14, మే 2022, శనివారం

పనికొచ్చే మనిషి – భండారు శ్రీనివాసరావు

 (నాదేంలేదు, ఇంగ్లీషు జోకుకి స్వేచ్ఛానువాదం చేయడం తప్ప)

పనిమనిషి ఇంటి యజమానురాలిని అడిగింది జీతం పెంచమని. పెంచడానికి మూడు కారణాలు చెప్పమంది ఇంటావిడ.

నేను మీకంటే బాగా బట్టలు ఇస్త్రీ చేస్తాను”

అలానా! ఎవరు చెప్పారు నీతో అలా?”

ఎవరో కాదు మన సారే ఆ మాట నాతో చాలా సార్లు చెప్పారు”

అల్లానా! సరే! ఇంకో కారణం చెప్పు”

నేను మీకంటే బాగా వంట చేస్తాను”

అలానా తల్లీ ఇదెవరు చెప్పారు?”

ఇంకెవరు? మన అయ్యగారే!”

ఓహో! అలా కూడా చెప్పారా అయ్యగారు, అది సరే నీ జీతం ఎందుకు పెంచాలో మరో కారణం చెప్పు”

అది చెప్పడం బాగుండదండీ! కానీ మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు, మీకంటే నేనే బాగుంటానుట”

ఏమిటీ! ఇది కూడా అయ్యగారే చెప్పారా? ఇంటికి రానీ సంగతి తేలుస్తాను.”

అయ్యో అలా అనుకున్నారా! ఈ సంగతి చెప్పింది అయ్యగారు కాదండీ మీ కారు డ్రైవరు”

సరే! ఇంతకీ యెంత పెంచమంటావు ముందది చెప్పు”

NOTE: Courtesy Image Owner



 

తొందరపడ్డదాన్ని కాదు (కధానిక) – భండారు శ్రీనివాసరావు

 ఆదివారం. లిఫ్ట్ అలుపూ సొలుపూ లేకుండా పైకీ కిందికీ తిరుగుతోంది. చిన్నా పెద్దా సామాన్లు ఖాళీగా ఉన్న మా పక్క పోర్షన్ లోకి చేరుతున్నాయి. నలుగురు పనివాళ్ళు పెద్ద పెద్ద టీవీలను , మంచాలను, అరమరాలను మెట్ల మీదుగా తెస్తున్నారు. సాయంత్రానికల్లా ఇల్లు పట్టనంత సామానును ఇంట్లో అమర్చిపోయారు. తీరా చూస్తే ఒక వయసుమళ్ళినావిడ, రిటైర్ అయిన మొగుడు.

వుండేది ఇద్దరే. పిల్లలు అమెరికాలో వుంటారట. ఇరవై నాలుగ్గంటలు వుండే పనిమనిషి, వంటకు ఇంకో మనిషి. పెద్ద టీవీలు ఉన్నాయన్న మాటే కానీ ఆవిడ ఎప్పుడూ పూజాపునస్కారాలతోటో, రామకోటి రాస్తూనో వుండేది. ఇక ఆయన పొద్దున్న ఇంగ్లీష్ పేపర్లో తలదూరిస్తే మళ్ళీ మధ్యాన్న భోజనం వరకు ఆ వార్తలే ఆయనగారికి భోజనం అన్నట్టుగా వుంటారు.

వంట మనిషి రోజూ ఆరున్నొక్క తీరుగా రకరకాల చిరుతిండ్లు చేసిపెడుతుంటుంది. కానీ ఏనాడూ ఆవిడ నోరు తెరిచి ‘ఈ మిఠాయి ఉండ నోట్లో వేసుకుని చెప్పమ్మా మరదలా’ అంటుందేమో అని చాలా రోజులుగా అనుకుంటూ వుండేదాన్ని. కానీ ఏనాడూ ఆమె నోటంట ఈ మాట రాలేదు. దాంతో నేనే కావాలని మా ఇంట్లో చేసిన వాటిని తీసుకుపోయి ఇస్తుండేదాన్ని. తిని తెగ మెచ్చుకునేది. ‘నీ చేతితో ఏం చేసినా అమృతం సుమా’ అనేది.

సంక్రాంతి వచ్చింది. ‘చూడు మరదలా! రేపు నువ్వూ తమ్ముడూ మా ఇంటికి భోజనానికి రావాలి. మరచిపోవద్దు’ అంటే ఆశ్చర్యపోయాను.

పండగనాడు రకరకాల వంటకాలు వడ్డించింది. స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిఉండొచ్చు అనుకున్నా.

ఏదీ మీ వంటమ్మాయి కనిపించడం లేదు’ అన్నాను అటూ ఇటూ చూస్తూ ఆవిడ ఇచ్చిన తాంబూలం నోట్లో వేసుకుంటూ.

పండక్కి వాళ్ళ ఊరుకు వెళ్ళింది. రేపు సాయంత్రం వస్తుంది. ఇన్నాళ్ళు ఆమె చేసి పెడితే మేము తింటున్నాము. ఇరుగూ పొరుగును పిలిచి ఆమె మీద భారం వేయడం ఎందుకని ఊరుకున్నాను. ఇదిగో! ఈరోజు ఇవన్నీ నా చేత్తో చేసినవే. ఎలా వున్నాయో చెప్పు. వంటింట్లోకి పోయి చాలా కాలం అయింది. ఇది తెలిస్తే మా పిల్లలు ఊరుకోరు’

ఏం చెప్పను?

ఆవిడ వయసే కాదు, మనసుకూడా పెద్దది.

13, మే 2022, శుక్రవారం

మనుషులు చేసే పనులేనా! – భండారు శ్రీనివాసరావు

 

బెజవాడలో డాక్టర్ కొమ్మూరి సాంబశివరావు (నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాల రావు గారి నాన్నగారు) గవర్నర్ పేట పోస్టాఫీసు దగ్గర క్లినిక్. ఆయన ఒక రోగితో చెబుతుంటే విన్నా. ‘ఈ మందులు సరిగా వాడకపోతే చచ్చిపోతావ్’ అని.
నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత కటువుగా చెప్పాలా అని. కానీ ఆయన అన్నారు ఇలా.
‘మనిషికి చావు భయాన్ని మించిన భయం వుండదు. ఈ రోగి నా దగ్గరకు రావడం ఇది పదో సారి. ఎప్పుడూ సరిగా మందులు వాడడు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తుంటాడు’
ఈ నేపధ్యం తలచుకోవడానికి కారణం వుంది.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజుల్లో యావత్ ప్రపంచం మృత్యువు ముంగిట్లో వుంది. లక్షల మంది కరోనా కోరల్లో చిక్కుకుని చనిపోయారు. దాదాపు ప్రతి కుటుంబం తన ఆత్మీయులలో ఒకరినో ఇద్దరినో పోగొట్టుకుంది. కొందరికి ఆ గాయాలు ఇంకా గుండెలో పచ్చిగా వున్నాయి. కరోనా భయం అనేది వున్నవారు లేనివారు అనే తేడా లేకుండా సమస్త సమాజాలను ఒకే తీరున వణికించింది. జీవితం అశాశ్వతం అనే నిర్వేదంలోకి మానవ జాతి వెళ్ళిన ఏకైక సందర్భం.
కానీ ఏం లాభం? ఏడాది తిరక్క మునుపే కింది వార్తలు చూడండి.
‘ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధురాలిపై అత్యాచారం’
‘నడి రోడ్డు మీద నరికి చంపిన హంతకులు’
‘వెంటాడి వేటాడాడు. చనిపోయాక కూడా రేప్’
‘భర్త ఆవేశం మరణ శాసనమై’
‘పెళ్ళికి ఒప్పుకోలేదని కాల్చి చంపేశాడు’
‘వివాహితపై అత్యాచారం’
‘ఫేస్ బుక్ ఫ్రెండ్ తో ప్రియుడిని చంపించిన మహిళ’
కుక్క తోక వంకర సామెత గుర్తుకు వస్తే తప్పు పట్టాలా!
(13-05-2022)

11, మే 2022, బుధవారం

పొత్తు పొడిచినా ఫలితం దక్కుతుందా! – భండారు శ్రీనివాసరావు

రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ పార్టీలు హడావిడి పడుతున్నాయి. పొత్తులు, ఎత్తులు, జిత్తుల మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రెండేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునే వ్యూహాలకు తెర తీస్తున్నాయి.

రాజకీయ పార్టీలకి అనేక లక్ష్యాలు వుంటాయి. కానీ అన్నింటిలో ఉమ్మడిగా కానవచ్చేది ఒక్కటే. అది విజయం వైపు పయనం.

