20, ఏప్రిల్ 2014, ఆదివారం

అన్యోన్య 'డాం'పత్యం


(మహీధర్ వల్లభనేని గారు ఇంగ్లీష్ లో షేర్ చేసిన దానికి స్వేచ్చానువాదం)
భార్యాభర్తలు ఒక మాట అనుకుని దానిమీద చిత్తశుద్దితో నిలబడితే అన్యోన్య దాంపత్యం అసాధ్యం కాదన్నది ఏకాంబరం అభిప్రాయం.
యెలా అన్నది లంబోదరం సందేహం.
ఇలా అన్నది ఏకాంబరం వివరణ.
పెళ్ళయిన కొత్తల్లోనే ఏకాంబరం ఆయన భార్య ఒక అంగీకారానికి వచ్చేసారు. బాధ్యతలు పద్దతిగా  పంచుకోవాలని. అలా పంచుకున్న వాటిలో రెండో వారి జోక్యం యెంత మాత్రం వుండరాదని.
ఎంతయినా మొగుడు ముండావాడిని  కదా పెద్ద నిర్ణయాలు తనకు వొదిలెయ్యాలని ఏకాంబరం కోరాడు. చిన్న విషాయాలు అన్నీ భార్యకు అప్పచేప్పేసాడు.
'ఏం కొనాలి ఏం తినాలి సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలి  నెలవారీ ఇంటి ఖర్చులు ఎలావుండాలి  పనిమనిషిని పెట్టుకోవాలా అక్కరలేదా ఇలాటి చిన్నాచితకా బాధ్యతలన్నీ భార్యవి.
ఇక-
ఇరాక్ ఇరాన్ యుద్ధం వస్తే ఎవరి పక్షం వహించాలి,  ఎన్నికల తరువాత పొత్తులు అవసరం అయితే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎవరిని కలుపుకు పోవాలి ఇలాటి కీలక అంశాల్లో ఏకాంబరం చెప్పేదే ఫైనల్. భార్య తాను ఏం చెబితే దానికి వొప్పుకుని తీరాలి'
ఇలా గీసుకున్న గీతను ఇద్దరిలో ఎవ్వరూ దాటకపోవడం వల్ల వారి దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతోందని ఏకాంబరం ఉవాచ 
ప్రలోభమనగానేమి?
"ఓటర్లని ప్రలోభపెడితే ఏడాది జైలు"
వీనుల విందైన మాట చెప్పారు సీ.యీ.సీ. సంపత్ గారు.
ప్రలోభపెట్టడం అంటే పూర్తి వివరణ పత్రికల్లో రాలేదు. అర్ధం అయినంతవరకు అది ఓటర్లని డబ్బుతో ఆకట్టుకోవాలని ప్రయత్నించడం అని బోధపడుతోంది.


అయితే,
'పేద ఆడపిల్లల్ని బడికి పంపిస్తే తల్లి ఖాతాలో నెలనెలా వెయ్యి రూపాయలు'
'ఇరవై వేలకోట్ల రూపాయల డ్వాక్రా రుణాల మాఫీ'
'ఆడపిల్లలందరికీ సెల్ ఫోన్లు'
'ఇంటింటికీ ఉచితంగా ఇరవై లీటర్ల మంచి నీళ్ళు'
'లక్ష రూపాయల వరకు రుణాల రద్దు'
'ఆడపిల్ల పుడితే ఎకరం పొలం'
'రెండు పడక గదుల ఇళ్ళు'
-ఇవన్నీ ప్రలోభాలు కాదా! పైగా వీటికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వ ఖజానా మీద పడేది.
అభ్యర్దులు సొంత డబ్బుతో జనాలను ఆకట్టుకోవడం ప్రలోభమా?
పార్టీలు ప్రజల డబ్బుతో పధకాలు ప్రకటించడం ప్రలోభమా?
విజ్ఞులకే తెలియాలి.

ఎండా వానకు పెళ్ళంట!


ఒక పక్క పెటపెట లాడించే వేసవి ఎండ. మరో పక్క అదేసమయంలో జనం తడిసి ముప్పందుం అయ్యేలా రాజకీయుల వాగ్దాన వర్షాలు.  ఇదీ స్థూలంగా  ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్తితి.


నామినేషన్ల పర్వం ముగియడంతో నేతలు చెలరేగిపోతున్నారు. నోటికి వచ్చిన వాగ్దానాలను జనంమీద జడివానలా కురిపిస్తున్నారు. నరం లేని నాలుకతో కల్లబొల్లి కధలు చెబుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. ఈరోజు చెప్పిన మాటలు కనీసం ఈ సాయంత్రానికి గుర్తుంటాయో లేదో ఆ పరాత్పరుడికే ఎరుక.

19, ఏప్రిల్ 2014, శనివారం

మరో బ్రేకొస్తే ఏమవుతుందో!


యాంఖర్ : ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ చర్చాకార్యక్రమం మొదలు పెట్టేముందు, ఈనాడు హాజరయిన అతిధుల్లో పలానా వారు పలానా పార్టీ అని పరిచయం చేసాము. అయితే ఇంతకుముందు బ్రేక్ ఇచ్చిన సమయంలో వారు పార్టీ మారి వేరే పార్టీలో చేరుతున్నట్టు తెలియచేసారు. ఈ మార్పు గమనించ ప్రార్ధన.

తిక్క కుదురుతుంది


"ఎండ పొడ అంటే ఏమిటో తెలియని నాయకులు ఇలా ఎండనపడి తిరుగుతూ, దోవలో బట్టలు ఇస్త్రీ చేస్తూ, మిర్చి బజ్జీలు వేయిస్తూ, కొబ్బరి బోండాలు కొడుతూ, గడ్డాలు చేస్తూ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ మీడియాలో దర్శనం ఇస్తుంటే ఏమనిపిస్తుంది?"
"నిజంగా నిజం చెప్పమంటారా! ఈ ఎలక్షన్లు ఇలా మరో ఆరునెలలు పెడుతూ పోతే బాగుంటుందని"

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

పరమాచార్య పావనగాధలు

కుర్రవానిలో గురుదర్శనం
(ఆదిశంకరాచార్యుల తరువాత అంతటి భగవదంశ కలిగిన మహానుభావుడు కంచి కామకోటి పీఠానికి 68 వ ఆచార్యుడయిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. 'నడిచే దేవుడి'గా ప్రసిద్దులయిన వారి గురించి మా అన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు గారు 'పరమాచార్య పావనగాధలు' పేరుతొ ఒక చిరు పొత్తం రచించారు. ఆ పుస్తకం ఆధారంగా అందిస్తున్న పావన గాదాశతి ఇది)


"స్వామినాధన్ తమిళనాడులో దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విలుప్పురం గ్రామంలో 1894 మే 20న జన్మించారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి. తల్లి మహాలక్ష్మి.  స్వామినాధన్ చిన్నతనంలో వారింటికి శాస్త్రి గారి స్నేహితుడు వచ్చారు. వృత్తిరీత్యా న్యాయవాది అయినా ప్రవృత్తిరీత్యా జ్యోతిష్యుడు. పిల్లవాడి  జాతకాన్ని పరిశీలిస్తూ ఆయన,  తల్లిని ఓ చెంబుతో నీళ్ళు తెమ్మని అడిగారు. తెచ్చిన నీళ్ళతో ఆయన,  స్వామినాధన్  కాళ్ళు కడిగి సాష్టాంగ నమస్కారం చేయడం చూసి తలిదండ్రులు నిర్ఘాంతపోయారు. శాస్త్రి గారు ఆశ్చర్యం నుంచి తేరుకుని 'అదేం పని! పెద్దవాడివి నువ్వు. పిల్లవాడిముందు సాగిలపడడం ఏమిటి?' అని మందలిస్తున్నట్టు అన్నారు. అప్పుడా న్యాయవాది నవ్వుతూ, 'నేనెంత! ఈ ప్రపంచం అంతా ఈ చిన్నవాడి పాదాలకు ప్రణమిల్లే రోజు రాబోతోంది. కానీ అప్పటికి నేనుంటానో, వుండనో తెలియదు కదా! అందుకని ఈ రోజే ఆ పనిచేసి తరించా' అన్నాడు.

ఆయన జోస్యమే నిజమయింది.            

ఆ మూడు పత్రికలు


ఆ మూడు పత్రికలను నేను కొని చదువుతాను. గత కొన్ని దశాబ్దాలుగా నాకిది అలవాటు. ఇదే రంగంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న నాకు - ఈరోజు ఒకే వార్తను ఈ పత్రికలు ప్రచురించిన తీరు చూసిన తరువాత ఉదయం లేవగానే అనూచానంగా చేసుకున్న పత్రికాపఠనానికి ఇక స్వస్తి చెప్పటం మంచిదా అనే ఆలోచన కలిగింది. డెబ్బయ్యవ దశకం మొదట్లో నార్ల గారి సంపాదకత్వంలో వెలువడిన నాటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉపసంపాదకుడుగా చేరినప్పుడు గొప్ప వృత్తిలో ప్రవేశిస్తున్నాను అన్న ఆనందంతో వొళ్ళు పులకరించిన మాట వాస్తవం. మరి ఇన్నేళ్ళ తరువాత పత్రికలే చదవకూడదు అన్న నిర్వేదంలోకి యెందుకు జారిపోతున్నట్టు.
సరే! అసలు విషయానికి వద్దాం.
నామినేషన్ల సందర్భంగా అభ్యర్ధులు తమ ఆస్తులు అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్లు సమర్పించడం ఒక నిబంధన. వాటిని ప్రజలకు తెలియచెప్పడం పత్రికల బాధ్యత.  ఈ క్రమంలో శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ జగన్ మోహన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ల వివరాలను అన్ని పత్రికలు ప్రచురించాయి. కానీ ఈ మూడు పత్రికలు వాటికి తమదైన రీతిలో వ్యాఖ్యానాలను కూడా జతపరిచాయి. ఆ పత్రికలకు ఈనాటి పరిస్థితుల్లో అలాటి సమాచారం ప్రచురించడం ఒక అనివార్యత కావచ్చు. కానీ నా కెందుకో వార్త రూపంలో ఆ పత్రికలు తమ మనసులోని మాటని చెప్పే ప్రయత్నం చేసాయని అనిపించింది.
ఈరోజు తాపీగా ఇంట్లో కూర్చుని నీతులు చెబుతున్నానని అనిపించవచ్చు  కానీ ఎందుకో ఏమిటో నాకది  సబబుగా అనిపించలేదు.

యేమో! నేను కూడా ఏదయినా పత్రికలో పనిచేస్తూ వున్నట్టయితే  ఆ వాలువేగంలో నేనూ కొట్టుకుపోతూ వుండేవాడినేమో! ఎవరికి ఎరుక?