17, మే 2014, శనివారం

సీమాంధ్ర ప్రజాతీర్పు


"అధికారం 'చేతి' లో పెట్టుకుని ప్రజాభీష్టాన్ని తుంగలో తొక్కి గొడ్డలితో నరికినట్టు రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీకి ఐ.పీ.సీ. (ఇండియన్ ప్రజాస్మృతి) 175/25 సెక్షన్  ప్రకారం జీవితకాలపు కఠినశిక్ష  విధించడమైనది.
ఒక దశలో రాష్ట్ర విభజనకు దోహదపడే ప్రకటన చేసిన వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీకి, ఆ పార్టీ నాయకుడి చిన్న వయస్సును దృష్టిలో పెట్టుకుని  ప్రతిపక్షపాత్రకు పరిమితం చేస్తూ అయిదేళ్ళ శిక్ష విదించడం జరిగింది.
రెండు కళ్ళ సిద్ధాంతంతో ముందు కలవరపెట్టినా, అనాధగా మిగిలిపోయిన సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి అవసరమైన అనుభవం కలిగిన పార్టీగా తెలుగు దేశం పార్టీని గుర్తించి, ఆ పార్టీ  పాత తప్పిదాలను క్షమించి, నిర్దోషిగా భావించి విడుదల చేస్తూ ఆ ప్రాంతపు పాలనాధికారాన్ని అయిదేళ్లపాటు దఖలు చేయడం జరిగింది.
ఈ తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి అయిదేళ్ళ వ్యవధానం ఇవ్వడం కూడా జరిగింది.


- సీమాంధ్ర ప్రజానీకం 

15, మే 2014, గురువారం

కాకతాళీయం


ప్రముఖ మానవతావాది, స్త్రీ జనోద్ధరణ ఉద్యమ నాయకురాలు శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారు మరణించినట్టు అమెరికా నుంచి ఇన్నయ్య గారు పెట్టిన పోస్ట్ చదువుతుంటే ఆకాశవాణి మాజీ ఎనౌన్సర్ శ్రీమతి రత్నప్రసాద్ ఫోన్ చేశారు. ఆవిడ పుట్టెడు దుఃఖంలో వుండి మాట్లాడుతున్నారు అనిపించింది. కేవలం రెండు నెలల తేడాలో భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. మొదలు పెడుతూనే జాతస్య మరణం ధృవం అంటూ - 'ఎందరి గురించో రాస్తుంటావు, నేను పోతే నా గురించి కూడా రాయి బాబూ' అన్నారు. నాకేమనాలో తోచక అలా 'అనకండి ముందూ వెనుకగా అందరం పోవాల్సిన వాళ్ళమే. పోయేదాకా ఇంకా బతుకు వుంది అనే ఆశతో బతుకుతుంటాం.' అని వోదార్చే ప్రయత్నం చేసాను. ఇంతలో ఆవిడకు మరో ఫోను వచ్చినట్టుంది. మళ్ళీ చేస్తాను అని కాసేపట్లో మళ్ళీ ఫోను చేశారు. 'యెంత పనయిందో చూసావా శ్రీనివాసూ, మా వియ్యపురాలు సుబ్బమ్మ గారు పోయారు. ఇప్పుడే సమాచారం అందింది' అన్నారు. అంతకు ముందు ఆవిడ ఫోను మాట్లాడుతున్నప్పుడే నేను ఇన్నయ్య గారు పంపిన ఆ సమాచారమే చదువుతున్నాను. ఆ  సమయంలో చావు వార్త చెప్పడం ఎందుకని మిన్నకుండి పోయాను. నిజానికి మల్లాది  సుబ్బమ్మ గారు ఎవరో కాదు, రత్న ప్రసాదు గారి వియ్యపురాలే. ఆ సమయంలో ఈ విషయం నాకు స్పురణకు రాలేదు. యెంత కాకతాళీయం. నిజానికి మనిషి జీవితమే ఇటువంటి సంఘటనల సమాహారం.


(Smt. Malladi Subbamma garu)

దేవుడూ, ఆత్మలు అవీ నమ్మని మనిషి కాబట్టి సుబ్బమ్మ గారి విషయంలో -  'సుబ్బమ్మగారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి' అనే షరా మామూలు సందేశాలు అవసరం పడవు.

ముందు కుక్క సంగతి చూద్దాం.


(కొల్లూరు సురేష్ బాబు గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)


ఏకాంబరం : " ఉదయం నుంచీ నా భార్య కనిపించడం లేదు"
ఇనస్పెక్టర్ : కొన్ని గుర్తులు చెప్పండి. ఆవిడ యెంత హైట్ వుంటారు?
ఏకాంబరం : "నేనెప్పుడు గమనించలేదు"
ఇనస్పెక్టర్ : "పోనీ లావా సన్నమా యెలా  వుంటారు/"
ఏకాంబరం : "అంత సన్నమేం కాదు, కొద్దిగా బొద్దుగా వుండొచ్చు"
ఇనస్పెక్టర్ :  "కళ్ళ రంగు?"
ఏకాంబరం :  "అంత శ్రద్ధగా ఎప్పుడూ గమనించలేదు"
ఇనస్పెక్టర్ :  "చివరి సారి చూసినప్పుడు ఏ దుస్తులతో వున్నారు, చీరె కట్టుకున్నారా, చుడీదారా?"
ఏకాంబరం : నైట్ డ్రెస్? నో నో ఇనస్పెక్టర్! సరిగా గుర్తుకు రావడం లేదు"
ఇనస్పెక్టర్ : పోనీ ఆవిడ వెంట ఎవరైనా వెళ్ళారా?
ఏకాంబరం : ఎప్పుడూ మా కుక్క రోమియో మా ఆవిడ వెంటే వుంటుంది. దాన్నే వెంటేసుకుని వెళ్ళి వుంటుంది. మా రోమియో అంటే గుర్తుకు వస్తోంది ఇనస్పెక్టర్ . దాని అందం దానిదే. తెల్లగా బొద్దుగా వుంటుంది. నిగనిగ లాడే జుట్టు. తేనె కళ్ళు. ఏడాది వయసు నిండలేదు కానీ ఇదిగో నా మోకాళ్ళ ఎత్తు పెరిగింది. గోళ్ళు వొంపు తిరిగి వుంటాయి. మాంసం లేకపోతే ముద్ద ముట్టదు అంటే నమ్మండి. ఎంతో ముచ్చటపడి బంగారు తాపడంతో గొలుసు కూడా  చేయించాము. అది కనబడకపోతే ఎలాగో వుంది ఇనస్పెక్టర్"

ఇనస్పెక్టర్ : ఓహో ! అలాగా! అయితే మేమిప్పుడు వెతకాల్సింది మీ కుక్కను."     
NOTE: Image Courtesy Cartoonist)

రెండు గుండెల చప్పుడు


'లబ్ డబ్ .....లబ్ డబ్ ......'


"ముందొచ్చిన మునిసిపాలిటీలు, తరువాతొచ్చిన జడ్పీటీసీల ఫలితాల నేపధ్యంలో రేపు వస్తున్న   ఫైనల్  రిజల్ట్స్...అధికారం అందినట్టే అనిపించి అందకుండా పోతుందేమో.....లబ్ డబ్...లబ్ డబ్...."

"మునిసిపాలిటీలు సరే.. జడ్పీటీసీలు సరే....ఇవన్నీ వచ్చి అసలు అధికారం అందకపోతే...లబ్ డబ్....లబ్ డబ్ ...".

14, మే 2014, బుధవారం

సర్వేల మంటలు

రాష్ట్రం మొత్తాన్ని ప్రెషర్ కుక్కర్ లో పెట్టి స్టవ్ వెలిగించినట్టు వుంది. ఆ వేడిని మరింత పెంచుతున్నాయి ఎన్నికల సర్వేలు.


ప్రార్ధన చేసే పెదవులకన్నా సాయంచేసే చేతులు మిన్న - సత్య సాయిబాబా



ఎప్పుడయినా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని అనిపిస్తే అందుకు  తగిన మార్గం ఒకటుంది. అదేమిటంటే అవసరంలో వున్నవాళ్ళకి సాయం చేయడమే. చాలామంది సాయం అర్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటూ వుంటారు. వారిలో కొందరికి సాయం చేయడానికి ఆ దేవుడు మిమ్మల్ని  ఎంపిక చేసుకుని వుంటాడనుకోవాలి. మనకు ఏదయినా పదవి వచ్చినా, ఉద్యోగంలో  పెద్ద  హోదా దొరికినా,  సంపదలు లభించినా  అవసరంలో వున్న వారికి సాయపడడానికే అన్న ఎరుక పెంచుకోవాలి.

అలనాటి ఆంధ్రపత్రిక మళ్ళీ కంటపడింది.


యెంత సంతోషం అనిపించిందో.


పక్కన స్టూడియో వన్ టీవీ ఛానల్లో 'నేనంటే నేను' పాత బ్లాక్ అండ్ వైట్ సినిమావస్తోంది. హీరో కృష్ణ, హీరోగా మారిన నాటి విలన్ కృష్ణంరాజు, చిదిమితే పాలుగారే వయస్సులో చంద్రమోహన్, నవ్వించే విలన్ నాగభూషణం, అందాల తార కాంచన, ఇక వస్తాదు నెల్లూరు కాంతారావు సరేసరి. కధలో భాగంగా చంద్ర మోహన్ చేతిలో ఆంధ్ర పత్రిక కనిపిస్తుంది. కాసేపే అయినా, అది చూడగానే  అలనాటి ఆంధ్ర పత్రిక వైభోగం కనులముందు కదలాడింది. ఆ పత్రిక్కి సంబంధించిన అనేక జ్ఞాపకాలు మదిలో సుడి తిరిగాయి. గొప్ప చరిత్ర కలిగిన ఆ గొప్ప పత్రిక చివరకు చరిత్రలో కలిసిపోయింది.