2, జూన్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (174) – భండారు శ్రీనివాసరావు

ట ట టా ట ట టా ట ట టా
ఆఫ్రికా ఒక చీకటి ఖండం. అక్కడ ఈగలు కుడితే మనుషులు చచ్చిపోతారట.
సరిగా తెలియని విషయానికి చివర్లో ‘ట’ తగిలిస్తే అది నిజం అనిపిస్తుందని చిన్నతనంలో అలా చెప్పుకునేవారు. అలాగే వెనక మేము మాస్కో వెళ్లినప్పుడు, స్కూల్లో మా వాడిని వాళ్ల క్లాస్ మేట్ అడిగాడట, ‘మీ ఇంట్లో ఎన్ని ఏనుగులున్నాయ’ని. ఇండియాలో పులులు వీధుల్లో తిరుగుతుంటాయని, ఏనుగుల్ని ఇళ్ళల్లో పెంచుకుంటారనీ, పిల్లలు పాములతో ఆడుకుంటారనీ, ఇవీ ఆ దేశంలో మన దేశం పట్ల వున్న అభిప్రాయాలు.
అమెరికన్ ఆతిధ్యం
కొన్నేళ్ళ క్రితం అమెరికాలో ఉంటున్న మా మనుమరాళ్ళ క్లాసు టీచరు మిసెస్ సూజన్ విల్సన్, ఆమె కుటుంబం హాలీడే కోసం ఇండియా వచ్చారు.
‘పనిలోపనిగా హైదరాబాదు కూడా చూసిరండి’ అని మా వాళ్ళు మా అడ్రసు ఇవ్వడంతో మా ఇంటికి వచ్చారు. చిన్న ఇంట్లో వుండడం వాళ్లకి వసతిగా వుండదేమో అన్న సందేహంతో మేము వారికోసం రెండు హోటల్ గదులు బుక్ చేసాము. అయినా వాళ్ళు మాతో పాటు మా ఇంట్లోనే మూడు రోజులు వున్నారు. పిజ్జాలు అవీ ఆర్డరు చేసినా వాళ్ళు వేలేసి ముట్టుకోలేదు. కూరలు, పచ్చళ్ళతో మా ఆవిడ పెట్టిన భోజనమే తిన్నారు. నేలమీదనే చాపలు పరచుకుని పడుకున్నారు. వున్న రెండు బాత్ రూముల్లోనే సర్దుకున్నారు. ఆటోలలో ఊరంతా తిరిగారు. అమెరికాలో తమ స్నేహితులకి కానుకలుగా ఇవ్వడానికి చార్మినార్ దగ్గర గాజులు కొనుక్కుని వెళ్ళారు. టాంక్ బండ్ బుద్ధ విగ్రహాన్ని చూసి ముచ్చట పడ్డారు. గోల్కొండ కోటలో కలియతిరిగారు. లైట్ అండ్ సౌండ్ షో చూశారు. వున్న మూడు రోజులు మాతో కలిసే వున్నారు కానీ, కలిసి ఉంటూ విడిగా ఉండడానికి ప్రయత్నించలేదు. అసౌకర్యంగా వున్నట్టు ఎక్కడా కనిపించకుండా హాయిగా మాతోనే వుండి, మన భోజనాలే చేస్తూ ఇంట్లో మనుషుల మాదిరిగా గడిపి వెళ్ళారు.
అదే మేము అమెరికా వెళ్లినప్పుడు ఇడ్లీ, దోసె దొరికే హోటళ్ళ మీద పడ్డామే కానీ, ఆ దేశపు ఆహార విహారాల ముచ్చటే పట్టించుకోలేదు. ఇతరులతో కలసిపోయే తత్వం, అంతటి విశాల హృదయం మాలో లేదని అనిపిస్తుంది.
మిసెస్ సూజన్ విల్సన్ భర్త మిస్టర్ గోర్డన్, రెడ్మండ్ టౌన్ సెంటర్ లోని కార్యాలయంలో పనిచేస్తారు. వారికి అయిదుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయాయి. మిగిలిన ముగ్గురి చదువులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. హాస్టళ్ళలో వుంటున్నారు.
ప్రస్తుతానికి భార్యాభర్తా ఇద్దరే బెల్ వ్యూ లోని సొంత ఇంట్లో వుంటున్నారు. మేము సియాటిల్ వెళ్ళినప్పుడు ఒక రాత్రి మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. ఇల్లు పొందికగావుంది. ముందూ వెనుకా విశాలమయిన ఖాళీ జాగా. ఇంట్లోకి అడుగు పెట్టగానే నల్లటి రంగులో తళ తళ మెరిసిపోతూ పియానో దర్శనమిచ్చింది. దాని పక్కనే ‘మరింబా’ అనే మరో సంగీత వాయిద్యం.
శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లులా ఆ ఇంట్లో అంతా సంగీత వాతావరణం. సాధారణంగా అమెరికన్లు బయటవారిని ఎవరినీ భోజనాలకు ఇళ్లకు పిలవరు, అంతగా పిలవాల్సి వస్తే హోటల్లో డిన్నర్ ఇస్తారని చెప్పుకునేవాళ్ళు.
అందుకే మేము వాళ్లు పిలిచినప్పుడు కొంత సందేహిస్తూనే వెళ్ళాము. కానీ వారి ఆదరణలో భేషజం ఏమీ కనిపించలేదు. పైగా ఆ సాయంత్రం మొత్తం మాతోనే గడపడానికి సిద్దమయినట్టు కనిపించారు. అందరం భోజనాల బల్ల దగ్గర కలిసి కూర్చుని భోజనం చేసాము. భోజనానికి ముందు మిస్టర్ గోర్డన్, మిసెస్ విల్సన్ ప్రార్ధన చేసారు.
“ ఓ! లార్డ్! ఇండియానుంచి వచ్చిన అతిధులు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మా పిల్లలు నిరుడు హైదరాబాదు వెళ్ళినప్పుడు వీరు వారిని చక్కగా చూసుకున్నారు. వారికి ఇలా భోజనం పెట్టగలిగే అవకాశం కల్పించిన నీకు కృతజ్ఞతలు.”
మా బామ్మ గారు జ్ఞాపకం వచ్చారు. భోజనానికి ముందు ఆవిడ తప్పకుండా దేవుడి ప్రార్ధన చేసేవారు.
“అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం”
తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నాలుగు విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.
నా చిన్నతనంలో మా బామ్మ రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణసమయంలో భోజనానికి కూర్చున్నప్పుడు, మొదటి ముద్ద చేతిలో పెట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అప్పుడు అర్ధం అయ్యేది కాదు.
పూర్వాచారాలు పాటించే బ్రాహ్మణ కుటుంబాల్లో వైశ్వదేవం అని చేస్తారు. భోజనం చేసే ముందు చేసే బలిహరణం అన్నమాట. దాన్ని ఆంతర్యం చాలా గొప్పది. మనం వుంటున్న ఈ భూమండలానికి పైనా కిందా అనేక లోకాలు వున్నాయి. వాటిల్లోని ఎన్నో కోట్ల జీవరాశులకు తృప్తి కలిగించడం దీని ఉద్దేశ్యం. ఈ విధమైన భూత తృప్తి భోజనానికి ముందూ తరువాత చేయడం విధాయకం. ఉత్తరాపోసన పట్టేటప్పుడు ‘ఇతర ప్రాణులను ఉద్దేశించి ఇది చేయడం జరుగుతోంది’ అని చెబుతారు.
బ్రాహ్మణులే కాదు ఇలా ఎవరయినా చేయవచ్చు. సమస్త భూతరాశి తృప్తి కోసం ప్రార్ధించవచ్చు.
ఇలా భోజనాత్పూర్వం సకల జనుల తృప్తి కోసం ప్రార్ధన చేయడం అనే ఆచారం ఇంకా అనేక దేశాల్లో, అనేక మతాల్లో వుంది.
అమెరికన్లు అనగానే విందుకు ముందు మందు అనే దురభిప్రాయం తొలగిపోయేలా మా భోజనం పూర్తయింది. తరవాత మిసెస్ విల్సన్ చక్కటి పాటలు పాడారు. మిస్టర్ గోర్డన్ పియానోతో సహకారం అందించారు. డిజర్ట్ సర్వ్ చేసేటప్పుడు వారి ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. పిల్లల చిన్నతనపు ముచ్చట్లు నెమరు వేసుకున్నారు. భాష అర్ధం చేసుకోవడంలో కొంత ఇబ్బంది ఎదురయినా వారి ఆప్యాయతను, ఆత్మీయతను మాత్రం పూర్తిగా ఆస్వాదించగలిగాము.
అక్కడ గడిపిన కొద్ది గంటల సమయంలో ఒక విషయం గమనించాము. ఎక్కడా ఏ గదిలో టీవీ కనిపించలేదు. అడగడం బాగుండదని ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ, నేను రేడియోలో పనిచేశానని తెలుసుకున్నప్పుడు, మాటల సందర్భంలో చెప్పినట్టుగా తమ ఇంట్లో టీవీ వుండదని చెప్పారు. ‘టీవీ అనేది వినోదాత్మకంగా వుండాలి. వార్తల జోలికి పోకూడదు’ అని అభిప్రాయపడ్డారు. వార్తలకోసం తాము పబ్లిక్ బ్రాడ్ కాస్ట్ రేడియో వింటామనీ, సంగీతంతోనే పొద్దుపుచ్చుతామనీ చెప్పారు. “మీడియా అంతా ఇప్పుడు ముక్కచెక్కలయింది. వాళ్లు సమాచారం ఇవ్వడం లేదు. వాళ్ల సొంత అభిప్రాయాలు చెబుతున్నారు” అన్నారాయన. రెండు కార్లు వున్నప్పటికీ, రోజూ ఆఫీసుకు ఏడున్నర మైళ్ళు సైకిల్ పైనే వెడతానని మిస్టర్ గోర్డన్ చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది.
చీటికీ మాటికీ చీకాకులు పడుతూ, పండంటి కాపురాలను పాడుచేసుకుంటారని, పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకోవడంలో అమెరికన్లు సిద్ధ హస్తులనీ, మన వైపు జనసామాన్యంలో వున్న అభిప్రాయంలో అంత వాస్తవం లేదని గోర్డన్ కుటుంబాన్ని చూసిన తరవాత అనిపించింది.
కింది ఫోటోలు:
హైదరాబాదులో మిసెస్ సూజన్ కుటుంబం
సియాటిల్ లో సూజన్ దంపతుల ఆతిధ్యం
(ఇంకావుంది)

Like
Comment
Share
Facebook

కామెంట్‌లు లేవు: