ఆడవాళ్లంటే గౌరవం పెరిగే సందర్భం నిన్న
అనుభవంలోకి వచ్చింది.
ప్రభుత్వ సర్వీసులో వున్నవాళ్ళు పదవీ విరమణ వయసు
రాగానే ఇంటికి పంపించేస్తారు. అంతవరకూ ఆఫీసులో నలుగురితో వారు సంపాదించుకున్న
ఆదరణను బట్టి వీడ్కోలు గౌరవం వుంటుంది. కాకపొతే కొంత స్థాయీ భేదాలు కూడా సహజం.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో దాదాపు నలభయ్
ఏళ్ళ బట్టి పనిచేస్తూ వచ్చిన విజయలక్ష్మి అనే ఆవిడ మొన్న అక్టోబర్ ముప్పయి ఒకటిన
రిటైర్ అయింది. మామూలుగానే చిన్న కార్యక్రమం పెట్టి వీడ్కోలు ఇచ్చి వుంటే ఇప్పుడీ
విషయం రాయాల్సిన అవసరం వుండివుండేది కాదు.
ముందు కొంత నేపధ్యం చెప్పుకుందాం.
గతంలో నేను రేడియోలో పనిచేసేటప్పుడు న్యూస్
ఎడిటర్లు, కరస్పాండెంట్లు అంతా మగ మహారాజులే. స్టెనోలు, టైపిస్టులు మాత్రం ఆడవాళ్లు.
న్యూస్ రీడర్లు కొంత మినహాయింపు. ఇప్పుడా
పరిస్తితి పూర్తిగా మారిపోయింది. న్యూస్ యూనిట్ హెడ్ బాఖర్ మీర్జా అయినప్పటికీ
న్యూస్ ఎడిటర్ శ్రీమతి సుప్రశాంతి. న్యూస్ కరస్పాండెంట్ శ్రీమతి లక్ష్మి. న్యూస్
రీడర్లు శ్రీమతి తురగా ఉషారమణి, శ్రీమతి మాధవీలత. ఇంగ్లీష్ స్టెనో గ్రాఫర్ శ్రీమతి
శైలజ, తెలుగు స్టెనో శ్రీమతి విజయలక్ష్మి. చివరాఖరుకు నాలుగో తరగతి అధికారులు
(క్లాస్ ఫోర్ ) కూడా శ్రీమతి శ్యామల, శ్రీమతి అన్నపూర్ణ.
మా యూనిట్లో ఈ ఆడవాళ్లందరూ కలసి ప్రభుత్వంలో ఒక విభాగాన్ని యెంత సమర్ధవంతంగా
నడపవచ్చో రుజువు చేశారు.
2011 లో మొత్తం దేశంలోని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా
విభాగాల్లో ‘బెస్ట్ న్యూస్ యూనిట్ అవార్డ్’ హైదరాబాదుకు లభిస్తే ‘బెస్ట్ న్యూస్
ఎడిటర్ అవార్డ్’ను శ్రీమతి సుప్రశాంతి కైవసం చేసుకున్నారు. ‘2009 బెస్ట్
న్యూస్ కరస్పాండెంట్ అవార్డ్’ శ్రీమతి లక్ష్మికి లభించింది. లక్ష్మి 2010 లో
రాష్ట్రపతి లావోస్, కంబోడియా పర్యటనలను, 2013 లో
ప్రధాని జపాన్ పర్యటనను ఆకాశవాణి తరపున
కవర్ చేస్తే, సుప్రశాంతి 2011 లో ప్రధాని వెంట మాల్దీవులకు, మళ్ళీ 2013 లో
ప్రధాని వెంట జర్మనీకి వెళ్ళి వచ్చారు.
(ఎడమనుంచి కుడికి - రంగారావు,విజయలక్ష్మి దంపతులు, లక్ష్మారెడ్డి, అద్దంకి రాం కుమార్, డి. వెంకట్రామయ్య, భండారు శ్రీనివాసరావు, శైలజ, సుప్రశాంతి, లక్ష్మి, తురగా ఉషారమణి)
సరే! ఇదంతా వృత్తిగతం. ఇన్ని అవార్డులు
రివార్డులు పొందిన తరువాత సామాన్యంగా ఎవరయినా సరే తాము అసామాన్యులమని అనుకోవడం సహజం. కానీ వీరిద్దరూ
దానికి పూర్తిగా మినహాయింపు. వీరే కాదు, ఇప్పుడు ఆ యూనిట్లో పనిచేస్తున్న మహిళలందరూ
భేషజాలు ఎరుగనివారే. అందుకే ఒక స్టెనోగ్రాఫర్ రిటైర్మెంట్ వేడుకను అంతా పూనుకుని ఎంతో ఘనంగా నిర్వహించారు.దాదాపు అరవై మంది క్యాజువల్ న్యూస్ రీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గౌరవం పొందిన విజయలక్ష్మికి
అభినందనలు. ఈ అభినందన వేడుకను కనుల పండుగగా నిర్వహించిన వారందరికీ శతాభివందనలు. (వయసు
రీత్యా చిన్నవారయినా మానసికంగా బాగా పరిణతి చెందినవారు కాబట్టి తప్పులేదేమో!)
(03-11-2013)