24, డిసెంబర్ 2009, గురువారం

మహిళలపై టీవీ ప్రభావం

మహిళలపై టీవీ ప్రభావం




ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం.

'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు.



హింస ఎక్కడ లేదు? నగరాల్లో- గ్రామాల్లో- ఇళ్ళల్లో- వీధుల్లో- మాటల్లో- చర్చల్లో ఎక్కడ చూసినా హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు - సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా డ్రాయింగ్ రూముల్లోకి జొరబడుతోంది. అవునా? కాదా?



అయిదేళ్ళక్రితం అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. 'మీ ఈ అభివృద్దికి కారణం ఏవిటన్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి ఈ చర్చకు సంబంధించినది వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా దూరదర్శన్ లో క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ, ఆ నాలడ్జే తరువాత జీవితంలో అక్కరకు వచ్చిందనీ వాళ్ళు చెప్పారు.

టీవీల వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.



లాహోర్ లో ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్ లో చదువుకునే విద్యార్ధులు నిరుడు ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్ట్ ఆన్ చిల్ద్రెన్ అన్నది సబ్జెక్టు. వాళ్ళ లెక్క ప్రకారం-

అక్కడి పిల్లల్లో -

పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట. ఓ అరగంటపాటు హోం వర్క్ చేసుకుని -ఓ గంట టీవీ గేమ్స్ చూస్తారట.

ఓ యిరవయి నిమిషాలు రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీ, ఓ గంట ఆటలకీ, రెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ ఖర్చు చేస్తారని తేలింది.

మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే - చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల ఇమాజినేటివ్ పవర్ పెరుగుతుందన్నారు. కొత్త భాషలు, కొత్త పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీ వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు - టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారని, దౌర్జన్యకారులుగా తయారవుతున్నారని, చదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు. ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను రెగ్యులేట్ చేయాలన్నారు. పిల్లలు చూసే ప్రోగ్రాములపై పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు.



రాజ్యాంగంలోని ఆర్టికిల్ యిరవై ఒకటి మనందరికీ జీవించే హక్కు ఇచ్చింది. రయిట్ టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగా, గౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు ఇస్తోందని - హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసాయి. టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం ఈ ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ ఏ టీవీ చానల్ కూడా దీన్ని పట్టించుకున్న దాఖలా లేదు.



వంటలు-ఆరోగ్యం- ఎడ్యుకేషన్ - వీటి మీద చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో- ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఆకర్షణీయమయిన టీవీ యాడ్స్ చూసి పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. చూసి కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి ఈ డ్రాయింగ్ రూం టీవీలే కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలు, సంగీతం అలా ఏదో ఒక ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో- సీరియళ్లు చూస్తూ వాటిపై చర్చోపచర్చలు చేసుకోవడంతోనే సరిపోతోంది. పిల్లలని చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే వాటికి ఎంతగా ఎడిక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.



ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడయి తోచు చందాన - ఈ నాడు ప్రయివేటు ఛానళ్ళు కుటుంబంలో అందరికీ కావాల్సిన ప్రోగ్రాములను నేత్రానందంగా తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీ' దీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే 'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు- చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలే కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం చెప్పేవారే కరువవుతున్నారు.



ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

అశ్లీలాన్ని అరికట్టే సదాశయంతో రూపొందించే ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి.



ఒక్క మాటలో చెప్పాలంటే- తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు తీరిక లేకుండా పనిచేస్తున్నాయి.



-భండారు శ్రీనివాసరావు -

కామెంట్‌లు లేవు: