16, ఫిబ్రవరి 2015, సోమవారం

తెలిసిన కేసీఆర్ లో తెలియని కేసీఆర్

(Published by 'SURYA' telugu daily on Tuesday,17-02-2015)
(ఫిబ్రవరి పదిహేడు - తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం)
కేసీఆర్ ని దగ్గరగా చూసి పదేళ్లు గడిచి వుంటాయి. 2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు,  కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గురించి చెప్పడానికి అనుకుంటా,  బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసిన గుర్తు. మధ్యలో కొంత ఎడం వచ్చింది కాని నేను మాస్కో వెళ్లక మునుపు కేసీఆర్,  ఎన్టీయార్ క్యాబినెట్ లో రవాణా శాఖ  మంత్రిగా వున్నప్పుడు, రేడియో విలేకరిగా  తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి  పేషీ వుండే సమతబ్లాక్ పక్కనే మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్  కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసివచ్చిన రాజకీయ ప్రముఖులు విలేకరులతో  మాట్లాడే 'మీడియా పాయింటు' ప్రస్తుతం ఆ ప్రదేశంలో వున్నట్టుంది.
అదలా వుంచితే, మళ్ళీ కేసీఆర్ ని దగ్గరగా గమనించే అవకాశం నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చింది. తెలంగాణా జర్నలిష్టుల ఫోరం కేసీఆర్ తో  ముఖాముఖి సమావేశం (మీట్ ది ప్రెస్) ఏర్పాటు చేసింది.
రావాల్సిందని నిర్వాహకుల నుంచి ఆహ్వానం.
'ప్రెస్ మీట్ అవగానే కేసీఆర్ కొందరితో కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి అని ఆహ్వానానికి కొసరు.
జర్నలిష్టుగా  రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. 'మీట్ ది ప్రెస్' కాబట్టి బయలుదేరి వెళ్లాను.

హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ.ఆర్.ఎస్. నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతో  కూడా కరచాలనం చేసారు. ఓ క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను.
సరే! ఆయన వేదిక మీదకు వెళ్ళి  తన అలవాటు ప్రకారం  సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, వాటిల్లో తొంగి చూసిన విషయ పరిజ్ఞానం, తొట్రు పడకుండా, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. 'సభికులు' అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశంలా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని మాటల మాంత్రికుడుఅంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. 'తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్న'దీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు ఒక రకంగా -  ఏదో ఒక సందర్భంలో ఆయన చెప్పినవే అయినా వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు, అదంతా టీవీల్లో  ప్రత్యక్షప్రసారంలో చూస్తున్న బెజవాడ  మిత్రుడు ఒకరు  ఎస్.ఎం.ఎస్. పంపారు. 'కేసీఆర్  ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెబుతున్నట్టుగా  యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ (విభజన) గొడవలే ఉండేవి కావ'న్నది దాని సారాంశం.  కానీ, అప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. ఎన్నికలే తరువాయి.
నాటి సభలో కేసీఆర్ అనేక విషయాలను స్పృశించారు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.  కాని 'విడిపోతే భద్రాచలం సంగతేమిటి?' అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని ఆయన ఆసక్తికరంగా వివరించారు.
"వెనుక  అది (భద్రాచలం) తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటన్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు  ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం  అంతా ఓ కధ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.
సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఆయనకు రాజకీయ గురువు అయిన  యన్టీయార్ గారిదీ ఇదే మనస్తత్వం. అతిధులను  స్వయంగా కనుక్కుంటూ, కొసరి కొసరి వడ్డించి  మరీ తినిపించేవారు.
హోటల్లో ఏవేవో పదార్ధాలు కేసీఆర్ కి వడ్డించబోతే, 'వద్దు ఇంత అన్నం, పప్పూ పట్టుకు రమ్మ'న్నారు. సింపుల్ భోజనం. భోజనం చేస్తుండగా  ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు. ఇదంతా ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం. అయిన తరువాత ఎన్నడూ కలిసింది లేదు. ఆ అవసరమూ రాలేదు. అయితే, టీవీల్లో ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు, పత్రికల్లో ఆయన గురించిన కధనాలు చదువుతున్నప్పుడు కేసీఆర్ మారిన దాఖలాలు ఏమీ కనబడడం లేదు.
అయినా ఆయన మునుపటి మనిషి కాదనే వాళ్లు వున్నారు. ఒకప్పుడు కాదని తోసిరాజన్నవాళ్ళను దగ్గరకి తీసిన సందర్భాలు, స్వవచన ఘాతుకంగా అనిపించే ప్రకటనలను వారు ఉదహరిస్తుంటారు. ఉదాహరణకు ఒకప్పుడు మోడీ గారి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదట్లో ఆయన పట్టించుకున్న దాఖలా లేదు. ఇప్పుడు అదే అంశాన్ని తన ప్రాధాన్యతల జాబితాలో చేర్చారు. భద్రాచలం ముంపు మండలాలు, రామోజీ స్టూడియో సందర్శన, కేంద్రంతో ఇటీవలి కాలంలో మెరుగు పరచుకుంటున్న సంబంధాలు ఇలా అనేకం.


ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, పూటకొక పధకం. 'ఇవన్నీ సాధ్యమా?' అనే వారికి  ఆయన సమాధానం ఒక్కటే. 'చూస్తుండండి చేసి చూపిస్తాను' అని.   
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా' అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ.
ముఖ్యమంత్రిగా అయన వ్యవహార శైలి విభిన్నంగా వుంటుందని ఆయనతో పనిచేసే అధికారులు చెబుతుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా రాష్ట్ర వ్యవహారం చర్చించాలని అనిపిస్తే చాలు, అధికారులతో ప్రమేయం లేకుండా ఆయనే స్వయంగా ఫోనులో మాట్లాడేస్తుంటారు.
అందుకే కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో వున్నాయి.
అదే కేసీఆర్ ప్రత్యేకత.
ఫిబ్రవరి పదిహేడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు. వారికి శుభాకాంక్షలు. తెలంగాణా రాష్ట్రం తొలి పుట్టిన రోజునాటికయినా ఆయన కంటున్న 'బంగారు తెలంగాణా'  కలల్లో కొన్నయినా నెరవేరాలని కోరుకుందాం. (16-=02-2015)          

                                    

మాయమై పోతున్నవమ్మా!



ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో  స్నేహితుడొకడిచ్చాడని చెప్పి మా పిల్లలు  ఓ తెలుగు సినిమా క్యాసెట్ ఇంటికి పట్టుకొచ్చారు. కాసెట్ అయితే వుంది కానీ దాన్ని టీవీ (నలుపు తెలుపు) తెరపై చూడడానికి వీడియో క్యాసెట్ ప్లేయర్ (వీ సీ పీ ) లేదు. నాడా దొరికిందని ఘోడా కోసం వెదికినట్టు చిక్కడపల్లిలో ఓ షాపునుంచి దాన్ని గంటకు ఇంత అని రెంటుకు  తీసుకొచ్చి ఇంట్లో  ఆ సినిమా చూసాం. ఆ తరువాత అందరి  ఇళ్ళల్లో వీసీపీలు వీసీఆర్ లు గృహప్రవేశం చేశాయనుకోండి. అది వేరే కధ.
మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత - మా బావగారి డెబ్బయ్యేడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1995 లో తీసిన  వీడియో క్యాసెట్ చూడాలనిపిస్తే, వీసీఆర్ అనే ఆ పరికరం ఇళ్లల్లోనే  కాదు షాపుల్లో కూడా మాయమై పోయింది. ఒకప్పుడు వీసీఆర్ ఇంట్లో వుంటే  ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా మాట చెబితే నమ్మేవాళ్ళు వుండరేమో. ఎందుకంటె ఈ నాటి పిల్లలకు ఆనాటి  వీడియో క్యాసెట్లు, వీడియో ప్లేయర్లు చూసివుండే అవకాశం లేదు కాబట్టి.
ఆ మధ్య  పేపర్లో ఓ వార్త చదివాను.
అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ పుణ్యమా అని, ఉత్తరాలు చదవడం దగ్గరనుంచి, టెలిఫోన్ డైరెక్టరీ  చూడడం వరకు అనేక పనుల అవసరం ఇప్పుడు జనాలకు లేకుండా పోయిందని ఓ సర్వే తేల్చిందట. ఇలాటివి దాదాపు  యాభయ్ దాకా వున్నాయని కూడా  ఆ సర్వే సారాంశం.
నెట్  ప్రపంచం ఆవిష్కృతమైన దగ్గరనుంచి లోగడ ప్రజలు అలవాటు  పడిన అనేక పనుల  అవసరం నేటి ప్రపంచంలో లేకుండాపోయింది. వెనుక ఏదయినా ఫోను నెంబరు కావాల్సివస్తే డైరెక్టరీతో పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. ఇంటర్ నెట్ వినియోగం  ఇంకా పూర్తిగా  వ్యాపించని కొన్ని దేశాల మాటేమో గాని ఇప్పుడు అనేకానేక దేశాల్లో ట్రావెల్ సంస్తల కార్యాలయాలకు వెళ్లి ప్రయాణాల టిక్కెట్లు కొనుక్కునే వారి సంఖ్య నామమాత్రం. పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను  గుర్తుగా రాసుకునే చిన్నిచిన్ని  పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి అని లండన్ కు చెందిన మొజి కంపెనీ చేసిన సర్వే తెలుపుతోంది. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి పేపర్లు తిరగేయడం కూడా బాగా తగ్గిపోతోంది. 