2019లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీని అధికార అందలం ఎక్కించిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, పరాjజయం పాలయిన టీడీపీ నాయకుడు చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ మువ్వురు  కూడా 2024లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల వ్యూహాలను రూపొందించుకునే కార్యక్రమంలో తలమునకలుగా వున్నారు.  ఈ లక్ష్య సాధన కోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు. రాజకీయ సమీకరణాలు  పూర్తిగా మారిపోతాయని మూడేళ్ళ క్రితం ఎవరయినా అంటే ఎవరూ నమ్మేవాళ్ళు కాదు. అంటే రోజులు గడుస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా, వారి వారి రాజకీయ అవసరాలకు, ప్రయోజనాలకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయనడానికి ఏపీలో  రోజురోజుకి మారుతున్న పరిణామాలే   మంచి ఉదాహరణ. కానీ ఈ విషయాలు వారెవ్వరూ బయటకి ఒప్పుకోరు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం. చెప్పీ చెప్పనట్టుగా కొన్ని చెబుతుంటారు, వాటిల్లో దాగున్న అర్ధాన్ని విశ్లేషిస్తూ చర్చలు సాగుతాయి. ప్రజలని తాము కోరుకున్న పద్ధతిలోనే ఆలోచించేలా చేయడం వీటి అంతిమ లక్ష్యం.

నేటి రాజకీయాల పట్ల కనీస అవగాహన ఉన్నవారికి ఈ పరిణామాలు గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే గతంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై నడిచిన రాజకీయాలు ఈనాడు అవసరాల పునాదులపై నిలదొక్కుకుంటున్నాయని వారికి తెలుసు కాబట్టి.

2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్నదే ఈ ముగ్గురు నాయకుల ధ్యేయం. కాకపోతే ఈ లక్ష్యసాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.

పాలకపక్షం వైసీపీ పూర్తిగా బలహీన పడిందని  నమ్ముతూ  తద్వారా ఏర్పడ్డ రాజకీయ శూన్యతను ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో కొత్త పొత్తుల ఆలోచన రూపుదిద్దుకుని ఉండవచ్చు. పొత్తులు ఫలితం ఇస్తాయి అనడానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏమీ లేదు. అవసరాలకోసం రాజకీయ నేతలు సర్దుబాటు చేసుకున్నట్టుగా ఆ పార్టీల కార్యకర్తలు అంత సులభంగా కలిసిపోరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఓట్ల బదలాయింపుకు అవకాశాలు తక్కువ.   

రాజకీయ శూన్యత వున్నప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయాల వికాసానికి అవకాశం వుంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేదాన్ని ఏ అధికార పక్షం అయినా ఎన్నికల్లో ఎదుర్కోక తప్పదు. అయితే వ్యతిరేకత ఒక్కటే పాలక పక్షం ఓటమికి దోహదం చేయదు. వ్యతిరేకత అసంతృప్తిగా మారి, ఆ అసంతృప్తి అసహనంగా మారి, ఆ అసహనం ఆగ్రహంగా మారినప్పుడే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. ఆ పరిస్థితిలో బలమైన ప్రత్యామ్నాయంగా కనపడిన పార్టీకి, ఏ పార్టీ అని కూడా చూడకుండా ఓట్లేసి గెలిపిస్తారు. 

రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజలు తమ ఆగ్రహాన్ని అనునిత్యం ప్రదర్శించరు. తమలోనే దాచుకుంటారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు.  

బ్రహ్మాండంగా విజయవంతమైన సినిమా ఫార్ములాతోనే అందుకు ఏమాత్రం తగ్గకుండా మరో సినిమా తీస్తే అది విజయవంతమైన సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఈ పొత్తులు. మళ్ళీ వీటిలో కొన్ని రకాలు. ఎన్నికలకు ముందు పెట్టుకునేవి కొన్ని అయితే, ఎన్నికల తరవాత, ఎవరికీ సరైన మెజారిటీ రానప్పుడు  కుదుర్చుకునేవి మరి కొన్ని. ఎన్నికలకు ముందు ప్రతి పార్టీ తాను బలమైన పార్టీ అనే నమ్ముతుంది. కనుక సీట్ల సర్దుబాటు ఒక సమస్యగా మారుతుంది. వామపక్షాల వైఖరి కొంత విచిత్రంగా వుంటుంది. పలానా నియోజక వర్గంలో గెలిచే అవకాశం లేకపోయినా, కేడర్ ని సుస్తిరం చేసుకోవడానికి పట్టు పడతాయి.

1982 ఎన్టీ రామారావు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, కాంగ్రెసేతర పార్టీలతో పొత్తుల ప్రతిపాదనలు వచ్చాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసి 120  సీట్లు కావాలని కోరాయి. సంప్రదింపులు జరిగిన తర్వాత కనీసం 90 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టాయి. ఎన్టీఆర్  80 ఇస్తామన్నారు. కమ్యూనిస్టులు తమకు అలవాటయిన చారిత్రక తప్పిదం చేశారు. ఒక్క సీటు తగ్గినా ఒప్పుకోమని తేల్చి చెప్పారు. చర్చలు విఫలం అయ్యాయి. మరో పక్క జనతా పార్టీ తరపున బాబుల్ రెడ్డి ఎన్టీఆర్ ని కలిసి  60 సీట్లు అడిగారు.  20 వరకు ఒప్పుకోవాలని ఎన్టీఆర్ యోచన. ఈలోగా లోక్ దళ్, రిపబ్లికన్ మొదలైన పార్టీలు మరికొన్ని అడిగాయి. ఈ పార్టీల వైఖరితో విసుగుచెందిన ఎన్టీఆర్, అసలు పొత్తులకే స్వస్తి చెప్పి ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించారు. ఆఖర్లో మాత్రం సంజయ్ విచార్ మంచ్ కి అయిదు సీట్లు ఇచ్చారు. మిగిలిన అన్ని సీట్లలో టీడీపీ పోటీ చేసింది.

అప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగి  ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలకు టీడీపీ వెలుగు రేఖలా  కనిపించింది. ఎన్టీఆర్ తొందరపడి ఇతర పార్టీలకు వారు అడిగిన సంఖ్యలో సీట్లు ఇచ్చి వుంటే,  ప్రజలు టీడీపీని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భావించి వుండేవారు కాదని ఓ అభిప్రాయం. ఓ పది సీట్ల కోసం కమ్యూనిస్టులు పట్టిన పట్టు రాష్ట్ర రాజకీయాల తీరుతెన్నులనే మార్చివేసింది. 

ఇక ప్రస్తుతానికి వస్తే.        

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలు ఒకేమారు తలపడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గణనీయంగా చీలిపోయి అధికార వైసీపీ లాభపడుతుందని కొందరి ఉద్దేశ్యం.  ఈసారి ఏదీ ఊహకు అందకుండా ఉంటుందని మరికొందరు అంటున్నారు. అంచేత బరిలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళూ ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ప్రయత్నాలు చేస్తారు. హామీలు, ప్రలోభాలు, ఎత్తులు, పొత్తులు, అవగాహనలు, పైకి ఒకటి చెబుతూ మరొకటి చేసే రాజకీయ రణతంత్రాలు, మిత్రబేధాలు, ఇలాటివన్నీ ఆ జాబితాలో వుంటాయి. డబ్బు ప్రాధాన్యం ఎలాగూ వుంటుంది. అయితే తమను ఎవరు పరిపాలించాలో ప్రజలు ముందే ఒక నిర్ణయానికి వస్తే మాత్రం, ఈ టక్కు ఠమారవిద్యలు అన్నీ కొరగాకుండా పోతాయి.

ప్రతి రాజకీయ పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని మూలసిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కాలమాన పరిస్తితులను బట్టి ఆ సిద్ధాంతాలను కొంత పక్కన బెట్టి వ్యవహరించే పరిస్తితి ఈనాడు చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి అంశాన్ని, విజయావకాశాలు, రాజకీయంగా ఒనగూడే లాభనష్టాల నిష్పత్తి కోణం నుంచే ఆయా రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. అధికారమే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు నీళ్ళు వదిలి, అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుతో మొదలయ్యే ఈ కప్పదాట్లు అధికార పీఠం అధిరోహించిన తరువాత మరింత వికృత రూపాన్ని, స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదిరించడం కోసం, నిలువరించడం కోసం పలు విపక్షాలతో రాజీపడి దానికి భావసారూప్యం అనే అందమైన అర్ధంలేని పదాన్ని అడ్డు పెట్టుకోవడం రాజకీయాలను గమనించేవారికి అనుభవమే. అలా మొదలయ్యే ఈ అవకరం క్రమంగా రాజకీయ కూటముల ఆవిర్భావానికి మార్గం వేసింది. అయితే, అధికారంలో పై చేయి కోసం వెంపర్లాటలు, పదవుల పంపిణీలో కీచులాటలు, సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ రాజకీయ కూటముల అస్తిత్వానికే ముప్పు తెచ్చిన సందర్భాలు కూడా గతంలో అనేకం.

పాలకపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనట్టు,  ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి పాలక పక్షాలు అంతే పట్టుదలగా పనిచేస్తున్నాయి. ప్రతిపక్షాలను గౌరవించడం సంగతి అటుంచి, అసలు వాటి ఉనికిని గుర్తించడానికి కూడా విముఖత చూపుతున్నాయి. ఉనికే లేకుండా చేయాలని యోచించడం ఇందుకు పరాకాష్ట.  చట్టసభల్లోనే కాకుండా చట్ట సభల వెలుపల కూడా ప్రతిపక్షాల పొడగిట్టని తత్వాలు, ఎదుటి పార్టీలను చీల్చి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు కొత్త రాజకీయ సంస్కృతిగా రూపుదిద్దుకుంటున్నాయి. కొద్ది హెచ్చు తగ్గులు మినహా ఏపార్టీ కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి. 

రాజకీయులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సాధించిన విజయాలు  ఎప్పటికీ శాశ్వతం అని భావించకూడదు. పరాజయం పొందినవారు అది శాశ్వతం అనుకోకూడదు. శిఖరం ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు. ఎప్పుడో ఒకప్పుడు కిందికి దిగకతప్పదు. అలా దిగినప్పుడు మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకోకూడదు.

అధికారం దక్కినప్పుడు కాలయాపన చేయకుండా, జనం తమకు అధికార పగ్గాలు అందించిన నిర్దిష్ట కాల వ్యవధిలోనే ప్రజలకు చేసే నాలుగు మంచి పనులే శాశ్వతంగా మిగిలిపోతాయి.

ఇది నిజం. కానీ ఈ నిజాలు ఈనాటి రాజకీయ నాయకులకు పట్టవు. నిజానికి వారికి ఆ అవసరం ఉన్నట్టు కూడా లేదు.

8, మే 2022, ఆదివారం

మా అమ్మకు శ్రీశ్రీ సాహిత్యం ఎలా తెలుసు? – భండారు శ్రీనివాసరావు

 1987 అక్టోబరు చివరి వారం.

అప్పటికి ఆమెకు ఎనభయ్ ఏళ్ళు నిండాయి. బడికి వెళ్లి చదువుకోకపోయినా రామాయణ, భారత, భాగవతాలు కంఠోపాఠం.

నేను మాస్కో రేడియోలో చేరడానికి తేదీ నిర్ణయం అయింది. కుటుంబాన్ని తీసుకుని  ముందు ఢిల్లీ రైల్లో వెళ్లి, సోవియట్ ఎంబసీలో వీసా స్టాంప్ వేయించుకుని సోవియట్ విమాన సంస్థ ఏరో ఫ్లోట్ లో మాస్కో వెళ్ళాలి.

ఢిల్లీ వెళ్ళడానికి సికిందరాబాదు స్టేషన్ కు వెళ్ళాము. బంధు మితృలు చాలా మంది వచ్చారు, వీడ్కోలు పలకడానికి. నేను మా అమ్మతో ప్లాటుఫారం మీద ఓ బెంచిపై కూర్చుని ఉన్నాను. ఆమె మొహంలో బాధ కనిపించడం లేదు కానీ, మనసులో మాత్రం బాధ పడుతోంది. రైలు ప్లాటు ఫారం మీదకు వస్తూ దూరంగా కనిపించింది. ఆమె నా చెయ్యి తన చేతిలోకి తీసుకుని మెల్లగా  అంది.

“కూటికోసం, కూలి కోసం దేశాలు పోవాలా!’

ఏం చెప్పాలో తోచలేదు.

రైలు ఎక్కిన తర్వాత కూడా ఆమె మాటలే చెవిలో రింగుమంటున్నాయి.

రామాయణ, భారత, భాగవతాలు కంఠోపాఠం కానీ మా అమ్మకు శ్రీశ్రీ కవిత గురించి ఎలా తెలిసింది? టీవీలో ఆకలి రాజ్యం సినిమా చూసి ఉంటుందా! చూసినా ఇంతలా ఎలా గుర్తు పెట్టుకుంది?

ఆ సందేహం ఇప్పటికీ నివృత్తి కాలేదు.



(08-05-2022)  

   

ముఖ్యమంత్రుల ‘ఇంటి’ ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 08-05-2022, SUNDAY, today)

 

దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి హైదరాబాదుకు మారగానే ఆయన మొదట్లో ప్రస్తుతం రాజభవన్ పక్కన వున్న దిల్ కుశ్ గెస్ట్ హౌస్ లో వుండేవారు. ‘కర్నూలు రాజధానిలో డేరాలు వేసుకుని వుండి వచ్చారు కదా! ఇప్పుడు హైదరాబాదులో జీవితం ఎలావుంద’ని ఒక విలేకరి ముఖ్యమంత్రిని అడిగారు. ‘ఏం చెప్పనబ్బా! ఈ ఇల్లు ఎంత పెద్దగా వుందో చూస్తున్నారు కదా! మా ఆవిడ ఏ గదిలో వుందో కనుక్కోవడానికి అరగంట పడుతోంది’ అని నవ్వుతూ బదులిచ్చారు. తరువాతి కాలంలో సంజీవరెడ్డి బేగంపేట లోని గ్రీన్ లాండ్స్ ప్రభుత్వ అతిధి గృహాన్ని తన అధికార నివాసంగా ఎంచుకున్నారు. ఆయన తర్వాత దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. సంజీవరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పుడు సంజీవయ్య ఖుర్షిద్ జా అనే ఒక ప్రైవేటు భవంతిలో నివాసం వుండేవారు.

సంజీవయ్య గారి ప్రసక్తి వచ్చింది కనుక, కర్నూలు జిల్లా కల్లూరు మండలం లోని స్వగ్రామం  పెద్దపాడులో ఆయన సొంత ఇంటి పరిస్థితి గురించి చెప్పుకోవడం సముచితంగా వుంటుంది. పైగా  ఈరోజు మే ఎనిమిది ఆయన వర్ధంతి కూడా. 

అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రి.

ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆ పదవికి రాజీనామా చేసిన దరిమిలా  ఆయన స్థానంలో దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయించారు. అగ్రకులాల ఆధిపత్యం అధికంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు. సంజీవయ్య అవినీతిపరుడని, అక్రమంగా లక్షలాది రూపాయలు కూడబెట్టారని అధిష్టానానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సంజీవయ్య నీతి, నిజాయితీ తెలిసిన నెహ్రూ ఆ ఫిర్యాదులను కొట్టి పారేశారు. అయినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు. 

నెహ్రూ ఓ నాయకుడిని ఆంధ్రాకు వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. కానీ ప్రధాని ఆదేశం. చేసేది లేక ఢిల్లీ నాయకుడిని వెంటబెట్టుకుని కారులో సంజీవయ్య గారి గ్రామానికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతున్నది. పొగగొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది. "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు ఢిల్లీ నేత. 

"సంజీవయ్య గారి ఇల్లు ఇదే. ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు. కారు దిగండి" అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు" అన్నారు.

ఆమె చెమటలు తుడుచుకుంటూ "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా నాయనా! ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు" అన్నది. 

ఢిల్లీ నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?" అడిగారు చక్రపాణి. "అవసరం లేదు. కారును హైద్రాబాద్ కు పోనీయండి" అన్నాడు నాయకుడు. 

ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అయ్యారు. 

 కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాల కారణంగా రెండేళ్ళ తర్వాత సంజీవరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. తదుపరి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చాలా రోజులు ప్రస్తుతం విద్యుత్ సౌధకు సమీపంలోని ఏరువాక ప్రభుత్వ భవనంలో వుండి, తరువాత బేగంపేటలో గ్రీన్ లాండ్స్ ఎదురుగా, రోడ్డుకు ఆవలవైపు ఉన్న మరో ప్రభుత్వ భవనాన్ని(ఇప్పుడు మంజీరా గెస్ట్ హౌస్) తన అధికార నివాసంగా ఎంచుకున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత అధికార నివాసభవనం ఉండాలనే బ్రహ్మానందరెడ్డి ఆలోచన ఫలితంగా ఆనందనిలయం రూపుదాల్చింది. వాస్తు చూసి ఏర్పాటుచేసుకున్నా ఎక్కువరోజులు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. రాష్ట్ర విభజన ఉద్యమాల ఫలితంగా ఆయన పదవి నుంచి దిగిపోవడంతో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టారు. ఆంధ్రఉద్యమం కారణంగా రాజీనామా చేసి తప్పుకునేంతవరకు ఆయన కూడా ఆనంద నిలయంలోనే కొనసాగడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో వుంది.

తదనంతరం జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో హోంమంత్రిగా వున్న సమయంలో పంజాగుట్ట ప్రాంతంలోని ద్వారకాపురి కాలనీలో ముచ్చటపడి కట్టుకున్న చిన్న భవంతిలోనే కొనసాగారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన వసతులు అరకొరగా ఉన్నప్పటికీ చివరి వరకు ఆయన ఆ ఇంట్లోనే కాలక్షేపం చేసారు.

ఆ తరువాత ముఖ్యమంత్రి అయిన మర్రి చెన్నారెడ్డి వ్యవహార శైలి విభిన్నం. ఆయన తార్నాక లోని సొంత ఇంట్లోనే వుండి, దానికి అన్నిరకాల హంగులు సమకూర్చుకున్నారు. బహుశా సొంత నివాసాలకు ప్రభుత్వ ఖర్చుతో వసతులు ఏర్పాటు చేసుకునే సాంప్రదాయానికి అప్పుడే బీజం పడిందని అనుకోవాలి. ఆ రోజుల్లో మొత్తం హైదరాబాదులో లిఫ్ట్ సౌకర్యం ఉన్న ప్రైవేటు గృహాలు రెండే ఉండేవని, వాటిల్లో ఒకటి చెన్నారెడ్డి గారి తార్నాక నివాసం అని జనం చెప్పుకునేవారు. 

తదుపరి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పరిస్తితి దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయనకు  బరకత్ పురాలో హౌసింగ్ బోర్డ్ వారి టూ ఆర్ టీ ఇల్లు వుండేది. మంత్రిగా, కేంద్ర మంత్రిగా వున్నప్పుడు ఆయన అక్కడే వుండేవారు. ఇప్పటి రోజులతో పోలిస్తే అది ఒక విడ్డూరమే. ఆ చిన్న ఇంటిపైనే గది మీద గది నిర్మించుకుంటూ వెళ్లడం వల్ల చాలా ఇరుకుగా వుంటుంది. మెట్లు కూడా సౌకర్యంగా వుండవు. ముఖ్యమంత్రిగా జనాల తాకిడి ఎక్కువ. దాంతో ఆయన గతంలో సంజీవరెడ్డి నివాసం ఉన్న గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ని అధికార నివాసంగా చేసుకుని, దానికి జయప్రజా భవన్ అనే పేరు పెట్టారు.

ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన భవనం వెంకట్రాం మాత్రం తాను అంతకుముందు మంత్రిగా వున్నప్పుడు వున్నప్పుడు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్ లోనే వుండిపోయారు. భవనం వెంకట్రాం తర్వాత ముఖ్యమంత్రి అయిన కోట్ల విజయ భాస్కరరెడ్డి లోగడ పీవీ ముఖ్యమంత్రిగా నివసించిన ఆనంద నిలయానికి మారారు. 

ఇక, తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ఎన్టీ రామారావు ఆబిడ్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు. ఒక ముఖ్యమంత్రి అధికార నివాసాలు ఒకటికి మించి గుర్తించి అందుకు తగిన సదుపాయాలు కల్పించే పద్దతి ఆయన హయాములోనే మొదలయింది. గండిపేటలోని తన ఆశ్రమాన్ని కూడా రెండో అధికార నివాసంగా మార్చుకున్నారు. కొన్నాళ్ళు ప్రతిపక్షంలో వుండి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తు బాగుందని భావించారేమో తెలియదు, బంజారా హోటల్ సమీపంలోని తన కుమార్తె పేరిట ఉన్న ఒక చిన్న భవనంలో నివాసం వున్నారు. ప్రభుత్వం పక్కనే ఉన్న మరో భవనాన్ని అద్దెకు తీసుకుని ముఖ్యమంత్రి అవసరాలకు తగిన విధంగా వసతులు సమకూర్చడం జరిగింది. ఒక నెల రోజులపాటు ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర రావు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే వున్నారు.

1995లో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు జూబిలీ హిల్స్ లోని తన సొంత ఇంట్లోనే నివాసం వున్నారు. హోదాకు, అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వమే కొన్ని వసతులు సమకూర్చింది.

వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవీప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్నిమాసాలపాటు నాగార్జున సొసైటీలోని తన కుమార్తె ఇంట్లో నివాసం వున్నారు. ముఖ్యమంత్రికి శాశ్వత నివాస భవనం ఉండాలనే కాసు బ్రహ్మానంద రెడ్డి ఆలోచనను ఆయన మళ్ళీ ఆచరణలోకి తీసుకువచ్చారు. బేగం పేట మంత్రుల క్వార్టర్స్ లోని కొన్ని భవనాలను తొలగించి, అన్ని వసతులతో కూడిన విశాలమైన ఒక మంచి భవనాన్ని ప్రభుత్వ ఖర్చుతో కొద్ది నెలల కాలంలోనే నిర్మించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించేవరకు అందులోనే నివాసం వున్నారు.

తరువాత ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిన కే. రోశయ్య ఆ భవనంలో చేరడానికి ఇష్టపడలేదు. అమీర్ పేటలోని ప్రకృతి చికిత్సాలయం దాపునే తాను నిర్మించున్న భవంతిలోనే వుండిపోయారు. ముఖ్యమంత్రిగా రోశయ్య నుంచి బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా చాలా కాలం జూబిలీ హిల్స్ లోని సొంత ఇంట్లోనే వున్నారు. ఆ తరువాత తన నివాసాన్ని బేగం పేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసానికి మార్చుకున్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సొంత ఇంట్లో నివసించిన తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్నాళ్ళు  వై.ఎస్. హయాములో నిర్మించిన నివాసంలోనే వున్నారు. అక్కడ వున్న సోఫాలను కానీ, ఫర్నిచర్ ను కానీ మార్చకుండా అందులో నివసించారని కేసీఆర్ వ్యక్తిగత అధికారులు చెబుతుంటారు. అక్కడే వుంటూ, పక్కనే కొత్తగా విశాలమైన ఆధునిక వసతులు కలిగిన సీఎం క్యాంపు కార్యాలయ సముదాయాన్ని ఏర్పాటు చేశారు.

పోతే, అటు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు తాత్కాలికంగా కృష్ణానదీ తీరాన ఒక ప్రైవేటు గెస్టు హౌస్ ను తన అధికార నివాసంగా మార్చుకున్నారు. అధికారంలో ఉన్నంతకాలం చంద్రబాబు దాన్నే తన నివాసంగా ఉపయోగించుకున్నారు. 2019లో  ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షనేత జగమ్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నకాలంలో అమరావతి ప్రాంతంలో నిర్మించుకున్న ఇంటినే ఆయన అధికార నివాసంగా మార్చుకున్నారు.




7, మే 2022, శనివారం

ఆంధ్రపత్రిక కధ – భండారు శ్రీనివాసరావు

 జర్నలిస్ట్ మిత్రుడు పాశం యాదగిరి చెప్పిన ఓ మనసున్న మనిషి కధ

రాధాకృష్ణ అంటే గుర్తు పట్టడం కష్టం. అదే ఆంధ్రపత్రిక రాధాకృష్ణ అంటే తెలియనివాళ్ళు వుండరు.

ఆ శివలెంక రాధాకృష్ణ గురించే యాదగిరి చెప్పింది.

కాశీనాధుని నాగేశ్వర రావు గారు స్థాపించిన ఆంద్ర పత్రిక దినపత్రిక తొలిరోజుల్లో బొంబాయి నుంచి ఆ తరువాత మద్రాసు నుంచి మొదలయి తదుపరి విజయవాడ నుంచి, హైదరాబాదు నుంచి ప్రచురణ సాగించింది. నాగేశ్వరరావు పంతులు గారి అల్లుడు శివలెంక శంభుప్రసాద్ ఆధ్వర్యంలో ఒక వెలుగు వెలిగిన ఆంధ్రపత్రిక చివరకు ఆయన కుమారుడు శివలెంక రాధాకృష్ణ చేతిలో కొన్నేళ్ళు నడిచి ఆగిపోయింది. హైదరాబాదులో బషీర్ బాగ్ లో ఒక పెద్ద భవనంలో ఆంధ్రపత్రిక కార్యాలయం వుండేది. ముక్కు శర్మ గారు, పాపయ్య శాస్త్రి గారు,  సుందరం, యాదగిరి, వేణుగోపాల్, విద్యారణ్య, వెంకట రత్నం  మొదలయిన వాళ్ళు బ్యూరోలో పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక ఈవెనింగ్ ఎడిషన్ కు మంచి గిరాకీ వుండేది. పత్రికారంగంలో ఎదురయిన పోటీ తట్టుకోలేక అది మూతపడే సందర్భం వచ్చింది.

విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అంజయ్య గారు పత్రికకు ఏదో సాయం చేయాలని సంకల్పించుకుని నామ మాత్రపు ధరకు ఆ భవనాన్ని వాళ్ళకే విక్రయించేలా ఏర్పాటు చేయమని తన కార్యదర్శి రాఘవేంద్ర రావు గారిని కోరారు. విషయం దాదాపు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో రాధాకృష్ణ గారు ఇలా (బహుశా యాదగిరితో కాబోలు) అన్నారు.

చిన్న పిల్లలకు మిఠాయిలు చూడగానే వాటినన్నిటినీ తినాలని అనుకుంటారు. అన్నీ తెచ్చుకుని ప్లేట్లో పెట్టుకుంటారు. ఒకటి రెండు తినగానే నిద్ర వస్తుంది. ప్లేట్లో మిఠాయిలు అలాగే వుంటాయి. మనుషులమూ అంతే. ఎన్నెన్నో ఆస్తులు కూడబెట్టి అనుభవించాలని అనుకుంటాం. నానా అవస్థలు పడి ఆస్తులు పోగేస్తాం. ఏం లాభం! అనుభవించే వ్యవధానం లేక శాశ్వత నిద్రలోకి జారుకుంటాం’

ఇలాంటి వేదాంతంతో ఆనాడు ఎంతో విలువైన ఆస్తిని ఆయన తృణప్రాయంగా వదులుకున్నారు. అదే వుంటే ఆంధ్రపత్రిక బతికేదేమో! కానీ ఆ పత్రిక ఏ విలువలకోసం పెట్టారో అవి కాలగర్భంలో కలిసేవేమో!