5, ఆగస్టు 2013, సోమవారం

భండారు వంశం


మా రెండో తాతగారు సుబ్బారావు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను మా అన్నయ్య పర్వతాలరావు గారు తన రచనలో ప్రస్తావించారు. దానికి సంబంధించిన ఒక అరుదయిన ఫోటో మా రెండో అన్నయ్య కొడుకు జవహర్లాల్   పంపాడు. అందువల్ల ఆ భాగాన్ని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. 

"పర్వతాలయ్య గారి హయాములోనే ఒక సంఘటన జరిగింది. మా చిన తాత గారు భండారు సుబ్బారావు గారికి రైల్లో ఒక యువ సాధువు  కలిశాడు. ఆయన వర్చస్సు, పాండిత్యం చూసి మా చిన తాతగారు ముగ్ధుడై ఆయనను కంభంపాడు తీసుకు వచ్చారు. ఆ సన్యాసి పేరు శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి. ఆయనను అంతా కాశీ స్వాములవారు
అనేవారు.


(కంభంపాడు స్వామీజీ శ్రీ శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి)



ఆయన మా వూళ్ళో ఒక ఆశ్రమం స్థాపించారు. స్వామి  వారు హోమియో వైద్యం కూడా చేసేవారు. ఆయన బోధనలు విని మా తాతగార్లు తలా కొంత పొలం ఆయన గారి ఆశ్రమానికి దానంగా ఇచ్చారు. అందులో కొంత భాగంలో ఆయన తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే  ఒక వేద పాఠశాలను కూడా నిర్వహించారు. అదంతా బహుశా 1930-40 ప్రాంతాల్లో కావచ్చు. ఆ కార్యకలాపాలతో శ్రీ మండాలపాటి నరసింహారావుగారికీ, విజయవాడ న్యాయవాది శ్రీ  దంటు శ్రీనివాస శర్మ గారికీ సంబంధం వుండేది. మా సుబ్బయ్య తాతగారు సతీ సమేతంగా కొన్నాళ్ళు ఆశ్రమంలోనే కాపురం పెట్టారు.  ఆ  స్వాములవారు కొన్నాళ్ళు మండాలపేటలోను ఆ తరువాత కొవ్వూరులోను వున్నారు. పూరీ గోవర్ధన మఠం పీఠాధిపతి గా కూడా వున్నారు. ఆయన నిర్మించిన శివాలయం ఇప్పుడు శిధిలావస్థలో వుంది. కాశీ నుంచి తెచ్చిన శివ లింగాన్ని అక్కడ ప్రతిష్టించారు.(ఈ మధ్యనే మా రెండో తమ్ముడు భండారు రామచంద్రరావు పూనిక వహించి ఆ గుడిని  ఓ మేరకు అభివృద్ధి చేసి ఒక  పూజారిని నియమించి ఆ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా కొంత మొత్తం పంపుతున్నాడు) ఆశ్రమం మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఆలయానికి ఇచ్చిన పొలం ప్రభుత్వం తీసుకుని ఆ  ప్రదేశంలో షెడ్యూల్డ్ కులాలవారికోసం ఒక పెద్ద కాలనీ నిర్మించింది. మొత్తానికి మా పూర్వీకులు దానం చేసిన స్థలం ఒక సత్కార్యానికి ఉపయోగపడడం సంతోషదాయకం. పునరుద్ధరించిన ఆలయానికి మా తమ్ముడు  రామచంద్ర రావు ట్రస్టీగా వున్నాడు.

(మరో భాగం మరో సారి) 

భండారు వంశం (నిన్నటి తరువాయి)

(నిన్నటి తరువాయి)
(ఈ భాగం నుంచి ఓ సాహసానికి పూనుకుంటున్నాను. ఇంతవరకు మా పెద్దన్నయ్య కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారు రాసి భద్రం చేసిన ‘భండారు వంశం’ రచనను ఏరోజుకారోజు పోస్ట్ చేస్తూ  వచ్చాను. నిన్నటితో, ఆయన రాసిపెట్టినది పూర్తయింది.  నేను మా వూళ్ళో వున్నది చాలా తక్కువ. చిన్నప్పుడే చదువుకోసం బెజవాడలో మా అక్కయ్య  దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడప్పుడు సెలవుల్లో మా వూరు  వచ్చేవాడిని. మా అన్నయ్యకున్న ధారణశక్తి నాకులేదు. అయినా ధైర్యం చేసి దీన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాను.)    

కంభంపాడు గ్రామంతో ముడిపడివున్న మరో పేరు చామర్తి వీరభద్రరావు గారు. ఆయన ఒక రకంగా ఈ మారుమూల కుగ్రామానికి ఆధునిక హంగులు అద్దారని చెప్పవచ్చు. వారి పూర్వీకులది ఖమ్మం జిల్లా సూర్యాపేట దగ్గరలోని వూరు. ఈయన,  తల్లి లలితమ్మ గారి  కడుపులో ఉండగానే, గ్రామకక్షల కారణంగా  ప్రత్యర్ధులు వీరభద్రరావు గారి తండ్రిని హత్య చేయడంతో భయపడిపోయిన  ఆవిడ మా వూరు వచ్చేసింది. వీరభద్రరావు గారు భోలా మనిషి. కళా ప్రియుడు. నాటకాలు వేసేవారు. బెజవాడ వెళ్లి రకరకాల భంగిమల్లో తీయించుకున్న ఫోటోలు అనేకం వాళ్ళింట్లో ఉండేవి. అప్పట్లో అందరివీ మట్టి ఇళ్ళు.  షాబాదు  బండలు పరిచిన మొదటి ఇల్లు ఆయనదే.


(కీర్తిశేషులు చామర్తి వీరభద్రరావు గారు) 

పంచెకట్టు అలవాటయిన వూళ్ళో పంట్లాముల  (ప్యాంట్లు) సంస్కృతి ప్రవేశ పెట్టింది కూడా ఆయనే. ప్యాంటులో చొక్కా దోపుకుని (ఇన్ షర్ట్ వేసుకుని) బూట్లు వేసుకుని తిరుగుతుంటే అంతా సినిమా నటుడ్ని చూసినట్టు కళ్ళార్పకుండా నిలబడిపోయేవారు. చక్కటి ఆకర్షణీయమైన విగ్రహం. అలాగే, వూళ్ళో మొట్టమొదట రేడియో కొన్నదీ ఆయనే. ఇప్పుడు కార్లలో వాడే పెద్ద ఎక్సైడ్ బ్యాటరీతో పనిచేసేది. ఆ రోజుల్లో అదో అద్భుతం. చిన్న పెట్టెలోనుంచి పాటలు, మాటలు వినబడుతుంటే వూళ్ళో వాళ్ళు భయంతో బిక్కచచ్చిపోయేవాళ్ళు. భానుమతి పాటలంటే ఆయన చెవి కోసుకునేవాళ్ళు. బెజవాడ వెళ్లి సినిమా చూసొచ్చి ఆయన చెప్పే కబుర్లే వూళ్ళో వాళ్లకి మంచి కాలక్షేపం. హార్మనీ పెట్టె ముందు పెట్టుకుని రాగాలు తీస్తూ పద్యాలు పాడేవారు. ఆయన ఇల్లంతా ఎప్పుడూ నాటకాలు ఆడేవాళ్ళతో, రిహార్సల్స్ తో చాలా సందడిగా వుండేది. చిన్నాపెద్దా తేడా లేకుండా, కులాల పట్టింపులు లేకుండా   వూళ్ళో అందరితో బాగా కలివిడిగా వుండేవారు. మా వూరికి మొదటి సారి కరెంటు వచ్చినప్పుడు వీధి దీపం కింద నిలబడి ఆయన సంతోషంతో డాన్స్ చేయడం అందరికీ గుర్తు. ఇక లలితమ్ముమ్మ మా బామ్మగారికి మంచి దోస్తు. ప్రతి రోజూ సాయంకాలం కర్ర పొడుచుకుంటూ మా ఇంటికి వచ్చి బామ్మతో ముచ్చట్లు చెబుతుండేది. వయస్సు మీదపడి నడవలేని రోజుల్లో కూడా ఒక చిన్న చెక్కబండిమీద ఆమెను కూర్చోబెట్టి లాక్కుంటూ తీసుకువచ్చేవారు. బామ్మ తన మంచం మీద. లలితమ్ముమ్మ ఆ మంచం  పక్కనే ముక్కాలు పీట మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే దృశ్యం ఇప్పటికీ కళ్ళల్లో కదలాడుతుంది. వాళ్ళు పోయారు కాని వాళ్ళ జ్ఞాపకాలు మిగిలాయి.
ఇంకో విశేషం ఏమిటంటే వీరభద్రరావు గారి పెద్దమ్మాయే మా రెండో వొదినె గారు శ్రీమతి విమలాదేవి, మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి భార్య.    
(మరో భాగం మరో సారి)              

4, ఆగస్టు 2013, ఆదివారం

కేసీఆర్ చెప్పిన భద్రాచలం కధ


కేసీఆర్ ని దగ్గరగా చూసి తొమ్మిదేళ్ళు అయిందేమో. 2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు సరిగా గుర్తులేదు కాని కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గురించి చెప్పడానికి అనుకుంటా బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసిన గుర్తు. మధ్యలో కొంత ఎడం వచ్చింది కాని నేను మాస్కో వెళ్ళాక మునుపు కేసీఆర్ ఎన్టీయార్ క్యాబినెట్ లో రవాణా శాఖ  మంత్రిగా వున్నప్పుడు తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి  పేషీ వుండే ‘సమత’ బ్లాక్ పక్కనే మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్  కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు.  ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఏమీ వున్నట్టు లేదు.  సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసివచ్చిన రాజకీయ ప్రముఖులు విలేకరులతో నిలబడి మాట్లాడే మీడియా పాయింటు ఆ ప్రదేశంలో వుంది.
ఈరోజు మధ్యాన్నం వీ సిక్స్ టీవీ నుంచి ఫోను వచ్చింది. ఏదయినా అంశం మీద ‘బైట్’ కోసమేమో అనుకున్నా. తీరా చూస్తే క్రాంతి గారు. ఇలాటి వాటికి ఆయన ఫోను చేయాల్సిన అవసరం లేదు. వేరేవాళ్ళు ఇందుకోసం వున్నారు.
క్రాంతి చెప్పారు. ‘కేసీఆర్ కాసేపట్లో తాజ్ డెక్కన్ హోటల్ కు వస్తారు. మీట్ ది ప్రెస్ ప్రోగ్రాం. తప్పకుండా రండి. అదయిన తరువాత కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి’
రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మీట్ ది ప్రెస్ కాబట్టి బయలుదేరి వెళ్లాను
.

(కేసీఆర్ మీట్ ది ప్రెస్ లో జ్వాలా, నేనూ, హెచ్.ఎం.టీ.వీ. శ్రీ ధర్ బాబు - ఫోటో భరత్ భూషణ్ సౌజన్యం)    

హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ ఆర్ ఎస్ నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతొ కూడా కరచాలనం చేసారు. ఓ క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను.
సరే! ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. సభికులు అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశం లా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని ‘మాటల మాంత్రికుడు’ అంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్నదీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు – ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో చెప్పినవే అయినా – వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు ‘ప్రత్యక్షప్రసారం’లో చూస్తున్న మిత్రుడు ఒకరు ఎస్ ఎం ఎస్ పంపారు. ఆయన ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెప్పినంతగా యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ గొడవలే ఉండేవి కావన్నది దాని తాత్పర్యం. అన్నీ ఇక్కడ ప్రస్తుతం కాని భద్రాచలం సంగతేమిటి అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని వివరించారు. వెనుక అది తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రటిష్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు  ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం – ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.
సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఎవేవో పదార్ధాలు ఆయనకు వడ్డించబోతే, వద్దు ఇంత అన్నం, పప్పూ పట్టుకు రమ్మన్నారు. సింపుల్ భోజనం. ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు.

మొత్తానికి చాలా రోజుల తరువాత జీవితం విభిన్నంగా గడిచినట్టనిపించింది. పోనీలే మంచిదే అనుకున్నాను. (04-0802013)                                     

భండారు వంశం

(నిన్నటి తరువాయి)

మా రెండవ చిన తాత వెంకట సుబ్బారావు గారు. ఈయన ఆధ్యాత్మిక దృక్పధం కలవాడు. జాలిగుండె. ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు. కోపం కూడా ఎక్కువే కాని అది తాటాకు మంట లాటిది. ఇట్టే ప్రజ్వరిల్లినా మళ్ళీ అట్టే చల్లరిపోయేది. చిన్నతనంలో చాలా దుడుకు మనిషి అని పేరు కాని పెద్దయిన తరువాత  చాలా మారిపోయాడు.


(సుబ్బయ్య తాతయ్య ఆయన శ్రీమతి సీతం బామ్మ - మధ్యలో వారు దత్తత తీసుకున్న మా రెండో తమ్ముడు  శ్రీ భండారు  రామచంద్ర రావు) 


శారీరకంగా కూడా దృఢమయిన మనిషి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల్లోను ఈయన ఒక్కరే బలంగా ఉండేవాడు. మిగిలిన ఇద్దరు శారీరకంగా అర్భకులు అనే చెప్పాలి. మొదట్లో ఆయనకు కాఫీ అంటే గిట్టేది కాదు. మా నాన్నగారు కాఫీని మొదటిసారి మా వూళ్ళో ప్రవేశపెట్టారనవచ్చు. లేకపోతే పర్చా రంగారావు గారో. మా ఇంట్లో కాఫీ పొడి మిషన్ వుండేది. మా  నాన్నగారు బెజవాడ వెళ్లి కాఫీ (గుండ్లు) గింజల్ని కొనుక్కుని వచ్చి వాటిని వేయించి, ఏరోజుకారోజు  ఆ మిషన్లో వేసి చేత్తో తిప్పితే, కొంత బరకగా వున్నా, మొత్తం మీద  కాఫీ పొడుం తయారయ్యేది. ఆరోజుల్లో ఫిల్టర్లు లేవు. వేన్నీళ్ళలో కాఫీపోడుం వేసి మరిగించి గుడ్డలో వడపోసి పాలూ పంచదార వేసుకుని ఇత్తడి జాంబు (గ్లాసు)లో పోసుకుని తాగేవారు. మా నాన్నగారే పొద్దున్నే లేచి కాఫీ పెట్టుకుని తానూ తాగి కొంత మా అమ్మగారికి ఉంచేవారు. కానీ, సుబ్బారావుగారికి (వూళ్ళో సుబ్బయ్యగారనే వారు) చెప్పానుకదా, కాఫీ అంటే చుక్కెదురు. ఆయనకు ఆరోగ్య సూత్రాల మీద మమకారం జాస్తి. శుభ్రం ఎక్కువ. అన్నం తినగానే కాని ఏదయినా పలహారం చేసిన తరువాత కాని నోట్లో నీళ్ళు పోసుకుని చాలాసేపు పుక్కిలించేవాడు. అందర్నీ అలాగే చేయాలని శాసించేవాడు. మాకేమో అదంతా చాదస్తంలా అనిపించేది. బయట ఊళ్లకు వెళ్ళినప్పుడు ‘లా’ పుస్తకాలు కొనుక్కొచ్చి వూళ్ళో తీర్పులు చెప్పేవాడు. మా వూళ్ళో మొదట గ్రామ ఫోన్ కొన్నది ఆయనే. జావళీలు, కీర్తనలు అంటే చెవి కోసుకునేవాడు. ముక్క అర్ధం కాకపోయినా వూళ్ళో వాళ్ళందరూ ఆ గ్రామ ఫోన్ పెట్టె చుట్టూ మూగి, గ్రామఫోన్ ప్లేటు తిరుగుతూ పాట వినిపిస్తుంటే నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోతుండేవారు. కొందరు దాన్ని ‘దెయ్యపు పెట్టె’ అనే వాళ్ళు. ఎవరో కంటికి కనబడకుండా ఆ పెట్టెలో కూర్చుని ఆ పాటలు పాడుతున్నారని అనుమానంగా చూసేవారు.

