జి.కృష్ణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జి.కృష్ణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జూన్ 2013, శనివారం

జేబులో రాజీనామా


1971 లో బెజవాడ  ఆంధ్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా  చేరడానికి వెళ్లాను. ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారు.
‘ఏదీ నీ రాజీనామా?’ అన్నారు. ఒక్క క్షణం గతుక్కుమన్నాను. ఇంతలో ఆయనే ‘జర్నలిస్టు అనేవాడు తన జేబులో రాజీనామా సిద్ధంగా వుంచుకోవాలి.తెలిసిందా’ అన్నారు.
నాలుగున్నర ఏళ్ళదాకా నాకు రాజీనామా అవసరం పడలేదు. తరువాత ఆంధ్రజ్యోతికి సలాం చెప్పి హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలేఖరిగా చేరాను. నేను చిక్కడపల్లిలో వుండేవాడిని. కలం కూలీ జీ.కృష్ణ గారి నివాసం రాం నగర్లో. బెజవాడలో వుండగా మా అన్నయ్య పర్వతాలరావు గారి ద్వారా కృష్ణ గారు పరిచయం. తరువాత హైదరాబాదులో ఆయన ఇండియన్  ఎక్స్ ప్రెస్ లో, నేను రేడియోలో విలేఖరులం. రాజకీయాలతో సంబంధం లేని అనేకమంది ప్రముఖులను ఆయన ద్వారా కలుసుకునే అవకాశం దొరికింది. కృష్ణ గారి ధారణ శక్తి అపూర్వం. ఎన్నెన్నో పాత సంగతులను చెబుతుండేవారు. ఎందరో ప్రముఖులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలు వుండేవి. ముఖ్యమంత్రి వెంగళరావు గారిని ‘ఏం వెంగళరాయా!’ అని సంబోధించేవారు. అనేక పత్రికల్లో పనిచేసిన అనుభవం ఆయనది. ఎక్కడా కాలునిలవని తత్వం. నార్లగారు చెప్పిన సూత్రాన్ని అక్షరాలా పాటించిన జర్నలిస్టు. అనేక పర్యాయాలు రాజీనామా చేసి పెద్ద పెద్ద పేపర్లలో పెద్ద పెద్ద పదవులను వొదులుకున్నారు.
కొంతకాలం ఢిల్లీలో పనిచేశారు. ఆనాటి ఆయన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.
“ఢిల్లీలో నేను సరిగా ఇమడలేకపోయాను. అక్కడ తక్కువ జీతగాళ్ళు వుంటారు  కాని తక్కువ జీతంపైన వుండలేం.
“ఢిల్లీలో తమిళులు ఒక స్వయం సమృద్ధవర్గం. వాళ్ల పురోహితులు వాళ్ల వాళ్ళే. వాళ్ల హోటళ్ళు వాళ్ళవే. ఒక తమిళుడు కుంభకోణంలోని తన స్నేహితుడికి ఇలా రాశాడట. ‘ఢిల్లీ మనదే. కాకపోతే ఇక్కడ అనవసరంగా ఉత్తరాదివాళ్ళు వచ్చిపడ్డారు.’  బెంగాల్ వాళ్ళది మరోతీరు. వాళ్లు తాము అందరికన్నా కనీసం ఒకరోజు ముందు ఆలోచించగలం అన్నది వాళ్ల ధీమా. అప్పట్లో నెహ్రూ నెల జీతం 2,500. దానిపై బెంగాలీల వ్యాఖ్య.- నెహ్రూ గారు తన యోగ్యతకు మించి నెలకు 2,500 ఎక్కువగా జీతం పుచ్చుకుంటున్నారని.
“అన్నట్టు, పట్టాభి సీతారామయ్య గారిని ఉపరాష్ట్రపతిగా నియమించాలని కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించింది. కాని నెహ్రూ గారు కాదని డాక్టర్ రాదాకృష్ణన్ గారిని ఎంపిక చేశారు. ఒక్క బీసీ రాయ్ మినహా ఇలా యెందుకు చేసావు అని అడిగే ధైర్యం పార్టీలో ఎవ్వరికీ లేకపోయింది.
“విలేఖరులనేకులు పట్టాభి గారి ద్వారా కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన వార్తల కూపీలు లాగుతుండేవారు. కానీ ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి రాలేదని యే ఒక్కడూ రాయలేదేమి?
“మన దేశంలో పత్రికా యజమానుల రాజకీయాలు సరేసరి. విలేఖరుల రాజకీయాలు కూడా వుంటయ్యి.” కృష్ణ గారి ఉవాచ.  (15-06-2013)

25, నవంబర్ 2011, శుక్రవారం

కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు



కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు  
వార్త
ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘ఈనాడు-ఈటీవి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక  ప్రశ్న, దానికి సమాధానం ఇలా వున్నాయి.
ప్రశ్న: “పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి సంబంధాలున్నాయి?”
సమాధానం: “బాగున్నాయి. కాంగ్రెస్ దానంతట అది వోడించుకుంటుంది తప్ప వేరే పార్టీకి కాంగ్రెస్ ని వోడించే బలం లేదు.”  మేమంతా ఐకమత్యంగా ఉంటేనే తిరిగి గెలుస్తాం.
(నవంబరు శుక్రవారం నాడు ఈనాడు దినపత్రిక లో ప్రచురించిన ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ)
వ్యాఖ్య
“కుఠార మాలికాం దృష్ట్యా
కంపంతతి తరోవనే!
తత్ర వృద్ధ తరుహ్  ప్రాహుహ్
మామకోనాస్తి కిం భయం”
ఈ సంస్కృత శ్లోకానికి  తెలుగు అనువాదం:
“ఒకడు పది గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం “ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు  మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా!” అని అభయం ఇచ్చింది.
“అదీ కాంగ్రెస్ వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.”
(కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన ‘అప్పుడు –ఇప్పుడు’ గ్రంధం నుంచి)
25-11-2011