14, డిసెంబర్ 2015, సోమవారం

ఒక విషాద ఘడియకు అరవై ఏళ్ళు


నాన్న చనిపోయి అరవై ఏళ్ళు. మనిషి చనిపోవడం అంటే ఏమిటో తెలియని చిన్న వయస్సులోనే కన్ను మూసాడు.  కంభంపాడులో చనిపోతే యాభయ్ మైళ్ళ దూరంలో వున్న బెజవాడకు ఆ కబురు అందడానికి రెండు రోజులు పట్టింది. మా వూళ్ళో సరయిన బడి లేదని నన్ను బెజవాడ స్కూల్లో చేర్పించారు. కబురు మోసుకొచ్చిన బ్రాహ్మడు ఏదో చెప్పడం, మా అక్కయ్య గుండెలు బాదుకుంటూ ఏడవడం లీలగా గుర్తు. బస్సు పట్టుకుని పెనుగంచి ప్రోలు వెళ్లి, బండి కట్టుకుని కంభంపాడు చేరే సరికి కర్మ తంతు మొదలయింది. కర్తగా మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు గుండుతో కనబడ్డారు. వచ్చిన చుట్టపక్కాలు నన్ను పొదివి పట్టుకుని ఏడుస్తుంటే ఏమీ అర్ధం చేసుకోలేని వయస్సు. అప్పటినుంచి ఇప్పటి దాకా మా నాన్నగారి ఆబ్దీకాలు ఏటా పెడుతూనే వస్తున్నాము. కంభంపాడులో ఈ తద్దినాలకు ఒక ఉత్సవ రూపం కలిగించినఘనత మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుది. డిసెంబరులో వచ్చే ఈ తద్దినానికి చుట్టపక్కాలందరికీ నవంబరు నుంచే పిలుపులు వెళ్ళేవి. ఏడుగురు అక్కయ్యలూ, బావలూ, వారి పిల్లలూ, నలుగురం అన్నదమ్ములం అందరం ఏటా ఒకచోట కలిసే సందర్భంగా మారిపోయింది. దశాబ్దాలపాటు ఈ బరువును మా మూడో అన్నయ్య, బాధ్యతను మా పెద్దన్నయ్య మోశారు.  వారు కన్ను మూసిన తరువాత కొన్నేళ్లుగా కర్తృత్వం నేను నిర్వహిస్తూ వస్తున్నాను.
రేపు డిసెంబరు పదిహేను మంగళవారం మా నాన్నగారి పుణ్యతిధి. ఆయన  రూపం కూడా లీలామాత్రంగా కూడా నాకు గుర్తు లేదు. ఒక్క ఫోటో కూడా లేదు.  నాన్న మంచాన పడి వున్నప్పుడు, చనిపోవడానికి  కొద్ది రోజుల ముందు మా బావగారు తుర్లపాటి హనుమంతరావు గారు ఒక ఫోటో తీసారుట. రూపం అస్పష్టంగా వున్న ఆ ఫోటో ఇప్పటికీ  కంభంపాడులోని మా ఇంటి వరండా గోడ గూటిలో వుంది.


రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు, హైదరాబాదులో  ఒక ఆర్టిస్టుకి ఆయన రూపు రేఖలు వర్ణించి చెప్పి ఒక ఊహా చిత్రం గీయించారు.

నాకీ జన్మ ఇచ్చిన మా నాన్నగారికి ఇదే నా  స్మృత్యంజలి.
(14-12-2015)        

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


ఈ కాలం లో వదిలి పెట్ట కుండా చేస్తున్నారు .

అదే గొప్పదనం, ధనము, దానమున్నూ కూడా .

అంజలి.

జిలేబి