10, జులై 2017, సోమవారం

బదరీ కేదార్ యాత్ర (1996) ఆరో భాగం – కొమరగిరి అన్నపూర్ణ


మర్నాడు తెల్లవారుఝామున్నే లేచి స్నానాలు కానిచ్చి బస్సులో రుద్రప్రయాగ చేరుకున్నాము. అక్కడ మందాకినీ, అలకనంద నదులు కలుస్తాయి. కానీ అక్కడ నీళ్ళు ఇఘాలు. అంత చల్లటి నీళ్ళలో స్నానాలు కష్టమని శ్రీనగర్ లోనే ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చాము కనుక నదిలో నీళ్ళు నెత్తిన చల్లుకున్నాము. బస్సు ఆగిన చోటునుంచి నది దగ్గరికి చేరుకోవడం కూడా కష్టం. ఇరుకు దారి. కాలు జారింది అంటే ఏకంగా నదిలో పడడమే. ఎట్లాగో అందరం చేతులు పట్టుకుని కిందికి దిగాము. యాభయ్ మెట్లు ఎక్కితే గంగాభవాని, శివాలయాలు వున్నాయి. అటునుంచే వెళ్లి బస్సు పట్టుకున్నాము. సాయంత్రం మళ్ళీ శ్రీనగర్ వెళ్లి పడుకున్నాము. మరుసటి రోజు కేదార్ ప్రయాణం.
ఉదయం ఎనిమిది గంటలకు గౌరీ కుండ్ చేరాము. అక్కడి వరకే బస్సు ప్రయాణం. తరువాత కాలినడక లేదా గుర్రాలపైనా కానీ డోలీలలో కానీ వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళకు పదకొండువందల చొప్పున అయిదు డోలీలు, నాలుగువందల చొప్పున ఆరు గుర్రాలు మాట్లాడారు. పదకొండుగంటలకు అయిదుగురు అక్కచెల్లెళ్ళం అయిదు డోలీలు ఎక్కాం. మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కారు. డోలీలు ఉయ్యాల మాదిరిగా వున్నాయి. ముందర ఇద్దరు మనుషులు, వెనక ఇద్దరు పట్టుకుని మోస్తారు.
బయలుదేరేటప్పుడు పెద్ద చలి ఉంటుందనుకోలేదు. అంచేత అందరం చిన్న స్వెట్టర్లు వేసుకుని శాలువలు కప్పుకున్నాం. వర్షం పడుతుందని బస్సువాడు చెప్పడంతో రెయిన్ కోట్లు అద్దెకు తెచ్చారు. ఒక కిలోమీటరు వెళ్ళామో లేదో పెద్ద వర్షం పట్టుకుంది. మేము తడవలేదు కానీ ఒకటే ఈదురుగాలి. దారిలో అక్కడక్కడా చిన్న పందిర్లు ప్లాస్టిక్ షీట్లతో వేసుకుని టీ, కాఫీ, రొట్టెలు, బిస్కెట్ల వంటివి అమ్ముతున్నారు. అంతంత దూరాల్లో తోడు లేకుండా ఎలా వుండగలుగుతున్నారో. ఒక వైపు చూస్తే కళ్ళు తిరిగే లోయ. అందులో హోరుమని చప్పుడు చేస్తూ మందాకినీ నదీ ప్రవాహం. మరో వైపు ఆకాశాన్ని అంటే హిమాలయాలు. ఇరుకు దారి. వందలకొద్దీ గుర్రాలు, డోలీలు. కాలినడకన సాగిపోయే వందలాది మంది యాత్రీకులు. పైగా వాన, బురద, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఏమాత్రం కాలుజారినా పాతాళంలో పడిపోవడమే. ఇక గుర్రాలు ఎలా తర్పీదు ఇచ్చారో