29, నవంబర్ 2011, మంగళవారం

ఒక మహర్షి అస్తమించాడు



కీర్తిశేషులు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారు 


ఈ రోజు నిజంగా దుర్దినం. స్వార్ధాన్ని జయించిన ఒక వ్యక్తి ఈ స్వార్ధ సంకుచిత ప్రపంచం నుంచి నిష్క్రమించాడు. తొమ్మిదిపదుల వయస్సు దాటిన  తరువాత  కాలు విరిగి కోలుకుంటున్నారు అన్న దశలో అందరిని హతాశులను చేస్తూ అస్తమించాడు. జీవన మార్గంలో అనేకమందికి నడక నేర్పిన మనిషికి నడక దూరమవడం విధి వైపరీత్యం. తన జీవితాన్ని చమురుగా మార్చి ఎన్నో ఇళ్ళల్లో దీపాలు వెలిగించిన ఆ మహా జ్యోతి ఆరిపోయింది. ఆఖరి చూపులు అందడం కోసం హడావిడిగా విజయవాడ  వెడుతూ ఆ మహానీయుడుకి అర్పిస్తున్న అశ్రు నివాళి.  
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
(29-11-2011)

28, నవంబర్ 2011, సోమవారం

తోట్లవల్లూరును మరచిపోలేను. - డాక్టర్ నోరి దత్తాత్రేయుడు



క్షణం తీరికలేని మనిషికి దొరికిన మధుర క్షణాలు. - భండారు శ్రీనివాసరావు

అనుక్షణం వార్తలమధ్య గడిపే జర్నలిష్టులను ప్రతిరోజూ  పత్రికల్లో వచ్చే వార్తలు అంతగా ఆకట్టుకోవు. కానీ, నవంబర్ ఇరవై ఐదో తేదీన ఈనాడు లో పడ్డ  వార్తను చూసి,  లోగడ ఆలిండియా రేడియో, దూర దర్శన్ లలో  న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన ఆర్.వీ.వీ. కృష్ణారావు కాసేపు చకితులయ్యారు. దానికో కారణం వుంది. అది తెలుసుకోవాలంటే అంతకు ముందు శనివారం నాడు హైదరాబాదులో  జరిగిన ఒక పెళ్లి. అది చెప్పుకునే ముందు ఈనాడులో పడ్డ వార్త సారాంశం తెలుసుకుందాం.

తోట్లవల్లూరును మరచిపోలేను.


డాక్టర్ నోరి దత్తా త్రేయుడు 


(తోట్లవల్లూరు, న్యూస్ టుడే-  కేన్సర్ చికిత్సలో ప్రపంచ ప్రఖ్యాత  కీర్తి గడించిన  డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గురువారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో పర్యటించి తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను చిన్నప్పుడు నివసించిన ఇంటిని సాంబశివరావు కొనుగోలు చేసి కొత్తగా  నిర్మించుకున్న ఇంటికి వెళ్లి అంతా  కలయతిరిగిచూసారు. ‘ఇక్కడో బావి వుండాలే!’ అని ఆ ఇంట్లోవారిని వాకబు చేశారు.   పమిడిముక్కల మండలం ఘంటాడలో తాను జన్మించినా, కుటుంబ సభ్యులతో చిన్నతనంలో  గడిపిన తోట్లవల్లూరును జీవితంలో మరచిపోలేనని చెప్పారు. తనకు నామకరణం చేసిన కలగా పూర్ణచంద్ర శాస్త్రి ఇంటివద్ద కొద్దిసేపు గడిపి వేణుగోపాలస్వామి ఆలయంలో  అర్చకులు ప్రసాదంగా ఇచ్చిన చిట్టి గారెలు తిని దాదాపు యాభై అరవై  ఏళ్ళ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.)

ఈ వార్త కళ్లబడగానే  కృష్ణారావు గారికి నెప్పల్లి  ప్రసాద్ గారి అబ్బాయి పెళ్ళిలో జరిగిన సంఘటన సినిమా రీలులా కళ్ళముందు కదలాడింది.
ప్రసాద్ గారు అమెరికాలో పేరుమోసిన చార్టర్డ్ అక్కౌంటెంట్. వారి ఆహ్వానం మేరకు కృష్ణారావు గారు ఆ పెళ్ళికి వెళ్లారు. అక్కడ ఆయనకు  వూహించని అతిధి తారసపడ్డారు. ఆయనే నోరి దత్తాత్రేయుడు గారు. ఆయన హస్తవాసికి తిరుగులేదు. క్షణం తీరికలేని వైద్యులు. కేన్సర్ రక్కసి పీచమడిచే పనిలో పడి దేశదేశాలు తిరుగుతుంటారు. ఇటీవల సోనియా గాంధీ గారికి వైద్యం చేసిన డాక్టర్ల  బృందానికి ఆయనే నేతృత్వం వహించారని పత్రికల్లో  వచ్చింది.  దత్తాత్రేయుడి గారికి  నెప్పల్లి ప్రసాద్ గారు  అత్యంత ఆత్మీయులు. అందుకే వారి కుమారుడి వివాహానికి అమెరికానుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. వారిని పెళ్ళిలో చూడగానే కృష్ణారావు గారికి చిన్నప్పటి తోట్లవల్లూరు సంగతులు మదిలో మెదిలాయి. దత్తాత్రేయుడు గారి కుటుంబం, కృష్ణారావు గారి కుటుంబం యాభయ్ , అరవై ఏళ్ళనాడు ఆ వూళ్ళో ఒకే ఇంట్లో నివాసం వుండేవి. చిరకాలం నాటి  బాల్య మిత్రుడు అన్నేళ్ల తరువాత   తారసపడగానే కృష్ణారావు గారు ఆయనతో మాటలు కలిపారు. మాటల మధ్యలో తోట్లవల్లూరు సంగతి ఎత్తారు. పెళ్ళిలో నలుగురి మధ్యవున్న కారణంగానో యేమో ఆయన  నుంచి వెంటనే  స్పందన కాన రాలేదు. అయినా కృష్ణారావు గారు నిరుత్సాహ పడలేదు. పెళ్ళయిన తరువాతో అంతకు  ముందో కానీ, భోజనాల సమయంలో మరోసారి దత్తాత్రేయుడు  గారితో ముచ్చటించే వీలు చిక్కించు కున్నారు. చిన్నప్పటి సంగతులు కొన్ని  గుర్తు చేశారు. ఈ సారి ఆయన గుర్తుపట్టినట్టే అనిపించింది.
“ఎన్నో ఏళ్ళయింది తోట్లవల్లూరు వెళ్లి. మేము అమ్మేసిన ఇల్లెలా వుంది? వూరేలా వుంది ?” అని అడిగారు.
‘వీలయితే ఈసారి కలసివెడదాం’ అని కూడా అన్నారు.  
“కోట పోయింది. చదువుకున్న స్కూలు అలాగే వుంది. మనం ఆడుకున్న గుడీ అలానే వుంది. పక్కన కృష్ణానది అందరి  జ్ఞాపకాలను వొడిలో దాచుకుని అలాగే పారుతోంది.” బదులు చెప్పారు.
అంతటితో ఆగలేదు. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు, మసలిన మనుషులు అన్నింటినీ  గుర్తుచేశారు.
“వేణుగోపాలస్వామి ఆలయం, గుళ్ళో ప్రసాదంగా పెట్టే చిట్టిగారెలు, కట్టు పొంగలి రుచి, వాళ్లు వున్న ఇల్లు, ఇంటి ముందు గిలక బావి, దొడ్లో బాదం చెట్టు” ఇలా ఒకటేమిటి గుర్తుకొచ్చినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పేశారు కృష్ణారావు గారు.
విందు పూర్తయింది. పెళ్లయిపోయింది. ఇంటికి తిరిగివచ్చిన తరువాత కూడా కృష్ణారావు గారికి తోట్లవల్లూరు గురించిన తలపులు వొదలలేదు. అది ఆయన సొంత వూరు  కాకపోయినా, దత్తాత్రేయుడు గారి మాదిరిగానే కృష్ణారావు గారికి కూడా ఆ వూరితో మరచిపోలేని అనుబంధాలు, జ్ఞాపకాలు అనేకం వున్నాయి.
కృష్ణారావు గారి నాన్న గారు రాయసం గంగన్న పంతులు గారు. దేవాదాయ శాఖలో ఉద్యోగి. చిన్న చిన్న దేవాలయాలను పర్యవేక్షించే అధికారి. బదిలీ మీద కుటుంబాన్ని వెంట తీసుకుని తోట్లవల్లూరు వెళ్లారు.
ఆ వూళ్ళో నోరి సత్యనారాయణ గారింట్లో ఓ వాటా అద్దెకు తీసుకున్నారు.
సత్యనారాయణ గారికి   నలుగురు కుమారులు. పెద్దబ్బాయి  నోరి రాధాకృష్ణ మూర్తి గారు. ఐ.పి.ఎస్. అధికారి. పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గానో ఆ పై పదవిలోనో రిటైర్ అయ్యారు. పోలీసు ఉద్యోగంలో చేరక మునుపు ఆయన బందరు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేవారు.
రెండో కుమారుడు ఎన్.మధురబాబు గారు. స్టేట్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామీణ బ్యాంకుల  వ్యవస్థలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొల్పిన మొట్టమొదటి గ్రామీణ  బ్యాంక్ – నాగార్జున గ్రామీణ బ్యాంక్ కు మొదటి  చైర్మన్ గా పనిచేసి సమర్ధుడయిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జ్యోతిష శాస్త్రంలో కూడా దిట్ట, మూడో కుమారుడు రామతీర్ధ కాగా కనిష్ట  కుమారుడు నోరి దత్తాత్రేయుడు గారు. చిన్నప్పుడు ‘దత్తు’ అని పిలిచేవాళ్ళు.
కొత్త వూరిలో కృష్ణారావుగారికి కొత్త స్నేహితులు లభించారు. ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. ‘అమ్మా నాన్నా ఏదయినా పనిమీద బెజవాడ  వెళ్ళాల్సి వస్తే ఆ నాలుగు రోజులు తన భోజనం పడకా కూడా నోరి  వారింట్లోనే’ అని కృష్ణారావు గారు నాతో  ఈ విషయాలు చెబుతూ గుర్తు చేసుకున్నారు.   
వారి తండ్రిగారి అకాల మరణం తరువాత నోరి వారి మకాం బందరుకు మారిపోయింది.
కృష్ణారావు గారు మాత్రం తండ్రిగారి  ఉద్యోగరీత్యా  తోట్లవల్లూరులోనే మరికొంత కాలం గడిపారు.
ఆ నాటి రోజులు గురించీ, అప్పటి వాతావరణం గురించీ ఆయన మాటల్లోనే.              
‘నదికి ఆనుకునే కాలవ. బెజవాడ నుంచి లాంచీలు తిరుగుతుండేవి. శివ కామేశ్వరి, శివ పార్వతి, గంగ వాటి పేర్లు.         
‘నోరి వారి కుటుంబం యావత్తూ కుసుమ హరనాధ బాబా భక్తులు.  ఇంట్లో  రోజూ భజనలు. పూజలు. తండ్రి చని పోయిన తరువాత వారి కుటుంబం బందరు వెళ్ళగానే ఆ వాటాలోకి అప్పయ్య శాస్త్రి గారు అద్దెకు దిగారు.
‘తోట్లవల్లూరులో వాళ్లు వున్న ఇల్లు బాగా పెద్దదేమీ కాదు. ఉత్తర ముఖంగావున్న ఆ ఇంటి ముందు గిలక బావి. దొడ్లో బాదం చెట్టు. కుడి పక్క  తాడికొండ వారి నివాసం. ఆ ఇంట్లోనే రామమందిరం. దాపునే తోట్లవల్లూరు కరణం గారయిన అడిదం వారి ఇల్లు. మరోపక్క గోవిందరాజుల వాళ్లు వుండేవాళ్ళు. పోతే,  శివలెంక వీరేశ లింగం గారి  ఇల్లు కూడా పక్కనే. వీరేశ లింగం గారు పేరు మోసిన  పెద్ద జ్యోతిష్కులు. సినీ నటుడు   ముదిగొండ లింగమూర్తి గారి  వియ్యంకులు. మద్రాసునుంచి భానుమతి వంటి ప్రముఖ సినీ  కళాకారులు కూడా ఆయనను కలవడానికి తోట్లవల్లూరు వచ్చేవాళ్ళు. వీరేశలింగం గారి  అబ్బాయి ఎస్.వి.ఎం. శాస్త్రి గారు  దక్షిణ  మధ్య రైల్వేలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తోట్లవల్లూరులోని శివాలయానికి శివలెంక వారు అనువంశిక ధర్మ కర్తలు.
‘వూళ్ళో వున్న పెద్దగుడి వేణుగోపాలస్వామిది. ఆ గుడికి తగ్గట్టు  పెద్ద గాలి గోపురం. దాని మీద పావురాళ్ళు. వాటి రక్తం పూస్తే పక్షవాతం వంటి రోగాలు నయమవుతాయని చెప్పుకునే వాళ్లు. అది బొమ్మదేవరపల్లి  జమీందారులు కట్టించిన గుడి కావడం వల్ల వైభోగానికి  తక్కువలేదు. పూజలు, పునస్కారాలు, ప్రసాదాల వితరణ ఘనంగానే  జరిగేవి. తిరునక్షత్రం నాడు పులిహోర చేసేవాళ్ళు. పర్లాంగు దూరంలో  కృష్ణానది. ధనుర్మాసంలో ఆలయ అర్చకులు ఆ బావినుంచి మంగళ వాయిద్యాలతో తీర్ధపు బిందెలు తెచ్చేవాళ్లు. మా  పిల్లల  ఆటలన్నీ గుళ్ళో పొగడ చెట్టు కిందనే.
‘మా వీధి లోనే పోస్టాఫీసు. అన్నంభొట్లవాళ్లు టపా పని చూసేవారు. ఉయ్యూరు నుంచి ప్రతిరోజూ ఒక భారీ మనిషి  (పోస్టల్ రన్నర్) తపాలా సంచీ మోసుకుంటూ అయిదుమైళ్లు గబగబా నడుచుకుంటూ  తోట్లవల్లూరు వస్తుండేవాడు. పెద్ద పెద్ద అంగలు వేస్తూ, చేతిలో వున్న పొడుగుపాటి బల్లేన్ని నేల మీద పోటు  పొడుచుకుంటూ  అతగాడు నడిచివస్తుంటే ఆ బల్లెం పైన కట్టిన మువ్వలు అదోరకం శబ్దం  చేస్తుండేవి.
‘తోట్లవల్లూరు  జమీందారులు బొమ్మదేవర వంశీకులు వేణుగోపాలస్వామి దేవాలయానికి అనువంశిక ధర్మకర్తలే కాదు,  దానికి కర్తా కర్మా క్రియా అన్నీ వాళ్ళే.  జమీందార్ల దగ్గర ఏనుగుల్ని సంరక్షించే నాగయ్య అనే వ్యక్తి తరువాతి రోజుల్లో ఈ గుడి వ్యవహారాలూ కనిపెట్టి  చూసేవాడు. కృష్ణారావు గారి తండ్రి రాయసం గంగన్న పంతులు గారు ప్రభుత్వం తరపున అంటే దేవాదాయ శాఖ తరపున ఆలయం బాధ్యతలు  చూస్తుండే వారు. అప్పట్లో ఆయన నెల  జీతం  అరవై రూపాయలు. కరవుభత్యం కింద  ఇరవై రూపాయలు. పైన మరో అర్ధ రూపాయి. ఆ వూరి మొత్తంలో  నెలసరి అంత జీతం వచ్చేవాడు మరొకడు లేకపోవడం వల్ల అది చిన్న జీతంగా ఆయన ఎప్పుడూ భావించలేదు. కాకపొతే అంత జీతం అన్నది ఆయనకు వూళ్ళో ఒక ప్రత్యేకతను,అయాచిత  గౌరవాన్ని కట్టబెట్టింది.



గరుడవాహనంపై వేణుగోపాలస్వామి వారు 

(1955 లో తీసిన ఈ ఫోటోలో కుడి నుంచి రెండో వ్యక్తి ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్  అడిదెం కనక వీరభద్ర రావు గారు  మూడో  వ్యక్తి  రాయసం గంగన్న పంతులు గారు, స్వామి వారి పక్కన ఆలయం ప్రధాన అర్చకులు పరాంకుశం అప్పలాచార్యులు గారు. పోతే, కూర్చున్న వారిలో కుడివైపు మొదటి కుర్రవాడు ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు)     

‘ఆ రోజుల్లో బెజవాడ నుంచి  తోట్లవల్లూరుకు  ప్రైవేటు సర్వీసులవాళ్లు బస్సులు నడిపేవాళ్ళు. ఒకటి  రామాంజనేయ మోటార్ సర్వీస్, రెండోది గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్. బస్సులమీద ఆ  పేర్లు రాసివుండేవి. గోపాలకృష్ణా ట్రాన్స్ పోర్ట్  అని రాసి  పక్కనే ‘ఇన్ లిక్విడేషన్’ అని కూడా వుండేది. దాని అర్ధం ఇప్పటికీ తెలియదు. వీటిల్లో   రామాంజనేయా సర్వీసు బస్సు ఖచ్చితంగా  టైం ప్రకారం నడిచేది. ఒక బస్సు డ్రైవర్  పేరు సుబ్రహ్మణ్యం అని గుర్తు.
‘వెనుక బెజవాడ నుంచి  రావాలంటే చుట్టూ తిరిగి  రావాల్సివచ్చేది. ఇప్పుడు కృష్ణానది కరకట్ట మీదుగా హంసలదీవి దాకా రోడ్డు వేసారు. దాంతో  రాకపోకలు సులువయ్యాయి.
‘తోట్లవల్లూరులో  వున్న హైస్కూలే చుట్టుపక్కల వూళ్ళకు దిక్కు. వల్లూరిపాలెం నుంచి ఆడపిల్లలు  నడుచుకుంటూ స్కూలుకు వచ్చేవాళ్ళు. పక్కనున్న భద్రిరాజుపాలెం నుంచి కూడా చదువుకోవడానికి పిల్లలు  తోట్లవల్లూరు  రావడం గుర్తు.
‘వూళ్ళో గుర్రబ్బళ్లు  కూడా వుండేవి. ఒకరోజు బండి చక్రం కింద ఓ కుక్క పిల్ల నలిగి చనిపోవడం చూసిన పిల్లలకు ఆ రోజు అన్నం తినబుద్దికాలేదు.’
తోట్లవల్లూరు గురించిన  పాత సంగతులు  కృష్ణారావు గారికి  ఇంకా అనేకం గుర్తున్నాయని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకనిపించింది.
పెళ్ళిలో కలసి కాకతాళీయంగా  ఆయన    చెప్పిన నాలుగు ముచ్చట్లు నోరి దత్తాత్రేయుడి గారి తోట్లవల్లూరు పర్యటనకు ‘ప్రేరణ’ కావడం  నా ఈ రచనకు ‘ప్రేరణ’గా మారింది. (28-11-2011)   

    

25, నవంబర్ 2011, శుక్రవారం

కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు



కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు  
వార్త
ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘ఈనాడు-ఈటీవి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక  ప్రశ్న, దానికి సమాధానం ఇలా వున్నాయి.
ప్రశ్న: “పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి సంబంధాలున్నాయి?”
సమాధానం: “బాగున్నాయి. కాంగ్రెస్ దానంతట అది వోడించుకుంటుంది తప్ప వేరే పార్టీకి కాంగ్రెస్ ని వోడించే బలం లేదు.”  మేమంతా ఐకమత్యంగా ఉంటేనే తిరిగి గెలుస్తాం.
(నవంబరు శుక్రవారం నాడు ఈనాడు దినపత్రిక లో ప్రచురించిన ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ)
వ్యాఖ్య
“కుఠార మాలికాం దృష్ట్యా
కంపంతతి తరోవనే!
తత్ర వృద్ధ తరుహ్  ప్రాహుహ్
మామకోనాస్తి కిం భయం”
ఈ సంస్కృత శ్లోకానికి  తెలుగు అనువాదం:
“ఒకడు పది గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం “ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు  మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా!” అని అభయం ఇచ్చింది.
“అదీ కాంగ్రెస్ వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.”
(కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన ‘అప్పుడు –ఇప్పుడు’ గ్రంధం నుంచి)
25-11-2011                         

24, నవంబర్ 2011, గురువారం

ప్లస్ లూ - మైనస్ లూ


ప్లస్ లూ -  మైనస్ లూ  - భండారు శ్రీనివాసరావు


(ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి నేటికి (25-11-2011)  సరిగ్గా ఏడాది.)





కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో  కిరణ్ కుమార్ రెడ్డి సరయిన తరుణంలో ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.

కలసివచ్చిన అంశాలు.
1.)  ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించేనాటికి  మరో  మూడున్నరేళ్ల పాలనా  సమయం మిగిలి వుండడం
2.)  అంతకు ముందు పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు తన పార్టీకి చెందినవారే కావడం
3.)  సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏవిధమయిన మరకలు లేకపోవడం
4.) యువకుడు, విద్యాధికుడు కావడం
5.)  అధిష్టానం ఆశీస్సులు  
ఇక కలసిరాని అంశాలు :
1.)  తెలంగాణా సమస్య తీవ్రం కావడం
2.) జగన్ ప్రాబల్యం గురించిన ప్రచారం పెరిగిపోవడం
3.)  సీనియర్లు మొరాయించడం
4.)  జూనియర్లు ఠలాయించడం
5.) పరిష్కారం తన చేతిలో లేని తెలంగాణా వంటి సమస్యలు చుట్టుముట్టడం
6.) అధికారులమీదనే ఎక్కువ ఆధారపడుతూ క్యాంప్ ఆఫీసుకే పరిమితమై ఓ సీనియర్ బ్యూరోక్రాట్ మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న వదంతులను గట్టిగా ఖండించలేకపోవడం
సాఫల్యాలు :
1.)  శాసనసభ నియోజకవర్గంనుంచి శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో చతురత చూపి పార్టీకి వున్న బలాన్ని మించి  అదనంగా ఒక సీటు గెల్చుకోవడం 
 2.)  సకలజనుల సమ్మె సందర్భంగా రైల్  రోఖో కార్యక్రమాన్ని నీరుకారుస్తూ పోలీసులతో కలసి వ్యూహ రచన చేయడం
 3.)  ప్రభుత్వం పడకేసిందన్న నిందను సైతం లెక్కచేయకుండా అనవసరమయిన నిర్ణయాలతో లేనిపోని ఆరోపణలకు గురికాకుండా జాగ్రత్త పడడం
4.) మూడున్నరేళ్లు వ్యవధానం వున్న ముఖ్యమంత్రికి కావాల్సింది ప్రభుత్వం నిలుపుకోవడం కానీ ప్రజా సంక్షేమ పధకాలు కాదన్న రాజకీయ కౌశల్యాన్ని ప్రదర్శించి ‘నెంబర్ గేమ్ ‘ కు ప్రాధాన్యం ఇవ్వడం.
5.) ఏడాది పుణ్యకాలం హారతి కర్పూరంలా కరిగిపోయినా ముందు కుర్చీ పదిలం చేసుకున్న తరువాతనే సంక్షేమ పధకాలను వరుసగా ప్రకటించడం
6.) ముఖ్యమంత్రిని మార్చే అవకాశం లేకుండా వచ్చే ఎన్నికలవరకు తననే కొనసాగించేలా అధిష్టానం వద్ద మార్కులు సంపాదించడం
7.) సొంతపార్టీలో అసమ్మతి గళాలు విప్పిన నోళ్లతోనే భజన గీతాలు పాడించడం
ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి సొంత ప్రతిభకు తార్కాణాలయితే అయాచితంగా  కలసివచ్చిన అంశాలు మరికొన్ని వున్నాయి.
 1.) కోర్టు నిర్ణయాలవల్ల మారిన రాజకీయ వాతావరణం
2.) సీ బీ ఐ దర్యాప్తులతో రెండు ప్రధాన ప్రత్యర్ధి వర్గాలు మల్లగుల్లాలు పడుతుండడం
౩.) గత కాలపు చేదు అనుభవాల నేపధ్యంలో పార్టీ హై కమాండ్ ముఖ్యమంత్రి మార్పు గురించి ఆలోచించే పరిస్తితి లేకపోవడం
4.) ప్రత్యర్ధుల బలహీనతలు ముఖ్యమంత్రికి బలంగా మారడం
ఇవన్నీ వున్నా  ఇంకా పొంచే వున్న రాజకీయ కారు మేఘాలు.
1.) సొంతగూటికి చేరుతున్నట్టు  ప్రకటనలు గుప్పిస్తున్న అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంతవరకు నమ్మొచ్చన్న అనుమానాలు
2.) ఇంతవరకు కిరణ్ ప్రభుత్వాన్ని చూసీ చూడనట్టు వొదిలేస్తున్న తెలుగుదేశం పార్టీ -   సీ.బీ.ఐ. దర్యాప్తు ముదిరిన తరువాత కూడా అదే దారిలో వెడుతుందా లేదా అన్న విషయంలో అస్పష్టత
౩.) ముదిరి పాకాన పడుతున్న దర్యాప్తుల నేపధ్యంలో పధకాల రూపకల్పనలోనూ, వాటి అమల్లోను , అధికారుల సహకారం మంత్రులకు, ముఖ్యమంత్రికి  ఏమేరకు వుంటుంది అన్న సందేహాలు
కాబట్టి రాజకీయాల్లో ఇవ్వాళ గడిచినట్టే రేపు గడుస్తుంది అన్న భరోసా లేదు. ఇవ్వాళ స్త్రోత్ర పాఠాలు వల్లిస్తున్న భజన బృందాలు అధికారం వున్నంతవరకే వెనకవుంటాయనీ, వెన్నంటి వుంటాయనీ తెలుసుకోవడానికి చరిత్ర తిరగేయనక్కరలేదు. నిన్నమొన్నటి వరకు ఆ గళాలు ఎవరిని వేనోళ్ళ స్తుతించాయో, ఎవరివెంట తిరిగాయో  తెలుసుకోవడానికి రిసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
కాకపొతే, ఈ నగ్న సత్యం ఈనాటి నాయకులకు తెలియందేమీ కాదు. తెలియనట్టు కానవస్తారంతే! ఎందుకంటె రాజకీయాల్లో ఈ భజనపరుల అవసరం కొండంత. పైపెచ్చు పరస్పరాధీనంగా నడిచే వ్యవహారాలు కావడం మరో కారణం. (25-11-2011)

