ఇద్దరు అధికారులు, ఒకే పాఠం
ఎంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం ఎదురయ్యే
సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని కొన్నేళ్ళ కిందటి నా ఈ అనుభవమే
నాకు మరోసారి తెలియపరిచింది.
దూరదర్శన్ సప్తగిరి ఆధ్వర్యంలో హైదరాబాదు
రవీంద్రభారతిలో ‘స్వర సమరం’ అనే సంగీత పోటీ జరిగింది. అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ ముఖ్య అతిధి. సతీసమేతంగా
హాజరయి శాస్త్రీయ సంగీతం పట్ల తమ మక్కువను చూపారు. ఆద్యంతం తెలుగులో ప్రసంగిస్తూ
ఇలాటి అద్భుత కార్యక్రమాలను నిర్వహించే శక్తి కేవలం దూరదర్శన్ కు మాత్రమే వుందని
ఉద్ఘాటిస్తూ, ఆ
సంస్థ ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని
ప్రోత్సహించాలని ఉద్బోధించారు. సరే అసలు విషయం ఇది కాదు.
మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్. ప్రభాకర
రావు, వారి
శ్రీమతి వేదవతి సంగీతం మీద వున్న ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ
ప్రభాకర రావు పోలీసు శాఖలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి సమర్ధుడైన అధికారిగా
నిరూపించుకున్నారు. ఆయన్ని గుర్తుపట్టిన దూరదర్శన్ సిబ్బందిలో కొందరు వారిని మొదటి
వరుసలో కూర్చోవాల్సిందిగా అభ్యర్ధించారు. అయినా సున్నితంగా తిరస్కరించి సాధారణ
ప్రేక్షకుల మాదిరిగానే వారిద్దరూ వెనుక వరుసలోనే కూర్చుని కార్యక్రమాన్ని ఆసాంతం
తిలకించారు.
గవర్నర్ పాల్గొంటున్న దృష్ట్యా రవీంద్ర భారతి
ఆవరణలో కట్టుదిట్టమయిన పోలీసు బందోబస్తు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత
రంగస్థలం మీద కళాకారులను అభినందిస్తూ నరసింహన్ దంపతులు కొద్దిసేపు అక్కడే
వుండిపోయారు. ప్రభాకరరావు దంపతులు ఈలోగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా, ద్వారం
వద్దవున్న పోలీసు అధికారులు అడ్డగించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి విధులు
నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి, తాము అభ్యంతరం చెబుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల
క్రితం తమ శాఖకు అత్యున్నత అధికారిగా పనిచేశారన్న విషయం తెలిసివుండక పోవచ్చు.
మధ్యలో ఎవరో కల్పించుకుని ఆయన ఎవరో ఏమిటో చెప్పబోతుంటే శ్రీ ప్రభాకర రావు వద్దని
సైగచేసారు. ‘వారి డ్యూటీ వారిని చేయనీయండి’ అంటూ మళ్ళీ వెనక్కు వచ్చి హాలులో
కూర్చుండిపోయారు.
రోజు తిరగకుండా మరోసారి మళ్ళీ ఇదేమాదిరి సంఘటన
అనుభవంలోకి వచ్చింది. మర్నాడు ఆదివారం గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టినరోజు. రాజభవన్
లో అనేకమంది వారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియ చేసారు. శ్రీ నరసింహన్
పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసినందువల్లనేమో లోగడ పోలీసు శాఖలో ఉన్నత
పదవుల్లో పనిచేసిన అనేకమంది గవర్నర్ ను అభినందించడానికి రాజ్ భవన్ కు వచ్చారు.
గతంలో నేను రేడియోలో పనిచేసిన కాలంలో సన్నిహితంగా మెలిగిన అనేకమంది అధికారులను చాలా
సంవత్సరాల తరువాత అక్కడ కలుసుకోవడం జరిగింది. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. ఆయన
హైదరాబాదు పోలీసు కమీషనర్ గా పనిచేశారు. నిబంధనల ప్రకారం తన సెల్ ఫోనును కారులో
బయటే వుంచేసి లోపలకు రావడం చూసి ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే ‘పోలీసుశాఖలో
ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే యెట్లా’ అన్నట్టు చిరునవ్వే సమాధానం.
‘ఎదిగినకొద్దీ
వొదగమ’ని ఓ సినీ కవి చక్కని పాట రాశారు. విన్నప్పుడల్లా యెంత చక్కని పాట అని
ఎన్నోసార్లు అనుకుంటాం. కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం గుర్తు రాదు. ఉద్యోగం
ద్వారా సమకూడిన హోదా ఒక్కటే గుర్తుంటుంది.
ఒక రోజు తేడాతో చూసిన ఈ రెండు సంఘటనలు మనసుపై
మంచి ముద్రవేశాయి. అలా వుండగలిగితే యెంత బాగుండు ఒక్క క్షణం అనిపిస్తుంది. కాని
మనసు కోతి లాటిది. దానికి తోడు, పాడు అహం, ఆ ఆలోచనను అనుక్షణం చంపేస్తూనే వుంటుంది. ఏం
చేస్తాం!
(ఇంకావుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి