17, జూన్ 2020, బుధవారం

కొన్ని సరికొత్త పాత సంగతులు

  

అదేమిటో చాలా మందికి, నాతో సహా, ఈ మధ్య జరిగిన విషయాలు గుర్తుండడం లేదు. కొందరు చెబుతుంటే కానీ జ్ఞాపకం రావడం లేదు.

ఇప్పుడు అలా విన్న సంగతులు చెప్పుకోవడానికే ఈ ప్రయత్నం. ఇవన్నీ ఏ క్రీస్తు పూర్వం నాటి విషయాలో  కాదు. మహా అయితే ఏడాది, రెండేళ్ళ లోపు సంగతులే.

2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ప్రధాన ప్రత్యర్దులమని చెప్పుకునే పార్టీలు ఎన్ని వున్నా నిజానికి పోటీ రెండింటి మధ్యనే. అంటే టీడీపీ, వైసీపీ నడుమనే అసలయిన పోటీ అనేది చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేవాళ్ళు.

ఈ రెండు పార్టీలు ఓటర్ల అభిమానం చూరగొనడానికి రకరకాల పధకాలు ప్రకటిస్తూనే మరో పక్క చాణక్య నీతిని కూడా ప్రదర్శించాయి. ఆ క్రమంలోనే మొదలయ్యాయి పార్టీ మార్పిళ్ల కార్యక్రమం. కాకపోతే ఈ విషయంలో జగన్ మోహన రెడ్డికి ప్రశాంత్ కిషోర్ రూపంలో చక్కని సలహాలు, సూచనలు దక్కాయి. అపర చాణక్యుడిగా తెలుగు రాజకీయాల్లో పేరు పొందిన చంద్రబాబు కొంచెం వెనక పడ్డట్టే లెక్క. (2014లో ఆయన ఈ విషయంలో ముందంజలో వున్నారు).  2019 నాటి ఎన్నికల సమయానికి  ఆయన ఊహించని రీతిలో టీడీపీ నుంచి వైసీపీకి ఎన్నికల ముందే వలసలు సాగాయి. వీటిల్లో చెప్పుకోతగ్గవి  కొన్ని వున్నాయి.

ఆదాల ప్రభాకరరెడ్డి గారు. వీరికి టీడీపీ టిక్కెట్టు కన్ఫర్మ్ అయింది. బీ ఫారం కూడా ఇచ్చినట్టు వున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. సరిగ్గా పదిహేను రోజులముందు ఆయన టీడీపీ అధిష్టానానికి ఫోనులో కూడా దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళడం వెళ్ళడం నేరుగా వైసీపీ గూటికే కావడం, ఆయనకు ఆ పార్టీ సీటు ఇవ్వడం అన్నీ మెరుపు వేగంతో జరిగిపోయాయి. టీడీపీ అధిష్టానం అప్పటికప్పుడు ప్రభాకరరెడ్డి స్థానంలో మరొక అభ్యర్ధిని వెతుక్కోవాల్సి వచ్చింది. బీద మస్తాన్ రావుగారిని  ఎంపిక చేసారు. ఆయన గట్టి అభ్యర్దే. కానీ ఫలితం దక్కలేదు. ఆ సీటును టీడీపీ కోల్పోయింది. సీటునేకాదు, చివరి క్షణంలో ఎంపిక చేసి నిలబెట్టిన అభ్యర్ధిని కూడా. ఎన్నికలు కాగానే బీద మస్తాన్ రావుగారు  టీడీపీకి గుడ్ బై చెప్పి తనను ఓడించిన వైసీపీలోకి  చేరిపోయారు.

ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఈయన కూడా టీడీపీని చివరి రోజుల్లో ఒదిలిపెట్టారు. కాకపోతే కాస్త మర్యాదగా. భార్య, పిల్లలతో సహా వెళ్లి అధినాయకుడిని కలిసి టీడీపీ తరపున పోటీ చేయలేను అని ఒక నమస్కారం పెట్టి వచ్చారు. తరువాత కొద్ది రోజులకే లోటస్ పాండులో జగన్ మోహన రెడ్డిని కలిసి ఆ పార్టీ సభ్యత్వాన్ని, పార్టీ టిక్కెట్టును కూడా సంపాదించుకున్నారు. వైసీపీ తరపున నిలబడి  గెలిచారు.

పొతే, రఘురామ కృష్ణంరాజుగారు. వై ఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తవర్గంలోని మనిషి. వై ఎస్ ఆర్ కు అత్యంత ఆత్మీయుడైన కేవీపీ కి స్వయానా  వియ్యంకులు. ఆ బాంధవ్యం పిల్లల ప్రేమ వివాహం  వల్ల ఏర్పడింది కాదు. ఉభయపక్షాల పెద్దలు కలిసి కుదుర్చుకున్న సంబంధం. పైగా పెద్ద కాంట్రాక్టరు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం పెద్ద విషయమూ కాదు, పెద్ద కష్టమూ కాదు. వీటికి తోడు ఎమ్మెల్యే కావాలని రాజుగారికి ప్రబలమైన ఆకాంక్ష వుందని కూడా చెప్పుకునేవారు. ఇన్ని హంగులు ఉన్నప్పటికీ ఎన్నికల బరిలో నిలబడే అవకాశం 2019 దాకా రాకపోవడం విచిత్రం.

వై.ఎస్. మరణించేవరకు కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని వుండి, తర్వాత జగన్ వైసీపీతో కలిసివున్నారు. ఆయన జైలుకు పోయిన తర్వాత వైసీపీని వదిలి బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆ పార్టీకి  కూడా ఎంపీ టిక్కెట్టు ఆయనకు ఇవ్వాలనే ఆలోచన ఉండడంతో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ కృష్ణంరాజు గారు ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేసారు. అయితే చివరి క్షణంలో  బీజేపీ అగ్రనాయకత్వం ఆ సీటును గోకరాజు గంగరాజు గారికి కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇండిపెండెంటుగా నామినేషన్ కూడా వేసి ఉపసంహరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ విజయం  దరిమిలా ఆయన ఆ పార్టీకి దగ్గరయ్యారు. చంద్రబాబునాయుడు ఆయన్ని తమ పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టాలని బలంగా కోరుకున్నారు. ఆమేరకు రాజుగారికి మాట ఇవ్వడం ఆయన తన నియోజకవర్గంలో పనులు చేసుకోవడం మొదలయింది కూడా. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ రాజుగారికి టిక్కెట్టు ఖాయం చేసింది. ఏం జరిగిందో తెలియదు కానీ, చివర్లో ఆయన టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ టిక్కట్టు మీద లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (ఇందులో ప్రశాంత్ కిషోర్ పాత్ర వుందని ఇప్పుడు స్వయంగా ఆయనే చెబుతున్నారు). ఏదైతేనేం మొత్తం మీద చట్టసభ సభ్యుడు కావాలనే రాజుగారి కోరిక నెరవేరింది.

పొతే, గత వారం పది రోజులుగా బుల్లితెరలపై సాగుతున్న మరో అంకం గురించి చెప్పాల్సిన పనిలేదనుకుంటా.

(17-06-2020)           


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

రఘు రామ రాజు కు అంట బిల్డప్ అవసరం లేదు. అతడు ఒక నిలకడ లేని మనిషి. అన్ని పార్టీలలో దూరతాడు మారతాడు.