కానీ, మెల్లగా దారి అంచున కొననుండి పోతుంటాయి. గుర్రాలకు, వాటిని తీసుకువెళ్ళే వాళ్లకు అలవాటు కావచ్చు కానీ యాత్రీకులకుకొత్త కదా! గుండెలు పీచు పీచుమంటూ వుంటాయి. డోలీల్లో కూర్చున్నామనే కానీ మా కాళ్ళూ చేతులూ చలికి వంకర్లు పోతున్నాయి. భారతికి కీళ్ళ నొప్పులు. చలికి అసలు తట్టుకోలేక గజగజా వణికి పోతోంది. భాష తెలియకపోయినా డోలీల వాళ్ళు దాన్ని మోసుకుపోయి దగ్గరలో ఒక పొయ్యి దగ్గర కూర్చోబెట్టి కాళ్ళూ చేతులూ కాపడం మొదలు పెట్టారు. అది చూసి ప్రేమకు, నాకూ భయం వేసింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కేదార్ ప్రయాణం ఇప్పుడే మొదలయింది. ఇంకా చాలా దూరం పోవాలి. చలి ఇప్పుడే ఇలా వుంది. ముందు ముందు ఇంకా ఎలా వుంటుందో. పైగా ఇక్కడ అంతా ఎవరికి వారే. అందర్నీ కలుపుకుపోవడం వుండదు. మిగిలిన వాళ్ళ పరిస్తితి మనకు తెలియదు, మనం ఎలా ఉన్నామో వాళ్లకు తెలియదు. ఇంతలో సురేష్ గుర్రం మీద వస్తూ కనిపించాడు. మేము కేకలు పెడితే చూసి దగ్గరకు వచ్చాడు. వాడిని చూడగానే రవంత ధైర్యం వచ్చింది.
డోలీల వాళ్ళు వాన బాగా వుంటే ఆగడం, తగ్గితే బయలుదేరడం చేస్తున్నారు. ఆగినప్పుడల్లా భారతి చలి తట్టుకోలేక పోతోంది. మా పరిస్తితి అంతంత మాత్రంగానే వుంది. ఇంతలో రంగారావు గారు గుర్రం మీద వస్తూ కనిపించారు. ఆయన వచ్చి భారతికి కాళ్ళూ చేతులూ కాపడం పెట్టించి వేడి వేడి కాఫీ తాగించారు. ఈలోగా శారదక్కయ్య, సావిత్రి వస్తున్న డోలీలు కూడా వచ్చి ఆగాయి. అందరం కాఫీలు తాగి బయలుదేరాము.
వేడి కాఫీ కడుపులో పడేసరికి కాస్త కోలుకున్నాం. డోలీ నుంచి చూస్తె పర్వతశ్రేణులు, వాటిపై రకరకాల చెట్లు, పూలతో ప్రకృతి రమణీయంగా కనబడింది. వాన వచ్చినప్పుడు కొండ వారన ఆగడం, తగ్గగానే బయలుదేరడం ఇలా డోలీ వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. కొండరాళ్ళు విరిగి మీదపడే ప్రమాదం పొంచి వుందని తెలిసికూడా అందరూ అలా ప్రయాణం చేస్తూ వుండడం చూస్తే అంతా దైవ లీల అనిపించింది. అవన్నీ చూస్తుంటే, ‘జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలు, మామూలు మేరకు ముడవలేక, ఎంత శ్రమనొందుచుంటివో స్వామి’’ అన్న జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి (కరుణశ్రీ) పద్యం గుర్తుకు వచ్చింది. చూస్తుంటే, పైనుంచి కొండరాళ్ళు దొర్లి పడకుండా ఏదో దివ్య శక్తి చేతులతో ఆపుతున్నట్లే వుంది. (ఇంకా వుంది)

9, జులై 2017, ఆదివారం

బదరీ కేదార్ యాత్ర (1996)– ఐదో భాగం - కొమరగిరి అన్నపూర్ణ


ఋషీకేశ్ నుంచి హిమాలయాలు ప్రారంభం. అక్కడి నుండే ఘాట్ రోడ్డుపై ప్రయాణం మొదలు. కొంత దూరం పోయిన తరువాత చల్లటి మంచి నీళ్ళు దొరుకుతాయని ఒక చోట బస్సు ఆపారు. అందరం వెళ్లి వాటర్ బాటిల్స్ లో తెచ్చుకున్నాము. ఎండ తీక్షణంగానే వున్నా గాలి చల్లగానే వీస్తోంది. కనుక హాయిగానే వుంది. ఒక వైపు అగాధమైన లోయ. మరో వైపు ఆకాశాన్ని అంటే పర్వతాలు. బస్సులో చాలామంది తెలుగు వాళ్ళు వున్నారు. ఒకామె ‘తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి’ అంటుంటే ఆమె భర్త కాబోలు, మా వైపు చూపించి ‘ మామ్మగార్లు చూడు ఇంత వయస్సులో కూడా ఎలా హుషారుగా తిరుగుతున్నారో’ అని భార్యని మందలిస్తున్నాడు.
గైడు మాకు హిమాలయాలను చూపిస్తూ హిమాలయాల్లో పెద్దవీ, చిన్నవీ కలిపి మొత్తం లక్షా పదిహేనువందల పర్వతాలు వున్నాయని చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. కాళిదాసు హిమాలయాలను మానదండం (రూళ్ళ కర్ర) గా వర్ణించాడు.
కొంత దూరం వెళ్ళిన తరువాత మళ్ళీ బస్సు ఆపారు. ‘ఇక్కడే భాగీరధి (గంగ), అలకనంద నదుల సంగమం వుంది వెళ్లి చూడండి అన్నాడు గైడు. అందరూ దిగి వెళ్లి నెత్తిన నీళ్ళు చల్లుకు వచ్చారు.  నేను, సావిత్రి కొంతదూరం వెళ్లి నడవలేక వెనక్కి వచ్చి బస్సులో కూర్చున్నాము. రంగడు సీసాలో నీళ్ళు తెచ్చిస్తే చల్లుకున్నాము.దాన్ని దేవా ప్రయాగ అంటారుట.
బస్సులో నుంచే సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసాము. ఎంతో మనోహరంగా వుంది. మనకు దగ్గరలోనే సూర్యుడు
 అస్తమిస్తున్న అనుభూతి కలిగింది. ఘాట్ రోడ్డు ప్రయాణం భయంకరంగానే అనిపిస్తుంది, వెళ్లినంతసేపు. ఎట్లాగో భగవంతుని దయ వల్ల క్షేమంగా శ్రీనగర్ చేరాము.
కాశ్మీరు రాజధాని శ్రీనగర్, ఈ శ్రీనగర్ ఒకటి కాదు. ఇది వేరు. ఇక్కడ అందర్నీ ఒక సత్రంలో బస చేయించారు.
మా పదకొండు మందికీ విడిగా రెండు గదులు ఇచ్చారు. గదికి అయిదువందలు అద్దె. అందరం మొహాలు కడుక్కున్నాం. స్వర్ణ మర్నాటికి అందరికీ కావాల్సిన బట్టలు అవీ తీసి మడతలు పెట్టి సర్దిఉంచింది.  రాత్రంతా బస్సులో సరిగా నిద్ర పట్టలేదు. మళ్ళీ తెల్లవారు ఝామున్నే ప్రయాణం. డోలీలు, గుర్రాలు ఎక్కడం ఎల్లా అనేదాని మీదే చర్చ. గుర్రానికి అయిదువందలు, డోలీకయితే పదిహేనువందలుట. శారదక్కయ్య, సావిత్రి  గుర్రం ఎక్కడానికి భయపడుతున్నారు. రంగారావు గారు నవ్వుతూ ‘ మీరు గుర్రాలు ఎక్కి ఏమైనా అయితే మీ కొడుకులకు నేనేం సంధానం చెబుతాను,డబ్బు పొతే పోయింది డోలీలే ఎక్కిస్తాను’ అని అన్నాడు.

ఫలహారం చేసి, మజ్జిగ తాగి ఆ రాత్రి పడుకున్నాము. హాయిగా నిద్ర పోయాము. ఈ విధంగా నాలుగో రోజు ప్రయాణం ముగిసింది. (ఇంకా వుంది)

అవినీతి వేలం పాటలు తగ్గించాలి


నిన్న సాయంత్రం (శనివారం) మహా టీవీ ‘ఎడిటర్స్ టైం’ ప్రోగ్రాం లో మాట్లాడాలని పిలిచారు. ఫోన్ ఇన్ కాబట్టి బయటకు పోవాల్సిన పని లేదు, వర్క్ ఫ్రం హోం లాగా. మహా టీవీ ఎడిటర్ ఐ. వెంకట్రావు గారు, నేను, ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం బెజవాడ ఆంద్రజ్యోతిలో కలిసి పనిచేసాము. నాపట్ల ఇప్పటికీ అప్పటి వాత్సల్యం చెక్కు చెదరలేదు. ఫేస్ బుక్ లో నేను రాసే వాటిని ఆయన శ్రద్ధగా చదువుతారు. ముందు కాసేపు ఆ విషయాలనే ప్రస్తావిస్తారు. ఇవ్వాళ మా పెద్దన్నయ్య పర్వతాల రావు గురించి రాసింది చదివినట్టున్నారు. ఆయనతోనే మా సంభాషణ మొదలయింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా వుంటే పర్వతాల రావుగారు తెలుగు ప్రజలు గర్వించే రచయిత అయ్యేవారనేది వెంకట్రావు గారి అభిప్రాయం.
తరువాత సంభాషణ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఇంబర్స్ వైపు మళ్ళింది. ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం గురించి అడిగినప్పుడు నేను ‘వివరణ’గా చెప్పాను. ఆకాశవాణి విలేకరిగా ప్రభుత్వాధినేతలతో మంచి సంబంధాలు ఉండేవని, అయితే వారిలో అంజయ్య, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురితో వ్యక్తిగత పరిచయం ఎక్కువని, కారణం వారు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు నాకు బాగా నచ్చడం వల్ల కావచ్చునని చెప్పాను. వైఎస్ తరువాత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ మొదలయిన పధకాలను యథాతధంగా కొనసాగించి ఉన్నట్టయితే ఈ సరికి తెలుగు రాష్ట్రాలలో అట్టడుగు ప్రజలు బాగుపడి వుండేవారన్నాను. ఇంజినీర్ అనిపించుకోవడం వల్ల బడుగువర్గాలకు చెందిన వారికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా సమాజంలో వారి స్థాయి పెరిగి, వారిలో ఆత్మన్యూనతా భావం తగ్గిపోతుందని, ఈ పధకం వల్ల ఇతరత్రా లభించే లబ్దికంటే ఇది చాలా ముఖ్యమని అన్నాను. దీనికి ఉదాహరణలు ఇచ్చాను. ఇవన్నీ గతంలో నేను నా బ్లాగులో రాసుకున్నవే. అమల్లో కొన్ని లోపాలు వున్నాయని, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో జరిగే అవినీతితో పోల్చినా, ఈ పధకాల వల్ల బడుగు,బలహీన వర్గాలకు జరిగే ప్రయోజనాలతో పోల్చి చూసుకుంటే వీటిల్లోని లొసుగులు చాలా స్వల్పమని చెప్పాను. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పధకాలను సరిగా పట్టించుకోకపోవడం వల్ల పేద ప్రజలు బాగా నష్ట పోయారని అన్నాను.
తరువాత సహజంగానే టాపిక్ వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్లీనరీ మీదకు మళ్ళింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రచురించిన అవినీతి చక్రవర్తి పుస్తకం ప్రస్తావన వచ్చింది. గతంలో జగన్ లక్ష కోట్ల అవినీతి గురించి విస్తృత ప్రచారం జరిగిందని, లక్ష కోట్లు, లక్ష కోట్లు అంటూ పదేపదే చెబుతూ పోవడంతో అదే నిజమని జనం నమ్మే పరిస్తితి వచ్చిందని, అంతిమంగా వేసిన చార్జి షీట్లలో పేర్కొన్న అవినీతి ఆ స్థాయిలో కనబడలేదని, ఇటువంటి ప్రచారాల వల్ల ప్రత్యర్ధి పార్టీలకు రాజకీయ ప్రయోజనం లభించవచ్చేమో కానీ ప్రజలకు రాజకీయ పార్టీల పట్ల ఏహ్యభావం పెంచుకునే అవకాశం ఉంటుందని అన్నాను. ఇప్పుడు వై.ఎస్.ఆర్.సీ.పీ. అదే పల్లవి ఎత్తుకుని చంద్రబాబును అవినీతి చక్రవర్తి గా అభివర్ణిస్తూ, గత మూడేళ్ళ కాలంలో ఆయన అవినీతి మూడుకోట్ల డెబ్బయి లక్షల స్థాయిలో వుందని సాక్ష్యాధారాలతో ఒక పుస్తకం వేసారని చెబుతూ, ఇలా అవినీతి లక్షల కొట్లలో జరుగుతున్నట్టు పై పాటలు పాడుతూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పొతే ప్రజలకు రాజకీయ నాయకులు అంటేనే విరక్తి కలిగే ప్రమాదం ఉంటుందని, అది ప్రజాస్వామ్యానికి మేలు చేయదని చెప్పాను.
ఆంద్ర ప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీలు ఎదుటివారిని విమర్శలతో ఎండగట్టె క్రమంలో ముందుకు వెడుతున్నాయని, ప్లీనరీలో జగన్ పక్షం వాళ్ళు ‘చంద్ర నామస్మరణ’ చేస్తే, ప్లీనరీ వెలుపల టీడీపీ మంత్రులు మూకుమ్మడి ‘జగన్నామ స్మరణ’ చేసారని చెప్పాను.
(విచిత్రం ఏమిటంటే ఈ రోజు (ఆదివారం) ఉదయం TV-5 News Scan లో కూడా విజయ్ నారాయణ్ ఈ అంశాల మీదనే నా అభిప్రాయం అడిగారు. దాదాపు ఇదే మోస్తరు జవాబులు చెప్పాను)

7, జులై 2017, శుక్రవారం

బదరీ కేదార్ యాత్ర (1996) నాలుగో భాగం – కొమరగిరి అన్నపూర్ణ

ఋషీకేశ్ లో బస్సు దిగగానే తొందర తొందరగా కాలకృత్యాలు పూర్తి చేసుకుని గంగా స్నానానికి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా నున్నటి తళతళ మెరిసే గుండ్రాళ్ళు. మంచి మంచివి  ఎంపికచేసుకుని తీసుకుపోతుంటే వాటికంటే మంచివి కనిపించేవి.  అలా వాటిని ఏరుకుంటూ కుప్ప  పోస్తుంటే గమనించిన ఓ పెద్దాయన, ‘ఆ  గుండ్రాళ్ళు  ఏం చేసుకుంటారు, మంచి  సాల గ్రామాలు దొరుకుతాయి, వెతుక్కోండి’ అని సలహా చెప్పి చక్కా పోయాడు.
గంగలో నీళ్ళు ఫ్రిజ్ నుంచి తీసినట్టు చాలా చల్లగా వున్నాయి. పెద్ద వాళ్ళం అలా ఇగపు నీళ్ళతోనే వణుక్కుంటూ స్నానాలు ముగించాము, స్వర్ణ, భారతి పెద్ద కోడలు మాత్రం ఎంతో ఓపిగ్గా మా తడి బట్టలు ఆరవేయడంలో, సంచులు మోయడంలో సాయపడుతూ వుంది. సురేష్ పెళ్ళయిన తరువాత శారదక్కయ్యకు స్వర్ణతో అంతగా పరిచయం వున్నట్టు లేదు. స్వర్ణను చూసి చాలా ముచ్చట పడింది. అలాంటి కోడలు దొరికిన భారతి అదృష్టవంతురాలని, పెద్ద వాళ్ళను కనిపెట్టుకుని చూసే ఓపిక ఉన్న కోడలు దొరికిందని కితాబు ఇచ్చింది. బట్టలు ఆరిన తరువాత గుండ్రాళ్ళు మోసుకు వద్దామంటే మాకు అలవి కాలేదు. చివరకు ఏరినవన్నీ అక్కడే వదిలేసి శాంపిల్ కు కొన్ని తెచ్చుకున్నాము. బస్సులో శివానంద ఆశ్రమానికి చేరుకున్నాము. అక్కడ కూడా అన్నీ పాలరాతి విగ్రహాలే. రాధాకృష్ణులు, శివానంద, హనుమాన్ విగ్రహాలు ఉన్న ఆ హాలు ఎంతో ప్రశాంతంగా వుంది. ఈ వయస్సులో, ఆరోగ్యం సరిగా లేని స్తితిలో ఇంత దూరాభారంలో ఇలా యాత్రలు చేస్తూ ఇవన్నీ చూడగలుగుతున్నాను అంటే అది కేవలం భగవంతుని కృప వల్లే సాధ్యం.
అక్కడినుండి లక్ష్మణ్ ఝూలా వెళ్ళాము. మధ్యలో స్తంభాలు అనేవి లేకుండా ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు తీగెలు బిగించి గంగపై నిర్మించిన వంతెన అద్భుతంగా వుంది. దీనిపై వాహనాలను అనుమతించడం లేదు, కేవలం కాలినడకన వెళ్ళే వాళ్ళు మాత్రమే. మనం వంతెన మీద నడుస్తుంటే అది ఉయ్యాల మాదిరిగా ఊగుతుంది. అందుకే లక్ష్మణ్ ఝూలా అన్నారు. ఝూలా అంటే ఉయ్యాల. కొందరు ‘రాం ఝూలా’ అని కూడా అంటుంటారు. ఆ వంతెన మీద నుంచి కిందికి చూస్తే స్వచ్చంగా పారుతున్న గంగా ప్రవాహం మనోహరంగా కానవస్తుంది. నాకయితే కళ్ళు తిరిగినట్టయింది. మొదట భయం వేసింది కాని తరువాత బాగానే  అనిపించింది.
రంగారావు గారికి రుద్రాక్షలు కొనుక్కోవాలని అంటే బస్సు వాళ్ళు ఓ దుకాణానికి తీసుకువెళ్ళారు.   ఆయన మూడువేలు పెట్టి రుద్రాక్షలు, నవరత్న గొలుసులు, ఉంగరాలు కొన్నారు. అక్కడ చెప్పులు తెగితే వేరే జత కొనుక్కున్నాము. మందులు, గ్లూకోజు వంటివి పెట్టుకోవడానికి వీలుగా వుండే ఓకే చిన్న బ్యాగు నేను కొనుక్కున్నాను, గుర్రం మీద వెళ్ళాల్సి వస్తే బేగ్ అయితే తేలిగ్గా ఉంటుందని.
అక్కడ నుండి టాక్సీ మాట్లాడుకుని మళ్ళీ లక్ష్మణ్ ఝూలా వద్దకు చేరుకున్నాము. అక్కడ ఒక చిన్న హోటల్లో ఇడ్లీ తిని, కాఫీ తాగి త్రిమూర్తుల ఆలయానికి వెళ్ళాము. ఆ గుడి అనేక అంతస్తులతో కట్టారు. త్రిమూర్తులు సకుటుంబంగా అక్కడ కొలువు తీరారు. వారితో పాటు సప్త ఋషులు, సనకసనందనాదులు, నారదుడు విగ్రహాలు అయినా సజీవంగా ఉన్నట్టే కానవచ్చారు. పదమూడు అంతస్తులు ఎక్కితే అక్కడ శంకరాచార్యుల వారున్నారని అన్నారు. కానీ నాకు చేతకాక పోలేదు. విమల, స్వర్ణ ఓపిక చేసుకుని అన్ని మెట్లు ఎక్కారు.
తరువాత దత్తాత్రేయులు, దుర్గాదేవి, సంకట మోచన్ హనుమాన్, విఘ్న వినాశక గణేష్   ఆలయాలు చూసాము. ‘అక్కడ వుండే పాండు రంగడు ఇక్కడ వున్నాడు’ అని అంటారు కానీ యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడి నదులు, దేవాలయాల పవిత్రత, ఆ సమయంలో మనలో కలిగే అనిర్వచనీయమైన అనుభూతి, ఆనందం అనుభవిస్తే కాని అర్ధం కాదు.

