25, జులై 2017, మంగళవారం

సెన్స్ ఆఫ్ హ్యూమర్


సామాన్యుడికి, ఆ మాటకు వస్తే ఎవరికయినా వారి వారి దినవారీ ఒత్తిళ్ళ నుంచి ఒకింత ఊరట కలిగించేవి చిన్న చిన్న  కార్టూన్లు, జోకులు. సీరియస్  వాతావరణం నుంచి  ఇవి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. కారణం తెలియదు కానీ రాజకీయ నాయకుల్లో ఈ సెన్స్ ఆఫ్  హ్యూమర్ అనే లక్షణం  రోజురోజుకీ తగ్గిపోతోంది. ఒక కార్టూనును  కానీ, లేదా ఒక హాస్య స్పోరక కధనాన్ని కానీ హరాయించుకోలేకపోతున్నారన్నది సుస్పష్టం.  ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో  ఇదొకటి.
ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల్లో  కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో, ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.
ఈ సందర్భంలో  ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం.   1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి  ఘోర పరాభవం ఎదురయినప్పుడు,  ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్,  నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్  కారణంగా ఆయన అభిమానులనుంచి దాడి తప్పదు అని ఆ కార్టూనిష్టు   అనుకుంటుంటే ఒక చిత్రం జరిగింది. లక్ష్మణ్ గారికి  నెహ్రూ నుంచి  ఒక ఉత్తరం వచ్చింది. తెరిచి చూస్తే విషయం ఇది.
‘పొద్దున్నే పత్రికలో మీ కార్టూన్ చూసి నాకెంతో సంతోషమయింది. అది చూడగానే నా మనసుకు ప్రశాంతత చిక్కింది.  అదే కార్టూన్ ని కొంచెం పెద్దదిగా గీసి నాకు  పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అని రాశారు నెహ్రూ.
బాపూ సినిమా ముత్యాలముగ్గులో  రావు గోపాల రావు అన్నట్టు ‘మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి’. నిజమే!

అయితే అది రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.

కామెంట్‌లు లేవు: