10, ఆగస్టు 2011, బుధవారం

ఓ చిట్టెలుక కధ – భండారు శ్రీనివాసరావు

ఓ చిట్టెలుక కధ – భండారు శ్రీనివాసరావు


 

అనగనగా ఒక రైతు. ఇంట్లో ఎలుకల బాధ భరించలేక ఆదివారం సంతకు వెళ్లి ఎలుకల బోను తెచ్చాడు.

అప్పుడే కన్నంలో నుంచి తలబయట పెట్టిన ఓ చిట్టెలుకకు ఆ బోనును చూడగానే ముచ్చెమటలు పట్టాయి.

వెంటనే రివ్వున పొలం వెళ్లి తను చూసిన విషయాన్ని తోటివారికి చెప్పాలనుకుంది.

‘రైతు సామాన్యుడు కాడు. మనల్ని పట్టుకోవడానికి బోను కొనుక్కుని వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త’ అని ఎలుగెత్తి అరిచింది.

ఎలుక హడావిడి చూసి కోడిపుంజుకు చిర్రెత్తుకువచ్చింది.

‘అయితే ఏమిటట. బోను తెస్తే భయపడాల్సింది నువ్వు. మాకెందుకు భయం?’ అంటూ కొక్కొరోకో అనబోయి ఇంకా తెల్లవారలేదన్న సంగతి గుర్తుకొచ్చి వూరుకుంది. ఇంత పెద్ద కబురు తెస్తే కోడి పుంజు అలా గాలి తీసినట్టు తేలిగ్గా తీసిపారేయటం చూసి చిట్టెలుక చిన్నబుచ్చుకుంది. పక్కనే పడుకున్న పంది దగ్గరకు వెళ్లి తన కడుపులోమాట చెప్పి బావురుమంది. పంది ఎలుకను ఓదార్చింది. బోను గురించి భయపడాల్సిన పని తనకు లేదని అంటూ ఎలుక క్షేమం కోసం ప్రార్ధనలు చేస్తానని హామీ ఇచ్చింది.

ఎలుక అంతటితో వూరుకోకుండా దోవలో కనబడ్డ ఎద్దుకు బోను విషయం చెప్పి ‘అందరం కలసి ఏదో చెయ్యకపోతే అందరికీ మూడుతుందని’ హెచ్చరించింది.

ఎద్దు దానికి సమాధానంగా ‘ఓసి పిచ్చిమొద్దూ . రైతు ఎలుక బోను తెచ్చాడని నేను కంగారు పడితే అర్ధం ఏమిటి. అందులో నా కాలి గిట్ట కూడా పట్టదు’ అని ఎగతాళి చేసింది.

ఇక ఎలుకకు ఏమి చేయాలో తెలియక ఇంటి దారిపట్టింది.

ఆ రాత్రి రైతు ఇంట్లో పెద్ద శబ్దం వినిపించింది. ఎలుకల బోను హటాత్తుగా మూసుకోవడంతో వచ్చిన చప్పుడు అది. రైతు భార్య లేచి బోను వద్దకు వెళ్ళింది. చీకట్లో అందులో ఏదో చిక్కుకున్న సంగతి లీలగా బోధపడింది. తీరా చూస్తే అది ఒక విష సర్పం. దాని కాటుకు రైతు భార్య స్పృహ కోల్పోయింది. వెంటనే వూళ్ళో వైద్యుడిని పిలుచుకు వచ్చారు. అతడేదో మందువేసి నీరసంగా వున్న రైతు భార్యకు ఏదయినా బలవర్ధక ఆహారం పెట్టమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.

రైతుకు పొలంలో వున్న కోడిపుంజు గుర్తుకు వచ్చి దానిని కోసి భార్యకు ఆహారంగా ఇచ్చాడు.

విషయం తెలుసుకున్న ఇరుగూ పొరుగూ చూడడానికి వచ్చారు. వారిలో కొందరు ఆమెను కనిపెట్టుకు చూడడానికి అక్కడే వుండిపోయారు. వారికోసం రైతు పందిని కోసి వండక తప్పలేదు.

కానీ, దురదృష్టం. వైద్యుడు ఇచ్చిన ఔషధం కన్నా విషం బాగా పని చేసి రైతు భార్య ఆ మరునాడు కన్నుమూసింది.

ఆమె కర్మకాండకు ఎంతో దూరం నుంచి చుట్టపక్కాలు వచ్చారు. వారికి వొండి పెట్టడానికి రైతు ఎద్దును కోయాల్సివచ్చింది.

ఈ పరిణామాలన్నింటినీ ఎలుక తన కలుగులోనుంచి గమనిస్తూ తన తోటివారు ఒక్కొక్కరే కనుమరుగు కావడం చూసి ఎంతో బాధపడింది.

ఒక విదేశీ జానపద కధాంశం ఆధారం అయిన ఈ చిట్టెలుక కధలో నీతి ఏమిటంటే –

‘ఎవరయినా ఏదయినా సమస్యలో చిక్కుకుని మన వద్దకు వచ్చినప్పుడు ఆ సమస్య మనది కాదని తప్పుకోవడం మంచిది కాదు. సంఘ జీవనంలో వున్నప్పుడు అందరి సమస్యలు అందరివీ అనుకోవాలి.’

(10-08-2011)

5 కామెంట్‌లు:

రాజేష్ మారం... చెప్పారు...

కథ చాలా బాగుంది...

Rao S Lakkaraju చెప్పారు...

Good One.

lekkala panthulu చెప్పారు...

katha chaala bagundhandi....

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rajesh Maram,@Rao S Lakkaraju,@Lekkalapantulu - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

రాజేష్ జి చెప్పారు...

మంచి స్పూర్తివంతమైన కధ.. పంచుకున్నందుకు ధన్యవాదాలు..!