(ఇంకా వుంది)               

6, జులై 2017, గురువారం

బదరీ, కేదార్ యాత్ర (1996) మూడో భాగం – కొమరగిరి అన్నపూర్ణ


రైల్లోనే రెండో రోజు గడిచిపోయింది. మర్నాడు ఉదయమే లేచి మొహాలు కడుక్కున్నాం. మా కంపార్టు మెంటులో మిగిలిన వాళ్ళందరూ హడావిడిగా సామాన్లు సర్దుకుంటున్నారు. అది చూసి ప్రేమ ‘ఢిల్లీ వచ్చిందేమో’ అన్నది. శారదక్కయ్య కిటికీ లో నుంచి చూసి ‘ఢిల్లీలో ఇలా ఖాళీ స్థలాలు వుంటాయా!కాదేమో’ అన్నది సందేహంగా. ఇంతలో శేషు, రంగడు వచ్చి ‘ఢిల్లీ వచ్చింది, పదండి’ అనేసరికి అందరం హడావిడిగా సామాన్లు తీసుకుని కిందికి దిగాము. అక్కడ హిందీ తప్ప మన మాట వినిపించదు. టాక్సీలు మాట్లాడుకుని ఇండియా హోటల్ కు వెళ్ళాము. స్నానాలు ముగించి మధ్యాన్నం ఆంధ్రా భోజనం పెట్టే హోటలుకు వెళ్లి భోజనం చేసాము. నాకూ, ప్రేమకూ మొదటి నుంచి హోటళ్ళలో వాళ్ళు పెట్టే కంచాల్లో అన్నం తినబుద్ది అయ్యేది కాదు. ఒకసారి తమ్ముడు శ్రీనివాసరావు చిన్నవాడయినా మాకు ఓ పెద్ద మాట చెప్పాడు. ‘వాళ్ళు తిన్న కంచం, వీళ్ళు తగిన గ్లాసు అనుకుంటే మనసు పరిపక్వం కాదు. అందరూ భగవత్ స్వరూపులే అనుకున్నప్పుడు ఆ తేడా రాదు. అలాంటివి మనసులోకి రానివ్వకూడదు’. అప్పటి నుంచి ఆ తేడా తీసేసుకుని ఏ కంచంలో అయినా తింటూనే వున్నాను. భోజనాలు అయిన తరువాత ఊరు తిరిగి చూద్దామంటే కళ్ళు తిరిగే ఎండ, వడగాలి. అందుకని హోటల్ కు తిరిగొచ్చి పండుకున్నాము. టాక్సీలో వచ్చేటప్పుడు రంగడు ‘ఇదిగో ఇదే ఇండియా గేట్’ అంటూ చూపించాడు. ఢిల్లీలో మేము చూసిన విశేషం అదొక్కటే. అదీ కారులోనుంచి.
మంచి నిద్ర పట్టింది. ఇంతలో బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. తలుపు తీద్దామంటే రావడం లేదు. కింది గదిలో విమల, ప్రేమ పడుకున్నారు. పైన గదిలో నేనూ, శారదక్కయ్య, సావిత్రి పడుకున్నాము. తలుపు తెరుచుకోలేదు. మాకు భయం వేసింది. పై గది నుండి కింది గదిలోకి ఇనుప మెట్లు వున్నాయి. అది మా అదృష్టం. వెంటనే దిగి కిందికి వెళ్ళాము. విమల తలం తీసింది. బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాము. తలుపు కొట్టిందెవరో తెలియలేదు.
బదరీ, కేదార్ యాత్రకు ముందుగా మాట్లాడుకున్న బస్సు ఎక్కాము. మేమే పదకొండుమందిమి. ముందుగా బస్సును ఢిల్లీలోని హనుమాన్ మందిర్ వద్దకు తీసుకుపోయారు. కేదార్ యాత్ర కష్టమైంది కదా! భగవదనుగ్రహం కోసం అక్కడ బస్సుకు పూజ చేయించారు. అందరం దిగి గుళ్ళోకి వెళ్లి దర్శనం చేసుకున్నాము. అన్నీ పాలరాతి విగ్రహాలు. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమ విగ్రహాలే కాకుండా వినాయకుడు, కుమారస్వామి, శివుడు, పార్వతి ఇలా అందరూ వున్నారు. సంతోషి మాత, లక్ష్మీనారాయణుడి విగ్రహాలు కూడా వున్నాయి. ఈ యాత్రల్లో మొదలు చూసిన గుడి ఇదే. ఆంజనేయ స్వామి విగ్రహం ఒక వైపు తిరిగి వుంటుంది. అంచేత అయన మోహంలో ఒక కన్నేమనకు కనబడుతుంది. ఇలాంటిదే మా వూరు కంభంపాడు హనుమంతుడి గుడిలో వుంది. ఒక బల్లపరుపు రాతి మీద విగ్రహం చెక్కడం చేత మా వూరి గుడిలో హనుమంతుడికి కూడా ఒక కన్నేకనిపిస్తుంది. మళ్ళీ బస్సెక్కాము. మన వైపు బస్సులే చాలా నయం. అక్కడి బస్సుల్లో ఎందుకో కానీ సీట్లు ఇరుకిరుకుగా వుంటాయి. అయినా సర్దుకుని అలాగే నిద్ర పోయాము. తెల్లారేసరికి ఋషీకేష్ చేరాం. (ఇంకా వుంది)

5, జులై 2017, బుధవారం

మాస్కోలో కారప్పూస

  
మాస్కో రేడియోలో పని ముగించుకుని ఆఫీసునుంచి బయలుదేరాలని అనుకునే సమయంలో నటాషా ఎదురుగా వచ్చింది. రష్యన్ భాషలో ‘ట’ లు లేవు, ‘త’లు తప్ప అనేవారు కలం కూలీ జీ. కృష్ణ గారు.  కానీ, నేను మాత్రం  కాస్త వత్తిపలికినట్టుగా వుంటుందని ‘నటాషా’ అని  పిలిచేవాడిని. నా రష్యన్ భాషా ప్రావీణ్యం పేరు పెట్టి పిలవడం వరకే. ఆ తరువాత ఏదో సినిమాలో జంధ్యాల చెప్పినట్టు ఆదివారం మధ్యాన్నం టీవీ వార్తలే. అంటే కేవలం సైగలే.
నటాషా రష్యన్ భాషలో  గడగడా ఏదో చెప్పింది. ఆ చెప్పిన దాన్ని తెలుగు తెలిసిన నా రష్యన్ సహచరుడు గీర్మన్  అనువదించి చెప్పాడు. ‘నతాషా ఇప్పుడు మీతో మీ ఇంటికి రావాలని అనుకుంటోంది. మీ ఆవిడ హండి క్రాఫ్ట్స్ ఎలా చేస్తారో చూస్తుందట’. మా ఆవిడ ఈ విద్య ఎప్పుడు నేర్చుకుందని నేను తటపటాయిస్తుంటే, మళ్ళీ ఆవిడే గుట్టు విప్పింది. కిందటి వారం ఇంట్లో చేసిన కారప్పూస ఆఫీసుకు తెచ్చి సంతర్పణ చేసాను. కారప్పూస  అలా చుట్టలు చుట్టలుగా  ఒకదానిలో ఒకటి అలా లాఘవంగా ఎలా దూర్చామో చూడాలని నటాషా కోరిక. ఓస్! ఇంత చిన్న కోరిక తీర్చడానికి ఇబ్బంది ఏముంది. ఇద్దరం కోట్లు తగిలించుకుని మెట్రోలో పడి ఇంటికి చేరాము. ఇక అప్పుడు మొదలయింది మా వంటింట్లో కారప్పూస చేసే విధాన ప్రక్రియ ప్రదర్శన.  మా ఆవిడ అప్పటికప్పుడు పిండి తడిపి ముద్దలు చేసి కారప్పూస గిద్దెల్లో కూరి బాగా కాగిన నూనె మూకుడులో వేస్తుంటే  నటాషా కళ్ళార్పకుండా విభ్రమంగా ఆ యావత్తు కార్యక్రమాన్ని దీక్షగా వీక్షించింది. చూస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపులు, కారప్పూస తిన్నప్పుడు కళ్ళల్లో తిరిగిన కన్నీళ్ళలో కలిసిపోయాయి. ‘యెంత బాగున్నాయో’ అంది వెడుతూ వెడుతూ  రష్యను భాషలో, అదేపనిగా  కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు చీదుకుంటు.
స్పసీబా (థాంక్స్)  నటాషా!

(పాతికేళ్ళ క్రితం మాస్కో అనుభవాల నుంచి)       

1996 బదరీ కేదార్ యాత్ర (రెండో భాగం) – కొమరగిరి అన్నపూర్ణ


మా యాత్ర ఏమో కానీ అందుకోసం మా చెల్లెలు ప్రేమ బిడ్డలు ఫణి, మణి పడ్డ హడావిడి అంతాఇంతా కాదు. చక్కిలాలు, కారప్పూస, కజ్జెకాయలు, వేయించిన అటుకులు ఇంకా రైల్లో తినడానికి పులిహోర, పెరుగన్నం, ఒంటి పూట వాళ్ళకోసం పూరీలు, కూర అన్నీ చక్కగా ప్యాక్ చేసి ఇచ్చారు. మా పెద్ద తమ్ముడి మూడో అమ్మాయి వాణి వచ్చి బదరీ, కేదార్ వెడుతున్నారు కదా, మా తరపున కూడా దణ్ణం పెట్టండి అంది. ‘మీ అందరి పేరుపేరునా సహస్రనామాలు మొదలు పెడితే ఇక మా దణ్ణం ఎప్పుడే’ అని నేనంటే అందరూ నవ్వుకున్నారు.
సాయంకాలం అరింటికే స్నానాలు ముగించుకుని నాలుగు ఆటోల్లో రైల్వే స్టేషన్ కు చేరుకున్నాము. సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు రైలు నాంపల్లి ఒదిలింది. రైలు సికింద్రాబాదులో ఆగినప్పుడు శారదక్కయ్య కొడుకు వచ్చి కలిసాడు. ‘మా అమ్మ మేము ఎంత వద్దంటున్నా వినకుండా మారాం చేసి యాత్రలకు బయలుదేరి వచ్చింది. జాగ్రత్తగా వెళ్ళిరండి’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. రైలు బయలుదేరగానే అనాదరం సర్దుకుని కూర్చున్నాం. రాత్రి పన్నెండు గంటలకు ఖాజీపేట చేరాము. రంగడు, శేషు టీసీతో మాట్లాడి వచ్చి, రండి, రండి. ఏసీలో సీట్లు దొరికాయన్నారు. సామాన్లు మోసుకుంటూ అందరం రైలు దిగి ఆరు డబ్బాల అవతలవున్న ఏసీ కోచ్ వద్దకు పోయి ఎక్కాము.
తెల్లవారకముందే  మెలకువ వచ్చి బయటకు చూస్తె,  సేవాగ్రాం అనే స్టేషన్ కనబడింది.  ఆ బోర్డు చూడగానే, మహాత్మా గాంధీ, అయన ఉన్న సేవాగ్రామ్ ఆశ్రమం గుర్తుకువచ్చాయి. స్వతంత్ర ఉద్యమంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం పేరుతొ సబర్మతి నుండి దండి వరకు పాదయాత్ర  మొదలుపెట్టారు. బ్రిటిష్ పాలకులు ఆయన్ని అరెస్టు చేసి రెండేళ్లకు పైగా నిర్బందించారు. విడుదల అయిన తరువాత గాంధీజీ ఒక కఠోర నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్రం సిద్ధించేవరకు తిరిగి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళేది లేదని. మధ్య భారతంలో నాగాపూరుకు దగ్గరలో ఉన్న సేవాగ్రాం అనే చిన్న పల్లె టూరును ఆయన తన మకాంగా ఎంచుకున్నారు. నిజానికి ఆ వూరు పేరు వేరే. సేగావ్ కాబోలు. కానీ సేవా దృక్పధం ప్రతిబింబించేలా ఆయన దాన్ని సేవాగ్రామ్ గా పేరు మార్చారని చెప్పుకునేవారు. ఇవన్నీ మా చెవుల్లో పడడానికి కారణం లేకపోలేదు. మా  బావల్లో ఇద్దరు, అయితరాజు రామారావు, కొలిపాక రామచంద్ర రావు దేశ స్వాతంత్ర ఉద్యమంలో నేరుగా పాల్గొంటే, మరో బావ కౌటూరు కృష్ణ మూర్తి పరోక్షంగా స్వతంత్ర సైనికులకు అజ్ఞాతంలో వుండి సేవలు అందించారు. పెద్ద బావ, రెండో బావ  పెళ్లి అయిన కొత్తల్లోనే  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళారు. వాళ్ళు జైల్లో వున్నప్పుడు మా నాన్నగారు వారిని పుట్టింటికి, కంభంపాడు తీసుకువచ్చి మా బావలు బయటకు వచ్చేవరకు తన దగ్గరే ఉంచుకున్నారు. అప్పటికి మా పెళ్ళిళ్ళు కాలేదు. అక్కయ్యలు మూడో నెల కడుపుతో వున్నప్పుడు జైలుకు వెళ్ళిన వాళ్ళు పద్నాలుగు మాసాల శిక్ష అనుభవించి విడుదల అయిన తర్వాతనే తమ కన్న బిడ్డలను కళ్ళారా చూసుకోగలిగారు.