25, జూన్ 2018, సోమవారం

అర్ధం కాని అర్గ్యుమెంటు

ఈ రోజు ఉదయం  AP 24 X 7 ఛానల్ సీయీఓ వెంకట కృష్ణ నిర్వహించే చర్చాకార్యక్రమంలో ఒక వింత వాదన నా చెవిన పడింది. (ఈ అంశంపై జరిగిన చర్చలో నాకు అవకాశం రాలేదు, నా వరకు వచ్చేసరికి మరో అంశం తీసుకున్నారు. ఒకోసారి సమయాభావం వల్ల ఇలా జరుగుతూ వుంటుంది)
విషయం ఇది. ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు ఇరవై వేల మంది గ్రామ సహాయకుల జీత భత్యాలను ఇతోధికంగా పెంచింది. ఆహ్వానించదగ్గ నిర్ణయం. వారందరూ కలిసి అమరావతిలో ఒక సమావేశం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నారు. ఇది కూడా ఆక్షేపనీయం కాదు. గతంలో ఇలాంటి ‘థాంక్స్ గివింగ్ సమ్మేళనాలు’ జరిగాయి కూడా. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఇదేమాదిరి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
అయితే ఈ సమావేశానికి హాజరయ్యే సిబ్బందికి ప్రయాణ వసతి, భోజన ఖర్చుల కింద మనిషికి మూడువందల రూపాయలు చెల్లించాలని రాజంపేట రెవెన్యూ అధికారి ఇచ్చిన ఒక ఉత్తర్వును సాక్షి పత్రిక ప్రచురించింది. అదే ఈ నాటి చర్చలో మొదటి అంశం అయి కూర్చుంది. జనసేన, వైసీపీ ప్రతినిధులు సహజంగానే దాన్ని తప్పుపట్టారు. ప్రజాధనం దుర్వినియోగం అని ఆరోపించారు. నిజానికి ఈ నిర్ణయంతో నేరుగా ముఖ్యమంత్రికి సంబంధం ఉండకపోవచ్చు.”More loyal than the King” అనే బాపతు అధికారులు అలాంటి ఒక ఉత్తర్వు జారీ చేసి ఉండవచ్చు. అతి స్వల్ప జీతాలు తీసుకుంటున్న సిబ్బందికి ఆ మాత్రం ఆర్ధిక సాయం అందిస్తే తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు.
అయితే, ఈ విషయంలో వివరణ ఇవ్వడానికి ఫోన్ లైన్లోకి వచ్చిన ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానం విస్మయ పరిచేదిగా వుంది. ఆయన ఏమన్నారంటే:
“ముఖ్యమంత్రిగారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అందుకు ప్రతిగా ఉద్యోగులు ఆయనకు కృతజ్ఞత తెలపాలని అనుకున్నారు. శ్రీకాకుళం, అనంతపురం వంటి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఆర్టీసీ ప్రత్యెక బస్సులు వేస్తోంది. వచ్చే వారికి టిఫిన్, మధ్యాన్న భోజనం, రాత్రి భోజనం పెట్టడానికి ఒక్కో ఉద్యోగికి మూడు వందలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు కూడా మా సంఘం సభ్యులే. పైగా ఆ డబ్బును ఉద్యోగులు మళ్ళీ ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఇక ఇందులో అభ్యంతర పెట్టాల్సింది ఏముంది?”
నిజమే. ఆ డబ్బును తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారు. కానీ ప్రభుత్వ ఖజానా అనేది ఇలాంటి ఖర్చులకు ‘చేబదులు’ ఇచ్చే వ్యవస్థ కాదుకదా. సిబ్బందికి ఇబ్బంది లేకుండా చూడడమే ఉద్దేశ్యం అయితే సంఘమే ఆ ఖర్చులు భరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు, పైగా అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలకు జవాబు చెప్పాలిసిన దుస్తితి కూడా వచ్చేది కాదు.
ఈ సింపుల్ లాజిక్ ను ఆ నాయకుడు ఎలా మిస్సయినట్టు?

లింక్:
https://www.youtube.com/watch?v=o-eZo6_KZxk

కామెంట్‌లు లేవు: