రేడియో ఎవరు వింటున్నారు?
రేడియో
గురించి రాస్తుంటే ఒక తరం వారు ఆసక్తిగా చదువుతున్నారు. నా బ్లాగు వీక్షకుల సంఖ్య కొద్ది రోజుల్లోనే పద్నాలుగు
లక్షల నుంచి మరో డెబ్బయ్ అయిదు వేలు పెరగడం దీనికి రుజువు. ఇక, మరో తరం వారు తరచుగా అడుగుతున్న
ప్రశ్న మరోటి. ఇంకా ఈ రోజుల్లో రేడియో వినేవాళ్ళు ఉన్నారంటారా? అసలు ఎవరి ఇళ్ళల్లో అయినా మీకు
రేడియో కనిపిస్తుందా? అనేది
వారి సందేహం. ఇందులో కొంత నిజం లేకపోలేదు. అలా అని రేడియో అనేది పూర్తిగా కనుమరుగు
అయిపోయిందని కూడా చెప్పలేము. కాకపోతే పాత కాలం నాటి రేడియో (ఆకాశవాణి) కార్యక్రమాలకు ఉన్న సంగీత సౌరభం, విజ్ఞాన, వినోదాల మేళవింపు ఇప్పటికి అలాగే ఉన్నాయా అంటే చప్పున ఔనని జవాబు చెప్పలేని పరిస్థితి
అయితే వుంది.
మంగళగిరి
ఆదిత్య ప్రసాద్ అనేది ప్రసార భారతిలో కొత్తగా చేరి పనిచేసేవారికి ఒక అధికారి పేరు.
కానీ సంగీత పరిజ్ఞానం కొద్దో గొప్పో వున్నవారికి మాత్రం ఆయన ఒక సంగీతకారుడు.
రేడియో అంటే సంగీతం అనుకునేవారు ఇలాటి అధికారులు రావాలని, కావాలని కోరుకుంటారు. కాని ప్రసాద్ గారు మాత్రం
రేడియో శ్రోతల సంఖ్య పెరగాలని కోరుకుంటూ వుంటారు. సందర్భం దొరికినప్పుడల్లా సమయం
చూసుకుని తన మనసులోని మాటని బయట పెడుతుంటారు.
"ఇప్పుడు
రేడియోలు ఎక్కడ దొరుకుతున్నాయండీ" అనే ప్రశ్నకు జవాబు ఆయన వద్ద సిద్ధంగా
వుంటుంది. అలా అడిగినవారికి ఒక చిన్న సైజు ట్రాన్సిస్టర్ రేడియోని కానుకగా ఇచ్చి, 'రేడియో దొరికింది కదా! ఇక వినండ'ని అంటుంటారని ఆయన గురించి
మెచ్చుకోలుగా చెప్పుకునే ఒక మాట ప్రచారంలో వుంది. కొన్నేళ్ళ క్రితం ఆదిత్య ప్రసాద్ రాజభవన్ లో నాటి గవర్నర్ నరసింహన్ గారిని
కలుసుకున్నప్పుడు, ఏకంగా వారికి ఒక చిన్ని ట్రాన్సిస్టర్ రేడియోను కానుకగా ఇచ్చారట. దాన్ని స్వీకరించిన
గవర్నర్ ఎంతగానో సంతోషించారట.
2014 లో
హైదరాబాదు రేడియో ప్రాంగణంలో డాక్టర్ ఆర్. ఏ. పద్మనాభరావు గారు రచించిన 'అలనాటి ఆకాశవాణి' పుస్తక ఆవిష్కరణ సభలో ఆయనే ఈ
విషయాన్ని మర్యాదకు భంగం కలగని రీతిలో, చాలా మన్ననగా ప్రస్తావించారు. 'రేడియో ప్రచార సభ' ఆలోచన కూడా వారిదే.
ఈ
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కే.వీ. రమణాచారి తమ ప్రసంగంలో రేడియోతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
ఆలిండియా సర్వీసులో చేరడడానికి ముందు ఆయన కొంతకాలం హైదరాబాదులో లెక్చరర్ గా పని చేసారు.
మధ్యాన్నం చాయ్ తాగడానికి ఆలిండియా రేడియో మీదుగా వెళ్లి వస్తుండేవారట. ‘ఆకాశవాణి –
నిషేధిత ప్రాంతము’ అనే బోర్డు చూస్తూ, జీవితంలో ఎప్పుడయినా రేడియో స్టేషన్ లోకి
అడుగుపెట్టే అవకాశం వస్తుందా అని అనుకునేవారట. ఒకరోజు గేటు వద్ద సెంట్రీని మాటల్లో
పెట్టి లోపల వరకూ వెళ్లారట కూడా. దరిమిలా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పలు పర్యాయాలు
రేడియో సమావేశాల్లో, అలాగే
ఒక రచయితగా, కవిగా అనేకమార్లు రేడియో స్టేషన్ కు వచ్చి రికార్దింగుల్లో పాల్గొన్నా
కూడా, ఆ తొలినాటి రేడియో ప్రవేశ అనుభవం మరపున పడలేదని గుర్తు చేసుకున్నారు, కేవీ
రమణాచారి గారు.
సహజంగా
హాస్య ప్రియులైన రమణాచారి చెప్పినట్టు, ఈనాడు కావాల్సింది 'హాయ్! ఓయ్! రేయ్!' అంటూ చెలరేగిపోయే మిర్చీ బజ్జీ
శ్రోతలు కాదు. మంచి సంగీతాన్ని, మనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి శ్రోతల సంఖ్య
పెరగాలి. ఆకాశవాణి అధికారులు కూడా రేడియో పూర్వపు ఔన్నత్యాన్ని, వైభవాన్ని తిరిగి పొందడానికి
వీలైన చక్కటి కార్యక్రమాలను రూపొందించాలి.
