంగా -






వివరాలకు ఈ కింది 'లింక్' పై నొక్కండి.













28, నవంబర్ 2011, సోమవారం

తోట్లవల్లూరును మరచిపోలేను. - డాక్టర్ నోరి దత్తాత్రేయుడు



క్షణం తీరికలేని మనిషికి దొరికిన మధుర క్షణాలు. - భండారు శ్రీనివాసరావు

అనుక్షణం వార్తలమధ్య గడిపే జర్నలిష్టులను ప్రతిరోజూ  పత్రికల్లో వచ్చే వార్తలు అంతగా ఆకట్టుకోవు. కానీ, నవంబర్ ఇరవై ఐదో తేదీన ఈనాడు లో పడ్డ  వార్తను చూసి,  లోగడ ఆలిండియా రేడియో, దూర దర్శన్ లలో  న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్.వీ.వీ. కృష్ణారావు కాసేపు చకితులయ్యారు. దానికో కారణం వుంది. అది తెలుసుకోవాలంటే అంతకు ముందు శనివారం నాడు హైదరాబాదులో  జరిగిన ఒక పెళ్లి. అది చెప్పుకునే ముందు ఈనాడులో పడ్డ వార్త సారాంశం తెలుసుకుందాం.

తోట్లవల్లూరును మరచిపోలేను.


డాక్టర్ నోరి దత్తా త్రేయుడు 


(తోట్లవల్లూరు, న్యూస్ టుడే-  కేన్సర్ చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాత  కీర్తి గడించిన  డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గురువారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పర్యటించి తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను చిన్నప్పుడు నివసించిన ఇంటిని సాంబశివరావు కొనుగోలు చేసి కొత్తగా  నిర్మించుకున్న ఇంటికి వెళ్లి అంతా  కలయతిరిగిచూసారు. ‘ఇక్కడో బావి వుండాలే!’ అని ఆ ఇంట్లోవారిని వాకబు చేశారు.   పమిడిముక్కల మండలం ఘంటాడలో తాను జన్మించినా, కుటుంబ సభ్యులతో చిన్నతనంలో  గడిపిన తోట్లవల్లూరును జీవితంలో మరచిపోలేనని చెప్పారు. తనకు నామకరణం చేసిన కలగా పూర్ణచంద్ర శాస్త్రి ఇంటివద్ద కొద్దిసేపు గడిపి వేణుగోపాలస్వామి ఆలయంలో  అర్చకులు ప్రసాదంగా ఇచ్చిన చిట్టి గారెలు తిని దాదాపు యాభై అరవై  ఏళ్ళ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.)

ఈ వార్త కళ్లబడగానే  కృష్ణారావు గారికి నెప్పల్లి  ప్రసాద్ గారి అబ్బాయి పెళ్ళిలో జరిగిన సంఘటన సినిమా రీలులా కళ్ళముందు కదలాడింది.
ప్రసాద్ గారు అమెరికాలో పేరుమోసిన చార్టర్డ్ అక్కౌంటెంట్. వారి ఆహ్వానం మేరకు కృష్ణారావు గారు ఆ పెళ్ళికి వెళ్లారు. అక్కడ ఆయనకు  వూహించని అతిధి తారసపడ్డారు. ఆయనే నోరి దత్తాత్రేయుడు గారు. ఆయన హస్తవాసికి తిరుగులేదు. క్షణం తీరికలేని వైద్యులు. కేన్సర్ రక్కసి పీచమడిచే పనిలో పడి దేశదేశాలు తిరుగుతుంటారు. ఇటీవల సోనియా గాంధీ గారికి వైద్యం చేసిన డాక్టర్ల  బృందానికి ఆయనే నేతృత్వం వహించారని పత్రికల్లో  వచ్చింది.  దత్తాత్రేయుడి గారికి  నెప్పల్లి ప్రసాద్ గారు  అత్యంత ఆత్మీయులు. అందుకే వారి కుమారుడి వివాహానికి అమెరికానుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. వారిని పెళ్ళిలో చూడగానే కృష్ణారావు గారికి చిన్నప్పటి తోట్లవల్లూరు సంగతులు మదిలో మెదిలాయి. దత్తాత్రేయుడు గారి కుటుంబం, కృష్ణారావు గారి కుటుంబం యాభయ్ , అరవై ఏళ్ళనాడు ఆ వూళ్ళో ఒకే ఇంట్లో నివాసం వుండేవి. చిరకాలం నాటి  బాల్య మిత్రుడు అన్నేళ్ల తరువాత   తారసపడగానే కృష్ణారావు గారు ఆయనతో మాటలు కలిపారు. మాటల మధ్యలో తోట్లవల్లూరు సంగతి ఎత్తారు. పెళ్ళిలో నలుగురి మధ్యవున్న కారణంగానో యేమో ఆయన  నుంచి వెంటనే  స్పందన కాన రాలేదు. అయినా కృష్ణారావు గారు నిరుత్సాహ పడలేదు. పెళ్ళయిన తరువాతో అంతకు  ముందో కానీ, భోజనాల సమయంలో మరోసారి దత్తాత్రేయుడు  గారితో ముచ్చటించే వీలు చిక్కించు కున్నారు. చిన్నప్పటి సంగతులు కొన్ని  గుర్తు చేశారు. ఈ సారి ఆయన గుర్తుపట్టినట్టే అనిపించింది.
“ఎన్నో ఏళ్ళయింది తోట్లవల్లూరు వెళ్లి. మేము అమ్మేసిన ఇల్లెలా వుంది? వూరేలా వుంది ?” అని అడిగారు.
‘వీలయితే ఈసారి కలసివెడదాం’ అని కూడా అన్నారు.  
“కోట పోయింది. చదువుకున్న స్కూలు అలాగే వుంది. మనం ఆడుకున్న గుడీ అలానే వుంది. పక్కన కృష్ణానది అందరి  జ్ఞాపకాలను వొడిలో దాచుకుని అలాగే పారుతోంది.” బదులు చెప్పారు.
అంతటితో ఆగలేదు. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, మసలిన మనుషులు అన్నింటినీ  గుర్తుచేశారు.
“వేణుగోపాలస్వామి ఆలయం, గుళ్ళో ప్రసాదంగా పెట్టే చిట్టిగారెలు, కట్టు పొంగలి రుచి, వాళ్లు వున్న ఇల్లు, ఇంటి ముందు గిలక బావి, దొడ్లో బాదం చెట్టు” ఇలా ఒకటేమిటి గుర్తుకొచ్చినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పేశారు కృష్ణారావు గారు.