(శ్రీ కే.రమణాచారి) 

మాయమై పోతున్న అంశాలు మననం చేసుకుంటున్నప్పుడు ఆత్మీయులు, తెలంగాణా ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు  కే. రమణాచారిగారి జన్మదినం సందర్భంగా హైదరాబాదు రవీంద్రా భారతి ప్రాంగణంలో జరుగుతున్న హరికధా ఉత్సవాలు, ఒకనాడు తెలుగునాట వూరూరా ప్రాచుర్యం పొందిన   హరికధను గుర్తుచేశాయి. హరికధల కధాకమామిషు తెలిసిన మిత్రులు ఆర్వీవీ కృష్ణారావు గారి మాటల్లో విన్న హరికధా గానం ఇది. చదవండి.
మనకు ఇష్టం లేని కబుర్లు ఎవరయినా  చెపుతుంటే ఈ హరికధలు చాల్లేవోయి అంటూ ఉంటాము.
కానీ హరికధలంటే బోరు కొట్టే కధలు మాత్రం కాదు. హరికధలు, ఒకానొక కాలంలో జనాలను కట్టిపడేసిన భక్తిరస ధునులు. పండిత పామరులను  సమ్మోహితులను చేసిన శ్రవణానందకర ధ్వనులు. 
చాన్నాళ్ళుగా ఈ ఛానళ్ళ ప్రోగ్రాములు చూసి చూసి విసుగెత్తి పోయినప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కాని భక్తీ ఛానల్ కాని చూడడం ఈ మధ్య తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోయింది. నిజంగా పెద్ద రిలీఫ్. మధ్య ఎస్.వి.బి.సి. ఛానల్ లో ఉమామహేశ్వరీ గారి హరికథ చూసాను. ఎంతో బాగా చెప్పారు. మరపున పడుతున్న మధుర జ్ఞాపకాలను తమ హరికధా గానంతో తట్టిలేపారు.
"ఈ నాటి పిల్లలకు కానీ,  ఇంకా చాలామంది  పెద్ద వాళ్ళకు కాని హరికథ అనే ప్రసిద్ధ కళా రూపం వొకటి వుందని కూడా తెలియదేమో అనిపించే రోజుల్లో జీవిస్తున్నాము.   హరికథ ఎంత గొప్పదో నాకు తెలుసు.  నేను కాలేజీ చదువు పూర్తయిన తరువాత కూడా హరికథ అంటే ఎంతో ఇష్ట పడే వాడిని.   ఎనభయ్యో దశకములో కూడా హరికథకు ఎంతో కొంత ప్రభావము వుండేది.
"యాభయ్, అరవై దశకాల్లో కూడా హరికథ ఎంతో  ఉచ్చ స్థితిలో వుండేది. దేవాలయాల ఉత్సవాలలో, వినాయక చవితి, దేవి నవరాత్రుళ్ళు, శ్రీరామ నవమి పందిళ్ళలో, పెద్ద స్థితిమంతుల ఇళ్ళల్లో జరిగే  శుభకార్యాలలో హరికథా కాలక్షేపాలు ఉండేవి.  మధ్య మధ్యలో వేసవికాలంలో  కూడా గ్రామస్తులు అంతా కలసి రామాయణమో, మహా భారతమో సీరియల్ గా చెప్పించుకొనే వారు.    సాంస్కృతిక కార్యక్రమాలు నెలనెలా  నిర్వహించే గాన సభల్లో కూడా ఏడాదికి వోసారి అయినా హరికకధ  పెట్టించే వారు.

హరికధ అనేది  సర్వ కళల సమాహారం.  హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ, భారత, భాగవతాదులు కరతలామలకంగా వుండాలి.  కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి.  వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయ కళ తెలిసివుండడం కూడా ముఖ్యం.  ఇన్ని వుంటేనే  దాసుగారికి బంతిపూల దండలు  దండిగా పడేది.  హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు.  అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా అన్నమాట.  హరికథకి వయోలిన్, మృదంగం పక్క వాయిద్యాలు.  దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండే వారు. కాళ్ళకు గజ్జెలు.  దాసు గారి ఆహార్యం పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి బాక్స్.

కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చునే గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి తాను  ఏ కధ  చెప్పదలచుకొన్నారన్నది  సూచన ప్రాయంగా తెలియచేస్తూ  రెండు మూడు కీర్తనలు పాడే వారు. తర్వాత లేచి నిలబడి, గజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని  కాళ్ళకు కట్టుకొని, ‘శ్రీమద్రమారమణ గోవిందా అని తానంటూ, సభికులందరి చేతా గట్టిగా అనిపిస్తూ  కథలోకి ఉపక్రమించే వారు.  కీర్తనలు ఆలపించేటప్పుడు పక్క వాయిద్యాల సహకారం తీసుకొనే వారు. సందర్భోచితంగా నాట్యం చేస్తూ కథను రక్తి కట్టించే వారు. నిద్రలో జోగే శ్రోతలను జాగ్రతావస్తలోకి తెచ్చేందుకు మధ్యమధ్యలో గోవిందలు కొట్టించేవారు.  సినిమాలో కూడా హరికథలు పెట్టేవారు.  పది పదిహేను నిమిషాలు వుండేవి.  విజయా వారి షాహుకారు సినిమా హరికథ తోనే ప్రారంభం అవుతుంది.  నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన కవితా వారి వాగ్దానం సినిమాలో రేలంగి హరిదాసుగా ఘంటసాల పాడిన  సీతా కల్యాణం చాలా మంది ఇష్టపడే మరపు రాని హరికథ.
హరికథ అంటే ఆది భట్ల నారాయణ దాసు గారి పేరే అందరికి గుర్తుకు వస్తుంది.  విజయనగరం సంస్థానం ఆస్థాన విద్వాంసులు ఆయన. ఫిడేలు  ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి ముందు విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు కూడా. హరికధ  చెప్పే ప్రతివారు 'మేము నారాయణదాసు గారి శిష్యులమనో లేదా ఆయన కథలు చెపుతున్నామ'నో చెప్పుకొనేవారు.  ఇప్పటికి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో నారాయణదాసు గారి ఉత్సవాలు చేస్తూ వుంటారు.
ఆయన తర్వాత తరంలో నరసాపురం దీక్షిత్ దాసు గారు. మా అమ్మ గారు నారాయణ దాసు గారు దీక్షిత దాసు గారు ఇద్దరి కథలూ విన్నాను అని చెప్పారు.  నేను కూడా ఎందరో ప్రసిద్ధులయిన  విద్వాంసుల హరికథలు విన్నాను.  తోట్లవల్లూరులో మా నాన్నగారు రాయసం గంగన్న పంతులు గారు వేణు గోపాల  స్వామి దేవాలయం ఆఫీసర్ గా పనిచేసినప్పుడు  వైశాఖ పౌర్ణమి కల్యాణాలలోను,  శివాలయంలో శివరాత్రి, దసరా నవరత్రులలోను ఎంతో మంది పేరున్న వారు వచ్చి హరికథలు చెప్పే వారు. కూచిభొట్ల కోటేశ్వర రావు అనే ఆయన బక్క పలచగా పొడుగ్గా వుండేవారు.  భక్త పోతన హరికథ ఎంతో గొప్పగా చెప్పేవారు.  'లలిత సరస గాన కళానిధే' అంటూ ప్రార్ధన చేసేవారు.  లేచి నిల్చున్న  వెంటనే 'వాసుదేవ' అని కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఎంతో శ్రావ్యంగా పాడే వారు.  సందర్భానికి తగ్గట్టుగా  పిట్ట కథలు చెప్పే వారు. ఇరవయ్యేళ్ళ తర్వాత నేను బెజవాడ రేడియోలో పని చేస్తున్నప్పుడు కూడా వారిని కలిసే అవకాశం నాకు దక్కింది.  పోతన భాగవతాన్ని అమ్ముకోలేక ఎంత బాధ పడ్డాడో అందరికీ తెలిసిందే.  పోతన గారిలాగే  కూచిభొట్ల వారుకూడా తమకున్న అద్భుతమయిన హరికథా విద్యను  అమ్ముకోలేదు.  ఏమిస్తే అది పుచ్చుకొనే వారు. పేదవారయినా పెద్ద మనసు వున్నవారు.  మేము బెజవాడలో త్యాగరాజ సంగీత కళా సమితి అనే సంస్థను ప్రారంభిస్తే ఇంట్లో వున్న  వెండి త్యాగరాజు ఫోటో పట్టుకొచ్చి ఇచ్చి 'ఇదే మీ లోగో' అన్న గొప్ప హృదయం వున్నమనిషి ఆయన. ప్రాతఃస్మరణీయులు.
సొమ్ములు వాగ్దేవికి
సరసమ్ములు సంగీత సహజ సౌందర్య
విలాసమ్ములు, మధురమ్ములు, మా   
అమ్ముల తమ్ముల మనోహరాపముల్  –కరుణశ్రీ  


అమ్ముల విశ్వనాధం గారు మరో గొప్ప విద్వాంసులు.  చల్లపల్లి, అవని గడ్డ ప్రాంతం వారు.  స్ఫురద్రూపి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు. మండలి బుద్ధప్రసాద్ గారు ప్రచురించిన దివిసీమ రత్నాలలో అమ్ముల విశ్వనాధం గారి గురించి చాలా వివరంగా వుంది.  నారాయణదాసు గారి తర్వాత బహుశః శిలా విగ్రహం వేయించుకోగలిగిన గౌరవం పొందింది అమ్ముల వారే.  శివధనుర్భంగం కథ చాలా గొప్పగా చెప్పేవారు. నేను రేలంగిలో వున్నప్పుడు మావూళ్లో సుబ్రహ్మణ్య షష్టికి కధ చెప్పిన తరువాత మళ్ళీ వూళ్ళోవాళ్ళు పిలిపించి రామాయణం సీరియల్ గా వారం రోజులు చెప్పించారు.  ఆఖరి రోజున రామపట్టాభిషేకం నాడు దాసుగారిని ఘనంగా సత్కరించారు కూడా. అమ్ముల విశ్వనాధం గారి అమ్మాయి దుర్గాభవాని ప్రస్తుతం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.
సీరియల్ హరికథల గురించి కొంత చెప్పాలి. పొలం పనులు అయిపోయి అందరు తీరిగ్గా వున్నప్పుడు సీరియల్ హరికథలు పెట్టించుకునేవారు.  గుళ్ళో కళ్యాణ మండపం స్టేజిగా రామాయణమో, భారతమో పూర్తిగా చెప్పించే వారు.  రాత్రి ఏడు ఎనిమిది మధ్య ప్రారంభమయిన కథ పన్నెండు గంటల దాకా సాగేది.  మధ్యలో హారతి పళ్ళెం పట్టే వారు.  హరికధ వినడానికి వచ్చిన  హారతి పళ్ళెంలో  తమకు తోచిన విధంగా అణా, అర్ధణా, బేడా, పావలా కాసులు వేసేవాళ్ళు.  పళ్ళెం మధ్యలో చిన్న కుంది పెట్టి వొత్తి వెలిగించి  దీపం పెట్టేవాళ్ళు.  చీకట్లో కొంతమంది అణా వేసి పావలా కొట్టేసేవారని జోకులు కూడా ఉండేవి. చిల్లర లేక పోతే హారతి పళ్ళెం పట్టే వాడిని అడిగి తీసుకునే వెసులుబాటు వుండేది. ‘నా దగ్గర పావలా వుంది నేను ఓ అణా వెయ్యాలి మిగతాది ఇచ్చెయ్యి అని అడిగి తీసుకునే వారు.
"వీరగంధం వెంకట సుబ్బారావు, రాజశేఖరుని లక్ష్మీపతి రావు ర్యాలి రామచంద్ర రావు, కంచిభొట్ల వీర రాఘవయ్య, నౌడూరి విశ్వనాధ శాస్త్రి , కడలి వీరదాసు, ముదపాక మల్లేశ్వర రావు, ప్రగడ వీర భద్ర రావు, ముదునూరు శంకర్ రావు, ఎల్లమంద రావు, చోరగుడి పాండురంగరావు గార్లు హరికధలు చెప్పడంలో దిట్టలుగా పేరుతెచ్చుకున్నారు.  ములుకోట్ల సదాశివ శాస్త్రి గారు అని తెనాలి అనుకొంటా.  హైస్కూల్ లో తెలుగు మాష్టారు గా వుండే వారు. త్యాగరాజ చరిత్రను  రామ భక్తి అంతా జోడించి చెప్పే వారు.   1996  ప్రాంతంలో నేను హైదరాబాద్ రేడియోలో పని చేస్తున్నప్పుడు తెనాలి నుంచి వాళ్ళ తాలూకు వాళ్ళు ఫోన్ చేసి ఆయన మరణించారు అని చెప్పి ఆయన్ను గురించి వివరిస్తూ ఉంటే ఆయన గొప్ప తనం నాకు తెలుసండీ  అని వార్తల్లో విపులంగా చెప్పాము. వార్తలు విన్న తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి అంత బాధలో కూడా, 'చాలా బాగా కవర్ చేసారు' అని థాంక్స్ చెప్పాడు.  పాతూరి మధుసూదన్ రావు  గారు  మొత్తం సంస్కృతం లోనే హరికథ చెప్పే వారు. సంసృతం రాని వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా. ఇలా రాసుకొంటూపోతే  చాలా  వున్నాయి. రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు. ఏ కధ అయినా చెప్పేవారు. షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం లేక పోతే ప్రయాగ వారి హరికథ వుండేది.  గాంధీ, నెహ్రు, బోస్  చరిత్రలు కూడా ఆయన హరికధలుగా  చెప్పేవారు.
తర్వాత తరంలో మనకందరికీ తెలుసున్న వ్యక్తి కోట సచ్చిదానంద  శాస్త్రి గారు.  చాలా రమణీయంగా హాస్యోక్తులతో ఎన్ని గంటలు విన్నా, ఇంకా ఇంకా  వినాలనిపించేలా చెప్పేవారు. ఇప్పటికి కూడా చెప్తున్నారు.  2005 లో నల్లకుంట శంకర్ మఠంలో 'దర్శనం' మాస పత్రికతో కలసి వారం రోజుల పాటు  హరికథా ఉత్సవాలు నిర్వహించారు  ప్రసార భారతి అప్పటి  సి.యి.వో. కే.ఎస్. శర్మ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి.
బుర్రా  శివరామకృష్ణ శాస్త్రి కూడా మంచి కథకులు.  ఆడవారిలో కూడా మంచి విద్వాంసులు వున్నారు. తెనాలి ఉమా చౌదరి భాగవతారిణి  కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశంతో పాటు ఇతర రాష్ట్రాలలోని తెలుగు వారికి సయితం  అభిమాన పాత్రులయ్యారు.  నగరాజకుమారి, వజ్రాల విజయ శ్రీ , మంత్రిప్రగడ లలిత కుమారి హరికథలు అంటే జనం  చెవి కోసుకొనే వారు.
రాజమండ్రి  దగ్గర కపిలేశ్వరపురం జమీందార్  సత్యనారాయణరావు గారు సర్వారాయ హరికథ గురు కులం ప్రారంభించి, హరికధలపట్ల ఆసక్తివున్న వారికి   అక్కడే వసతి కల్పించి రెండు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసారు.  ఇప్పుడు హరికథ చెపుతున్నవారిలో  చాలా మంది కపిలేశ్వరపురం  గురుకులం  విద్యార్ధులే - మొదట్లో ప్రస్తావించిన ఉమా మహేశ్వరితో సహా.  ఉమా మహేశ్వరి  చాలా చిన్నతనంలోనే సంసృతంలో హరికధ  చెప్పి అందరిని మెప్పించారు.  మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు కళా కృష్ణ గారిని వివాహం చేసుకొని ఈ  దంపతులిద్దరూ  ఒకరు పేరిణి నాట్యం ద్వారా,  మరొకరు హరికథ ద్వారా కళాసేవ  చేస్తున్నారు.
"ఆచార్య తూమాటి దోణప్ప గారు హరికధా సర్వస్వం అనే గ్రంధం రాశారు.  తెలుగు యూనివర్సిటీ వారు నిరుడు తమ రజితోత్సవాల సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పుస్తకాల్లో ఇది కూడా వుంది. ఇంకా అవి వున్నాయో లేదో  కూడా తెలియదు. హరికధను అభిమానించే వారంతా కొని  దాచుకోవాల్సిన పుస్తకం. యూనివర్సిటీ పీఆర్వో చెన్నయ్యగారికి ఏవన్నా దీన్ని గురించి తెలుసేమో, అడగాలి.  

రేడియోలో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు గంట సేపు హరికథ వచ్చేది. రేడియో సంగీత సమ్మేళనం, నాటక సప్తాహం లాగా హరికథా సప్తాహం కూడా నిర్వహించే వాళ్ళు. హరిదాసులు అందరు వారి లెటర్ హెడ్స్ పైనా, కర పత్రాల పైనా రేడియో ఆర్టిస్టు అని వేసుకొనే వారు.  ఇప్పుడు కూడా హరికథలు ప్రసారం చేస్తున్నారో లేదో వోసారి చెక్ చెయ్యాలి.  వస్తే చాలా సంతోషం. మానేస్తే  అంత కంటే అన్యాయం మరోటి వుండదు.  తోలుబొమ్మలాటలు పోయాయి. పౌరాణిక నాటకాలు మరచి పోతున్నారు. హరికథని అలా కానివ్వకూడదు.  తమిళనాడులో ఇంకా హరికధ  ఆదరణకు నోచుకుంటూనే వుందన్న సంగతి మరచిపోకూడదు.

గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కధాగాన కళాపరిషద్ ఏర్పాటు చేసింది. సంగీత,సాహిత్య, నాటక అకాడమీల్లాగానే అది కూడా కాలగర్భంలో కలసిపోయింది. అలాగే బుర్రకధలు. ఎన్నికలప్పుడే ప్రచారాలకోసం గుర్తుకొచ్చే విధంగా క్రమంగా మాయమయిపోతున్నాయి.
సాంస్కృతిక ప్రియుడయిన రమణాచారి గారు ఏవన్నా చేయగలుగుతారేమో చూడాలి. వారికి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు" (16-02-2015)

14, ఫిబ్రవరి 2015, శనివారం

జల జగడం

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN IT'S EDIT PAGE ON 15--02-2015, SUNDAY)

ఒక స్పందన - ఒక ప్రతిస్పందన ఈ రెండూ,  రెండు తెలుగు రాష్ట్రాల పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోకుండా కాపాడాయి. రెండు ఫోను సంభాషణలు రెండు తెలుగు రాష్ట్రాలలో నివసించే ప్రజల్లో చెలరేగిన భయాందోళనలను సమసిపోయేలా చేయగలిగాయి. ఏమైతేనేనేం మొత్తం మీద, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నడుమ తారాస్థాయికి చేరిన 'జలజగడం'  సుఖాంతం దిశగా మలుపు తీసుకుంది.
మొన్న  శుక్రవారంనాడు ప్రధాన తెలుగు దినపత్రికల్లో కనపడ్డ పతాక శీర్షికలు చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పడ్డ సంబరం ఆ రోజు సాయంత్రానికల్లా ఆవిరై పోయింది. 'మాట్లాడుకుందాం రండి, సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందాం' అంటూ తెలుగుదేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 'గతం గతః , ఆంధ్ర తెలంగాణా గొడవలేవీ  మనసులో పెట్టుకోవద్ద'ని  టీ.ఆర్.యస్. అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నట్టు పత్రికల్లో చదివి 'ఆహా! మంచి రోజులు వచ్చేస్తున్నాయ'ని  అటుపక్కా, ఇటు పక్కా జనాలు  మురిసి ముక్కచెక్కలయ్యారు. కానీ ఇరవై నాలుగ్గంటలు కూడా గడవకముందే నాగార్జున సాగర్ దగ్గర రెండు రాష్ట్రాల అధికారుల నడుమ మొదలయిన సంభాషణ సంఘర్షణగా మారిపోయి, కొద్దిసేపట్లోనే  ముదిరిపాకాన పడింది. సాగర్ లో నీటిమట్టం మాదిరిగానే మాటలు తగ్గిపోయి, బాహాబాహీ  చేతులు కలుపుకునే  దుస్తితి దాపురించింది. అంతటితో  ఆగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు రంగం లోకి దిగి, పరిస్తితిని చక్కదిద్దకపోగా మరింత ఆజ్యం పోసారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల శాంతి భద్రతల పరిరక్షకులే   ఒకరిపై మరొకరు లాఠీలు ఝలిపించుకుంటూ కానవచ్చిన దృశ్యాలను టీవీల్లో చూసిన జనం బిత్తరపోయారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పిన 'మంచి' ముక్కలు ఉదయం పత్రికల్లో అయితే వచ్చాయి కానీ, వాళ్ల మాటల్లో కానవచ్చిన 'మంచితనం' కింది స్థాయి దాకా చేరిన దాఖలా కానరాలేదు. 'రెండు దేశాల సరిహద్దుల్లో  సైనికుల్లా ఈ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు తలపడితే ఏమవుతుందో' అని ప్రజలు తలలు పట్టుకున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే,  వాస్తు, ముహూర్తాలపట్ల నమ్మకాలు  లేనివాళ్ళకు కూడా రాష్ట్ర విభజన 'మంచి ముహూర్తం'లో జరగలేదేమో అని అనుమానించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
కధ ఇలా క్లైమాక్స్ కు చేరిన దృశ్యాలు టీవీల్లో చూసారో, సమాచారం తెలుసుకున్నారో తెలియదు కాని ముందుగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుతో ఫోనులో మాట్లాడారు. పరిస్తితిని వివరించి చక్కదిద్దడంలో సాయం కోరారు. కేసీఆర్ కూడా అందుకు తగ్గట్టే ప్రతిస్పందించారు. గవర్నర్ సముఖంలో విషయాలను చర్చించి, వివాదాలను పరిష్కరించుకునేందుకు సంసిద్ధత తెలిపారు. ఆ వెంటనే, గవర్నర్ నరసింహన్ కు ఫోను చేసి శనివారం ఉదయమే గవర్నర్ సమయం తీసుకుని ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి మార్గం సుగమం చేశారు. ఈ వ్యాసం రాసే సమయానికి ఈ సమావేశం జరుగుతోంది. ఇది ఫలప్రదం కావాలని  ఉభయ రాష్ట్రాల్లో నివసిస్తున్న,  రాజకీయాలతో సంబంధం లేని తెలుగు ప్రజలందరూ మనఃస్పూర్తిగా కోరుకుంటున్నారు. ఈ విధంగా స్వతంత్ర భారతంలో రెండు రాష్ట్రాల నడుమ సాయుధ సంఘర్షణకు తాత్కాలికంగా అయినా తెర పడింది. శుభం.  గతంలో కూడా కావేరి  జల వివాదాల కారణంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఉదంతాలు లేకపోలేదు. కానీ, మొన్న శుక్రవారం నాడు కృష్ణమ్మ సాక్షిగా నాగార్జున సాగర్ దగ్గర రెండు రాష్ట్రాల పోలీసులు లాఠీలతో తలపడ్డ సందర్భం గతంలో ఎన్నడూ అనుభవంలోకి రాలేదు.
ఈ రకమైన దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోవడానికి ముందు ఉభయ రాష్ట్రాల సేద్యపు నీటి అధికారుల మధ్య పలు పర్యాయాలు చర్చలు, సంప్రదింపులు జరిగాయి. కుడి కాల్వకు నీళ్ళు విడుదల చేయాల్సిన అవసరాన్ని గురించి ఆంధ్ర ప్రదేశ్ అధికారులు, అలా చేయడానికి  యెందుకు కుదరదో తెలంగాణా అధికారులు పరస్పరం తెలియచేసుకున్నారు. ముందే నిర్ధారణకు వచ్చి జరిపే సంప్రదింపుల్లో ఎలాటి ఫలితం రాదన్నది సామాన్యుడికి కూడా తెలిసిన విషయమే. అదే జరిగింది. జరిగిన తరువాత ఏం జరగాలి? పైవారికి విషయం ఎరుక పరచాలి. 'ఏం చెయ్యాలి' అన్నదానిపై పైనుంచి ఆదేశాలు తీసుకోవాలి. కానీ విచిత్రం ఏమిటంటే వారు అన్నింటికీ సిద్ధపడే వచ్చినట్టు తరువాత పరిణామాలను బట్టి  తెలుస్తోంది.


సాగర్ వద్ద సాగుతున్న సంఘర్షణ వాతావరణం గురించి మీడియాలో కధనాలు వెలువడుతున్న సమయంలోనే ఆంధ్ర ప్రదేశ్ సాగునీటి శాఖామంత్రి దేవినేని ఉమా, తెలంగాణా సేద్యపు నీటి శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశాల్లో తమ తమ వైఖరులను పునరుద్ఘాటిస్తూ బుల్లి తెరలపై కానవచ్చారు. సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశ్యం వెల్లడిస్తూనే, మరో పక్క తద్విరుద్ధ అంశాలను ప్రస్తావించారు. కృష్ణా జలాలను వెంటనే విడుదల చేయాలని, రైతుల తక్షణ అవసరాల దృష్ట్యా తెలంగాణా అందుకు అంగీకరించాలని కోరుతూనే, కృష్ణానదీజలాల ట్రిబ్యునల్ కు రాసిన ఉత్తరాన్ని దేవినేని విలేకరులకు చూపించారు. హరీష్ రావుతో ఫోనులో మాట్లాడినట్టు కూడా వెల్లడించారు.
ఇవన్నీ చూసిన వారికి అనుసరించవలసిన విధివిధానం ఇదేనా అనిపించక మానదు. నీటి అవసరం ఆంధ్ర ప్రదేశ్ రైతులది. అయినప్పుడు, రాజధాని ఇంకా హైదరాబాదులోనే వున్నప్పుడు, సచివాలయాలు కూడా పక్కపక్కనే ఒకే ఆవరణలో వున్నప్పుడు, ఉత్తరాలు రాసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫోనులో మాట్లాడే బదులు ఇద్దరు మంత్రులు  కలిసి కూర్చుని మాట్లాడుకుంటే పోయేదేముంటుంది ?  విద్యుత్ సరఫరా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ని  మిగులు రాష్ట్రంగా చేయడానికి కేంద్రంతో పలుమార్లు సంప్రదింపులు జరిపామనీ, విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాలు సకాలంలో చేసుకోవడం వల్లనే ఇరవై నాలుగు గంటలు సరఫరా చేయగలుగుతున్నామనీ, తమ మాదిరిగా చేయకపోవడం వల్లనే తెలంగాణకు విద్యుత్ కష్టాలు చుట్టుముట్టాయనీ చెప్పుకుంటున్న ఆంధ్ర పాలకులు,  సేద్యపు నీటి విషయంలో రైతుల ఇబ్బందులను తీర్చడానికి అదే విధమైన సంప్రదింపుల విధానాన్ని ఎంచుకోకుండా కేవలం ఉత్తరాలకు,  ఫోను సంభాషణలకు పరిమితం కావడంలో అంతరార్ధం ఏమిటి? అలాగే, మరోపక్క,  'ఇప్పటికే కృష్ణా జలాల్లో ఆంధ్ర ప్రదేశ్ తన వాటాను మించి వాడుకుంద'ని నొక్కి చెబుతున్న తెలంగాణా మంత్రి హరీష్ రావు, పరిస్తితి బాగా విషమించిన తరువాత కానీ సానుకూల ప్రకటన చేయలేకపోయారు. ఆంధ్ర రైతుల అవసరాలకు యెంత నీరు అవసరమో లిఖిత పూర్వకంగా తెలియచేస్తే సామరస్యంగా వ్యవహరించడానికి సిద్ధమని  దరిమిలా ప్రకటించారు. తెలంగాణా భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సర్దుబాటు చేయాలన్న  షరతు కూడా పెట్టారు.  
మంత్రుల ప్రకటనలను బట్టి సామాన్యులకి  అర్ధం అయ్యేది ఏమిటంటే, ఇది పరిష్కారానికి అనువుకానంత జటిలమైన సమస్య ఏమీ కాదని. ఉభయపక్షాలు బెట్టుసరికి పోయి మెట్టు దిగడానికి సంసిద్ధంగా లేకపోవడమే విషయం ఇంతగా చిక్కుముడి పడిపోవడానికి కారణం అయివుంటుందని.
మంచిది. సాగర్ సంఘర్షణ పుణ్యమా అని ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలకు కూర్చున్నారు. తమ వాదనలను సిద్ధం చేసుకునే వచ్చారు. వాదనల వల్ల  ఎవరు రైటో తెలుస్తుంది. చర్చల్లో ఏది రైటో తేలుతుంది.
ఈ చర్చల్లో శాశ్విత పరిష్కారం దొరక్కపోయినా తాత్కాలిక ఉపశమనం లభించడానికి ఆస్కారాలు బాగా వున్నాయి. గవర్నర్ ప్రమేయం వుంది కాబట్టి ఏదో ఒక మార్గం కనుక్కుని తీరతారు. ఇప్పటికే సరే!కానీ,  ఈ రెండు రాష్ట్రాల నడుమ పరిష్కారం కావాల్సిన అనేక ఇతర సమస్యలు వున్నాయి. ఈ సమావేశం వాటి పరిష్కారానికి కూడా దోహదం చేయగల తొలి సోపానం కాగలిగితే అంతకన్నా కావాల్సింది లేదు. 
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాకతాళీయంగా 'ప్రేమికుల దినం' నాడు కలిసారు. నిజమైన 'ప్రజా ప్రేమికులు' అనిపించుకోవాలంటే ఇరువురూ ఒక మెట్టు దిగి ఆలోచించాలి. అప్పుడే వారు, చుట్టుముడుతున్న సమస్యలనుంచి తమ రాష్ట్రాలను గట్టెక్కించగలుగుతారు.
'కాదుకూడదు, ఇలాగే మొండిగా వ్యవహరిస్తాం' అనే ధోరణిలోనే ఇక ముందు కూడా  ముందుకు సాగితే, రాజకీయంగా తమ పార్టీలకి లాభించవచ్చునేమో కానీ, ప్రజల దృష్టిలో చులకన అవడం ఖాయం.  (14-02-2015)                     

IMAGE  COURTESY 'ABN' 

