“లోక సంచారి ఒంటరిగా తిరుగుతాడు.
ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. ఒక ఏడాదిలో
ఆదినారాయణ గారు చేసిన మూడు యాత్రల్లోని నాలుగు వేల కిలోమీటర్ల కాలి నడక అనుభవాల
పూమొగ్గలు ఈ భ్రమణ కాంక్షలో పుష్పించాయి’ అని ప్రచురణ కర్తలు పేర్కొన్నారు.
అనేక సార్లు ఆయన పాద యాత్రలు చేసారు. అందులో
నాలుగు, అయిదు యాత్రలు ప్రధానమైనవి. 1992 లో విశాఖపట్నం నుండి సముద్ర తీరాన
పరదీప్ పోర్ట్ వరకు 500 కిలోమీటర్లు, అల్లూరి కొత్తపట్నం నుండి కన్యాకుమారి వరకు సముద్ర
తీరంలో 1200 కిలోమీటర్లు, 1993 లో విశాఖ నుంచి డార్జిలింగ్
వరకు 1800 కిలోమీటర్లు, 1994 లో చవట పాలెం నుంచి న్యూఢిల్లీ వరకు 2300 కిలోమీటర్లు, 1997 లో కాశీ నుండి తిరువైయ్యారు వరకు 2600 కిలోమీటర్లు ఇలా ఆయన పాదయాత్రలు అలుపు ఎరగకుండా సాగాయి. ఇవికాక
చేసిన అనేక పాదయాత్రలతో కలిపి చూసుకుంటే మొత్తం 10856, అక్షరాలా పదివేల ఎనిమిది వందల యాభయ్
ఆరు కిలోమీటర్ల పొడవున కాలి నడకన తిరిగారు. ఆ యాత్రా విశేషాలను ఎక్కడా డైరీలో కూడా
రాయకుండా కేవలం తన ధారణ శక్తితో తిరిగి వచ్చిన తరువాత తేదీలు, ఊళ్ళ పేర్లతో సహా గ్రంధస్తం చేశారు. పైగా స్వయంగా తను కంటితో
చూసిన ప్రదేశాలను, వింతలను చిత్రాలుగా గీసి తన రచనకు ఒక విశిష్టతను చేకూర్చారు. మూడు వందల పేజీలకు పైగా వున్న ఈ పుస్తకంలోని
కొన్ని భాగాలను స్పృశించే ప్రయత్నం మాత్రమే
ఇది. (కోట్స్ లో వున్నవి రచయిత ఆదినారాయణ గారివి)