విందు పూర్తయింది. పెళ్లయిపోయింది. ఇంటికి తిరిగివచ్చిన తరువాత కూడా కృష్ణారావు గారికి తోట్లవల్లూరు గురించిన తలపులు వొదలలేదు. అది ఆయన సొంత వూరు  కాకపోయినా, దత్తాత్రేయుడు గారి మాదిరిగానే కృష్ణారావు గారికి కూడా ఆ వూరితో మరచిపోలేని అనుబంధాలు, జ్ఞాపకాలు అనేకం వున్నాయి.
కృష్ణారావు గారి నాన్న గారు రాయసం గంగన్న పంతులు గారు. దేవాదాయ శాఖలో ఉద్యోగి. చిన్న చిన్న దేవాలయాలను పర్యవేక్షించే అధికారి. బదిలీ మీద కుటుంబాన్ని వెంట తీసుకుని తోట్లవల్లూరు వెళ్లారు.
ఆ వూళ్ళో నోరి సత్యనారాయణ గారింట్లో ఓ వాటా అద్దెకు తీసుకున్నారు.
సత్యనారాయణ గారికి   నలుగురు కుమారులు. పెద్దబ్బాయి  నోరి రాధాకృష్ణ మూర్తి గారు. ఐ.పి.ఎస్. అధికారి. పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గానో ఆ పై పదవిలోనో రిటైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగంలో చేరక మునుపు ఆయన బందరు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేవారు.
రెండో కుమారుడు ఎన్.మధురబాబు గారు. స్టేట్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామీణ బ్యాంకుల  వ్యవస్థలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొల్పిన మొట్టమొదటి గ్రామీణ  బ్యాంక్ – నాగార్జున గ్రామీణ బ్యాంక్ కు మొదటి  చైర్మన్ గా పనిచేసి సమర్ధుడయిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట, మూడో కుమారుడు రామతీర్ధ కాగా కనిష్ట  కుమారుడు నోరి దత్తాత్రేయుడు గారు. చిన్నప్పుడు ‘దత్తు’ అని పిలిచేవాళ్ళు.
కొత్త వూరిలో కృష్ణారావుగారికి కొత్త స్నేహితులు లభించారు. ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. ‘అమ్మా నాన్నా ఏదయినా పనిమీద బెజవాడ  వెళ్ళాల్సి వస్తే ఆ నాలుగు రోజులు తన భోజనం పడకా కూడా నోరి  వారింట్లోనే’ అని కృష్ణారావు గారు నాతో  ఈ విషయాలు చెబుతూ గుర్తు చేసుకున్నారు.   
వారి తండ్రిగారి అకాల మరణం తరువాత నోరి వారి మకాం బందరుకు మారిపోయింది.
కృష్ణారావు గారు మాత్రం తండ్రిగారి  ఉద్యోగరీత్యా  తోట్లవల్లూరులోనే మరికొంత కాలం గడిపారు.
ఆ నాటి రోజులు గురించీ, అప్పటి వాతావరణం గురించీ ఆయన మాటల్లోనే.              
‘నదికి ఆనుకునే కాలవ. బెజవాడ నుంచి లాంచీలు తిరుగుతుండేవి. శివ కామేశ్వరి, శివ పార్వతి, గంగ వాటి పేర్లు.         
‘నోరి వారి కుటుంబం యావత్తూ కుసుమ హరనాధ బాబా భక్తులు.  ఇంట్లో  రోజూ భజనలు. పూజలు. తండ్రి చని పోయిన తరువాత వారి కుటుంబం బందరు వెళ్ళగానే ఆ వాటాలోకి అప్పయ్య శాస్త్రి గారు అద్దెకు దిగారు.
‘తోట్లవల్లూరులో వాళ్లు వున్న ఇల్లు బాగా పెద్దదేమీ కాదు. ఉత్తర ముఖంగావున్న ఆ ఇంటి ముందు గిలక బావి. దొడ్లో బాదం చెట్టు. కుడి పక్క  తాడికొండ వారి నివాసం. ఆ ఇంట్లోనే రామమందిరం. దాపునే తోట్లవల్లూరు కరణం గారయిన అడిదం వారి ఇల్లు. మరోపక్క గోవిందరాజుల వాళ్లు వుండేవాళ్ళు. పోతే,  శివలెంక వీరేశ లింగం గారి  ఇల్లు కూడా పక్కనే. వీరేశ లింగం గారు పేరు మోసిన  పెద్ద జ్యోతిష్కులు. సినీ నటుడు   ముదిగొండ లింగమూర్తి గారి  వియ్యంకులు. మద్రాసునుంచి భానుమతి వంటి ప్రముఖ సినీ  కళాకారులు కూడా ఆయనను కలవడానికి తోట్లవల్లూరు వచ్చేవాళ్ళు. వీరేశలింగం గారి  అబ్బాయి ఎస్.వి.ఎం. శాస్త్రి గారు  దక్షిణ  మధ్య రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తోట్లవల్లూరులోని శివాలయానికి శివలెంక వారు అనువంశిక ధర్మ కర్తలు.
‘వూళ్ళో వున్న పెద్దగుడి వేణుగోపాలస్వామిది. ఆ గుడికి తగ్గట్టు  పెద్ద గాలి గోపురం. దాని మీద పావురాళ్ళు. వాటి రక్తం పూస్తే పక్షవాతం వంటి రోగాలు నయమవుతాయని చెప్పుకునే వాళ్లు. అది బొమ్మదేవరపల్లి  జమీందారులు కట్టించిన గుడి కావడం వల్ల వైభోగానికి  తక్కువలేదు. పూజలు, పునస్కారాలు, ప్రసాదాల వితరణ ఘనంగానే  జరిగేవి. తిరునక్షత్రం నాడు పులిహోర చేసేవాళ్ళు. పర్లాంగు దూరంలో  కృష్ణానది. ధనుర్మాసంలో ఆలయ అర్చకులు ఆ బావినుంచి మంగళ వాయిద్యాలతో తీర్ధపు బిందెలు తెచ్చేవాళ్లు. మా  పిల్లల  ఆటలన్నీ గుళ్ళో పొగడ చెట్టు కిందనే.
‘మా వీధి లోనే పోస్టాఫీసు. అన్నంభొట్లవాళ్లు టపా పని చూసేవారు. ఉయ్యూరు నుంచి ప్రతిరోజూ ఒక భారీ మనిషి  (పోస్టల్ రన్నర్) తపాలా సంచీ మోసుకుంటూ అయిదుమైళ్లు గబగబా నడుచుకుంటూ  తోట్లవల్లూరు వస్తుండేవాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ, చేతిలో వున్న పొడుగుపాటి బల్లేన్ని నేల మీద పోటు  పొడుచుకుంటూ  అతగాడు నడిచివస్తుంటే ఆ బల్లెం పైన కట్టిన మువ్వలు అదోరకం శబ్దం  చేస్తుండేవి.
‘తోట్లవల్లూరు  జమీందారులు బొమ్మదేవర వంశీకులు వేణుగోపాలస్వామి దేవాలయానికి అనువంశిక ధర్మకర్తలే కాదు,  దానికి కర్తా కర్మా క్రియా అన్నీ వాళ్ళే.  జమీందార్ల దగ్గర ఏనుగుల్ని సంరక్షించే నాగయ్య అనే వ్యక్తి తరువాతి రోజుల్లో ఈ గుడి వ్యవహారాలూ కనిపెట్టి  చూసేవాడు. కృష్ణారావు గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు ప్రభుత్వం తరపున అంటే దేవాదాయ శాఖ తరపున ఆలయం బాధ్యతలు  చూస్తుండే వారు. అప్పట్లో ఆయన నెల  జీతం  అరవై రూపాయలు. కరవుభత్యం కింద  ఇరవై రూపాయలు. పైన మరో అర్ధ రూపాయి. ఆ వూరి మొత్తంలో  నెలసరి అంత జీతం వచ్చేవాడు మరొకడు లేకపోవడం వల్ల అది చిన్న జీతంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. కాకపొతే అంత జీతం అన్నది ఆయనకు వూళ్ళో ఒక ప్రత్యేకతను,అయాచిత  గౌరవాన్ని కట్టబెట్టింది.



గరుడవాహనంపై వేణుగోపాలస్వామి వారు 

(1955 లో తీసిన ఈ ఫోటోలో కుడి నుంచి రెండో వ్యక్తి ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్  అడిదెం కనక వీరభద్ర రావు గారు  మూడో  వ్యక్తి  రాయసం గంగన్న పంతులు గారు, స్వామి వారి పక్కన ఆలయం ప్రధాన అర్చకులు పరాంకుశం అప్పలాచార్యులు గారు. పోతే, కూర్చున్న వారిలో కుడివైపు మొదటి కుర్రవాడు ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు)     

‘ఆ రోజుల్లో బెజవాడ నుంచి  తోట్లవల్లూరుకు  ప్రైవేటు సర్వీసులవాళ్లు బస్సులు నడిపేవాళ్ళు. ఒకటి  రామాంజనేయ మోటార్ సర్వీస్, రెండోది గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్. బస్సులమీద ఆ  పేర్లు రాసివుండేవి. గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్  అని రాసి  పక్కనే ‘ఇన్ లిక్విడేషన్’ అని కూడా వుండేది. దాని అర్ధం ఇప్పటికీ తెలియదు. వీటిల్లో   రామాంజనేయా సర్వీసు బస్సు ఖచ్చితంగా  టైం ప్రకారం నడిచేది. ఒక బస్సు డ్రైవర్  పేరు సుబ్రహ్మణ్యం అని గుర్తు.
‘వెనుక బెజవాడ నుంచి  రావాలంటే చుట్టూ తిరిగి  రావాల్సివచ్చేది. ఇప్పుడు కృష్ణానది కరకట్ట మీదుగా హంసలదీవి దాకా రోడ్డు వేసారు. దాంతో  రాకపోకలు సులువయ్యాయి.
‘తోట్లవల్లూరులో  వున్న హైస్కూలే చుట్టుపక్కల వూళ్ళకు దిక్కు. వల్లూరిపాలెం నుంచి ఆడపిల్లలు  నడుచుకుంటూ స్కూలుకు వచ్చేవాళ్ళు. పక్కనున్న భద్రిరాజుపాలెం నుంచి కూడా చదువుకోవడానికి పిల్లలు  తోట్లవల్లూరు  రావడం గుర్తు.
‘వూళ్ళో గుర్రబ్బళ్లు  కూడా వుండేవి. ఒకరోజు బండి చక్రం కింద ఓ కుక్క పిల్ల నలిగి చనిపోవడం చూసిన పిల్లలకు ఆ రోజు అన్నం తినబుద్దికాలేదు.’
తోట్లవల్లూరు గురించిన  పాత సంగతులు  కృష్ణారావు గారికి  ఇంకా అనేకం గుర్తున్నాయని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకనిపించింది.
పెళ్ళిలో కలసి కాకతాళీయంగా  ఆయన    చెప్పిన నాలుగు ముచ్చట్లు నోరి దత్తాత్రేయుడి గారి తోట్లవల్లూరు పర్యటనకు ‘ప్రేరణ’ కావడం  నా ఈ రచనకు ‘ప్రేరణ’గా మారింది. (28-11-2011)   

    

25, నవంబర్ 2011, శుక్రవారం

కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు



కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు  
వార్త
ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘ఈనాడు-ఈటీవి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక  ప్రశ్న, దానికి సమాధానం ఇలా వున్నాయి.
ప్రశ్న: “పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి సంబంధాలున్నాయి?”
సమాధానం: “బాగున్నాయి. కాంగ్రెస్ దానంతట అది వోడించుకుంటుంది తప్ప వేరే పార్టీకి కాంగ్రెస్ ని వోడించే బలం లేదు.”  మేమంతా ఐకమత్యంగా ఉంటేనే తిరిగి గెలుస్తాం.
(నవంబరు శుక్రవారం నాడు ఈనాడు దినపత్రిక లో ప్రచురించిన ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ)
వ్యాఖ్య
“కుఠార మాలికాం దృష్ట్యా
కంపంతతి తరోవనే!
తత్ర వృద్ధ తరుహ్  ప్రాహుహ్
మామకోనాస్తి కిం భయం”
ఈ సంస్కృత శ్లోకానికి  తెలుగు అనువాదం:
“ఒకడు పది గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం “ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు  మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా!” అని అభయం ఇచ్చింది.
“అదీ కాంగ్రెస్ వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.”
(కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన ‘అప్పుడు –ఇప్పుడు’ గ్రంధం నుంచి)
25-11-2011