5, నవంబర్ 2014, బుధవారం

ముఖ్యమంత్రి చెప్పిన జోకు



ముఖ్యమంత్రి చెప్పిన జోకు అంటే మనిద్దరు చంద్రుల్లో ఒకరు చెప్పిన జోకనుకుంటారేమో. ఆ ఛాన్సే లేదు. వారు నవ్వరు. మనల్ని నవ్వించరు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకోవడానికే సమయం సరిపోవడం లేదు. ఇక జోకులు పేల్చే టైమెక్కడిది.
ఈ జోకు చెప్పింది గోవా బీ.జే.పీ. ముఖ్యమంత్రి  శ్రీ మనోహర్ పర్రీకర్.


(దేశంలో మొట్టమొదటి ఐ.ఐ.టి. గ్రాడ్యుయేట్ ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్)  

మనోహర్ పర్రీకర్. ఈ పేరు రోజంతా టీవీ స్క్రోలింగుల్లో దొర్లుతూనే వుంది. కాబోయే రక్షణ మంత్రి అని ఊహాగానాలు జోడిస్తున్నారు. పారీకర్, పర్రేకర్ అని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు.  అంచేత నేను కూడా పర్రీకర్ అని రాసి నేను సైతం నా ఇష్టం వచ్చినట్టు రాయగలను సుమా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. టీవీలో స్క్రోలింగులు చూసిన తరువాత ఆయన్ని గురించి నిరుడెప్పుడో రాసింది గుర్తుకు వచ్చింది.
పుణేలో నిరుడు   ఒక సదస్సు జరిగింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్  ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.  మాట్లాడుతూ మాట్లాడుతూ  మాటల మధ్యలో  ఓ జోకు పేల్చారు. దాన్ని  సభికులందరూ ఆసక్తిగా వినడమే కాదు, విని  కడుపుబ్బా నవ్వుకున్నారట కూడా.
ఆ జోకేమిటంటే....
ఆయన మాటల్లోనే విందాం.
జూ నుంచి రెండు సింహాలు తప్పించుకున్నాయి. వాటిల్లో ఒకటి అడవి సింహం. అడవిలో  పట్టుబడి పట్నంలో వున్న  జూకి వచ్చింది. తప్పించుకోవడమే తడవు  అది మళ్ళీ అడవిలోకి పారిపోయింది.
పోతే రెండో సింహం అడవిలో దొరికింది కాదు. అది జూలోనే పుట్టి  జూలోనే పెరిగిన సింహం. దాంతో దానికి అన్నీ బస్తీ అలవాట్లే అలవడ్డాయి. అడవీ, వేటా ఇవన్నీ దాని వంటికి పడవు. జూ సిబ్బంది పెట్టింది తిని తొంగుండే బాపతు. బద్దకానికి పెట్టింది పేరు.
మూడు రోజులు గడిచాయో లేదో, పారిపోయిన అడవి సింహం జూ సిబ్బందికి ఇట్టే  దొరికిపోయింది.  దాన్ని తీసుకువచ్చి మళ్ళీ జూలో బోనులో బంధించారు. కానీ బస్తీ సింహం ఆచూకీ మాత్రం పట్టుకోలేకపోయారు.
నెల గడిచింది. రెండు నెలలు గడిచాయి. మూడో నెల నడుస్తున్నా బస్తీ సింహం ఎటు పోయిందన్న సమాచారం లేదు.    
చివరికి ఎట్లాగయితేనేం బస్తీ సింహం ఆచూకీ ఆరుమాసాల తరువాత దొరికింది. దాన్ని పట్టి బంధించి మళ్ళీ జూకే తీసుకువచ్చారు.
పాత నేస్తాన్ని చూడగానే అడవి సింహం మొహం వికసించింది.
వాటి నడుమ సంభాషణ ఇలా సాగింది.
ఏం మిత్రమా! ఈ మానవ మృగాల కంట బడకుండా ఈ ఆరు నెలలు ఎక్కడ దాక్కున్నావు? యెలా దాక్కున్నావు?  ఈ రక్కసి  మనుషుల నుంచి  తప్పించుకుని ఏవిధంగా తిరగగలిగావు? ముందు  ఆ సంగతి చెప్పు
ఏం లేదు మిత్రమా! నువ్వేమో అలా అడవిలోకి వెళ్లావు. ఇక నాకు ఆ  అడవీ, దాని  ఆనుపానులు అసలే తెలియవాయె. ఏం చెయ్యాలి ఎక్కడ దాక్కోవాలి అని ఆలోచిస్తుంటే  దారిలో సచివాలయం కనిపించింది. వెంటనే దాంట్లోకి దూరిపోయాను. నా సామిరంగా! యే గదిలో చూసినా ఎక్కడ చూసినా అన్నీ ఫైళ్ళే. దుమ్ముకొట్టుకుపోయి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయివున్నాయి.  హాయిగా వెళ్ళి వాటి మాటున దాక్కున్నాను.
భలే భలే. మరి తిండీ తిప్పలమాటేమిటి
నిజానికి తిండికి వెతుక్కోవాల్సిన పనే లేదనుకో! ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఎటు చూసినా సిబ్బందే. హాయిగా రోజుకొకడ్ని నంజుకు తిన్నా అడిగేవాడులేదు. ఎందుకంటే ఒకడు కనిపించకపోయినా అక్కడ అయిపూ అజా కనుక్కునేవాడే లేడు. ఒకడు రాకపోయినా, పత్తా లేకుండా పోయినా  వాడి స్థానంలో ఇంకోడ్ని టెంపరరీగా వేసుకుంటారు కానీ,  అసలు వాడు ఎటు పోయాడు అని ఆరా తీసే వాడేలేడనుకో. అసలక్కడ పనిచేసేవాడంటూ వుంటే కద.  అందువల్ల నేను ఎంతమందిని  కొరుక్కుతిన్నా లెక్కతెలిసే అవకాశమేలేదు. అంచేత నాకు ప్రతిరోజూ మృష్టాన్న భోజనమే”  
మరి ఇంత హాయిగా రోజులు గడిచిపోతూ వుంటే మళ్ళీ వీళ్ళ  చేతికి యెలా చిక్కావ్
అదే ఖర్మ అంటే. హాయిగా రోజుకో ప్రభుత్వ ఉద్యోగిని తింటూ పోతే నన్ను ఎవడూ పట్టుకునే వాడు కాదు. బుద్ధి తక్కువై  ఓ రోజు,  వాళ్లకు రోజూ  టీ పట్టుకువచ్చేవాడు దొరికితే, ముందూ వెనకా చూడకుండా  వాడిని పొట్టనబెట్టుకున్నాను. అదే నా పొట్టమీద కొట్టింది. రోజూ టీ ఇచ్చేవాడు కనబడకపోవడంతో అప్పుడు వారికి మన వ్యవహారం అర్ధం అయినట్టుంది.  అంతా కలిసి మాటువేసి  నన్ను  పట్టేసుకున్నారు. అదీ మిత్రమా నా విషాద గాధ

(24-04-2013)

2 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

ఒక ముఖ్యమంత్రే ఇట్టాంటి జోకేశాడా?యెంత ఘోరం!ఈ దేశం యేమైపోవాల?!అధ్యక్షా,ఈ ముఖ్యమంత్రి కన్నా ఆ బస్తీ సింహమే తెలివయింది అని నొక్కి వక్కాణిస్తాండా!!దాన్నే అరిజెంటుగా సీయెమ్ముని జెయ్యాల.

అజ్ఞాత చెప్పారు...

ఆర్యా, సబ్ రిజిస్ట్రార్ , రవాణా శాఖా లో ,యెదిని సంపాదన అదికంగా ఉన్న డిపార్టుమెంటు లో ఎంప్లాయిస్ ఎవరో, దళారీ ఎవరో కొత్తగా వెళిన వారికీ అయోమయంగా ఉంటుంది. ఇది అక్షరాల నిజం. ఈ విషయం గవర్నమెంట్ కు తెలిసి కూడా పటించుకోవడుం లేదు. ఇక్కడే ప్రక్షాచన జరగాలి.