ఎమర్జెన్సీతో పాటే పత్రికలపై సెన్సార్
షిప్ విధించారు.
ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చే వార్తలు, ఫోటోలను ముందుగా సెన్సార్ అధికారికి చూపించి, ఆయన అనుమతి లభించిన తరువాతనే వాటిని
ప్రచురించాల్సిన పరిస్తితులు ఉండేవి.
ఢిల్లీ స్టేట్స్ మన్
పత్రికలో ఒక అద్భుతమైన ఫోటోగ్రాఫర్
ఉండేవాడు. అయన పేరు రఘురాయ్ . ఎమర్జెన్సీ విధించిన తరువాత నగరంలో పరిస్తితులను
కళ్ళకు కట్టినట్టు చూపే ఒక ఫోటో తీసాడు.
ఒకతను సైకిల్ పై ఇద్దరు పిల్లలను
కూర్చోబెట్టుకుని దాన్ని తోసుకుంటూ వెడుతుంటాడు.
వెనకనే అతడి భార్య నడిచి వస్తుంటుంది.
ఆ ఫోటోకి కింద పెట్టిన క్యాప్షన్ ఇలా
వుంటుంది.
“చాందినీచౌక్ ప్రాంతంలో జనజీవనం చాలా సాధారణంగా వుంది”
సెన్సార్ అధికారికి అందులో అభ్యంతర పెట్టాల్సింది ఏమీ కనిపించలేదు. దాన్ని ఓకే చేసాడు.
ఫోటోగ్రాఫర్ తెలివి అతడ్ని పప్పులో కాలేసేలా చేసింది. ఆ ఫోటో చూస్తే జనజీవనం సాధారణంగా సాగిపోతున్న భావన
కలిగే మాట నిజం. కానీ అదే వీధిలో గుంపులు గుంపులుగా గస్తీ తిరుగుతున్న పోలీసులు
కూడా ఆ ఫోటోలో లీలగా కనిపిస్తారు. ఆ అధికారి ఆ విషయం గమనించలేదు. అంచేత మరునాడు పత్రికలో ఆ ఫోటో అచ్చయింది.
సెన్సార్ అధికారులు తరువాత నాలుక
కరుచుకున్నారు. ఆ ఫోటో ప్రచురణకు అనుమతి ఇచ్చిన అధికారిని బదిలీ చేసారు.