ఘంటా చక్రపాణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఘంటా చక్రపాణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2016, సోమవారం

ఇలాగా కూడా జరుగుతుంది

కొన్ని విషయాలు వింటుంటే నిజమా అనిపిస్తుంది.
మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి బీటెక్ పాసయింది. ఎం టెక్ కూడా చేసింది. వాళ్ళు వుండేది నల్గొండలో.
సర్వీసు కమీషన్ వాళ్ళు  మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగంలో టెక్నికల్ ఆఫీసరు పోస్టుకు పరీక్ష పెడితే రాసింది. ఇంటర్వూకు పిలిస్తే వెళ్ళింది. ఏదో మోటారు సైకిల్ కంపెనీ వారి ‘ట్యాంకులో పెట్రోలు నింపండి, ఇక మరచిపొండి’ అనే ప్రకటన తరహాలో ఆ విషయం మరిచిపోయింది.
నిన్ననో మొన్ననో ఆమెకు నియామక పత్రాలు పోస్ట్  లో అందాయి. ఆ అమ్మాయికి ఆనందం, ఇంట్లో వాళ్లకి ఆశ్చర్యం.  ఆ ఉద్యోగం కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, ఏ రకం అయిన పైరవీలు చేయలేదు. అందుకే ఆ ఆనందం, అందుకే ఆ ఆశ్చర్యం.
ఆర్డరులో చూస్తే బోధన్ పోస్టింగు ఇచ్చారు. ఆ అమ్మాయే ధైర్యం చేసి ఆ విభాగం చీఫ్ ఇంజినీరును కలిసి ముందు థాంక్స్ చెప్పింది, తరువాత వచ్చిన పని చెప్పింది.
ఆ అమ్మాయికి ఈ సారి ఆనందంతో పాటు ఆశ్చర్యం.
ఎందుకంటే క్షణాల్లో ఆ ఆర్డరు మార్చి బోధన్ బదులు నల్గొండకు పోస్టింగు  ఇచ్చారు.
పైరవీ లేదు పైసా ఖర్చులేదు. ఆ కుటుంబం ఆనందమే ఆనందం.

(ఘంటా చక్రపాణి గారూ వింటున్నారా!)  

5, ఆగస్టు 2011, శుక్రవారం

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు


మొన్న రాత్రి మహా టీవీలో ఏదో చర్చకు పిలిస్తే వెళ్లాను. తెలకపల్లి రవి గారు, ఘంటా చక్రపాణి గారు కూడా వచ్చారు. ప్రోగ్రాం మధ్యలో అనివార్యంగా వచ్చే ‘విరామ సమయం’లో రవి – మాటల మధ్య ప్రసిద్ధ రష్యన్ రచయిత చెఖోవ్ రాసిన ఓ చిన్న కధ చెప్పారు.

‘గుర్రబ్బండి నడుపుతూ పొట్టపోసుకునే ఒక వృద్ధుడు ఈ కధలోని ప్రధాన పాత్ర. ఆ రోజు ఉదయమే అతడి కొడుకు ఆకస్మికంగా మరణిస్తాడు. అంత దుఃఖంలో కూడా బండి నడపక పోతే పొట్ట గడవని స్తితి అతనిది. తన బండి ఎక్కినవాళ్లకు కుమారుడి మరణ వార్త చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా వాళ్లు అడ్డంపడుతుంటారు. ఎందుకంటె ఈ పాడు ప్రపంచంలో ఎవడి గోలవాడిది. తన కష్ట సుఖాలు పక్కవాడితో పంచుకోవాలనే ఆత్రుత తప్ప ఎదుటివాడి బాధ ఏమిటో ఎవరికీ పట్టదు. చివరికి, ఎవరికీ తన కడుపులోని దుఖం చెప్పుకోకుండానే ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. కొష్టంలో గుర్రాన్ని కట్టివేస్తూ పిల్లవాడి చావు కబురు దాని చెవిలో వేసి కడుపులో భారం దించుకుంటాడు.’

చెఖోవ్ ఈ కధ రాసి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ మనుషుల మనస్తత్వాల్లో ఎలాంటి మార్పులేదు.

టీవీల్లో జరిగే చర్చలే దీనికి మంచి ఉదాహరణ. ఎవరికి వారు తమ వాదం వినిపించాలని ప్రయత్నిస్తారే తప్ప ఇతరులమాట వినిపించుకోరు. అందరికీ అన్నీ తెలియాలన్న రూలేమీ లేదు. తెలియంది తెలుసుకుంటే పోయేదీ లేదు. అనవసరమయిన ఈ అభిజాత్యం అవసరమా ? ఎవరికివారే తెలుసుకోవాలి.(05-08-2011)