11, మే 2015, సోమవారం

బుక్ షెల్ఫ్ ..........


ప్రతి రాజకీయ పార్టీలో క్రమశిక్షణ లేకపోయినా క్రమశిక్షణా సంఘం అంటూ ఒకటి వుంటుంది. 'దొంగవాడికి మడిబట్టలు అడ్డమా' అన్నట్టు ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవారిని ఈ సంఘాలు ఏమీ చెయ్యలేవు. కాకపొతే పార్టీ నుంచి బహిష్కరించే వీలుంటుంది. స్వగృహ ప్రవేశం పేరుతొ ఎంచక్కా  తిరిగి పార్టీలో చేర్చుకుంటున్న రోజుల్లో, నిజం చెప్పాలంటే ఎవరికి వారే పార్టీలో తిరిగి  చేరిపోతున్నట్టు పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటున్న కాలంలో 'బహిష్కరణ వేటు' అనేది  ఏమేరకు ఉపయోగం అనేవారూ వున్నారు.
క్రమశిక్షణ పేరుతొ వేటు వేసేముందు ఆ  సంఘం వారు ఒక నివేదిక ఇస్తారు. అభియోగాలను విచారించేందుకు సీనియర్ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. వారు దర్యాప్తు చేస్తారు. పార్టీ అధ్యక్షుడికి ఒక నివేదిక సమర్పిస్తారు. ఒక పద్దతి అంటూ సాగని  వ్యవహారాలపై విచారణ తతంగం మాత్రం  పద్దతి ప్రకారమే జరుగుతుంది. అలా నియమాలను తోసిరాజని ప్రవర్తించిన సభ్యులను పార్టీ నుంచి తొలగించాలని సంఘం చేసిన సిఫారసును పార్టీ అధ్యక్షులు ఆమోదించి తదనుగుణంగా ఆ సభ్యుడిని బహిష్కరించినట్టు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటారు. అయితే సంఘాల నివేదికల్లో ఏమి పేర్కొన్నదీ బయట ప్రజలకి తెలియదు. పార్టీలో వారికీ తెలియదు. కానీ కొన్ని సందర్భాలలో ఆ అంశాలు బహిర్గతం అవుతుంటాయి. అలా మరుగున పడిపోయిన ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తుంటాయి.
అలాటి సందర్భం తెలుగుదేశం అధినాయకుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నకాలంలో జరిగింది. ఎన్టీఆర్ హయాములో తెలుగు దేశం పార్టీకి సుశిక్షితమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేరుండేది. అలాటి ఆ పార్టీలో,  సీనియర్ సభ్యురాలయిన రేణుకా చౌదరిపై ఒక సారి ఇలాగే త్రిసభ్య బృందాన్ని ఏర్పాటు చేసి ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు జరపమని స్వయానా పార్టీ అధ్యక్షులవారే ఆదేశించారు. శ్రీమతి టీ.ఎన్. సదాలక్ష్మి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రతాపరెడ్డి త్రిసభ్య కమిటీలో  సభ్యులు. సమావేశం అనంతరం  ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇలా వుంది.
"ఇది నా ఆఫీసు, ఈ సిటీ నాది. ఈ సిటీ మొత్తం మీద పెత్తనం నాది. నా అనుమతి లేకుండా నువ్వు (బుచ్చయ్య చౌదరి) ఎవడవురా రావడానికి? వాడు (ఎన్టీఆర్) ఎవడురా పంపడానికి? కొడకా! చేపలు అమ్ముకునే వెధవా? ఏం పీకుతావురా? ఇదేమన్నా గోదావరి అనుకున్నావా?" అని రేణుకా చౌదరి లంకించుకునేసరికి సమావేశాన్ని వాయిదా వేసుకుని త్రిసభ్య సంఘం వారు బయట పడ్డారు. అయినా ఆమె ఒదిలిపెట్టలేదు. తన అనుచరులకు బుచ్చయ్య చౌదరిని చేయితో చూపిస్తూ, 'డక్కా మారో సాలేకో!' అంటూ రేణుకా చౌదరి వారి వెంట పడ్డారు.
ఇంత  జరిగిన తరువాత కూడా రాజీ కుదర్చడానికి ఆఖరు నిమిషంలో పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా రాజీ కోసం తాము  చేసిన ప్రయత్నాలను కమిటీ సభ్యురాలు సదాలక్ష్మికి  వివరించారు. అటు రేణుకా చౌదరి ప్రతిష్ట దెబ్బతినకుండా, ఇటు   రామారావు ఆదేశాన్ని పాటించే విధంగా 'తెలియకుండా జరిగిపోయింది. క్షమించాలి' అని కోరుతూ ఒక లేఖ ఎన్టీఆర్ కి అందచేయాలని తామూ,  చంద్రబాబు నాయుడు రేణుకా చౌదరిని కోరామనీ, అందుకు ఆవిడ కూడా అంగీకరించారనీ, అయితే తెల్లారేసరికల్లా ఏం జరిగిందో కాని మొత్తం పరిస్తితి మారిపోయిందనీ సదాలక్ష్మి చెప్పారు. శ్రీ రామారావుకు ఇష్టం లేకున్నా ఆయనకు నచ్చచెప్పి ఈ రాజీ ప్రయత్నాలు చేసామని సదాలక్ష్మి తెలపడం విశేషం. ఇంత చేసినా పార్టీ నుంచి రేణుకా చౌదరి బహిష్కరణ తప్పలేదు. ఈ ఉదంతాన్ని చంద్రబాబు నాయుడికి ఓటమిగా, దగ్గుబాటి, లక్ష్మీ పార్వతి వర్గాల విజయంగా అప్పట్లో పార్టీలో పరిగణించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ తరువాత రేణుకా చౌదరి లెక్క చేసేది ఒక్క చంద్రబాబునే. ఆమె అంటే బాబుకు కూడా అభిమానం. అందుకే రేణుక  బహిష్కరణ పట్ల ఆయన ఖిన్నులయ్యారు.
బహిష్కరణ నిర్ణయంతో రేణుకా చౌదరి ఏ మాత్రం బెదరలేదు. పైపెచ్చు సంచలన వ్యాఖ్యలు చేసారు. 'నన్ను బహిష్కరించి ఎన్టీఆర్ ఇన్నాల్టికి మగాడనిపించుకున్నాడు. థాంక్స్.' ఇదీ ఆవిడ ప్రతిస్పందన.
(తదనంతర కాలంలో వడివడిగా సాగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, రేణుకా చౌదరిని తిరిగి తెలుగు దేశం పార్తీలోకి చేర్చుకోవడం జరిగాయి.  కాని, రేణుక ఇమడ లేకపోయారు. మూడోసారి రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వనందుకు బాబు వైఖరిపై కినిసి రేణుకా చౌదరి, కాంగ్రెస్ లో చేరి 1999 ఎన్నికల్లో ఆ పార్టీ టిక్కెట్టుపై ఖమ్మం నుంచి లోక సభకు ఎన్నికయ్యారు) 

  

(సీనియర్ జర్నలిష్ట్  ఐ. వెంకట్రావు, ఎన్టీ రామారావు పై రాసిన  'ఒకే ఒక్కడు' పుస్తకం ఆధారంగా)                   

2 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

మంచో,చెడో ఎన్.టి.ఆర్ చాలా విషయాలలో ఒక్క మగాడు గానే వ్యవహరించారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Kondala Rao Palla - అందుకే వెంకట్రావు గారు రామారావు గారి మీద రాసిన తన పుస్తకానికి 'ఒకే ఒక్కడు' అని పేరు పెట్టుకున్నారు.