ఓ జ్ఞాపకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఓ జ్ఞాపకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జనవరి 2019, మంగళవారం

నందమూరి తారకరామారావు గారు, ఓ జ్ఞాపకం


ఈ వృత్తాంతం ఎందుకు గుర్తుకు వచ్చిందో చివర్లో చెబుతాను. బహుశా చెప్పాల్సిన పని కూడా వుండదు అనుకుంటాను.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.
ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.
ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.
లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం  ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా.  ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు వుంది.
ఆయన మాతో చెప్పారు.
“రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు,  మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త  అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?”
నిన్న మా ఆవిడా నేనూ NTR కధానాయకుడు సినిమా చూశాము.

18, నవంబర్ 2018, ఆదివారం

పార్టీ టిక్కెట్లు, ఓ జ్ఞాపకం


1999 ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు రావడంతో ఢిల్లీలో పార్టీ టిక్కెట్ల హడావిడి అంతాఇంతా కాదు. ఢిల్లీలోని ఏపీ భవన్, హోటళ్ళు పార్టీ టిక్కెట్లు ఆశి౦చేవారితో వారి మద్దతుదారులతో కిటకిటలాడిపోయాయి. నేనప్పుడు ఏదో పనిమీద వెళ్లి ఢిల్లీ ఏపీ భవన్ లో వున్నాను. చివరి నిమిషం వరకు పార్టీ అధిష్టానం టిక్కెట్లు ఖరారు చేయకపోవడంతో అభ్యర్ధులు చాలా టెన్షన్ పడ్డారు. మిగిలిన రాష్ట్రాల అభ్యర్ధులను నిర్ణయించి ఏపీ వంతు వచ్చేసరికి నామినేషన్ల దాఖలుకు ఆఖరు ఘడియ దగ్గర పడింది. ఎట్టకేలకు అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. వాళ్ళు హైదరాబాదు వెళ్లి గాంధీ భవన్ లో బీ ఫారాలు తీసుకుని మళ్ళీ వారి వారి నియోజకవర్గాలకు వెళ్ళాలి. చుట్టుపక్కల అయితే పర్వాలేదు. ఉమ్మడి రాష్ట్రం కనుక అటు ఆదిలాబాదు నుంచి శ్రీకాకుళం వరకు దూర ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళు మరింత ఉడ్డుగుడుచుకున్నారు. ముందు ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరడం పెద్ద పరీక్షగా మారింది. అందరికీ రిటర్న్ టికెట్స్ వున్నాయి కానీ అవి కన్ఫర్మ్ కావడం అసాధ్యం. అప్పట్లో ఇప్పట్లా విమాన సౌకర్యాలు లేవు. హైదరాబాదు నేరుగా వెళ్ళే విమాన సర్వీసులు చాలా తక్కువ. అవన్నీ చాలావరకు బుక్కయిపోయాయి. ఢిల్లీ నుంచి కలకత్తానో, బెంగళూరో, చెన్నయో వెళ్లి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లయిట్ పట్టుకోవాలి. ఎక్కడ లెక్క తప్పినా మొత్తం అన్నాళ్ళు పడిన శ్రమ వృధానే.
ఆ సమయంలో నాకు తెలిసిన ఒక రాజకీయ మిత్రుడు ఎయిర్ లైన్స్ లో ఎవరయినా తెలుసా అని నన్ను వాకబు చేసారు. ఆ సమయంలో ఆంధ్రాలో తుపాను ప్రమాదం వచ్చి పడింది. ఎయిర్ లైన్స్ బుకింగ్ కౌంటర్ లో అడిగితే, నేను రేడియో విలేకరిని కనుక నా టిక్కెట్టుకు ఇబ్బంది లేదనీ,  ఎమర్జెన్సీ కోటాలో కన్ఫర్మ్ చేసి ఇస్తామని చెప్పారు. కానీ అవసరం ఆయనది కదా!
ఈ మీమాంసలో వున్నప్పుడు నాకు ఒక వ్యక్తి చటుక్కున గుర్తుకు వచ్చారు. ఆయన నేను మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు మాస్కోలో ఎయిర్ ఇండియా ఆఫీసులో పెద్ద అధికారిగా వుండేవారు. తరచూ కలుస్తూ వుండేవాళ్ళం.
ఇద్దరం కలిసి ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాం. ఆయన ఇప్పుడు జనరల్ మేనేజర్ అయ్యారు. బయట పియ్యేని కలిసి నా ప్రవర చెప్పుకుని ఆయన్ని కలవాలని చెప్పాను. నా మాస్కో పరిచయం గురించి తెలిసిన తర్వాత ఆ పియ్యే లోపలకు ఫోను చేసి పలానావారిని పంపించమంటారా అని అడిగి, అనుమతి తీసుకుని ఒక బంట్రోతును ఇచ్చి  లోపలకు పంపారు. పంపేముందు, వచ్చిన విషయం ఏమిటని అడిగితే ఓపెన్ టిక్కెట్టు కన్ఫర్మేషన్  కోసం వచ్చామని చెప్పాము. ఆ పియ్యే చిరునవ్వు నవ్వి, ‘ఆయన్ని కలిసి ఈ చిన్నపని అడగకండి, అదేదో నేనే చేసి పెడతానని, అప్పటికప్పుడే ఎవరికో ఫోను చేసి టిక్కెట్లు కన్ఫర్మ్ చేసాడు. వచ్చిన పని అయిపొయింది కనుక ఆ పియ్యేకి కృతజ్ఞతలు చెప్పి, మాస్కో పెద్దమనిషిని లోపల కలిసినప్పుడు టిక్కెట్ల విషయం ఎత్తకుండా ఇతరత్రా పిచ్చాపాటీ మాట్లాడి వచ్చేసాము. చాలా  ఏళ్ళ తర్వాత కలిశాను కనుక ఆయన కూడా బాగా సంతోషపడ్డారు.
ఇక మా మిత్రుడి సంగతి చెప్పక్కర లేదు. అధిష్టానం ఆఖరు నిమిషంలో పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. ఆఖరు నిమిషంలో విమానం టిక్కెట్టు కన్ఫర్మ్ అయింది.
తరువాత ఆయన తన ప్రతిభతో ఎమ్మెల్యే అయ్యారు. తదనంతర  కాలంలో మంత్రి కూడా అయ్యారు.


2, జూన్ 2016, గురువారం

ఓ జ్ఞాపకం



హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు  ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగిన రోజుల్లో ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగానో, పీసీసీ అధ్యక్షుడిగానో వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వచ్చి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని  పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో  వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. కాసేపట్లో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు ప్రెస్ క్లబ్ దగ్గర ఆగకుండా  గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే ముందుకు వెళ్ళిపోయింది. నేను వెంటనే కేవీపీ కి ఫోన్ చేశాను. ఆయన ‘అర్రెర్రే బషీర్ బాగ్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ  వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.