KCR BIRTH DAY FEB 17th. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
KCR BIRTH DAY FEB 17th. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఫిబ్రవరి 2017, గురువారం

విశిష్ట గుణాల సమాహారం కేసీఆర్ - భండారు శ్రీనివాసరావు

(ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని)
(PUBLISHED IN ANDHRA JYOTHY DAILY TODAY, 16-0202017, THURSDAY)
అద్భుతమైన తెలివితేటలతో రాణించాలంటే అమెరికా వెళ్లి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకోనక్కరలేదని రుజువు చేసారు తెలంగాణా ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ స్కూల్లో చదువుకుని వ్యవహారదక్షులయిన వారిని మించిన దక్షత  తనకుందని పలుమార్లు నిరూపించుకున్నారు. ఆ స్కూల్లో చదువుకుంటే కూడా  లభించని కామన్ సెన్స్ ఆయనలో పుష్కలం. అదే ఆయనకు శ్రీరామ రక్షగా నిలిచిందనుకోవాలి.
బిజినెస్ స్కూల్లో నేర్పే మోటివేషన్, డెలిగేషన్ మొదలయిన విషయాలు కేసీఆర్ కు పుట్టుకతోనే అబ్బాయి. రాజకీయాల్లో చేరి మంత్రిగా, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఈ లక్షణాలు ఎంతగానో ఆయనకు  ఉపయోగపడుతున్నాయి.
ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తిచేకున్నప్పుడు ఊహించని వ్యక్తి నుంచి  ఆయనకు దక్కిన  ఒక చక్కటి కితాబును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ  వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.  
డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.
సంజయ్ బారు ఒక్కరే కాదు, హైదరాబాదు వాసులందరూ ఇదే అభిప్రాయంతో వున్నారు. కారణం ఏమిటంటేఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అన్నట్టు వుండే కరెంటు సరఫరా గురించి వారు పెంచుకున్న ఆందోళన అనతికాలంలోనే  దూది పింజలా ఎగిరిపోయింది.  అయితే ఈ ఘనతను కేసీఆర్ ఏనాడూ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయలేదు. సరికదా, సమయం దొరికినప్పుడల్లా సంబంధిత మంత్రి, జెన్కో చైర్మన్, అధికారులు, సిబ్బంది  సమష్టి కృషి వల్లనే ఈ అద్భుతం’  సాధ్యం అయిందని పలుమార్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు. పరిపాలనలో   ‘నేనుఅని కాకుండా మేముఅనే పదాన్ని మించిన  మోటివేషన్ ఏముంటుంది? అందుకే ఈ  విషయంలో ఇక ఆయన కొత్తగా నేర్చుకోవాల్సిన పాఠాలు లేకుండా పోయాయి. 
 అలాగే, బిజినెస్ గురువులు చెప్పే మరో అంశం డెలిగేషన్. అంటే అధికారాలు, బాధ్యతల బదిలీ. ముఖ్యమంత్రిగా ఎన్నో అధికారాలు తనవద్దనే కేంద్రీకృతం అయివున్నా వాటిని సంబంధిత మంత్రులకు, అధికారులకు కేసీఆర్  అప్పచెప్పేసారు. లక్ష్యాలు నిర్ణయించి, ఫలితాలు రాబట్టాలని నిర్దేశించారు. ఆన్నింటా తానయి, అన్నిట్లో వేలు దూర్చడం కాకుండా దశ, దిశలను నిర్దేశించడం వరకే తన పాత్రను పరిమితం చేసుకుని ఫలితాలు సాధించే పనిని ఎంచుకున్నారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ఇందుకు ఉదాహరణలు. ఇతర పరిపాలకులకు కూడా కేసీఆర్ చూపిన ఈ  బాట అనుసరణీయం.  తను బీపీ తెచ్చుకోకుండా, పనిచేయించేవారికి బీపీ తెప్పించకుండా పనులు జరిగేలా చూడడం వల్లనే రాష్ట్రంలో పరిపాలన నల్లేరు మీది బండిలా హాయిగా సాగిపోతోందనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడడానికి కారణం ఇదే.
అనర్ఘలంగా ప్రసంగించేవారు రాజకీయుల్లో  చాలామంది కనబడతారు. కానీ ఆకట్టుకునేలా ఉపన్యసించడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. తన ఎదురుగా వున్నశ్రోతలను బట్టి ఆయన ప్రసంగ శైలిని మార్చుకుంటారు. మహిళలు, ఉపాధ్యాయులు, మేధావులు, విలేకరులు ఇలా ఎవరికి తగ్గట్టు అప్పటికప్పుడు ఆయన ఉపన్యాస ధోరణి మారిపోతుంది. వారి వారి  అభిరుచులు,ఇష్టాఇష్టాలను గమనిస్తూ సంభాషణ కానీ ప్రసంగం కానీ కొనసాగించడం ఆయన ప్రత్యేకత. వేదిక ఎక్కి ఆశువుగా మాట్లాడితే ఇక దానికి అడ్డే వుండదు. అదే కాగితాలు చూస్తూ చదివితే పేలవంగా వున్నట్టనిపిస్తుంది. ఈ విషయం ఆయనే అనేక సందర్భాలలో స్వయంగా చెప్పారు. కాగితం చూస్తూ చదవడం తనకు ఇష్టం ఉండదని, అయినా కొన్ని కొన్ని అధికారిక కార్యక్రమాల్లో తప్పడం లేదని ఆయనే చెప్పారు. భోజనం వేళకు ఇంట్లో ఎంతమంది వుంటే అంతమందిని భోజనాలకు లేపడం ఆయనకు ఓ అలవాటని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. స్వతహాగా  భోజన ప్రియుడు కాకపోయినా ఇతరుల ఇష్టాఇష్టాలను గమనిస్తూ ఒక గృహస్తుగా భోజనాదికాలు కనుక్కుంటూ వుండడం ఆయనకు  అలవాటని కూడా చెబుతుంటారు. నాతొ సహా హైదరాబాదులోని చాలామంది విలేకరులకు ఇది అనుభవైకవేద్యమే. అంతే కాదు, దేశంలో ఏ ప్రాంతంలో ఏ వంటకాలు ప్రాచుర్యం పొందాయన్నది ఆయనకు కరతలామలకం. రాష్ట్ర విభజన తరువాత ఒకసారి బెజవాడ వెళ్ళిన కేసీఆర్  కు, అయన పరివారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విందు భోజనం ఏర్పాటు చేసారు. పొరుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాల ప్రత్యేకతలు అయిన పిండి వంటలు, ఇతర వంటకాలను కేసీఆర్ ఆ విందు సందర్భంగా సవివరంగా ప్రస్తావించారు. మా ప్రాంతపు వంటకాల గురించి మాకే ఇంతగా తెలియదు, ఆయన ఎప్పుడు ఇంత అధ్యయనం చేశారని ఆశ్చర్య పోవడం ఆంధ్రప్రాంతం మంత్రుల వంతయిందని మరునాడు పత్రికలు రాసాయి. అలాగే వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాల పట్ల కూడా ఆయనకున్న  అవగాహన అపరిమితం.
ఆయన దురదృష్టం ఏమిటంటే, కేసీఆర్ గురించి కొన్ని వర్గాల్లో ఒక అపోహ ఇప్పటికీ  వుంది, ప్రాంతీయ పార్టీ నాయకుడిగా ఆయన, తన ప్రాంత ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తారని. అంతవరకయితే పరవాలేదు. కానీ ఆయన్ని ఒక కరడు కట్టిన ప్రాంతీయ వాదిగా ముద్రవేసే ప్రయత్నం కూడా జరుగుతోందనేది కూడా వాస్తవం. కేసీఆర్  ప్రాంతీయవాది కావచ్చేమో కాని ప్రాంతీయ తత్వం మాత్రం ఆయన రక్తంలో లేదనడానికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి.
సినీ నటుడు బాలకృష్ణ ఒకసారి ఓ పనిమీద తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుని కలుసుకుని ఒక వినతి పత్రం అందచేశారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఆయన శాసనసభ్యుడు. పైగా టీ.ఆర్.ఎస్. ప్రధాన రాజకీయ  ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిని కలుసుకున్నది హైదరాబాదులోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రి చైర్మన్ హోదాలో, ఆ హాస్పిటల్ కు సంబంధించిన ఒక వ్యవహారంలో. అయినా కేసీఆర్ వెంటనే సానుకూలంగా స్పందించి అధికారులకు తదనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చారు. బాలకృష్ణ గారు అడిగింది  ఆయన స్టూడియోకో, లేదా వ్యాపార వాణిజ్య అంశానికి సంబంధించిన విషయమో కాదు, ప్రజలకు ఉపయోగపడుతున్న దవాఖానా గురించి. అలాంటప్పుడు ఆలోచించాల్సింది ఏమిటన్నదికేసీఆర్ ప్రశ్న. అందుకే ఆయన ఏమాత్రం సంకోచించకుండా స్పందించారు. అటువంటి విషయాల్లో ప్రాంతీయ తత్వం పనికి రాదన్నది కేసీఆర్ సిద్ధాంతం.
రాజనేవాడికి స్పందించే గుణం వుండాలని కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో చెబుతాడు. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ లక్షణం అతికినట్టు సరిపోతుంది.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా అన్ని దిన పత్రికలు చదవడం ఎన్నో ఏళ్ళుగా ఆయనకు వున్న అలవాటు.  పత్రికల్లో వచ్చే ముఖ్యమైన వార్తలను క్రోడీకరించి అనుదినం అందించే యంత్రాంగం ప్రతి ముఖ్యమంత్రికి వున్నట్టే కేసీఆర్ కి కూడా వుంది. అయినా ఆయన స్వయంగా ప్రతి పత్రికను ఆమూలాగ్రం చదువుతారు. చదివిన తరువాత ఆయా విషయాల మీద ఆయన తక్షణం స్పందించే తీరు కొన్ని సందర్భాలలో కొందరు అశక్తుల విషయంలో వరంగా మారుతోంది. అలా అయాచితంగా లబ్దిపొందిన కుటుంబాల్లో మాదీ ఒకటి.
మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు అయిదుగురు ముఖ్యమంత్రుల వద్ద వరుసగా  పీ ఆర్ ఓ గా (చెన్నా టు అన్నా, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు) పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి స్వచ్చంద పదవీవిరమణ చేసారు. ఉన్నతోద్యోగాలు చేసి కూడా  ఒక సొంత గూడంటూ ఏర్పాటు చేసుకోలేని స్తితిలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కొన్ని వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆయన పెన్షన్ మొత్తాన్ని అమ్ముకున్న ఫలితంగా మా ఒదినె సరోజిని గారికి కుటుంబ పెన్షన్ పదేళ్లుగా రాని పరిస్తితి. విన్నపాలు, వినతి పత్రాలు మినహా కోర్టు గుమ్మం తట్టకూడదనే  సంస్కారం కలిగిన కుటుంబం. ఈలోగా ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. సాయం చేయాలని వారికి  మనసులో యెంతగా  వున్నా, నిబంధనల కారణంగా  ఏమీ చేయలేని స్తితి. ఈ నేపధ్యంలో రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ కు వున్న పత్రికలు చదివే అలవాటు దాదాపు మూసివేసిన  ఈ ఫైలుకు మళ్ళీ ప్రాణం పోసింది. మా అన్నగారి వర్ధంతిని పురస్కరించుకుని మిత్రుడు  జ్వాలా నరసింహారావు ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక వ్యాసంలో ఈ పెన్షన్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో దాగున్న  మానవతా కోణం ఒక్కటేముఖ్యమంత్రి కేసీఆర్  కంటికి కనిపించింది. అంతే! ఏళ్ళతరబడి ఎదురుచూస్తున్న ఆ డెబ్బయి ఎనిమిదేళ్ళ  వృద్దురాలికి నిబంధనలు సడలించి  పెద్దమనసుతో ఆయన పెన్షన్ మంజూరు చేశారు. శతమానం భవతి అని కేసీఆర్ ని మనసారా  ఆశీర్వదించడం  ఒక్కటే కృతజ్ఞతలు తెలపడానికి  ఆమెకు మిగిలిన దారి. ఇక ఈ క్రమంలో సహకరించిన ఆంధ్రజ్యోతితో సహా అందరికీ మా కుటుంబం తరపున ధన్యవాదాలు. (15-02-2017)


(Courtesy, Editor, Andhra Jyothy)

రచయిత మొబైల్: 9849130595 ఈ మెయిల్:  bhandarusr@gmail.com  


16, ఫిబ్రవరి 2015, సోమవారం

తెలిసిన కేసీఆర్ లో తెలియని కేసీఆర్

(Published by 'SURYA' telugu daily on Tuesday,17-02-2015)
(ఫిబ్రవరి పదిహేడు - తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం)
కేసీఆర్ ని దగ్గరగా చూసి పదేళ్లు గడిచి వుంటాయి. 2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు,  కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గురించి చెప్పడానికి అనుకుంటా,  బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసిన గుర్తు. మధ్యలో కొంత ఎడం వచ్చింది కాని నేను మాస్కో వెళ్లక మునుపు కేసీఆర్,  ఎన్టీయార్ క్యాబినెట్ లో రవాణా శాఖ  మంత్రిగా వున్నప్పుడు, రేడియో విలేకరిగా  తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి  పేషీ వుండే సమతబ్లాక్ పక్కనే మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్  కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసివచ్చిన రాజకీయ ప్రముఖులు విలేకరులతో  మాట్లాడే 'మీడియా పాయింటు' ప్రస్తుతం ఆ ప్రదేశంలో వున్నట్టుంది.
అదలా వుంచితే, మళ్ళీ కేసీఆర్ ని దగ్గరగా గమనించే అవకాశం నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చింది. తెలంగాణా జర్నలిష్టుల ఫోరం కేసీఆర్ తో  ముఖాముఖి సమావేశం (మీట్ ది ప్రెస్) ఏర్పాటు చేసింది.
రావాల్సిందని నిర్వాహకుల నుంచి ఆహ్వానం.
'ప్రెస్ మీట్ అవగానే కేసీఆర్ కొందరితో కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి అని ఆహ్వానానికి కొసరు.
జర్నలిష్టుగా  రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. 'మీట్ ది ప్రెస్' కాబట్టి బయలుదేరి వెళ్లాను.

హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ.ఆర్.ఎస్. నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతో  కూడా కరచాలనం చేసారు. ఓ క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను.
సరే! ఆయన వేదిక మీదకు వెళ్ళి  తన అలవాటు ప్రకారం  సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, వాటిల్లో తొంగి చూసిన విషయ పరిజ్ఞానం, తొట్రు పడకుండా, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. 'సభికులు' అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశంలా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని మాటల మాంత్రికుడుఅంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. 'తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్న'దీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు ఒక రకంగా -  ఏదో ఒక సందర్భంలో ఆయన చెప్పినవే అయినా వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు, అదంతా టీవీల్లో  ప్రత్యక్షప్రసారంలో చూస్తున్న బెజవాడ  మిత్రుడు ఒకరు  ఎస్.ఎం.ఎస్. పంపారు. 'కేసీఆర్  ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెబుతున్నట్టుగా  యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ (విభజన) గొడవలే ఉండేవి కావ'న్నది దాని సారాంశం.  కానీ, అప్పటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయింది. ఎన్నికలే తరువాయి.
నాటి సభలో కేసీఆర్ అనేక విషయాలను స్పృశించారు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం.  కాని 'విడిపోతే భద్రాచలం సంగతేమిటి?' అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని ఆయన ఆసక్తికరంగా వివరించారు.
"వెనుక  అది (భద్రాచలం) తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటన్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు  ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం  అంతా ఓ కధ మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.
సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఆయనకు రాజకీయ గురువు అయిన  యన్టీయార్ గారిదీ ఇదే మనస్తత్వం. అతిధులను  స్వయంగా కనుక్కుంటూ, కొసరి కొసరి వడ్డించి  మరీ తినిపించేవారు.
హోటల్లో ఏవేవో పదార్ధాలు కేసీఆర్ కి వడ్డించబోతే, 'వద్దు ఇంత అన్నం, పప్పూ పట్టుకు రమ్మ'న్నారు. సింపుల్ భోజనం. భోజనం చేస్తుండగా  ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు. ఇదంతా ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వం. అయిన తరువాత ఎన్నడూ కలిసింది లేదు. ఆ అవసరమూ రాలేదు. అయితే, టీవీల్లో ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు, పత్రికల్లో ఆయన గురించిన కధనాలు చదువుతున్నప్పుడు కేసీఆర్ మారిన దాఖలాలు ఏమీ కనబడడం లేదు.
అయినా ఆయన మునుపటి మనిషి కాదనే వాళ్లు వున్నారు. ఒకప్పుడు కాదని తోసిరాజన్నవాళ్ళను దగ్గరకి తీసిన సందర్భాలు, స్వవచన ఘాతుకంగా అనిపించే ప్రకటనలను వారు ఉదహరిస్తుంటారు. ఉదాహరణకు ఒకప్పుడు మోడీ గారి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదట్లో ఆయన పట్టించుకున్న దాఖలా లేదు. ఇప్పుడు అదే అంశాన్ని తన ప్రాధాన్యతల జాబితాలో చేర్చారు. భద్రాచలం ముంపు మండలాలు, రామోజీ స్టూడియో సందర్శన, కేంద్రంతో ఇటీవలి కాలంలో మెరుగు పరచుకుంటున్న సంబంధాలు ఇలా అనేకం.


ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, పూటకొక పధకం. 'ఇవన్నీ సాధ్యమా?' అనే వారికి  ఆయన సమాధానం ఒక్కటే. 'చూస్తుండండి చేసి చూపిస్తాను' అని.   
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా' అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ.
ముఖ్యమంత్రిగా అయన వ్యవహార శైలి విభిన్నంగా వుంటుందని ఆయనతో పనిచేసే అధికారులు చెబుతుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైనా రాష్ట్ర వ్యవహారం చర్చించాలని అనిపిస్తే చాలు, అధికారులతో ప్రమేయం లేకుండా ఆయనే స్వయంగా ఫోనులో మాట్లాడేస్తుంటారు.
అందుకే కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో వున్నాయి.
అదే కేసీఆర్ ప్రత్యేకత.
ఫిబ్రవరి పదిహేడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు. వారికి శుభాకాంక్షలు. తెలంగాణా రాష్ట్రం తొలి పుట్టిన రోజునాటికయినా ఆయన కంటున్న 'బంగారు తెలంగాణా'  కలల్లో కొన్నయినా నెరవేరాలని కోరుకుందాం. (16-=02-2015)