7, నవంబర్ 2013, గురువారం

రారండోయ్ రారండోయ్ రేడియో విందాం రారండోయ్ - 1


ఏ ముహూర్తాన మార్కొనీ మహాశయులు రేడియో కనిపెట్టారో కాని అనేక దశాబ్దాలపాటు అది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఇళ్ళల్లో అదో అపూర్వ వస్తువుగా వెలిగిపోయింది. కాలక్రమంలో వచ్చిన మార్పులనే  కారుమబ్బుల క్రీనీడల్లో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతూ ఉనికిని కాపాడుకునే విఫల ప్రయత్నం చేస్తున్న రేడియో కదాకమామిషు:

మొత్తం దేశం సంగతి యేమో కాని దక్షిణ భారత దేశంలో రేడియో ప్రసారాలు ప్రారంభం కావడానికి కారకులు ఓ తెలుగు వ్యక్తి అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే. ఆయనే  రావు బహదూర్ సీ.వీ. కృష్ణ స్వామి సెట్టి.  1914 లో మద్రాసు నగర పాలక సంస్థలో ఎలక్త్రికల్ ఇంజినీర్ గా చేరారు. తొలిసారి విమానం ఎక్కిన భారతీయుల జాబితాలో పేరు దక్కిచ్చుకున్న వ్యక్తి. 1924లో మద్రాసు రేడియో క్లబ్ ద్వారా ఆయన రేడియో ప్రసారాలు మొదలుపెట్టారు.  1924 మే 16 న ఏర్పడిన ఈ మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్, 1924 జులై  31 నాడు ప్రసారాలు మొదలు పెట్టింది. అయితే ఆ ప్రసారాలలో సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం వుండేది. కాకపొతే ఇది మూడేళ్లలోనే మూతపడింది. అయితే  కృష్ణ స్వామి సెట్టి గారి పూనికతో 1930 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి మద్రాసు నగర పాలక సంస్థ రేడియో ప్రసారాలు ప్రారంభించింది.   కాని ఆ పరిమిత ప్రసారాల్లో తెలుగు పాటలు విన్పించినా తెలుగు నాటకాలు వంటివి ప్రసారం అయిన ఆధారాలు లేవనీ ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ ఉవాచ. పోలీసువారి ప్రకటనలు, ఆరోగ్య విశేషాలు కొన్ని ప్రసారం చేసేవారు. బడి పిల్లలకోసం  కొన్ని కార్యక్రమాలు వినిపించేవారు. ఈ ప్రసారాలు  చిత్తూరు, వేంకటగిరి మొదలయిన  చోట్ల వినిపించేవి. వాతావరణం అనుకూలించినప్పుడు బంగాళాఖాతం తీరం వెంబడి వున్న వూళ్ళల్లో విశాఖపట్నం దాకా వినిపించేవని గోపాలకృష్ణ ఒక వ్యాసంలో రాశారు.



(1920 ప్రాంతంలో రేడియో వినడానికి  ఇంత శ్రమ పడేవారు) 

NOTE: COURTESY OWNER OF THE PHOTOGRAPH 

6, నవంబర్ 2013, బుధవారం

పార్టీలు వేరయినా ‘వరస’ ఒక్కటే!


