10, జూన్ 2020, బుధవారం

భయం – భండారు శ్రీనివాసరావు


రోశయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కృష్ణానదికి బ్రహ్మాండమైన వరదలు వచ్చాయి. కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కర్నూలు పట్టణంలోకి వరద నీరు ప్రవేశించి పెద్ద పెద్ద భవంతులు కూడా మునిగిపోయాయి. కొన్ని అపార్ట్ మెంట్లలో రెండో అంతస్తులోకి కూడా నీళ్ళు వచ్చాయి. ఇళ్లన్నీ వరద బురదతో పేరుకుపోయాయి. ఇక లోతట్టు ప్రాంతాల పరిస్తితులు చెప్పక్కర లేదు. హైదరాబాదు  నుంచి  చూడడానికి వెళ్లాము. ఒక అధికారి చెప్పాడు, ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మా తల ప్రాణం తోకకు వచ్చింది. ఇళ్లు వదిలిపెట్టి సహాయక శిబిరాలకు రావడానికి వాళ్ళు ఓ పట్టాన ఒప్పుకోవడంలేదు
దీనికి సమాధానం ప్రజలదగ్గర నుంచే వచ్చింది. ఒకతను చెప్పాడు.
వున్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి రమ్మంటారు. ఎలా వెడతామ్. టీవీలు ఫ్రిజ్ లు చాలా ఖరీదైన వస్తువులు. మా పెద్దవాళ్ళ టైమ్ లో అయితే గోచీపాత తప్పితే యేమీ వుండేవికావు. ప్రతిసారీ వరదలు వచ్చినప్పుడల్లా వచ్చి ఖాళీ చేయమంటారు. మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ ఇదే తంతు. మా బతుకులు గంగమ్మ నీడలోనే గడిచిపోతాయి. నీళ్ళను చూస్తూ పెరిగాము. నీళ్లంటే మాకు భయం లేదు. చూస్తున్నారు కదా. ఇక్కడ ఎన్ని కొంపలు వున్నాయో. ఇలా ప్రతిసారీ బోలెడు ఖర్చు పెట్టి ఖాళీ చేయించే బదులు వరద భయం లేని మెట్ట ప్రాంతాలలో మాకు ఇళ్లు కట్టించి ఇస్తే ప్రతియేడూ ఇలా తరలించే ఖర్చు ప్రభుత్వానికి కలిసి వస్తుంది కదా!
బదులు చెప్పడానికి వీలులేని సమాధానం.
రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు వుండదు అని సామెత. భయం కూడా అంతే! భయం అలవాటు అయినకొద్దీ భయం పట్ల భయం పోతుంది.
కరోనా సంగతి చూస్తున్నాం కదా!

కామెంట్‌లు లేవు: