4, సెప్టెంబర్ 2022, ఆదివారం

ప్రజాస్వామ్యం హరాయించుకోలేని పార్టీ ఫిరాయింపులు

 (Published in Andhra Prabha Daily on 04-09-2022, SUNDAY0

పత్రికారచయితలు రాసుకోవడానికి కాలం చెల్లని, సార్వకాలీన అంశం ఏదైనా వుంది అంటే అది పార్టీ ఫిరాయింపులే. ఎందుకంటే, దేశంలో ఎక్కడో ఒక చోట,  నిన్నా,నేడు, రేపు  అనే తేడా లేకుండా సర్వకాలాల్లో జరుగుతుండేవి ఈ ఫిరాయింపులే.

పార్టీ ఫిరాయింపులు గురించి ప్రస్తావించుకునేటప్పుడు కొంత పరిణామక్రమాన్ని కూడా గుర్తుచేసుకోవాలి.

అనైతిక పార్టీ మార్పిళ్లను అరికట్టడానికి చట్టం లేదా అంటే వుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా  పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారు. అయితే, దాని ప్రకారం, చట్ట సభలో ఒక పార్టీకి వున్న సంఖ్యాబలంలో మూడింట ఒక వంతుమంది వేరే పార్టీలోకి మారితే అది పార్టీ పిరాయింపు కాకుండా, 'విలీనం' కిందికి వస్తుంది. దీన్ని అడ్డుపెట్టుకుని వ్యూహాత్మక మార్పిళ్లు జరగడంతో ఆ చట్టం కోరలు పదును పెట్టడం కోసం దరిమిలా దానికి ఎన్నో సవరణలు కూడా చేశారు. అయినా  చట్టంలోని  లొసుగుల్ని వాడుకుంటూ, చట్టాలకు తూట్లు పొడవడం ఆ చట్టాల నిర్మాతలయిన ప్రజా ప్రతినిధులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చట్టం దోవ చట్టానిది,  రాజకీయ నాయకుల దోవ వారిదీ అవుతూ వచ్చింది. ఎవరినీ తప్పుబట్టడానికి వీలులేకుండా తప్పులు చేస్తూ పోవడానికి చట్టాల్లో వున్న ఈ లొసుగులే ప్రధాన కారణం. అనేకానేక అధ్యయనాల అనంతరం పద్దెనిమిదేళ్ళ తరువాత అంటే, 2003 లో ఈ చట్టానికి మరో రాజ్యాంగ సవరణ చేసారు. దీని ప్రకారం 'పార్టీ మార్పిడి పిరాయింపు కాదు, మరో పార్టీలో విలీనం కావడం' అని చట్టం దృష్టిలో అనిపించుకోవాలంటే ఆ పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు సమ్మతించాలి. ఈ సవరణ ప్రకారం విడిగా కానీ, బృందాలుగా కానీ, పార్టీ మారే చట్టసభల సభ్యులు తమ సభ్యత్వానికి ముందు  రాజీనామా చేయాలి.  అలా రాజీనామా చేసినవారు, ఆ తరువాత ఎటువంటి లాభదాయక పదవులు పొందడానికి వీలుండదు. నిజానికి ఈ రాజ్యంగ  సవరణ ద్వారా పార్టీ మార్పిళ్లు అనేవి దుర్లభంగా మారాయి. కానీ, రాజకీయాల్లో వున్నవాళ్ళు ఘటనాఘటన దురంధరులు. అడ్డువచ్చిన వాటిని ఎలా అడ్డు తొలగించుకోవాలో, అదీ చట్టబద్ధంగా, వారికి కరతలామలకం. ఎన్నికలు కాగానే, గెలిచినవాళ్ళల్లో కొందరు, తాము అధికారం దక్కని పార్టీలో ఉన్నామని గ్రహించిన మరుక్షణం నుంచే గోడదూకే సన్నాహాలు మొదలుపెడతారు.  ఎందుకంటే, ఎన్నికల్లో గెలవడం ఒక్కటే వారికి ముఖ్యం కాదు, పాలకపక్షం అండ దొరికితేనే 'ప్రజాసేవ' చేయడానికి వీలుంటుంది అన్న నమ్మకం పుష్కలంగా పెంచుకున్నవాళ్ళు వారు. అందుకే అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరిపోయి, తమ రాజీనామా ద్వారా ఉత్పన్నమైన ఖాళీలో జరిగే ఉపఎన్నికలో  పోటీ చేసి,  అధికార పార్టీ ప్రాపకంతో మళ్ళీ  అనతికాలంలోనే చట్టసభల్లో ప్రవేశించిన ఉదాహరణలు  కోకొల్లలు.  పార్టీ పిరాయింపులను నిరోధించడానికి రూపొందించిన చట్టాన్ని ఆ విధగా కొందరు నీరుకార్చి వేస్తున్నారు. 'ఇది నైతికమా కాదా' అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కానీ, అంతటి  సావధానం కానీ వారికి ఉంటుందనుకోలేము. ఇక, 'ఇలా చేతికి అందిన రాజీనామాలు ఆమోదించాలా తిరస్కరించాలా లేదా పెండింగులో పెట్టాలా' అనే విషయంలో స్పీకర్లదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాలను  సమీక్షించే లేదా తిరగతోడే అవకాశం న్యాయస్థానాలకు  కూడా లేదు. గత అయిదారేళ్ళ కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలను సునిశితంగా గమనిస్తూ వస్తున్నవారికి  ఇటువంటి సందర్భాలు లెక్కకు మిక్కిలి అన్నవిషయం తేలిగ్గానే బోధపడుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అధికారంలో వున్న పార్టీదే పైచేయి.  అందువల్ల, పిరాయింపులు అనేవి పాలకపక్షాల ఇష్టాఇష్టాల ప్రకారమే అటు చట్టబద్దం కావడమో, ఇటు చట్ట విరుద్ధం కావడమో జరుగుతోంది. అయితే, చట్టంలో వున్న  ఈ లొసుగుకు  సుప్రీం కోర్టు ఓ మేర అడ్డుకట్టవేసింది. గతంలో గోవా శాసనసభ స్పీకర్ ఇద్దరు సభ్యులపై వేసిన 'అనర్హత వేటు'ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.  కానీ రాజ్యాంగం పదో షెడ్యూల్లో పొందుపరచిన మిగిలిన అధికరణాలను మాత్రం సుప్త్రీంకోర్టు తప్పుపట్టలేదు.

మంచి చేయబోతే చెడు ఎదురయినట్టు, ఈ చట్టం వల్ల కొందరు నిజాయితీపరులయిన సభ్యులు ఇబ్బంది పడే అవకాశం వుంది.  అనర్హత వేటుకు భయపడి, ఇష్టం వున్నా లేకపోయినా పార్టీ అధినాయకత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను, బిల్లులను, వాటి  మంచి చెడులతో నిమిత్తం లేకుండా సమర్ధించాల్సిన పరిస్తితి వారిది.

ఇండిపెండెంటు సభ్యులకు  ఈ చట్టంలో కొంత వెసులుబాటు వుంది. వారు తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు తెలపవచ్చు. కానీ అందులో చేరడానికి వీలులేదు. ఇండిపెండెంటుగా గెలిచినా వాళ్ళు ఇండిపెండెంటు హోదాలోనే కొనసాగాలని   చట్టం నిర్దేశిస్తోంది. హర్యానాలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఇండిపెండెంటుగా గెలిచిన అభ్యర్ధులు   అధికార పార్టీలో చేరినట్టు టీవీల్లో వార్త  ప్రసారం అయింది. ఒక టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  ఏకంగా వారే ఈ విషయం చెప్పినట్టు వచ్చింది. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించారు. వారు కోర్టును ఆశ్రయించారు. చివరికి  సుప్రీం కోర్టు కూడా  స్పీకర్ నిర్ణయాన్నే  సమర్ధించింది.

పొతే, మనం సాధారణంగా  'పాలిటిక్స్' అని వాడే ఇంగ్లీష్ పదం  గ్రీకు భాషలోని 'పొలిటికా' అనే పదం నుంచి వచ్చింది. అమెరికా దేశపు మొదటి  అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహాం లింకన్  ప్రజాస్వామ్య ప్రభుత్వానికి  ఇచ్చిన నిర్వచనాన్నే మన రాజకీయ నాయకులు తరచూ ఉటంకిస్తుంటారు. 'ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం' అని. పొలిటికా అనే  ఈ గ్రీకు పదానికి దాదాపు అదే అర్ధం. అయితే కాలక్రమంలో 'నేతిబీరకాయ సామెత' మాదిరిగా ప్రజాస్వామ్యంలో 'ప్రజలు' అడుగంటి పోయి 'నాయకస్వామ్యం'గా మారడం మొదలయింది. 'దీనికి ఎవ్వరు కారకులు? ప్రజలా? పాలకులా? పార్టీలా?' అంటే, 'తిలాపాపం తలా పిడికెడు' అన్నట్టు అందరికీ ఇందులో భాగం వుంది.  ఎవరో అన్నట్టు రాజకీయాలు అనేవి ఒక బుడుగు మాదిరి. దాంట్లోకి ఒకసారి దిగితే అంతే  సంగతులు. తిరిగిరావడం వారి చేతిలో వుండదు. అందుకే,  ఒక పార్టీలో తమకు భవితవ్యం  లేదనుకున్నప్పుడు సిద్దాంతాలు, సూత్రాలు గాలికి వొదిలేసి వేరే పార్టీలోకి దూకుతున్నారు. ఇలా గోడలు దూకేవాళ్ళు కొందరయితే, దూకడానికి తటపటాయించేవారిని దింపడం కోసం గోడలకు నిచ్చెన వేసే పార్టీలు మరికొన్ని. చేపలకు 'ఎర'  వేస్తున్నారా, లేక చేపలే వచ్చి గాలానికి చిక్కుకుంటున్నాయా అనేది జవాబు దొరకని ప్రశ్న.

చివరికి  చెప్పేదేమిటంటే, చట్టాలు చేసేవారే వాటిని 'ఎలా ఉల్లంఘించాలా' అనే దారులు వెతకడం మొదలు పెడితే, అసలు వాళ్ళు చేసిన చట్టాలకు అర్ధం వుండదు, అవి తయారయ్యే చట్టసభలకూ  అర్ధం వుండదు. తరువాత తీరిగ్గా విచారించినా ప్రయోజనం వుండదు.

అన్ని రాజకీయ పార్టీలు ఈ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడే మన ప్రజాస్వామ్య సౌధం పునాదులు బీటలువారకుండా వుంటాయి.




(01-09-2022)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Sir,
You may want to edit; Abraham Lincoln was the 16th president of US. George Washington was the first president of US.

అజ్ఞాత చెప్పారు...

నాయకస్వామ్యం కాదండి, ధనికస్వామ్యం

Chiru Dreams చెప్పారు...

పార్టీ మారాల్సిన అవసరంలేకుండానే.. తమ ప్రభుత్వంలో మంత్రిపదవులుసైతం ఇవ్వగలిగిన చెందరబాబోరిని భూమివున్నంతవరకూ సాధారణ జనాలు మర్చిపోలేరు. బ్లడ్డూ, బ్రీడు వేరేగా ఫీలయ్యే అసాధారణ జనాలకి మినహాయింపు.