పార్టీలు వేరయినా ‘వరస’  ఒక్కటే!
రాష్ట్ర విభజన అనండి రాష్ట్ర సమైక్యత అనండి – నిప్పూ ఉప్పూ మాదిరిగా ఏమాత్రం పొసగని  అన్ని పార్టీలదీ ఒక్కటే మాట - అదే చిత్రం! అదే విచిత్రం! కావాలంటే ఆయా పార్టీల నాయకులు తరచుగా చెప్పే  మాటలు ఓసారి  గమనించండి. అర్ధమై పోతుంది.
“కేవలం మా పార్టీని ఇరుకున పెట్టడానికి అవతలి పార్టీలు కుమ్మక్కై చేస్తున్న ఆరోపణ ఇది.  ఆ రాజకీయ పార్టీలన్నిటిది  ఒకటే లక్ష్యం.  వోట్లు, సీట్లు. ఎన్నికల్లో గెలిచి అధికారం కైవసం చేసుకోవడం యెలా అన్న యావ తప్పితే వాటికి ఈ విషయంలో మా మాదిరిగా ఎంతమాత్రం  చిత్తశుద్ధి లేదు.”
ఈ మాటలు చెప్పింది, చెప్పేది  ఏ పార్టీ అన్నది, ఏ పార్టీవారన్నది అసలు లెక్క లోకే  రాదు. ఎందుకంటే తిరగేసి మరగేసి అందరూ ఏకధాటిగా వినిపించే వాదనల  సారాంశం ఇదే.  కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, సీపీఐ,,  ఇలా ఏ పార్టీ వారిదయినా ఒకటే స్వరం. ఒకటే రాగం. పల్లవులే వేరు,  ‘దారులు వేరయినా వారి బారులొక్కటే’ అన్న చందంగా.       
(ఇందుకు సీపీయం మినహాయింపు. ఎందుకంటే వారిది మొదటి నుంచీ  ఒకటే మాట – రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని.  టీ.ఆర్.ఎస్. వాళ్లకు కూడా ఈ మినహాయింపు  కొంత వర్తిస్తుంది ఎందుకంటే ఆ పార్టీ  పుట్టిందే వేర్పాటు నినాదంతో కాబట్టి. వారికి మరో మాటా బాటా లేదు కాబట్టి)

నమ్మకం కుదరాలంటే  ఏదో ఒకరోజు ఉదయం కాస్త మనస్సు ఉగ్గపట్టుకుని  టీవీ చర్చలు చూడండి.
(06-11-2013)       

5, నవంబర్ 2013, మంగళవారం

ఐ పాడ్ మేజిక్



అన్నిరకాల మేజిక్ లు అయిపోయి ఇక ఐ పాడ్ మేజిక్ లు వచ్చేసాయి. మూడునిమిషాలే కాబట్టి హాయిగా చూసెయ్యొచ్చు. ఒక పనయిపోతుంది. ఏమంటారు? లింకుపై నొక్కి చూడండి.
http://www.lifo.gr/tv/videos/460

3, నవంబర్ 2013, ఆదివారం

ఆడవాళ్లా మజాకా!


ఆడవాళ్లంటే గౌరవం పెరిగే సందర్భం నిన్న అనుభవంలోకి వచ్చింది.
ప్రభుత్వ సర్వీసులో వున్నవాళ్ళు పదవీ విరమణ వయసు రాగానే ఇంటికి పంపించేస్తారు. అంతవరకూ ఆఫీసులో నలుగురితో వారు సంపాదించుకున్న ఆదరణను బట్టి వీడ్కోలు గౌరవం వుంటుంది. కాకపొతే కొంత స్థాయీ భేదాలు కూడా  సహజం.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో దాదాపు నలభయ్ ఏళ్ళ బట్టి పనిచేస్తూ వచ్చిన విజయలక్ష్మి అనే ఆవిడ మొన్న అక్టోబర్ ముప్పయి ఒకటిన రిటైర్ అయింది. మామూలుగానే చిన్న కార్యక్రమం పెట్టి వీడ్కోలు ఇచ్చి వుంటే ఇప్పుడీ విషయం రాయాల్సిన అవసరం వుండివుండేది కాదు.
ముందు కొంత నేపధ్యం చెప్పుకుందాం.
గతంలో నేను రేడియోలో పనిచేసేటప్పుడు న్యూస్ ఎడిటర్లు, కరస్పాండెంట్లు అంతా మగ మహారాజులే. స్టెనోలు, టైపిస్టులు మాత్రం ఆడవాళ్లు. న్యూస్ రీడర్లు కొంత మినహాయింపు.  ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారిపోయింది. న్యూస్ యూనిట్ హెడ్ బాఖర్ మీర్జా అయినప్పటికీ న్యూస్ ఎడిటర్ శ్రీమతి సుప్రశాంతి. న్యూస్ కరస్పాండెంట్ శ్రీమతి లక్ష్మి. న్యూస్ రీడర్లు శ్రీమతి తురగా ఉషారమణి, శ్రీమతి మాధవీలత. ఇంగ్లీష్ స్టెనో గ్రాఫర్ శ్రీమతి శైలజ, తెలుగు స్టెనో శ్రీమతి విజయలక్ష్మి. చివరాఖరుకు నాలుగో తరగతి అధికారులు (క్లాస్ ఫోర్ ) కూడా శ్రీమతి శ్యామల, శ్రీమతి అన్నపూర్ణ.
మా యూనిట్లో ఈ ఆడవాళ్లందరూ కలసి  ప్రభుత్వంలో ఒక విభాగాన్ని యెంత సమర్ధవంతంగా నడపవచ్చో రుజువు చేశారు.
2011 లో మొత్తం దేశంలోని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాల్లో ‘బెస్ట్ న్యూస్ యూనిట్ అవార్డ్’ హైదరాబాదుకు లభిస్తే ‘బెస్ట్ న్యూస్ ఎడిటర్ అవార్డ్’ను శ్రీమతి సుప్రశాంతి కైవసం చేసుకున్నారు. ‘2009 బెస్ట్ న్యూస్ కరస్పాండెంట్ అవార్డ్’ శ్రీమతి లక్ష్మికి లభించింది. లక్ష్మి 2010 లో రాష్ట్రపతి లావోస్, కంబోడియా పర్యటనలను, 2013 లో ప్రధాని జపాన్ పర్యటనను  ఆకాశవాణి తరపున కవర్ చేస్తే, సుప్రశాంతి 2011 లో ప్రధాని వెంట మాల్దీవులకు, మళ్ళీ 2013  లో ప్రధాని వెంట జర్మనీకి వెళ్ళి వచ్చారు.


(ఎడమనుంచి కుడికి - రంగారావు,విజయలక్ష్మి దంపతులు, లక్ష్మారెడ్డి, అద్దంకి రాం కుమార్, డి. వెంకట్రామయ్య, భండారు శ్రీనివాసరావు, శైలజ, సుప్రశాంతి, లక్ష్మి, తురగా ఉషారమణి)     

సరే! ఇదంతా వృత్తిగతం. ఇన్ని అవార్డులు రివార్డులు పొందిన తరువాత సామాన్యంగా ఎవరయినా సరే  తాము అసామాన్యులమని అనుకోవడం సహజం. కానీ వీరిద్దరూ దానికి పూర్తిగా మినహాయింపు. వీరే కాదు, ఇప్పుడు ఆ యూనిట్లో పనిచేస్తున్న మహిళలందరూ భేషజాలు ఎరుగనివారే. అందుకే ఒక స్టెనోగ్రాఫర్ రిటైర్మెంట్ వేడుకను అంతా  పూనుకుని ఎంతో  ఘనంగా నిర్వహించారు.దాదాపు అరవై మంది క్యాజువల్ న్యూస్ రీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గౌరవం పొందిన విజయలక్ష్మికి అభినందనలు. ఈ అభినందన వేడుకను కనుల పండుగగా నిర్వహించిన వారందరికీ శతాభివందనలు. (వయసు రీత్యా చిన్నవారయినా మానసికంగా బాగా పరిణతి చెందినవారు కాబట్టి  తప్పులేదేమో!)
(03-11-2013)

పెళ్ళాన్ని సంతోషంగా వుంచాలంటే :


భార్యను సుఖపెట్టాలనుకున్న భర్త ఆమెకు :
ఒక స్నేహితుడిగా
ఒక ప్రేమికుడిగా
ఒక సాటి మనిషిగా
ఒక వంటమనిషిగా
ఒక ఎలెక్త్రీషియన్ గా
ఒక ప్లంబర్ గా
ఒక కార్పెంటర్ గా
ఒక డెకొరేటర్ గా
ఒక మంచి శ్రోతగా
ఒక పనివాడిగా
ఒక అంగరక్షకుడిగా
చెప్పిన  ప్రతిమాట చెవి వొగ్గి వినేవాడిగా
చెప్పిన ప్రతిపని బుద్దిగా చేసేవాడిగా
ఒక శ్రేయోభిలాషిగా
చక్కని తెలివితేటలు కలవాడిగా
ధైర్యశాలిగా
సంపాదన పరుడిగా
అడిగినవన్నీ కొనిపెట్టేవాడిగా
అడగనివి కూడా కొనేవాడిగా
ఏవీ కొన్నా వాటిని గురించి ఏవీ అడగనివాడిగా
ఆమె పుట్టిన రోజును మరచిపోనివాడిగా
వుంటే చాలు.
పోతే, భర్తను సంతోషంగా వుంచాలంటే
ఇవేవీ అక్కరలేదు
అతడ్ని వొంటరిగా  వొదిలిపెడితే చాలు.
అతడికి అదే పదివేలు.


(ఒక ఇంగ్లీష్ గల్పికకు సంక్షిప్త స్వేచ్చానువాదం )

2, నవంబర్ 2013, శనివారం

దీపావళి శుభాకాంక్షలు


మీ హృదయాంగణంలో
మీ గృహ ప్రాంగణంలో
దీపావళి దివ్యకాంతులు ప్రసరించాలని మనసారా కోరుకుంటూ –


(నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు) 


  

1, నవంబర్ 2013, శుక్రవారం

ఆకాశవాణి నూతన డైరెక్టర్ జనరల్ ఆర్. వెంకటేశ్వర్లు గారికి అభినందన మందారమాల


ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ గా తెలుగువారయిన శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాకు తెలిసి ఆకాశవాణిలో ఇంతటి అత్యున్నత పదవి తెలుగువారికి దక్కడం ఇదే మొదటి సారి.  గతంలో ఆకాశవాణి, దూరదర్శన్ ఈ రెంటికీ కలిపి ఏర్పాటుచేసిన ప్రసార భారతి సంస్థకు సారధ్యం వహించిన ఖ్యాతి శ్రీ కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మగారికి లభించింది.


(శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు)

శ్రీ వెంకటేశ్వర్లు పరిచయం వున్నవారందరికీ ముందు గుర్తు వచ్చేది ఆయన మందస్మిత వదనం. గతంలో ఆయన ఆలిండియా రేడియో, ఫీల్డ్ పబ్లిసిటీ సంస్థల అధికారిగా పనిచేసిన రోజులనుంచీ నాకు ఆయనతో పరిచయం. తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ వరంగల్ రేడియో స్టేషన్ డైరెక్టర్ గా, హైదరాబాదు దూరదర్శన్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు ఆయనతో సాన్నిహిత్యం మరింత బలపడింది. మెట్లెక్కిన కొద్దీ  సహజంగా కానవచ్చే బెట్టుసరి వైఖరి వెంకటేశ్వర్లు గారిలో కలికానికి కానరాకపోవడం వల్ల మా మైత్రీబంధం మరింత గట్టిపడింది. ఎప్పుడు ఎక్కడ కనబడినా ‘ఏం మిత్రమా కుశలమా’ అనే మాట ఆయన నోట వినబడేది. అధికారిక అంతరం లేని ఆయన అంతరంగం వల్ల ఆయనతో నా వ్యవహార శైలి మునుపటి మాదిరిగానే కొనసాగుతూ వచ్చింది.
ఆర్ వీ వెంకటేశ్వర్లు గారు (అందరికీ ఆర్వీగా పరిచయం) ఢిల్లీ వెళ్ళిపోయిన తరువాత పెద్దగా కలిసింది లేదు. ఈరోజు ఆయన ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ గా నియమితులయినారని తెలిసి కాస్త సందేహిస్తూనే అభినందించడానికి ఫోను చేసాను. కొన్ని ఆయన లైన్లోకి రాగానే ఫోను కట్టయింది. బిజీ గా వుండొచ్చు అనుకున్నాను. క్షణాల వ్యవధిలో నా ఫోను మోగింది. “ఏం మిత్రమా! యెలా వున్నారు!” అంటూ అదే పలకరింపు.
కాసేపు మాట్లాడారు. కానీ నాకు చాలాసేపు అనిపించింది. హైదరాబాదు వచ్చినప్పుడు కలుద్దాం అని చెప్పి నేనే ముగించాను.

ఆయనకు మరోసారి మనః పూర్వక అభినందనలు. (01-11-2013)