25, మార్చి 2014, మంగళవారం
ఐడియా
ఐడియా
అమెరికన్లు సరదాగా చెప్పుకునే ఓ కధ ఇంటర్నెట్ లో
దర్శనం ఇచ్చింది. దాన్ని తెలుగులో చెక్కితే .....
(ఇదో గొప్ప ఐడియా - రెండింటిని ఒకటిగా చూపడం)
'అనగనగా ఓ అమెరికన్ వూళ్ళో ఓ వృద్ధుడు నివసిస్తూ
వుండేవాడు. అతడి ఒక్కగానొక్క కొడుకు దొంగతనం చేసి పోలీసుల చేతికి చిక్కి
జైలుపాలయ్యాడు. ఆ మనాదితో భార్య మంచానపడి కన్ను మూసింది. వృద్ధుడికి పెద్దతనం
మరింత ముసురుకు వచ్చింది. జైల్లో వున్న కొడుక్కు ఉత్తరం రాసాడు.
'నాయనా. అమ్మ పోయినదగ్గర నుంచి నాకేమీ చేతకాకుండా
పోతోంది. వున్న ఎకరం (?) బంగాళా దుంపల తోట దున్ని పంట వేయడం నాకు అలివి కావడం
లేదు. నువ్వా జైల్లో వున్నావు. ఏం చెయ్యాలో తోచడం లేదు' అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
కొడుకు నుంచి తిరుగు టపాలో ఉత్తరం వచ్చింది.
'నాన్నా . ఆ తోట జోలికి వెళ్ళకు. నేను దొంగతనంగా
ఎత్తుకొచ్చిన తుపాకులను మన తోటలోనే పాతిపెట్టాను. నేను వచ్చిన తరువాత దాని సంగతి
చూసుకుందాం.'
ఆ ఉత్తరం వచ్చిన మర్నాడే బిలబిలమంటూ పోలీసు పటాలం
దిగింది. ఆ వృద్దుడిని వెంటబెట్టుకుని తోటకు వెళ్లారు. అతడు కళ్ళప్పగించి
చూస్తుండగానే మొత్తం ఆ తోటనంతా గడ్డపారలు తీసుకుని కుళ్లబొడిచారు. సెంటు జాగా వొదలకుండా
తవ్వేశారు. అక్కడ తుపాకులు గట్రా ఏమీ దొరకకపోవడంతో వెనక్కు మళ్ళారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు తోటను సాగుకు అనువుగా
చేసిపోయారు.
ఇంతకీ జరిగినదేమిటంటే ..తండ్రి
రాసిన ఉత్తరం కొడుక్కు బాధ కలిగించింది. తానా జైల్లో వున్నాడు. వెళ్ళి తండ్రికి
సాయం చేసె వీలు లేదు. కానీ మనసుంటే మార్గం
వుంటుంది. ఆ క్రమంలో ఆ జైలుపక్షికి ఒక 'ఐడియా'
తట్టింది. తుపాకులు, దొంగతనం అంటూ తండ్రికి ఉత్తరం రాసాడు. అతడు వూహించినట్టే దాన్ని పోలీసులు పొల్లుపోకుండా చదివారు. తోటలో
దాచిన తుపాకులను స్వాధీనం చేసుకోవాలని వెళ్లారు. తోటనంతా తవ్విపోసారు. ఏమైతేనేం చేతకాని తండ్రికి
చేతనైన సాయం చేయగలిగాడు. NOTE: Courtesy image owner
24, మార్చి 2014, సోమవారం
రేడియో జోకులు
నిజంగా రేడియోలో వచ్చిన జోకులే. పీ ఎస్. గోపాల కృష్ణ గారు, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం పూర్వ సంచాలకులు, లాంగ్ లాంగ్ ఎగో, సో
లాంగ్ ఎగో, నో బడీ కెన్ సె హౌ లాంగ్ ఎగో, సంచాలకులు కాకపూర్వమే రేడియోలో
'నవ్వకండి' అనే కార్యక్రమం చేస్తుండేవారు. నేనో జోకు చెప్పనా అనే తరహాలో కాకుండా
జోకు చెప్పి నవ్వించే జోకులు
చెబుతుండేవారు, అందులో ఒకటి.
