26, ఏప్రిల్ 2022, మంగళవారం

ఎవరీ పీకే – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA on 26-04-2022, Tuesday)

లార్జర్ దాన్ లైఫ్ (Larger than life) అని ఇంగ్లీష్ లో తెగ వాడేస్తుంటారు. ఈ వాక్యానికి అసలు అర్ధం మారిపోయి, ఉన్న మనిషిని ఉన్నదానికన్నా పెంచి చూపించడం అనే కోణంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనిషిలోని  గొప్పతనాన్ని  మరింత పెంచి చూపించడం అంటే ఇమేజ్ బిల్డింగ్ (ప్రతిష్టను ఇనుమడింప చేయడం) అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశంలో ఒక స్థాయికి ఎదిగిన రాజకీయ నాయకులు అందరూ ఈ ఇమేజ్ బిల్డింగ్ తాపత్రయంలో పడిపోతున్నారు. బహుశా ఇదంతా ప్రశాంత్ కిషోర్ (పీకే) మహిమ కాబోలు.

కొన్ని వారాల క్రితం ఒక వెబ్ ఛానల్ వాళ్ళు ఈ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడమని అడిగారు. ‘ఎవరీ పీకే?  ఆయన వెనక ఎవరున్నారు?’ అనేది మొదటి ప్రశ్న.

‘ఆయన వెనుక ‘ఆయనే’ వున్నారు అనేది నా జవాబు. 

ఇంకొకరు వెనక ఉండడానికి ఆయన అల్లాటప్పా రకం కాదు. బాహుబలి డైరెక్టర్ రాజమౌళి లాగా ప్రశాంత్ కిషోర్ ఖాతాలో కూడా వరస విజయాలు వున్నాయి. ఒక వ్యక్తిని లేదా వ్యవస్థను అంచనా వేయడానికి ఈనాటి వాణిజ్య ప్రపంచంలో విజయాన్ని మించిన కొలమానం లేదు. ఆ విజేతలు పట్టింది బంగారం,  చెప్పింది వేదం. వారి మాటకు ఎదురు చెప్పేవారు వుండరు. చెప్పరు కూడా.  విజయంలో దాగున్న  అసలు రహస్యం అదే!

బీహార్ లోని  రోహతాస్ జిల్లా కోనార్ గ్రామానికి చెందిన ప్రశాంత్ కిషోర్ వైద్యుడైన తన తండ్రితోపాటు  బక్సర్ కు వెళ్లి అక్కడే స్కూలు చదువు ముగించాడు. ఆరోగ్యరంగంలో ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో ఐక్యరాజ్యసమితిలో ఎనిమిదేళ్లు పనిచేసి, భారత దేశానికి తిరిగివచ్చారు. అందరు నడిచేదారిలో కాకుండా రాజకీయ వ్యూహకర్తగా తన వృత్తిని ఎంచుకున్నారు.

మొదటి విజయానికి పునాది గుజరాత్ లో పడింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ  2012లో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం ఎన్నికలను ఎదుర్కుంటున్న తరుణంలో పీకే తన వ్యూహ చాతుర్యాన్ని ప్రదర్శించి ఆయన గెలుపుకు కారణం అయ్యారు. తిరిగి రెండేళ్ల తరువాత 2014 లో బీజేపీ  తరపున ప్రధాని అభ్యర్ధిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా పీకే ‘చాయ్ పె చర్చా వంటి వినూత్న కార్యక్రమాలతో దేశ ప్రజల దృష్టిలో నరేంద్ర మోడీకి ఒక ప్రత్యేక స్థానం కల్పించడంలో విశేష కృషి చేశారు. అ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం, ఆ పార్టీ జాతీయ స్థాయిలో స్థిర పడడానికి, వివిధ రాష్ట్రాలలో అధికార పీఠం ఎక్కడానికి తోడ్పడింది. రెండు ఎన్నికలలో బీజేపీతో  కలిసి పనిచేసిన పీకే 2015 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించారు. అంతే! అక్కడ కూడా పీకే వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అమరేంద్ర సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు.  తరువాత పీకే తన సొంత రాష్ట్రం అయిన బీహార్ లో ఆ  రాష్ట్ర ముఖ్యమంత్రి    నితీష్ కుమార్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. అక్కడా ఆయనకు ఎదురు లేకుండా పోయింది.

‘నన్నెవ్వరాపరీవేళా’ మాదిరిగా పీకే ప్రభలు దేశవ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన రెడ్డి నుంచి ఆహ్వానం అందింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎదుర్కోవడం, ఎదుర్కుని గెలవడం అనేవి  జగన్ మోహన రెడ్డికి చావోరేవో అనుకునే తరుణంలో, పీకే ఆయనతో జట్టు కట్టారు. అంతవరకూ సాంప్రదాయక ప్రచార పద్ధతులకు అలవాటు పడిన రాష్ట్ర రాజకీయ నాయకులకు ఈ వ్యూహకర్తల పాత్ర ఏమిటన్నది అర్ధం కాలేదు. పైగా ఈ పీకే అనే పెద్దమనిషి ఎవరో ఏమిటో కూడా చాలామందికి తెలవదు. ఎన్నికలకు ముందు జగన్ మోహన రెడ్డి ఒక బహిరంగసభలో ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానించి, పక్కన నిలబెట్టుకుని  ‘ఇదిగో వీరే ప్రశాంత్ కిషోర్’ అని పరిచయం చేసేవరకు ఆయన ఎలా ఉంటాడో కూడా చాలామందికి తెలియదు. ఆ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అఖండ, అపూర్వ ఘన విజయం సాధించడంతో, ఎన్నికల వ్యూహ కర్తగా  పీకే పేరు దేశం యావత్తు మారుమోగిపోయింది.  పీకే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలుగునాట ప్రచారంలో ఉండడం కూడా ఓ కారణం కావచ్చు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీ ఎం కె విజయానికి దోహదం చేసింది కూడా పీకే వ్యూహ చాతుర్యమే. అలాగే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా, మోడీ, అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కుని సాధించిన విజయం కూడా చిన్నదేమీ కాదు.   

అల్లాంటి పీకే మళ్ళీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. కాంగ్రెస్ లో చేరి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి కృషి చేస్తారని ఆ వార్తల సారాంశం. వీటికి తగ్గట్టే ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో  ప్రశాంత్ కిషోర్ ముఖాముఖి చర్చలు జరపడంతో ఈ వార్తలకు మరింత ఊతం చిక్కింది.

ఈ ప్రచారాలు ఇలా అనంతంగా సాగుతుండగానే ప్రశాంత్ కిషోర్, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘ ఏకాంత చర్చలు జరపడం రాజకీయ దుమారం లేపింది. తెలంగాణా కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఈ అంశంపై చేసిన ట్వీట్లు, రాష్ట్ర  కాంగ్రెస్ అధినేతలలో కలవరం రేకెత్తించాయి. ‘నీ శత్రువుతో స్నేహంగా వుండేవాడిని  నమ్మరాదు’ అనే కొటేషన్ ను ఆయన వరసగా ట్వీట్ చేయడం ఏ.ఐ.సీ.సీ. వర్గాల్లో కూడా చర్చకు దారి తీసింది.  

ఇలా రాజకీయంగా పరస్పరం విబెధించుకునే పార్టీలతో మంతనాలు జరపడం ద్వారా పీకే ఏమి సాధించదలచుకున్నారు అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తికరమైన  జవాబు లేదు. అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని అధికారం నుంచి తప్పించాలనే  ఏకైక ధ్యేయంతోనే తాను పనిచేస్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ పలుమార్లు  చెప్పిన విషయం గమనార్హం. అంటే మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేయడం అనే లక్ష్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నారు అని అనుకోవాలి. అదే సమయంలో, ‘మీకు ఒక రాష్ట్రంలో విజయం ముఖ్యమా, కేంద్రంలో అధికారం ప్రధానమా అనేది మీరే  తేల్చుకోండ’ని, కాంగ్రెస్ పార్టీకే పీకే వదిలేసినట్టు అనిపిస్తోంది.  

ఒకటి మాత్రం నిజం. పీకే వల్ల అధికార పగ్గాలు చేజిక్కించుకున్నవాళ్ళు ఆయన వల్లనే తాము విజయం సాధించామని పైకి ఒప్పుకోకపోవచ్చు. కానీ ఆయన వల్ల పరాజయం పాలయిన వాళ్ళు మాత్రం ఏదో ఒక రోజు ఆయన సాయం తీసుకోరని అనుకోవడానికి కూడా  లేదు. ఇందుకోసం క్యూలో నిలబడి వున్నా ఆశ్చర్యం లేదు. కారణం గెలుపు కోసం, అధికార పీఠం కోసం  వాళ్ళు పడే ఆరాటం, అనేక ఘన విజయాలు ఖాతాలో ఉన్న ప్రశాంత్ కిషోర్ వంటి వారివైపే అడుగులు వేయిస్తుంది.