(మరో భాగం మరో సారి)                                                                                            

3, ఆగస్టు 2013, శనివారం

సంయమనం నేటి అవసరం


ఈరోజు (03-08-2013) శనివారం సాయంత్రం హైదరాబాదు శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో  రాష్ట్ర విభజన అంశంపై హెచ్.ఎం.టీ.వీ. నిర్వహించిన ప్రత్యేక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నేను చేసిన సూచనలు:



“రెండు నిమిషాల్లో ముగిస్తానన్న హామీతో మొదలు పెడుతున్నాను. ఆ హామీ నిలబెట్టుకుంటానన్న హామీ కూడా ఇస్తున్నాను.   
“హెచ్.ఎం.టీ.వీ. బాధ్యతాయుతమైన మీడియా పాత్ర నిర్వహిస్తోంది. సంతోషం. నిజానికి ఇది నేటి అవసరం కూడా. Need of the Day.
“చాలామంది మాట్లాడారు. చక్కని సూచనలు చేసారు. విలువైన సలహాలు ఇచ్చారు.
“నేను సలహాలు చెప్పదలచుకోలేదు. మరో నాలుగురోజుల్లో – ఏడో  తేదీకి  నాకు 68 ఏళ్ళు నిండుతాయి కనుక సలహాలు ఇచ్చే వయస్సు వున్నా, అనుభవం లేదు కాబట్టి కొన్ని సూచనలు మాత్రమే చేస్తాను.
“గతం గురించీ, వీలయితే వర్తమానం గురించి మరచిపోదాం. గతంలో ఏం జరిగిందన్న దాన్ని గురించి వర్తమానంలో చర్చించుకోవడం వల్ల భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుంది. కాబట్టి, గతాన్ని, వర్తమానాన్ని కొన్నాళ్ళు పక్కన బెట్టి భవిష్యత్తు గురించే ఆలోచిద్దాం.
“జరిగిన ‘నిర్ణయం’ గురించి తవ్వుకోవడం వల్ల వొరిగేదేమీ వుండదు. కాకపోతే నిర్ణయం తీసుకోవడం బాగా ఆలస్యంగా, చాలా అనూహ్యంగా జరగడం వల్లనే ఈ పరిస్తితి ఉత్పన్నమైంది. సరైన సమయంలో సరయిన నిర్ణయం అంటూ  ఏండ్లూ పూండ్లు నానుస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇకనుంచి అయినా బాధ్యత తీసుకోవాలి. ఢిల్లీ లో కూర్చుని వూరికే ప్రకటనలు చేస్తూ కూర్చుంటే కుదరదు. కేంద్ర హోమ్  మంత్రి గారు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తామన్నారు. అసలు ఈసరికే ఆయన రాష్ట్రంలో మకాం పెట్టి వుంటే బాగుండేది.
“నిర్ణయం అమలు జరిగే తీరు పట్ల కొందరిలో అనుమానాలు, భయ సందేహాలు వున్నాయి. సహజం కూడా. వీలైనంతవరకు వాటన్నిటిని వీలైనంత త్వరగా – పరిస్తితులు పూర్తిగా చేయిదాటక ముందే నివృత్తి చేయాలి. మీన  మేషాలు లెక్కిస్తూ కూర్చునే వ్యవధానం లేదు.
“చివరిగా ఒక మాట.
“మాట పెదవి దాటితే పృధివి దాటుతుంది. అంచేత, రానున్న కొద్ది మాసాలు అందరూ సంయమనం పాటించాలి. ఇతరులు పాటించాలని డిమాండ్ చేయడం కాదు. అది ఎవరికి వారు బాధ్యతగా తమ నుంచే ప్రారంభించాలి.
“రాజకీయ నాయకులు టీవీ ఛానళ్లతో మాట్లాడేటప్పుడు సాధ్యమైనంతవరకు రాసుకొచ్చిన ప్రకటనలనే చదివి వినిపించాలి. ఇందులో భేషజాలకు తావుండకూడదు. ఏదైనా అనేసి – ఆ తరువాత తీరిగ్గా – అల్లా మాట్లాడ్డం మా ప్రాంతంలో మామూలు  అంటే సరిపోదు. అలాటివాటిని సాధారణ సందర్భాలలో ఎవరూ పట్టించుకోరు. కాని ఇప్పుడు అలా కాదు. మాటలు తూటాలవుతాయి. అందుకే ప్రతి మాటా బంగారం తూచినట్టు బేరీజు వేసుకుని, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి.
“రెండు నిమిషాలు అయిపోయాయి. ఇక  ముగిస్తున్నాను.”

-భండారు శ్రీనివాసరావు (03-08-2013)                      

భండారు వంశం

(నిన్నటి తరువాయి)

మగవాళ్ళ మధ్య ఇంతగా వైరాలు నడుస్తున్నా, పిల్లలు కలిసి ఆడుకోవడానికి కాని, ఆడవాళ్ళు కలిసి మంచి నీళ్ళ బావికి వెళ్ళడానికి కాని, మధ్యాహ్నం వేళల్లో కలిసి కూర్చుని కాలక్షేపానికి పచ్చీసు ఆడుకోవడానికి కాని మగవాళ్ళు అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. లక్ష్మయ్య తాతయ్య గారి భార్య వరలక్ష్మి ( అంతా వరమ్మగారనేవారు, మేమంతా వరం బామ్మ అనేవాళ్ళం) ఎంతో ఆప్యాయత, ఆపేక్ష కలకలిగిన  మనిషి. మమ్మల్నీ, వాళ్ళ పిల్లల్నీ సమంగా చూసేది. మా నాన్నగారికి మేము పదకొండుమందిమి. ఏడుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలం. మా ప్రసాదం బాబాయి గారికి ఒక్కడే కొడుకు సత్యమూర్తి. ఆడపిల్లలు ఇద్దరు – సుగుణ, మధుర. మేమంతా ఎంతో స్నేహంగా, కలివిడిగా వుండేవాళ్ళం. నేనూ (పర్వతాలరావు) సత్యమూర్తి అన్నయ్య  చాలా  స్నేహంగా వుండేవాళ్ళం. మా రెండిళ్ళ నడుమ తగాదాలను గురించి మేం కాలేజీలో చదివేటప్పుడు తరచూ చర్చించుకునేవాళ్ళం. ‘మనం పెద్దవాళ్ళం అయిన తరువాత అలాటి గొడవలను ఇక ససేమిరా రానీయ వద్దు’ అని దీక్ష పూనాం కూడా. ఆవిధంగానే, తగాదాలు, గొడవలు అన్నీ పెద్దవాళ్ళతోటే పోయాయి.


(కీర్తిశేషులు శ్రీ భండారు సత్యమూర్తి)

సత్యమూర్తి  అన్నయ్య మాకే కాక ఊరంతటికీ పెద్ద అండగా ఉండేవాడు. సహాయకారి. పైపెచ్చు ధైర్యశాలి కూడా. దేనికీ భయపడే తత్వం కాదు. రాజకీయాల్లో తిరిగినా, హింస, దౌర్జన్యాలకు తావులేకుండా సామరస్య పూర్వకంగా వ్యవహారాలు నడిపేవాడు.  మా వూరి పంచాయతీకి మొట్టమొదటి సర్పంచ్ గా పనిచేసాడు. గ్రామాభివృద్ధికి బాగా పాటుపడ్డాడు. కాకాని వెంకటరత్నం గారికి ఏకలవ్య శిష్యుడు. చదువుకోసం వెళ్ళిన నన్ను తప్పిస్తే ఆయనే మా వూరునుంచి  హైదరాబాదు వ్యవహారరీత్యా వెళ్లి వచ్చిన మొదటి వాడు. ఆయన హైదరాబాదులో బస్సు దిగి నేరుగా ఖైరతాబాదులో, కాకాని వెంకట రత్నం గారు మంత్రిగా వున్న ఇంటికి వెళ్ళిపోయేవాడు. వూరికి తిరిగి వచ్చిన తరువాత ‘హైడ్రాడ్’ (ఆయన ఉచ్చారణ అలానే వుండేది) విశేషాలను వైన వైనాలుగా వివరంగా చెప్పేవాడు. ఊరివారందరు గుమికూడి ఆ సంగతులన్నీ ఆసక్తిగా వినేవారు. ఊళ్ళోకి కరెంటు తీసుకు రావడానికి, రోడ్డు పడడానికి ఎంతో శ్రమ పడ్డాడు. గుండె జబ్బుతో ఆయన అకాల మరణం చెందకపోతే, మా వూరికి ఆయన తిరుగులేని నాయకుడిగా ఉండేవాడు. వూళ్ళో కలిగిన వాళ్ళే కాకుండా బీదాబిక్కీ కూడా ఆయన్ని విపరీతంగా అభిమానించేవారు. ఆయన చనిపోయినప్పుడు వారంతా తాము దిక్కులేని వాళ్ళు అయిపోయినట్టు దుఖించారు. ఆయన మృత దేహాన్ని మోసే హక్కు  మీకే కాదు మాకూ వుందని ఇంటి వాళ్ళతో పోట్లాడి చివరకు అందరు కలసి స్మశానానికి తీసుకువెళ్ళి దహనం చేసారు. మేమందరం నిమిత్తమాత్రులుగా చూస్తూ ఉండిపోయాం. ఆరోజుల్లో స్మశానాలకు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కాని అదేమిటో ఆ రోజు వూరు వూరంతా తరలివచ్చింది. అక్కడ కులబేధం అని కాని, చిన్నా పెద్దా అని కాని  లేకుండా అంతా ఆయన చితిలో కట్టెపుల్లలు వేయడానికి తొక్కిసలాడారు. ‘మేమంతా ఆయన పిల్లలమేగా, ఆయన చితికి నిప్పంటించే కర్తవ్యం మాకు లేదా’ అంటూ షెడ్యూల్డ్ కులాలవారు పెద్దగా ఏడుస్తూ  ఆయన చితిపై కొరవులు వేయడం అందరి హృదయాలను కదిలించింది. అంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న సత్యమూర్తి అన్నయ్య ధన్యజీవి. చిరంజీవి. ఇప్పటికీ గ్రామంలో ఏదయినా సమస్య తలెత్తితే ‘ సత్యమూర్తి గారు ఉంటేనా ..’ అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది.
(మరో భాగం మరో సారి)

Confidence is the need of the hour

The Congress decision to finally create a separate Telangana state is welcome.
But it seems to have been taken in a hurry.
The Congress High Command has not prepared the Seemandhra leaders in this regard. Even the Congress MPs and Ministers of either region have no clue.
Now the Seemandhra region is on the boil and the leaders are not in a position to face it.
Nevertheless, it is necessary for the people in that part of the State to restrain themselves in registering their protests which should be done in a democratic way.
The Centre should also take special responsibility immediately to create confidence among the people of both the regions.
They just can't make some announcements on the division of the State and keep quiet.
Immediate efforts should be made at the highest authoritative level to dispel genuine doubts of the affected people regarding location of the capital, funds allotment, water distribution, etc. A government-level mechanism has to be set up for this pur pose. Let the MPs, MLAs, Ministers and leaders of all parties come out and tell the people about their plan of action. Mere resignations will not serve the purpose. At the same time, let there be clarity on Hyderabad as joint capital and its operation.
Our State leaders, irrespective of their party affiliations, need to learn, at least now, from the leaders of neighbouring States like Tamil Nadu, Karnataka and Maharashtra. In spite of their political differences, they get united when they have to fight with the Central Government on issues that benefit the people in their respective States. They show immense solidarity and strength for effective bargain. It is a pity that similar unity is lacking among our leaders.

Bhandaru Srinivas Rao,  Yellareddyguda,Hyderabad (03-08-2013)