2, జూన్ 2019, ఆదివారం

మోడీ మంత్రివర్గంలో మామూలోడు – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Bhoomi Daily on 02-06-2019, SUNDAY)
నరేంద్ర దామోదరదాస్ మోడీ అనే నేను అంటూ రెండో పర్యాయం భారత ప్రధానిగా మోడీ పదవీ ప్రమాణస్వీకారం చేసి దేశ రాజకీయ చరిత్రలో నూతనాధ్యాయానికి నాంది పలికారు. మంత్రివర్గంలో ఎవరికి చోటు దొరికింది, ఎవరిని తప్పించారు అనే చర్చకు అవకాశం లేకుండా మోడీ తనదైన శైలిలో ఒక కొత్త ప్రయోగం చేసి జాతికి చూపారు. ఇలాంటివి చేయడానికి ధైర్యం తెగువ మాత్రమే సరిపోవు. హృదయ వైశాల్యం కూడా వుండాలి.
ఈ విషయం ముచ్చటించుకునేముందు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుందాం. ఆయనే ఈ వ్యాసానికి ప్రేరణ.
ప్రజల భాషలో చెప్పాలంటే ఆయన ఒక మామూలోడు. సాదాసీదా సామాన్యుడు. నిజం చెప్పాలి అంటే సామాన్యులలో అతి సామాన్యుడు. గతంలో రెండు సార్లు ఒడిసాశాసనసభకు ఎన్నికయినా ఆయన రూపం మారలేదు. భాష మారలేదు. జీవన విధానం మారలేదు. అదే పూరిల్లు. అవే దుస్తులు. కుర్తా పైజామా లేదా ధోవతి. అవీ రెండు జతలే. ఎక్కడికి వెళ్ళినా యెంత దూరం వెళ్ళినా ఒక చేతి సంచీ మాత్రమే ఆయన లగేజి. ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ మీదనే సవారీ. తెల్లటి బవిరి గడ్డం. చింపిరి జుట్టు. సమాజ సేవ కోసం పెళ్లి చేసుకోలేదు. ఏడాది క్రితం కన్నతల్లి కూడా మరణించడంతో ఆ పూరి గుడిసెలో ఒంటరి జీవనం. కానీ ఒంటరి మాత్రం కాదు. చుట్టూ సామాన్య జనం. జనం మధ్యనే ఆయన శ్వాస. జనం కోసమే ఆయన ధ్యాస.
పేరు సారంగి. ప్రతాప్ చంద్ర సారంగి. ఆయన ఇప్పుడూ సామాన్యుడే. కానీ మోడీ పుణ్యమా అని వున్నట్టుండి అసామాన్యుడిగా మారిపోయాడు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ కూర్పులో ప్రధాని మోడీ సారంగిని తన మంత్రి మండలిలోకి తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నేపద్యంలో బహిరంగ వేదికపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇతర ఆహూతుల సమక్షంలో సారంగి కేంద్రమంత్రిగా పదవీ ప్రమాణం స్వీకరించే సమయంలో చప్పట్లే చప్పట్లు. సైకిల్ పై తిరిగే ఓ సామాన్యుడు ఇప్పుడు కేంద్రంలో ఒక గౌరవనీయ మంత్రి.
ఈ విధంగా సారంగీ పేరు మరోమారు దేశమంతటా మారుమోగి పోయింది. మరోమారు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ప్రతాప్ చంద్ర సారంగి అంత అనామకుడేమీ కాదు.
ఇప్పటికే సారంగి రెండు మార్లు, 2004లో మొదటి సారి, 2009లో రెండోసారి ఒడిసా శాసన సభకు ఎంపికయ్యారు. మొదటి నుంచీ ఆర్ ఎస్ ఎస్ మూలాలు కలిగిన సారంగి భజరంగ్ దళ్ కార్యకర్త. అతి సామాన్య జీవనం గడిపే సారంగిని అక్కడి ప్రజలు ఒడిసా మోడీ అని పిల్చుకుంటారు. శాసన సభ్యుడిగా లభించే పించను జీవనాధారం. అయితే సారంగి జీవితానికి కాదు, ఆయన్ని నమ్ముకుని జీవిస్తున్న సామాన్యులకు. వేరే ఖర్చులంటూ లేని సారంగి చేసే సమాజ సేవకు ఆ పించను డబ్బులు ఉపయోగపడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ ఒడిసా మోడీ గురించి భారత్ మోడీకి కూడా బాగా తెలుసు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎప్పుడు ఒడిసా పర్యటనకు వచ్చినా ఆయన మరచిపోకుండా చేసే పని ప్రతాప్ చంద్ర సారంగిని కలవడం. ఆ విధంగా సారంగి పేరు అందరికీ తెలిసిపోయింది. భారత ప్రధాన మంత్రి మోడీకి సారంగి అత్యంత సన్నిహితుడు అని నలుగురికీ తెలుసు. అయినా నలుగురితో నెరిపే ఆయన సంబంధ బాంధవ్యాలలో ఎలాంటి తేడా లేదు. ఆప్యాయతతో కూడిన అదే పలకరింపు. అదే వేష ధారణ. అదే జీవన శైలి. అదే సైకిలు. అదే పూరి గుడిసె.
2009లో బీజేపీ అభ్యర్ధిగా సారంగి నామినేషన్ వేయాలి. సైకిల్ పై వెడుతుంటే నామినేషన్ పత్రాలు ఎక్కడో జారి పడిపోయాయి. చేసేది లేక సారంగి ఇండిపెండెంటు అభ్యర్ధిగా పోటీ చేసారు. జనం ఆయన్ని గెలిపించారు. 2014లో పార్టీ ఆయనకు పార్లమెంటుకు పోటీ చేయడానికి అవకాశం కల్పించింది. దురదృష్టం ఆ ఎన్నికల్లో ఆయన నెగ్గలేదు. ఈసారి మళ్ళీ బీజేపీ ఆయన సేవలను గుర్తించి మరోమారు టిక్కెట్టు ఇచ్చింది. కోటీశ్వరుడైన ప్రత్యర్ధిపై గెలుపొందారు. ఆ విధంగా సభ్యుడిగా లోకసభలో అడుగుపెట్టే మహత్తర అవకాశం లభించింది. అయితే విధి లిఖితం మరోలా వుంది. కేవలం సభ్యుడిగా కాకుండా మంత్రిగా పార్లమెంటులో కాలుమోపే సువర్ణావకాశాన్ని ప్రధాని మోడీ ఆ సామాన్యుడికి కల్పించారు.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

బాగానే ఉంది.
అయితే // "సారంగి భజరంగ్ దళ్ కార్యకర్త." // అన్నారు పైన. ఒక ఇరవై యేళ్ళ క్రితం ఈయన ఒడిషాలో భజరంగ్ దళ్ నాయకుడిగా ఉన్న రోజుల్లోనేగా దళ్ మనుషులు కొంతమంది గ్రాహమ్ స్టెయిన్స్ అనే ఒక ఆస్ట్రేలియన్ మిషనరీని, ఆయన ఇద్దరు చిన్నపిల్లలనూ (10 యేళ్ళ వయసు) వాళ్ళు నిద్రిస్తున్న వేన్ లోనే సజీవదహనం చేసింది. దారాసింగ్ అనే వ్యక్తిని దోషి అని నిర్ణయించి మరణశిక్ష విధించింది కోర్ట్. తరువాత పై కోర్ట్ వారు దానిని జీవితకాలశిక్షగా తగ్గించినట్లుంది.