ఎందుకంటే ఆయన పెద్ద బిజినెస్ మాన్. ఆయన ఖాతాలో ఇంతవరకు అపజయం అన్నది లేదు. (గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం ఒకటి వుంది. అయితే తాను ఆ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని ప్రశాంత్ కిషోర్ స్వయంగా వివరణ ఇచ్చారు)

తను చేసిన పనికి తన ఫీజు తాను తీసుకుని నిబద్ధతతో పనిచేస్తాడు.(అయితే, పార్టీల నుంచి  డబ్బు తీసుకోను అని ఈ మధ్యనే ఆయన ఒక ప్రకటన  చేశాడు) తనను నమ్ముకున్నవారికి ఫలితం చూపిస్తున్నాడు, బాహుబలి రాజమౌళిలాగా. విశ్వాసానికి విజయమే గీటురాయి.

రాజకీయ పార్టీలు కూడా వ్యాపార సంస్థలే. లాభం లేదు అనుకుంటే ఒక పైసా విదల్చవు. ఉందనుకుంటే కోట్లు వెదజల్లుతాయి.

 

ఇక ఎవరికీ పట్టని నైతిక విలువలు ఓటర్లకు మాత్రం ఎందుకు? టీవీ చర్చల్లోకి  తప్ప.

పొతే, ప్రశాంత్ కిషోర్ కు ఓ హితవాక్యం.

ఇంతవరకు పీకే ఒడ్డున వుండి పావులు కదిపి తన జట్టును గెలిపించుకున్నాడు. ఇప్పడు తనే స్వయంగా ఓ పార్టీ తీర్థం పుచ్చుకుని, గోదాలోకి దిగుతున్నారు. ఈసారి పాత్ర మారుతోంది. మారిన కొత్త  పాత్రలో జీవించడం, మెప్పించడం  అంత సులభం కాదు. ఈ పరిస్థితిలో  అయన మునుపటి మాదిరిగా విజయాలు సాధిస్తే ఆయన్ని నమ్ముకున్నవాళ్లకు మంచిదే. కానీ, పరాజయం సిద్ధిస్తే మాత్రం  దాన్ని హుందాగా స్వీకరించగలగాలి. 



(25-04-2022)

 

11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఒడ్డున వుండి పావులు కదిపి తన జట్టును గెలిపించుకున్నాడు.

పల్స్ పట్టేసారు

నీహారిక చెప్పారు...

మన పీకే గారు రెండు మూడు సినిమాలు హిట్టయ్యే సరికి తన సినిమా తనే తీసుకుందామని "జానీ" అనే సినిమా తీశారు. ఒక వారం రోజులు కూడా సినిమా ఆడలేదు.

ఎవరిపని వాళ్ళే చేయాలి అనేది నేర్చుకోవలసిన విషయం.

అజ్ఞాత చెప్పారు...

చీర్స్


జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

జిలేబి”? “జిలేబి” 🤔?!!
అంటే దీనర్థం “జిలేబి” గారు బ్లాగుల్లో పునర్దర్శనం ఇస్తున్నారా?
Welcome back.

bonagiri చెప్పారు...

ఎవరీ పీ కే అంటే, మహాభారతం లో మాయా జూదం ఆడించిన శకుని మామ వారసుడు.
ఏ ఎన్నికలకు ఆ రంగు మార్చే ఊసరవెల్లి.
అసలు ఇలాంటి వాళ్ళ సంస్థలను ఎన్నికల కమిషన్ నిషేధించాలి. సోషల్ మీడియా ద్వారా అర్ధసత్యాలు, అసత్యాలు ప్రచారం చెయ్యడం ఆపాలి.

అజ్ఞాత చెప్పారు...

KYAAAAAAAAAAAAAA !!??????
ZILEBI ZINDA HAI !!??????
inkemundi ZINDA TILISMATH ki malli girakee ne 🤣🤣🤣

అజ్ఞాత చెప్పారు...

అలా కాదు లెండి Anonymous గారు. “జిలేబి” గారుంటే ఆ సందడే వేరు. చూడండి కొన్ని నెలలుగా ఎంత చప్పగా ఉందో ?

ఏదో కారణాల వలన అజ్ఞాతంగా సంచరిస్తున్నారనే ఆశిద్దాం.

- విన్నకోట నరసింహారావు

శ్యామలీయం చెప్పారు...

It is some impostor. I don't think Zilebi is back.

Chiru Dreams చెప్పారు...

>>“జిలేబి” గారుంటే ఆ సందడే వేరు. చూడండి కొన్ని నెలలుగా ఎంత చప్పగా ఉందో ?

పోనీ జిలేబీ సీట్లో శ్యామలీయంగారిని కూర్చోబెడదామా?

అజ్ఞాత చెప్పారు...

పోనీ జిలేబీ సీట్లో శ్యామలీయంగారిని కూర్చోబెడదామా?
Manchi selectione kani, Oppukumtaaramtara?

అజ్ఞాత చెప్పారు...

It is some impostor. I don't think Zilebi is back.
ఔనవును వీరెవరో దొంగ జిలేబీయే!