22, నవంబర్ 2011, మంగళవారం

అప్పుడు - ఇప్పుడు


వార్త – వ్యాఖ్య
( ఆంధ్ర జ్యోతి దినపత్రిక 21-11-2011)
అప్పుడు విజయవాడలో అల్లర్లు జరిగాయి. ఆ ప్రాంతంలో పర్యటించడానికి  ముఖ్యమంత్రి పీ.వీ.నరసింహారావు బయలుదేరుతున్నారు. ఆయన  అక్కడికి వెడితే ... ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతాయని, రావద్దని జిల్లా కలక్టర్,  ఎస్పీ... పీవీని  వారించారు. ముఖ్యమంత్రి హోదా, రాజకీయ ప్రయోజనాలు బేరీజు వేసుకున్న పీవీ వెళ్లడానికే నిర్ణయించుకున్నారు. ఇక లాభం లేదనుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వల్లూరి  కామేశ్వరరావు రంగంలోకి దిగారు. వెళ్ళవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. ‘నువ్వు సెక్రెటరీవి. నా ఉద్యోగివి.  నీ పని నువ్వు చూసుకో.  నేను చెప్పింది చేయి. నేను పొలిటీషియన్ని. నా పని నేను చేస్తా. ‘ అంటూ ఆఫీసు  మెట్లు దిగి కారెక్కడానికి వచ్చారు పీవీ. కానీ అక్కడ కారు  డ్రైవర్  లేడు.  ఏడని అడిగితే... ‘సీఎస్  గారు కారు తీయవద్దన్నారని’ సమాధానం వచ్చింది. ‘డ్రైవర్  నా ఉద్యోగి. అతడు నేను చెప్పినట్టే వింటాడు. అతను రాడు.’ అని సీఎస్ కరాఖండిగా చెప్పారు. పీవీ పర్యటన ఆగిపోయింది. మరుసటి రోజు పీవీ వల్లూరిని పిలిచి .....’నిన్న నేను వెళ్ళివుంటే గొడవలు పెరిగేవి. నన్ను ఆపి మంచిపని చేసావు’ అని మెచ్చుకున్నారు.
....విధులపట్ల అదీ ఆనాటి అధికారుల నిబద్ధత. మరి ఇప్పుడో...!
ఓసారి శ్రీశైలంలో ఒక జాతీయ పార్టీ సమావేశం జరుగుతోంది. దాన్ని కవర్ చేయడానికి హైదరాబాద్ నుంచి  ఒక విలేకరి వెళ్లాడు. సమావేశం పూర్తయ్యాక ఫాక్స్ ద్వారా వార్త పంపడానికి కొండకిందకు వెళ్ళబోతున్నాడు. అది గమనించిన ఆ పార్టీ ప్రముఖుడొకరు జీపు ఏర్పాటు చేస్తానన్నా అతగాడు వొద్దన్నాడు. పరవాలేదని నచ్చజెప్పి తన  జీపు డ్రైవర్ ను పిలిచి కాఫీ, టీలు, భోజనం, ఫాక్స్ బిల్లు వగైరాలకు కొంత డబ్బు ఇచ్చి తగిన సూచనలు చేసి ఆ విలేకరిని కిందికి  పంపాడు. ఆయన పనులన్నీ పూర్తయి  హైదరాబాద్ బస్సు ఎక్కేదాకా వుండి  రాత్రికి జీపు డ్రయివర్ తిరిగి వచ్చాడు. రాగానే అతడికి ఇచ్చిన మొత్తం యధాతధంగా తిరిగి వాపసు చేయడంతో  ఆ నాయకుడు ఖంగు తిన్నాడు. ‘ఏమీ ఖర్చు కాలేదా’ అని అడిగితే ‘లేదు సార్ ! కాఫీక్కూడా నన్ను డబ్బులివ్వనివ్వలేదు. పైగా నేను వొద్దంటున్నా మన జీపులో  పది లీటర్ల డీజిల్ కొట్టించి డబ్బులు ఆయనే ఇచ్చాడు సార్  ‘ అని చెప్పేసరికి నివ్వెరపోవడం ఆ నాయకుడి వంతయింది.
......ఒకనాటి విలేకరుల నిబద్దత అది. మరి ఇప్పుడో.....!

(22-11-2011)

కనుక్కోండి చూద్దాం !




కనుక్కోండి చూద్దాం !

ఈ కింది వరుసల్లో సున్నాల మధ్య దాగున్న ఇంగ్లీష్ 'C' అక్షరాన్ని పట్టుకోండి.

OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO COOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO
OOOOOOOOOOOOOOOOOOO OOOOOOOOOOOO

సంతోషం ఈ పరీక్ష గట్టెక్కారు.  ఇప్పుడు కింద వరుసగా కనిపిస్తున్న'9'  అంకెల నడుమవున్న '6' అంకెని గుర్తుపట్టండి.

9999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999
6999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999
9999999999999999999 9999999999999999 999999999999

పోతే ఇప్పుడు మూడోది. అదేమిటంటే – కింద ఇంగ్లీష్ ‘M’ అక్షరాలు కనబడుతున్నాయి కదా. వాటి నడుమ కనీకనబడకుండా ఇంగ్లీష్ ‘N’ అక్షరం వుంది. దాన్ని కూడా కనిపెట్టేశారంటే ఒక పనయిపోతుంది.

MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMNMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
MMMMMMMMMMMMMMMMMMM MMMMMMMMMMMM
అబ్బో! గట్టివాళ్ళే! మీవి  డేగ కళ్ళు సుమా. మూడింట్లోను  నెగ్గారు. అంటే అర్ధం ఏమిటి?
చక్కగా పనిచేస్తున్నవి మీ కళ్ళు మాత్రమే కాదు. మీ నాడీ వ్యవస్థ కూడా బాగా వుందన్న మాట. మీ మెదడు యెంత బాగా పనిచేస్తోందంటే - ‘ఆల్జిమీర్స్’ వ్యాధి వచ్చే అవకాశాలు ఆమళ్ల దూరంలో కూడా లేనట్టే.
తోకపిట్ట : నెట్ లో ఇలాటి జోకులు మామూలే! హాయిగా నవ్వేసి వూరుకోండి నాలాగే!
(22-11-2011)

19, నవంబర్ 2011, శనివారం

తెరిపినపడ్డ కాంగ్రెస్


తెరిపినపడ్డ కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు



ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఏంచేయాలి. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాలి. కానీ సాధారణంగా జరిగేదేమిటి ?  పక్క వాటాలో కూడా కరెంట్ వుందో లేదో అని ఓ కంట కనిపెట్టిచూడడం మానవ నైజం. తనకు నష్టం జరిగిందన్న బాధ కన్నా పక్కవారికి కూడా అదే జరిగితే సంతోషించే రోజులివి.
సీ.బీ.ఐ. దర్యాప్తులకు న్యాయస్తానాలు ఆదేశిస్తున్న ఉదంతాలపై  ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరు కూడా ఈ స్వభావాన్నే సూచిస్తోంది.
ఏమయితేనేం! చేతులారా తెచ్చిపెట్టుకున్న సమస్యలతో కుడితినపడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలం తరువాత చక్కని  ఊరట దొరికింది.
జగన్ అండ చూసుకుని కొరకరాని కొయ్యలుగా తయారయిన కొందరు ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక నిస్సహాయస్తితిలోవున్న అధికార కాంగ్రెస్ కు, కోర్టు ఆదేశాలపై సీ.బీ.ఐ. ప్రారంభించిన జగన్ ఆస్తుల కేసు విచారణ  కొంత ఊరటనిస్తే,  చంద్రబాబు అధికార దుర్వినియోగం గురించి హైకోర్టు ఆ  సీ.బీ.ఐ. నే దర్యాప్తుచేయమని తాజాగా ఆదేశించడం పూర్తి ఊరటను ఇచ్చింది. అటు  సీమాంధ్ర లో పూర్తిగా, ఇటు తెలంగాణలో ఓ మోస్తరుగా  ఏకుమేకై కూర్చున్న వైఎస్సార్ పార్టీని, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా యెలా ఎదుర్కోవాలో తెలియని పరిస్తితిలో బాగా డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు కొత్త ఊపిరి పోస్తున్నాయి. సరికొత్త ఆశలు  చిగురింపచేస్తున్నాయి.
కారణాలు ఏమయితేనేం, కారణ’భూతం’ ఏదయితేనేం చాలాకాలం తరువాత, అదీ ఏడాది పాలన పూర్తిఅవుతున్న తరుణంలో ‘కిరణ్ సర్కార్’ కొంత తెరిపిన పడింది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కాబోలు (18-11-2011)