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

నీరు కారిపోతున్న ఆశలు



ఈరోజు  శుక్రవారంనాడు ప్రధాన తెలుగు దినపత్రికల్లో పతాక శీర్షికలు చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పడ్డ సంబరం ఆ రోజు సాయంత్రానికే ఆవిరై పోయింది. మాట్లాడుకుందాం రండి, సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందాం అంటూ తెలుగుదేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గతం గతః , ఆంధ్ర తెలంగాణా గొడవలేవీ  మనసులో పెట్టుకోవద్దని  టీ.ఆర్.యస్. అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నట్టు పత్రికల్లో చదివి ఆహా! మంచి రోజులు వచ్చేస్తున్నాయని జనం అటుపక్కా, ఇటు పక్కా మురిసి ముక్కచెక్కలయ్యారు. కానీ ఒక్క రోజుకూడా తిరక్కుండానే నాగార్జున సాగర్ దగ్గర రెండు రాష్ట్రాల అధికారుల నడుమ సంఘర్షణ ముదిరిపాకాన పడింది. సాగర్ లో నీటిమట్టం మాదిరిగానే మాటలు తగ్గి చేతులు కలుపుకునే పరిస్తితి దాపురించింది. అంతటితో  ఆగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు రంగం లోకి దిగి ఒకరిపై మరొకరు లాఠీలు ఝలిపిస్తున్న దృశ్యాలు టీవీ తెరలపై దర్శనమిచ్చాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పిన మంచి ముక్కలు ఉదయం పత్రికల్లో అయితే వచ్చాయి కానీ, వాళ్ల మాటల్లో కానవచ్చిన మంచితనం కింది స్థాయి దాకా చేరినట్టులేదు. రెండు దేశాల నడుమ సైనికుల్లా ఈ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు తలపడితే ఏమవుతుందని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. వాస్తు, ముహూర్తాలపట్ల నమ్మకాలు  లేనివాళ్ళకు కూడా ఈ పరిణామాలు చూస్తుంటే,  రాష్ట్ర విభజన 'మంచి ముహూర్తం'లో జరగలేదేమో అని అనుమానించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  



(మంచితనం మాటలకే పరిమితమా?)
       

దేవుడా! మజాకా!


లోకంలోని మగవాళ్ళందరూ కలసి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు.
'మంచి గుణవతి, సౌందర్యవతి, సౌశీల్యవతి, అణగిమణిగి నడుచుకుంటూ తమ చెప్పుచేతల్లో పడివుండే భార్యల్ని'  ఇమ్మని అడిగారు.
'ఓస్!  ఇంతేనా!' అన్నాడు దేవుడు.
'ఈ ప్రపంచం నలుమూలల్లో ఏమూలలో  చూసినా మీరు చెప్పిన ఆడవాళ్ళు వెతక్కుండానే మీకు  దొరుకుతారు, పోయి చూసుకోండి' అన్నాడు.
వచ్చిన పని వెంటనే అయిందని సంతోషపడుతూ వాళ్ళందరూ వెనుదిరగ్గానే, భూమిని గుండ్రంగా మార్చేసి, కడుపు పగిలేట్టు నవ్వుకున్నాడు దేవుడు.


(Note: Courtesy Image Owner)

10, ఫిబ్రవరి 2015, మంగళవారం

స్వీప్ చేసిన ఆప్

(Published in 'SURYA' telugu daily in its Edit Page on 12-02-2015, THURSDAY)

కేజ్రీవాల్ ది  ఘన విజయం అనుకోవాలా? ఇంకేదయినా గొప్ప  పదం వుందా!
మోడీది  ఘోర పరాజయం అనుకోవాలా? ఇంకేదయినా  మంచి విశేషణం వుందా!
మొత్తం డెబ్బయి సీట్లు వుంటే అందులో అరవై ఏడింటిలో ఆప్ విజయ పతాకం రెపరెపలా! కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కమల ధ్వజం ఎగురవేయాలని కలలుకంటున్న బీజేపీ అగ్ర నాయక ద్వయం మోడీ- అమిత్ షా ల విజయం కేవలం  మూడు స్థానాలకే పరిమితమా!
ఇలాటిది ఇంతకుముందు ఎప్పుడయినా జరిగిందా! మునుపెప్పుడయినా విన్నామా! కన్నామా!
నిరుడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆప్ పార్టీని  ఆనవాళ్ళు లేకుండా తుడిచిపెట్టిన మోడీ ప్రభంజనం ఇంత తక్కువ సమయంలోనే ఏమయిపోయినట్టు? యెలా ఆవిరై పోయినట్టు? అందివచ్చిన అధికారాన్ని కాలదన్నుకుని ఆ పొరబాటుకు లెంపలు వేసుకోవాల్సివచ్చిన  అరవింద్  కేజ్రీవాల్ ని మళ్ళీ హస్తిన ఓటర్లు  యెందుకు ఇంత త్వరగా అక్కున చేర్చుకుని ఆదరించినట్టు?
నిజంగా ఇదంతా జరిగిందా! జరిగిందంతా నిజమేనా!


(మోడీ వర్సెస్ మఫ్లర్ వాలా) 
   
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం  నుంచి అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి.
ఒకటి మాత్రం వాస్తవం. ఏ కొలమానంతో కొలిచినా, ఏ గీటురాయితో చూసినా, ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ సాధించిన విజయం మాత్రం అపూర్వం, అనితర సాధ్యం.  అయితే, ఆయన సాధించిన విజయం కంటే మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి లభించిన ఘోర పరాజయం  ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితం మోడీ పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ప్రత్యర్ధులు బహిరంగంగా అంటుంటే, మోడీ మార్గం మార్చుకోవాల్సిన సమయం ఆసన్నం అయిందనడానికి సంకేతం అని ఆయన పార్టీవారే ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
కేజ్రీవాల్ గెలుపు, రానున్న రోజుల్లో రాజకీయాలు తీసుకోబోయే గొప్ప మలుపుకు నాంది అని అభిప్రాయపడేవారు కూడా లేకపోలేదు. భవిష్యత్ భారతంపై కొత్త తరం పెంచుకుంటున్న ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకోవడానికి ఈ పరిణామాలు దోహదం చేస్తాయని భావించే ఆశావాదులు కూడా వున్నారు.
తొమ్మిదిమాసాలక్రితం జరిగిన లోకసభ ఎన్నికల్లో  విజయ దుందుభి మోగించి తనదయిన మార్కు పాలనతో ప్రజల  అభిమానం అపారంగా చూరగొంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఈ స్వల్పకాలంలో చేసిన పెద్ద తప్పిదాలు కూడా ఏవీ లేవు, ఢిల్లీ పౌరులు ఆయన పార్టీని ఇంత ఘోరంగా,  ఇంత భారీ స్థాయిలో తిరస్కరించడానికి. దేశమంతా 'మోడీ మోడీ' అని ఓ పక్క బ్రహ్మరధం పడుతుంటే, దేశ రాజధాని ఢిల్లీలో ఆయన నాయకత్వంలోని బీజేపీకి మూడంటే మూడు సీట్లు రావడం చూస్తే మోడీ  ప్రభావానికి అడ్డుకట్టపడబోతున్నదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే,  ఢిల్లీ ఫలితం మోడీ పరిపాలనపై ప్రజాతీర్పు అనడం కంటే, ఎన్నికల క్రతువులో విజయసాధన కోసం ఆయన పార్టీ అనుసరించిన కొన్ని అనైతిక విధానాల పట్ల ప్రజల నిరసనకు సంకేతంగా భావించడం సముచితంగా వుంటుంది. కేజ్రీవాల్ చెబుతున్న 'మార్పు' ను కోరుకుంటున్న ప్రజలకు బీజేపీ అగ్రనాయకులు అమలుచేసిన సాంప్రదాయిక రాజకీయ ఎన్నికల ఎత్తుగడలు మొహం  మొత్తించి వుంటాయి. మోడీ నాయకత్వంలోని బీజేపీ కూడా 'అదే తానులో ఒకముక్క' అనే అభిప్రాయాన్ని కలిగించి వుంటాయి. ఎన్నికల  ప్రచారం జరిగిన తీరు, అందులో నాయకులను పెద్దయెత్తున మోహరించిన విధానం, వ్యక్తిగత ఆరోపణలకు పెద్ద పీట వేసిన వైనం, 'మార్పు'ను బలంగా కోరుకుంటున్న ప్రజలకు బీజేపీ పట్ల  వైమనస్యాన్ని పెంచివుంటాయి.  ఓసారి ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని కాలదన్నుకుని, గతంలో చేసిన ఆ తప్పిదం మరో మారు చేయనని బహిరంగంగా అంగీకరించిన అరవింద్  కేజ్రీవాల్ పట్ల సానుభూతిని రగిలించివుంటాయి.      
ఇది ఆప్ విజయమా, బీజేపీ పరాజయమా అనే ప్రశ్న వేసుకుంటే నిస్సంశయంగా కేజ్రీవాల్ వ్యక్తిగత విజయమని ఒప్పుకోక తప్పదు. కుల, మత, వర్గాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ కలిసి కేజ్రీవాల్ కి కట్టబెట్టిన ఘన విజయం ఇది. లేకపోతే ఓటర్లలో సగానికి పైగా ఆయన పార్టీని ఎంచుకోవడం సాధ్యపడదు. 'పాంచ్ సాల్  - కేజ్రీవాల్' అనే నినాదానికి అనుగుణంగా, 'ఏమైనా సరే,  పూర్తి కాలం పాలించేలా  ఈసారి ఆయన్ని పూర్తి మెజారిటీతో  గెలిపించి తీరాలి' అనే కసితో జనం ఓట్లు వేసినట్టు కనబడుతోంది. కాబట్టే,  రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల్లో ఒకటయిన  కాంగ్రెస్ పార్టీని  వాక్యూం క్లీనర్ తో శుభ్రంగా  వూడ్చేసినట్టు సమూలంగా తిరస్కరించారు.   మరో జాతీయ పార్టీ బీజేపీని మూడు సీట్లతో సరిపుచ్చి,  ఆప్ పార్టీ ఎన్నికల గుర్తయిన 'చీపిరికట్ట'తో వూడ్చి పక్కనబెట్టారు. అందుకే కేజ్రీవాల్ దీన్ని 'ప్రజావిజయం' గా అభివర్ణించారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్ని ఆత్మ రక్షణలో పడేస్తే, ఆప్ కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయి. అదే సమయంలో ఓటర్లు  తమ తీర్పుతో రాజకీయ పార్టీలకి ఓ గట్టి సంకేతాన్ని కూడా ఇచ్చారు. తాము గట్టిగా తలచుకుంటే యెంత గట్టి పార్టీ తలరాతను అయినా ఇట్టే మార్చగలం అనే వారి హెచ్చరిక కూడా ఈ ఎన్నికల ఫలితాల్లో అంతర్లీనంగా వుంది.                      
ఓడల్ని బండ్లుగా, బండ్లను ఓడలుగా చేయగల 'ఓటు' అనే మహత్తర ఆయుధం సగటు ఓటరు చేతిలో వుంది. 'ఒకసారి  ఓటరు ఇచ్చిన తీర్పుతో అధికార అందలం ఎక్కి, అదే శాశ్వతం అనుకుని ఆదమరచి వ్యవహరిస్తే ఫలితాలు యెలా వుంటాయి' అనడానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలే మంచి ఉదాహరణ. ఇవి బీజేపీకి, దానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోడీకి గుణపాఠం. అలాగే, ఆప్ నాయకుడు, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఓ హెచ్చరిక కూడా.  గతంలో చెప్పింది చేయలేకపోవడానికి ఆయన కారణాలు ఆయనకు వున్నాయి. ఈసారి అలా కుదరదు. చేయగల పనులన్నీ చేయగల 'చేవ'ను 'గొప్ప మెజారిటీ' రూపంలో ప్రజలు ఆయనకు కట్టబెట్టారు. కాబట్టి సాకులు చూపి తప్పించుకునే వెసులుబాటు ఇక  ఎంతమాత్రం వుండదు.
అంతే  కాదు, ప్రజలు అనుక్షణం గమనిస్తూనే వుంటారు. వారి కళ్ళు కప్పడం అంత సులభం ఏమీ కాదు. వెనుకటి రోజుల్లో మాదిరిగా తాపీగా వ్యవహరిస్తాం అంటే కుదిరే పని కాదు. అయిదు రోజుల క్రికెట్ టెస్ట్ నుంచి 'ట్వంటీ ట్వంటీ' పోటీల  పట్ల మోజు పెరుగుతున్న రోజులివి. ఏదయినా త్వరత్వరగా జరిగిపోవాలని అనుకుంటారు. ఆ వేగం, ఆ వడీ చేతల్లో కానరాకపోతే ఇంతే సంగతులు.      
రాజకీయాల్లో రోజులు యెలా మారిపోయాయంటే,  పరమపద సోపానపఠంలో మాదిరిగా పెద్ద నిచ్చెన ఎక్కిన వారికి పెద్ద పాము నోట్లో పడడానికి కూడా అవకాశాలు ఎక్కువే. బీజేపీకి జరిగింది అదే! అది జరక్కుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత కేజ్రీవాల్ భుజస్కంధాలపై వుంది.
తస్మాత్ జాగ్రత్త!

(11-02-2015)

NOTE: Courtesy Image Owner

6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఇల్లాళ్ళ శ్రమకు సుప్రీం కోర్టు గుర్తింపు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 08-02-2015, SUNDAY)

ఇది జరిగి పాతికేళ్ళవుతోంది.
జైవంతిబేన్ జితేంద్ర త్రివేది సాధారణ గృహిణి. ఆర్ధికంగా కుటుంబానికి సాయపడేందుకు ఇంట్లోనే కుట్టు మిషన్ పెట్టుకుని ఇరుగూ పొరుగుకీ దుస్తులు కుట్టుపెడుతూ నెలకు కొంచెం అటూ ఇటూగా మూడువేలు సంపాదించేది. 1990, సెప్టెంబర్ 21 వ తేదీన ఒక రోడ్డుప్రమాదంలో ఆమె కన్ను మూసింది. కేసు విచారించిన ట్రిబ్యునల్ ఆమె భర్తకు, కుమార్తెకు  2,24 000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని ప్రమాదానికి కారకులయిన వారిని ఆదేశించింది. ప్రతికక్షులు హైకోర్ట్ ని ఆశ్రయించారు. హైకోర్టు పరిహారాన్ని 2,09400 రూపాయలకు తగ్గించింది. దాంతో మృతురాలి భర్త, ఆమె కుమార్తె కలిసి  అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తలుపు తట్టారు. పాతిక సంవత్సరాలుగా ఆ కుటుంబం చేస్తున్న న్యాయ పోరాటం ఇన్నాల్టికి  ఫలించింది.  పూర్వాపరాలను పరిశీలించిన మీదట,  తొమ్మిది శాతం వడ్డీతో సహా  మొత్తం 6,47000 పరిహారం చెల్లించాలని గతవారం కోర్టు తీర్పు చెప్పింది. మామూలుగా అయితే ఇదో మామూలు వార్తే. అందుకే కాబోలు సుప్రీం తీర్పు అనేక  పత్రికల్లో కానరాలేదు.
తీర్పు ప్రకటిస్తూ, జస్టిస్ భానుమతి,  జస్టిస్ గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసింది. అవే ఈ వ్యాసానికి ప్రేరణ.


కుటుంబం కోసం గృహిణి అందించే సేవలు  విలువ కట్టలేవన్నది  ఆ వ్యాఖ్యల తాత్పర్యం. ఇల్లాళ్ళు  చేసే ఇంటెడు  చాకిరీని డబ్బుతో ముడిపెట్టి లెక్కలు కట్టడం సంభావ్యం కాదని సుప్రీం అభిప్రాయపడింది.
మోటారు కారు కిందపడి మరణించిన మహిళకు పరిహారం నిర్దేశించే సమయంలో సాధారణంగా గమనంలోకి తీసుకునే అంశాలతో పాటు ఆమె కుటుంబం కోసం పడే శ్రమను కూడా లెక్కలోకి తీసుకోవాలన్నది అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం.
ఇలాటి కేసులు విచారించేటప్పుడు,  ప్రమాదాల్లో మరణించిన వ్యక్తులపై వారి కుటుంబ సభ్యులు  ఏమేరకు ఆధారపడి వున్నారు, లేదా వారి మృతి కారణంగా ఆ కుటుంబాలకు ఏమేరకు ఆర్ధిక పరమైన లోటువాటిల్లిందన్న విషయాలు కూడా  కోర్టులు పరిగణన లోకి తీసుకోవడం కద్దు. సరిగ్గా ఈ అంశాన్నే న్యాయమూర్తులు తమ తీర్పులో ప్రస్తావించారు.
'ఇంటిపనిచేసే గృహిణులు గడియారం చూసుకుంటూ పనులు చేయరు. చేసిన పనికి యెంత  గిట్టిందని కూడా లెక్కలు చూసుకోరు.  సమయంతో నిమిత్తం లేకుండా, కాలంతోపాటు పరిగెడుతూ వాళ్లు రోజంతా తమవారికోసం కష్టపడతారు. మొత్తం కుటుంబాన్ని ఇరవై నాలుగుగంటలపాటు కంటికి రెప్పలా కనిపెట్టి చూసుకుంటారు. కాబట్టి వారి మరణంవల్ల కలిగిన లోటును నిర్ధారించే సమయంలో ఈ విషయాలను మనసులో వుంచుకోవాలి'  ఇదీ సుప్రీం తీర్పు తాత్పర్యం.
జస్టిస్ భానుమతి  తమ తీర్పులో ఇంకా ఇలా పేర్కొన్నారు.
'ఇళ్ళల్లో వుంటూనే ఇంటెడు చాకిరీ చేసే ఆడవాళ్ళ శ్రమదమాదులు  మొత్తం ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మానవ సమాజాల పురోగతికి (పరోక్షంగా) దోహదం చేస్తాయి.'        
న్యాయమూర్తులు  వెల్లడించిన ఈ  ధర్మ సూత్రాలు ఎన్నదగినవిగా, మెచ్చదగినవిగా  వున్నాయనడంలో ఎలాటి సందేహం లేదు.    
బాధితులకు సంపూర్ణ న్యాయం జరగడానికి న్యాయస్థానాల్లో  ఏండ్లూ పూండ్లూ పట్టిన విషయాన్ని పక్కనపెడితే, ఈ కేసును పురస్కరించుకుని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ పట్ల ఆశలు రేకిస్తున్నాయి. ఇళ్ళల్లో ఆడవారి చాకిరీని గుర్తించి గౌరవించే రోజులు రాబోతున్నాయేమో అనే ఆశను కలిగిస్తున్నాయి.
ఏది ఏమైనా సభ్యసమాజంలో ఆడవారి చాకిరీకి తగిన గుర్తింపు లేదనే మాట వాస్తవం. గుర్తింపు లేకపోగా 'ఇరవై నాలుగ్గంటలు ఇంటి పట్టున పడివుండి వాళ్లు చేసేది ఏముంది ' అని చులకనగా మాట్లాడేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కాబట్టే సుప్రీం వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ అవకాశాన్ని తీసుకుని దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. ఇళ్ళల్లో ఆడవారి సేవలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు, గౌరవం దక్కేలా అడుగులు పడాలి.
అయితే ఆ అడుగు వేసేది ఎవరు? వేయించేది ఎవరు?
'కార్యేషు దాసీ, కరణేషు మంత్రి' అంటూ కుటుంబంలో మహిళల  పాత్రను ఓ పక్క  శ్లాఘిస్తూనే,  వారిని శతాబ్దాల తరబడి ఇళ్ళల్లో కట్టు బానిసలుగానే వుంచేసారని కొందరు అంటారు.  స్వాభావికంగానే కుటుంబానికి సంబంధించిన అనేక రకాల పనులను  స్వచ్చందంగా చేయడానికి మహిళలు  మానసికంగా సిద్ధపడి వుండడం వల్లనే వాళ్లు  ఇలా నిస్వార్ధసేవలు అందించగలుగుతున్నారని అనేవారూ వున్నారు.  ఆడా మగా పెంపకం అనేది వివక్షతో కూడుకుని వున్నందువల్ల, చిన్నతనం నుంచి ఆడవారిలో  ఈవిధమైన సేవాతత్వం  జీర్ణించుకుని పోయింది. అయితే ఇలాటి వివక్ష మచ్చుకు కూడా కనిపించని పాశ్చాత్య సమాజాల్లోని మహిళలు  కూడా తల్లులుగా తమ బాధ్యతలను అదనంగా పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపొతే,  కాలానుగుణంగా  పిల్లల పెంపకం విషయంలో  ఈనాటి తలితండ్రులు బాధ్యతలు పంచుకుని సర్దుకుపోతున్న విషయం కూడా వాస్తవదూరం కాదు. అయితే, తండ్రి పాత్ర పోషించే మగవారు కొన్ని విషయాల్లో బాధ్యతలను ఒక పరిధిలోనే నిర్వహిస్తున్నారు. ఆడవారి మాదిరిగా అన్ని విషయాల్లో పసిపిల్లల మంచిచెడులను కనిపెట్టి చూడడంలో ఒక అడుగు వెనకే వున్నారు. పసిపిల్లల తల్లులు పారిశుధ్య కార్మికులుగా కూడా సేవలు అందిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. ఉద్యోగాలు చేస్తున్న తలితండ్రులలో కొందరు మగవాళ్ళు తమ అభిజాత్యాలను కొంత పక్కనబెట్టి, ఇలాటి విషయాల్లో కూడా తమ  పిల్లల ఆలనాపాలనా  కనిపెట్టి  చూస్తూన్న సందర్భాలు లేకపోలేదు.  నగరాల్లోని మాల్స్ లో, సినిమా ధియేటర్లలో, రెస్టారెంట్లలో ఈరకమైన అధునాతన సర్దుబాటు  మనస్తత్వం కలిగిన తండ్రులు తారసపడుతూనే వుంటారు. ఈ మార్పు ఆహ్వానించతగ్గదే. అయితే ఇలాటి తండ్రుల సంఖ్య మనదేశంలో పరిమితమనే చెప్పాలి.
కొన్నాళ్ళక్రితం చదివిన ఒక ఆంగ్ల గల్పిక ఈ సందర్భంలో గుర్తుకు వస్తోంది.
విదేశాల్లో నివసిస్తున్న తన పిల్లల దగ్గరికి వెళ్ళి రావడానికి ఓ మహిళ వీసా కోసం కాన్సులేటు కార్యాలయానికి  వెడుతుంది. అక్కడి అధికారి ఆమెను 'మీరెవరు, ఏం చేస్తుంటారు' అని ప్రశ్నిస్తాడు.
'భారతదేశంలో సాధారణ మహిళలు ఏం చేస్తుంటారు?' అనే ప్రశ్నకు సమాధానం ఆమె బదులిచ్చిన పద్దతిలో కనిపిస్తుంది. పనీపాటా లేకుండా రోజులు గడపడం తప్ప ఆడవారికి మరో పని లేదని  పిడివాదం చేసేవారికి రోజంతా ఆడవారు ఇంట్లో ఎన్నెన్ని పనులు చక్కబెడుతుంటారో అర్ధం అయ్యేలా ఆమె జవాబు వుంటుంది. ఒక గృహిణిగా, ఒక  ఇల్లాలిగా, ఒక తల్లిగానే కాకుండా పారిశుధ్యకార్మికురాలిగా, పనికత్తెగా, వంటమనిషిగా, ఇంటి జమాఖర్చులు చూసే ఆడిటర్ గా, పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలిగా, సమాజానికి అవసరమయ్యే బాధ్యతకలిగిన  భావిపౌరులను తయారు చేసి ఇచ్చే సామాజిక కార్యకర్తగా ఒక  సాధారణ మహిళ ఎన్ని పాత్రలు పోషిస్తుందో, పడ్డ శ్రమకు ప్రతిఫలం ఆశించకుండా, పనిగంటలతో నిమిత్తం లేకుండా ఎన్నెన్ని పనులు చక్కబెడుతుందో ఆమె నోటి ద్వారా విన్న ఆ వీసా అధికారి ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతాడు.
ఇది కల్పన కావచ్చు కానీ,  ఒక విషయం మాత్రం నిజం.
ఆడవాళ్ళు కుటుంబంకోసం పడే శ్రమకు ఎటువంటి గుర్తింపు కోరుకోరు, ఎలాటి ప్రతిఫలం ఆశించరు. అందుకే వాళ్లు తరతరాలుగా అలాగే వుండిపోతున్నారు. (07-02-2015).
NOTE: Courtesy Image Owner