అందుకు నాందిగా, ఆదిత్య ప్రసాద్
గారి మాదిరిగా ఒకరికొకరు చిన్న చిన్న రేడియోలు చిరు కానుకలుగా ఇచ్చిపుచ్చుకునే
సంప్రదాయం రావాలి.
పోతే,
రేడియో ఎవరు
వింటున్నారు అని కదా మొదలు పెట్టింది.
ఇప్పటికీ
పూర్వంలా ప్రతి ఇంట్లో రేడియో మోగుతూ ఉండకపోవచ్చు. కానీ నెట్లో రేడియో వినేవాళ్ళు
బహు కొల్లలు.
నేను
రేడియోలో పనిచేసే రోజుల్లో వార్తల్ని టైం ప్రకారం వినేవాళ్ళు నాకు తెలుసు. శ్రీ
ఎం. సత్యనారాయణ రావు ఏ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా పనిచేసే రోజుల్లో, వారిని ఢిల్లీలో వారింట్లో కలుసుకున్నాను. చిత్రంగా
నేను వెళ్ళిన సమయానికి ఆయన రేడియో వార్తలను చాలా శ్రద్ధగా వింటున్నారు. అలాగే మాజీ
ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు. ఒకసారి రికార్డింగు పనిమీద ఇంటికి
వెళ్లాను. కాసేపు ఆగి మొదలెడదా౦ అన్నారు. నాకు అర్ధం కాలేదు. ఒకటీ పది కాగానే
పక్కనే వున్న ట్రాన్సిస్టర్ చేతిలోకి తీసుకున్నారు. ‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది..
అంటూ వార్తలు మొదలయ్యాయి. ఓహో! ఇందుకా ఆగమన్నది అని అప్పుడు బోధ పడింది.
మాజీ
ముఖ్యమంత్రి, తమిళనాడు
గవర్నర్ గా పనిచేసిన కీర్తిశేషులు రోశయ్య
గారికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా వార్తలు వినే అలవాటు వుండేది. అలాగే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మంచి రేడియో శ్రోత. ఉమ్మడి
రాష్ట్రంలో చంద్రబాబు
నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పుడు ఖమ్మం నుంచి రోడ్డు మార్గాన
హైదరాబాదు వస్తూ, మధ్యాన్నం రేడియో వార్తల టైం కాగానే డ్రైవర్ని కారు పక్కకు
తీయమని చెప్పి, (ఆ రోజుల్లో సింగిల్ రోడ్డు) వార్తలు వినేవారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా
నాకు చెప్పారు.
ఢిల్లీలో
సెంటర్ ఫర్ మీడియా సర్వీసు అనే ప్రసిద్ధ సంస్థ సంస్థాపకులు డాక్టర్ ఎన్. భాస్కర రావు చేతిలో ఎప్పుడూ ఒక చిన్న
రేడియో వుంటుంది. ప్రతి రేడియో బులెటిన్ ను ఆయన శ్రద్ధగా వింటుంటారు.
తెలంగాణా
మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రధాన
పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన జ్వాలా నరసింహారావుకు క్రమం తప్పకుండా రేడియో
వార్తలు వినే అలవాటు వుంది. కారులో వెడుతున్నాకూడా వార్తల సమయం కాగానే రేడియోపెట్టి
వార్తలు వింటుంటారు.
ఈ
జాబితాలో చివరన పేర్కొంటున్నప్పటికీ రేడియో శ్రోతల్లో, అభిమానుల్లో ప్రధముడుగా చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు.
ఆయనే కప్పగంతు శివరామ ప్రసాద్ గారు. రేడియో
అభిమాని అనే బ్లాగు నడుపుతూ, ఆకాశవాణి కళాకారుల అపురూప చిత్రాలను సేకరించడం ఆయన
హాబీ. రేడియోకి సంబంధించిన అనేక సాంకేతిక అంశాల్లో ఆయన అథారిటి.
(కింది
ఫోటో)
మంగళగిరి
ఆదిత్య ప్రసాద్
(ఇంకా
వుంది)
5 కామెంట్లు:
మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు ఆకాశవాణి లో ఉన్నతోద్యోగి గా పని చేశారు. స్వయంగా గాయకుడు, వయొలిన్ సంగీత కళాకారుడు, సంగీత అభిమాని, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తారు. ఆయన సంగీత విశేషాలు, గొప్ప ఆర్టిస్టుల తో తన అనుభవాల గురించి ప్రసంగించే టప్పుడు చాలా ఉత్సాహంగా సమయాన్ని కూడా మరచి పోయి చెబుతూ ఉంటారు. ఆయనకు కర్నాటక హిందూస్తానీ సంగీతం పై విశేష జ్ఞానం ఉంది. ఏ ఎస్ రావు నగర్ లో త్యాగరాజ ఉత్సవాల లో అనేకమార్లు చూశాను.
ఈ ప్రశంస కూడా అజ్ఞాత గానే చెయ్యాలా, అజ్ఞాత గారూ ?
అంత ఫ్రెష్ పుటము గా ఎవరిదో తెలిసి పోతూనే వున్నది కదా ! జగమెరిగిన ....
:)
నాకు తెలియడం లేదు. మీ అంత సూక్ష్మగ్రాహిని కాదు కదా మరి.
అజ్ఞాత మైన నేమి
సుజ్ఞానమందించగా
పేరులో ' నేమున్నది ' .
జిలేబికి ఎరుక
కామెంట్ను పోస్ట్ చేయండి