"రేడియో ఏం రిపేరు చేసినట్టయ్యా! ఇంకా అన్నీ
చెత్త ప్రోగ్రాములే వస్తున్నాయి" అందొకావిడ రిపేరీ చేసిన ఆసామితో.
నవ్వుకు నా పూచీ ఏం లేదు.
అల్లాగే ఇంకోటి.
"పదేపదే పార్టీలు
మారుతున్నాను అని నేనంటే గిట్టనివారు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇందులో
వాస్తవం ఎంతమాత్రం లేదు. కావాలంటే నా గత చరిత్ర ఒకసారి తిరగేయండి. నేను ఎప్పుడూ
ఏదో ఒక అధికారపక్షంలోనే వుంటున్న సంగతి బోధపడుతుంది." ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు గారి వ్యవహారశైలి
నేను 1975 లో
పుట్టి 1985 లో
చనిపోయాను.
అంటే
ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం.
విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..
రేడియోలో
చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా
వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. ప్రతి
రోజూ వార్తల కంపోజింగ్, పేజీ
మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి
తీసుకోవాల్సిన పరిస్తితి. సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు
కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్
చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు 'ఆ ఖాళీ
పేజీలు’ ఉపయోగపడ్డాయి.
ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ
ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని
వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో
దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు
ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. ఈ నేపధ్యంలో నాకు హైదరాబాదు
ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.
(జలగం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక సభలో మాట్లాడుతున్న వై ఎస్ ఆర్)
అప్పుడు
ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. సమర్దుడయిన పాలకుడిగా పేరు. ఎమర్జెన్సీ ఆయనకు
కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో
నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు కలసివచ్చిన అంశాలు.
వెంగళరావు
గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ
పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే
విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి
ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా
ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు
మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా
చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన
కేంద్రమంత్రిగా, పీసీసీ
ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన
కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ
రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని
అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా
చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు.
వెంగళరావుగారి
వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట -
ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు -
గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి
బయలుదేరడం, తిరిగి
ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు
సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ
ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్
పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి
రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు
చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.
రేడియో
విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను
చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు
సంబంధించిన ‘డెడ్ లైన్లు’ వుండేవి కావు.
చెప్పాల్సింది చెప్పేసి, లేచి
నిలబడి - ‘మంచిది
వెళ్ళిరండి” అనేవారు.
విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే
వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు
గారు, హిందూ
రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.
వెంగళరావు
గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.
బెజవాడ
నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ – ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే
రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ
ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి
పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ
ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది
చాలా పెద్ద ఇల్లు. కిరాయి మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు
వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే
అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు
చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని
అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి
పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. చివరికి
ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.
గవర్నమెంట్
కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా
కనబడ్డప్పుడు ‘ఇల్లు
వసతిగా వుంది కదా!’ అనేవారు.
నేను అవుననీ కానీ, కాదనీ
కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. (09-09-2010)
22, మార్చి 2014, శనివారం
ఆకాశమే హద్దురా!
లేబుళ్లు:
ఆకాశమే హద్దురా!
జగన్ - బాబు
ఇది నా అభిప్రాయం కాదు ఓ అంచనా మాత్రమే.
దీనితో ఏకీభవించనక్కర లేదు. విభేదించనక్కరలేదు.
అయినా ఎవరిష్టం వారిది.
21, మార్చి 2014, శుక్రవారం
"నో వర్రీ మేడం! మోడీ వచ్చే చాన్స్ లేదు"
(గుంటూరి నాగేశ్వరరావు గారు షేర్ చేసిన ఇంగ్లీష్
జోక్కి అనువాదం, వారికి కృతజ్ఞతలతో)
పాడు ప్రపంచాన్ని చూసి చూసి దేవుడికి వొళ్ళు
మండిపోయింది. దీన్ని దేవుడు కూడా మార్చలేడు అవటా అనుకుని ఏమైనా సరే ఈ ప్రపంచానికి భరత వాక్యం పలకాలని నిర్ణయించేశాడు. అయితే ఈ
నిర్ణయాన్ని అమలుచేసేముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలా ఓ సమావేశం ఏర్పాటుచేసి తాను
ముఖ్యులు అనుకున్న ఓ ముగ్గురు దేశాధినేతలను దానికి రమ్మని ఆహ్వానించాడు. పిలుపుల
మేరకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని
మన్మోహన్ సింగ్ వెళ్లారు. దేవుడు ఆట్టే సమయం వృధా చేయకుండా ప్రపంచాన్ని అంతం
చేయబోతున్నట్టు ప్రకటించి 'పోయి మీ వాళ్లకు చెప్పుకోండ'ని ఆదేశించాడు.
ఒబామా వెంటనే టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం
ఏర్పాటుచేసి తన దేశప్రజలతో చెప్పాడు.
'మీ అందరికీ ఓ శుభ వార్త. ఓ చెడు వార్త. మంచి
వార్త ఏమిటంటే మనం అందరం విశ్వసిస్తున్న దేవుడు నిజంగానే వున్నాడు. దుర్వార్త ఏమిటంటే ప్రపంచాన్ని అంతం చేయబోతున్నట్టు ఆయనే
నాతొ స్వయంగా చెప్పాడు'
చైనా అధ్యక్షుడు తన దేశపౌరులను ఉద్దేశించి
మాట్లాడాడు.
'ప్రియమైన కామ్రేడ్స్! ఒక దుర్వార్త ఏమిటంటే మనం
దేవుడు లేడని ఇన్నాళ్ళు చెబుతూ వచ్చాం. అది నిజం కాదు. ఆయన్ని ఇప్పుడే
కలుసుకున్నాను. దానికంటే మించిన చెడు వార్త ఒకటి వుంది. ఈ యావత్ ప్రపంచాన్ని కమ్యూనిస్ట్
ప్రపంచంగా మార్చాలనే మన ఆశయం నెరవేరేటట్టులేదు. ఎందుకంటే ఆ పాడు దేవుడు దీన్ని
అంతం చేయాలని ఓ నియంతలా ఆకస్మిక నిర్ణయం
తీసుకున్నాడు"
మన్ మోహన్ సింగ్ దేశ ప్రజల జోలికి పోలేదు. ముందు
మేడం సోనియాకు ఫోను చేసాడు.
'మేడం. ఓ శుభవార్త. దానికితోడు దాన్ని మించిన మరో
మంచి వార్త. ఇన్నాళ్ళు నేనొక పనికి రానివాడినని పేపర్లలో కార్టూన్లు వేస్తుంటే
నిజమే కాబోసు అని బాధపడేవాడిని. కాని మేడం ! ఆ దేవుడు నా ప్రతిభని గుర్తించాడు.
అమెరికా, చైనా అధ్యక్షులతో పాటు నన్ను కూడా ఆహ్వానించాడు' అన్నాడు గడ్డం మాటున ముసి ముసి నవ్వులు దాచుకుంటూ.
'మీ సంగతి సరే! ఇంతకీ ఆ మంచి వార్త ఏమిటో చెప్పండి'
'అదా మేడం. దేవుడు ఈ
లోకానికి తక్షణం చరమగీతం పాడాలని నిర్ణయించేసాడు. మోడీ ప్రధాని అయిపోతాడేమోనన్న భయం అక్కరలేదు మేడం'
లేబుళ్లు:
"నో వర్రీ మేడం! మోడీ వచ్చే చాన్స్ లేదు"
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)




