24, ఏప్రిల్ 2022, ఆదివారం

ఈ ప్రశ్నకు బదులేది? – భండారు శ్రీనివాసరావు

 (Published in ANDHRAPRABHA on 24-04-2022, SUNDAY)

 

1973 లో స్వీడన్ లోని స్టాక్ హోంలో బ్యాంకు దోపిడీ జరిగింది. ఈ సందర్భంలో దోపిడీ దొంగలు కొంతమంది బ్యాంకు  సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. తమని చంపేస్తారేమోనని ముందు బందీలు భయపడ్డా, దొంగలు వారిని ఏమీ చేయలేదు. బందీలుగా వున్న రోజుల్లో వారికీ వీరికీ నడుమ ఒక రకమయిన ఆత్మీయ బంధం ఏర్పడింది. ఆరు రోజుల తరువాత వారిని విడిచిపెడతామన్నా కూడా బందీలు బయట పడడానికి  అంగీకరించలేదు. పైపెచ్చు, తమని బందీలుగా పట్టుకున్న దొంగలనే వారు సమర్ధించారు. వారిపై పెట్టిన కేసు ఖర్చులను కూడా భరించడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు, బందీల్లో వున్న ఒక అమ్మాయి, బందిపోటు దొంగల్లో ఒకడిపై మనసు పారేసుకుని అతడినే ఆ తరువాత మనువాడింది కూడా. ఈ రకమయిన మనస్తత్వానికి తదుపరి రోజుల్లో ‘స్టాక్ హోం సిండ్రోం’ అనే పేరు స్తిరపడింది.

ఈ విషయం గుర్తు చేసుకోవడానికి పూర్వరంగం ఒకటుంది.

మేధావులు తమకు తెలిసింది చెబుతారు. సామాన్యులు తమ మనసులోని మాట చెబుతారు. సామాన్యుల మాటలు,  రంగూ రుచీ వాసన లేని స్వచ్ఛమయిన నీరు వంటివి.’

ఒక టీవీ చర్చలో పాల్గొంటూ నేను చెప్పిన ఈ మాటతో నాతోపాటు ఈ కార్యక్రమానికి హాజరయిన  మరో విశ్లేషకుడు ఏకీభవించలేదు.

మేధావులు, చదువుకున్నవాళ్లు, తమకున్న పరిజ్ఞానంతో అది లేని వారికి విషయం విడమరచి చెప్పి, సరయిన తీరులో వాళ్ళు కూడా ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. కాకపొతే మా ఇరువురి నడుమా ఈ సంభాషణ ‘బ్రేక్’ టైం లో సాగింది.

ఆయన అభిప్రాయం కూడా కొట్టిపారేసేది కాదు. కాని మేధావి అంటే ఎవరు? ఒక మేధావి చెప్పింది మరో మేధావి ఒప్పుకునే పరిస్తితి వుందా? అలా వుంటే మేధావి ఎలా అవుతాడు?

సరే! మా సంభాషణ సాగుతుండగానే లైవ్ షో మొదలయింది. నా అభిప్రాయాన్ని సమర్ధించుకుంటూ నేను ఓ అనుభవాన్ని ఉదహరించాను.

ఎనభయ్యవ దశకం ఆఖరులో నేను మాస్కోలో వున్నప్పుడు టీవీలో ఒక టాక్ షో చూసాను. భాష అర్ధం కాకపోయినా భావం అర్ధం అయ్యేలా ఆ షో నడిచింది. ఆ టాక్ షోలో పాల్గొనాల్సివున్న ఒక ప్రసిద్ధ నటుడు సమయానికి రాకపోవడంతో అక్కడ పనిచేసే లైట్ బాయ్ ని పెట్టి ఆ షో నడిపిస్తారు. అతడు దాన్ని యెంత సమర్ధంగా నడిపిస్తాడంటే, ఆ ఒక్క షో తోనే  ప్రేక్షకులు అతడికి బ్రహ్మరధం పడతారు. అవకాశం వచ్చినప్పుడు సామాన్యులు కూడా తమలోని ప్రతిభను బయట పెడతారని అతగాడు రుజువు చేస్తాడు.

ఇది చెప్పి, టీవీ ఛానళ్ళ వాళ్లు కూడా సామాన్యుల అభిప్రాయాలతో కార్యక్రమాలు రూపొందిస్తే జనసామాన్యం అభిప్రాయాలు మరింత బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం వెల్లడించాను. అయితే ఇవన్నీ చాలా పాత రోజుల ముచ్చట్లు అనుకోండి. ఇప్పుడు ఇలా మాట్లాడే సావకాశం విశ్లేషకులకు లేదు. అలాంటి అవకాశం ఇచ్చే వీలూసాలూ,  చర్చను నిర్వహించేవారికి కూడా  వున్నట్టు లేదు.

అసలింతకీ విషయం ఏమిటంటే, సమాజంలో నానాటికీ విస్తరిస్తున్న అవినీతి భూతాన్ని సామాన్యులు అంతగా పట్టించుకోవడం లేదని, వారి నిర్లిప్తత వల్ల ఎంతో అనర్ధం జరుగుతుందని ఈనాడు అనేకమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో వారిని జాగృతం చేయాల్సిన బాధ్యత వివేకులు, విజ్ఞానులు, మేధావులు తీసుకోవాలని వారి డిమాండు. అయితే, ఇతరులని అవినీతిపరులని ముద్ర వేస్తున్న వాళ్లు సయితం ఏమీ తక్కువ తిన్నవాళ్ళు కాకపోవడం వల్లనే, ప్రజలు అవినీతిపట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న సంగతిని వాళ్లు మరచిపోతున్నారేమో అనిపిస్తున్నది. ఆరోపణలు చేసేవారికి విశ్వసనీయత అడుగంటడమే ఈ పరిస్తితికి దారితీసింది. అందరూ అవినీతిపరులే అన్న భావన, అందరూ ఆ తానులో ముక్కలే అనే అభిప్రాయం  ప్రజల్లో ప్రబలిన తరువాత ఈ నీతివాక్యాలు వారి చెవులకు సోకవు.

ఓట్లు అమ్మకాలు, కొనుగోళ్ల గురించి మా వాచ్ మన్ కుటుంబం దగ్గర ప్రస్తావన తెస్తే వాళ్ళు చెప్పిన జవాబులు కూడా ఆలోచింపచేసేలా వున్నాయి. 

‘రాజకీయాల్లో వున్నవారు ఓ పదవికి ఆశపడితే అది ధర్మం. సామాన్యులు వోటుకు  బదులుగా ఏదయినా కోరుకుంటే అది అధర్మం. నిజానికి ఓటు అమ్మడం అలవాటు చేసింది వాళ్ళే. కొనేవాడు లేకపోతే ఇక అమ్మేదెవరికి? ఓటుకింత అని ఇప్పుడు డిమాండ్ చేస్తున్న మాట కూడా నిజమే.  ఓ వెయ్యో, రెండు వేలో మా మొహాన విదిలించి గెలిచినవాళ్ళు ,కౌన్సిల్, రాజ్యసభ ఎన్నికల్లో వారి ఓటును లక్షలకు అమ్ముకుంటున్నారని టీవీల్లో చూసి తెలుసుకున్నప్పుడు, మరి  మాకు బాధగా ఉండదా! రాజకీయులు ఏదయినా ఓ పార్టీకి కొమ్ముకాస్తూ, తమ పనులు చక్కబెట్టుకుంటే అది నైతికత. రాజకీయంగా సమర్థనీయం. సమాజం మొత్తాన్ని అవినీతిరహితంగా వుంచగలిగితే అందరూ సంతోషిస్తారు. అంతే కాని, పక్కవానికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని అంటే కుదరదు”

సామాన్యుడు అనేవాడు ఇక ఎంత మాత్రం సామాన్యుడు కాడని, అసామాన్యంగా ఆలోచించడం మొదలు పెట్టాడని  నాకు ఆ మాటలతో తెలిసి వచ్చింది. నువ్వు చేస్తున్నది తప్పు అని అతడికి  చెప్పగలిగే స్థాయి నాకు వుందని నేను అనుకోను.

రాజకీయ నాయకులు, ఆ మాటకు వస్తే సమాజంలో ఎంతోకొంత పలుకుబడి కలిగిన వాళ్లందరూ తమ స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నప్పుడు, తమ విషయంలోనే ఈ పెద్దలు సుద్దులు నూరిపోయడం సామాన్యులు జీర్ణం చేసుకోలేకపోతున్నారన్న మాట.

తోకటపా:  

పూర్వం ఓ మహారాజు పెద్దమనసుతో ప్రతిరోజూ అన్నార్తులకు అన్నదానం చేస్తుండేవాడు. ఇలా పుణ్య కార్యాలు చేస్తూ ఎంతో పుణ్యం మూటగట్టుకుని స్వర్గంలో మంచి స్థానాన్ని ఇప్పటినుంచే సంపాదించి పెట్టుకుంటున్నాడు అని జనం అందరూ వేనోళ్ళ చెప్పుకునేవారు. అయితే అలా దానం చేస్తున్న అన్నం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ‘ఎంగిలి’ అవుతోందన్న విషయం ఆ రాజు గారికి తెలియదు. కాని ఈయనగారు ఇలా నిత్యాన్నదానం కొనసాగిస్తూవుంటే, మరో పక్క నరకంలో ‘ ఆ ఎంగిలి కూడు’ ఓ కొండలా పెరగడం మొదలయింది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ కొండ విషయం గమనించి ఆ విషయాన్ని భూలోకానికి వచ్చినప్పుడు ఆ రాజుగారి చెవిన వేసాడు. రాజు కంగారు పడిపోయి తరుణోపాయం కోరాడు. అప్పుడు నారదుడు ఇచ్చిన సలహా రాజుగారికి నచ్చకపోయినా గత్యంతరం లేక అమలు చేసాడు. నారద ముని సూచన మేరకు ఓ ఒంటిస్థంభం మేడ కట్టించి అందులో యుక్తవయస్సులో వున్న తన ఏకైక కుమార్తెను ఒంటరిగా వుంచాడు. ప్రతిరోజూ సాయం సంధ్యవేళలో ఆ భవనానికి వెళ్లి, కుమార్తె పడకగది బయట తెల్లవారేవరకు ఆమెకు తెలియకుండా గడిపి తిరిగి రాజభవనం చేరుకునేవాడు. రాజుగారి ఈ వ్యవహారం ఆ నోటా ఈనోటా పడి చివరకు ప్రజలు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. సొంత కుమార్తెతో రాజు గారికి అక్రమ సంబంధం అంటగట్టి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భూలోకంలో జనం రాజుగారికి వ్యతిరేకంగా అపనిందల ప్రచారం పుంజుకుంటున్నకొద్దీ, అక్కడ నరకంలో రాజుగారి ‘ఎంగిలి కొండ’ క్రమంగా తరిగిపోవడం మొదలయింది.

త్రిలోక పూజ్యుడయిన నారద మునీంద్రులు రాజుగారి పాప ప్రక్షాళన కోసం ఇచ్చిన సలహా మహిమ అది.

మాదోరి పాప. ఆదోరి బయ్యాలి’ అని కన్నడంలో ఒక సూక్తి. అంటే ఒకరు చేసిన పాపాన్ని వేరొకరు అదేపనిగా చెబుతుంటే ఆ పాపంలో వాటా వాళ్ల ఖాతాలోకి కూడా చేరుతుంది.



 

కామెంట్‌లు లేవు: