10, ఆగస్టు 2017, గురువారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా.....(8)


పర్వతాలరావు గారి భండారు వంశం
మా వంశం గురించి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు తన జీవితకాలంలోనే అనేక విషయాలు సేకరించి పెట్టారు. వాటినే యధాతధంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు 


(భండారు పర్వతాలరావు) 
  
భండారు వంశం ఎప్పుడు మొదలయిందో ఇదమిద్ధంగా చెప్పడం కష్టం. దీనిని గురించి కొంత పరిశోధన చేసిన శ్రీ భండారు చంద్ర మౌళీశ్వరరావు గారు  న్యాయవాది, రచయిత కూడా. వీరిది వరంగల్లు. ఈ విషయంలో వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడదు. శ్రీ భండారు నాగభూషణ రావు (నిజాం షుగర్స్ లో పనిచేశారు.  కీర్తిశేషులు. అసలు వేములపల్లి స్వగ్రామం) చెప్పినదాన్నిబట్టి బసవేశ్వరుడు ఈ వంశానికి ఆదిపురుషుడని తెలుస్తోంది. కొందరు అక్కన్న కూడా ఈ వంశం వాడేనని  అంటున్నారు.
వంశ  నామాలలో చాలా భాగం వూరి పేర్లు కనిపిస్తాయి. కొడవటిగంటి (కొడవటిగల్లు) మాగంటి (మాగల్లు), వేములపల్లి, తుర్లపాడు మొదలయినవి ఇందుకు ఉదాహరణ. అయితే భండారు అనే పేరు తెలుగునాట ఊరికీ లేదు. మహారాష్ట్రలో భండారి అనే బస్తీ వుంది. ఛత్రపతి శివాజీ దండయాత్రల సమయంలో అక్కడినుంచి కొందరు బ్రాహ్మణులు ఆయనతో పాటు ఆంద్ర దేశం వచ్చి అక్కడక్కడా స్థిరపడినట్టు తెలుస్తోంది. వారిని, భండారి వారని, భండారు   వారని పిలిచే అవకాశం లేకపోలేదు.
భండారు  అన్న వంశనామ పుట్టుపూర్వోత్తరాల సంగతి తెలియకపోయినా కంభంపాడు  గ్రామానికి భండారు వంశీకులు మొదట ఎలా వచ్చారు అన్న సంగతిపై మాత్రం తగిన ఆధారాలు లభించాయి. నేను (పర్వతాలరావు గారు) విజయవాడలో చదువుకునేటప్పుడు, అంటే 1953 ప్రాంతంలో మా చిన తాతగారు భండారు వెంకట సుబ్బారావు గారు  మా స్నేహితుడు శ్రీ గోనుగుంట్ల విశ్వనాధంతో  తనకు గుర్తున్నంత వరకు మా వంశ వృక్షం రాయించారు. నేను కూడా రాసుకుంటానంటే,  ‘ఎవరి వంశవృక్షాన్ని వాళ్ళు రాసుకోకూడదు. అలా  రాసిన వారికి సంతానం కలగదంటారుఅని  చెప్పి వారించారు. ఆ తరువాత మా చిన తాతగారు లక్ష్మీనారాయణ గారింట్లో మా వంశవృక్షం కాపీ ఒకటి వుందని ఆయన మునిమనుమడు భండారు సుధాకర రావు చెప్పగా నేను వెళ్లి దాని నకలు రాసుకొని వచ్చాను.  ఈ రెండూ కాక, పైన చెప్పిన కోర్టు తీర్పు కాపీలో కూడా ఆ వివరాలను  పేర్కొన్నారు. కంభంపాడుకు  సంబంధించినంత వరకు ఈ ఆధారాలతో చాలావరకు వంశ వృక్షాన్ని నిర్ధారించుకునే  అవకాశం కలిగింది.
కానీ వీటిని బట్టి వూరి చరిత్ర తెలుసుకునే వీలు తక్కువ. అయితే చాలా ఏళ్ళుగా వున్న  గ్రామం అని చెప్పవచ్చు.  స్తంభము ప్రోలుఅన్నది కంభం పాడు  అన్న పేరుకు మూలం కావచ్చు. లేదా స్థంభం పహాడ్కాలక్రమంలో కంభంపాడు కావచ్చు. కానీ ఈ గ్రామానికి సమీపంలో స్థంభం కానీ, పహాడ్ కానీ లేవు. ఇక్కడ లోగడ ఏదయినా జయస్థంభంలాంటిది వుంటే, స్థంభం ప్రోలు లేక కంభంపాడు అనే పేరు వచ్చి ఉండవచ్చు.  ఆ రోజుల్లో ఇలాటి జయ స్తంభాలను చాలాచోట్ల నెలకొల్పి వుంటారు. కనుక కంభంపాడు అన్న పేరుతొ చాలా గ్రామాలు కనిపిస్తాయి. మధిర దగ్గర ఒకటి, తిరువూరు దగ్గర ఒకటి, అమరావతి దగ్గర వైకుంఠ పురం దగ్గర మరోటి వున్నాయి. గ్రామ చరిత్రను తెలుసుకోవాలంటే బందరు వెళ్లి జిల్లా కలెక్టర్ ఆఫీసులో పురాతన పత్రాలను శోధించాల్సి వుంటుంది.

కంభంపాడుకు  భండారు వారు రావడం గురించి వంశ వృక్షంలో కాని, కోర్టు తీర్పులో కాని, వివరాలు అంటే తేదీలు వగయిరా  పేర్కొనలేదు. వాడేల రామరాజు గారని ఒకరుండేవారు. ఆయన భార్య బుచ్చమ్మ. వారికి మగపిల్లలు లేరు. ఒక్కతే  కుమార్తె. ఆమెను కంచెల గ్రామంలో భండారు వీరేశలింగం గారికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరేశలింగంగారు కంభంపాడుకు వచ్చి స్థిర పడ్డారు. (ఒకరకంగా ఇల్లరికం అన్నమాట) లక్ష్మీనారాయణగారు రాయించిన వంశ  వృక్షం ఆయనను వీరేశలింగంగా  పేర్కొంటోంది. సుబ్బారావుగారు రాయించిన దానిలో వీరేశం అనే వుంది. (కోర్టు తీర్పులో కూడా ఇంటి పేరు బండారుఅనే వుంది  కాని భండారుఅని లేదు. అయితే ఇది రాయసకాని పొరబాటు అని అనుకోవచ్చు. ఇంచుమించు అదే కాలంలో భండారు లక్ష్మయ్య కులకర్ణి గారు రాసిన ఒక అర్జీలో  ఇంటి పేరును స్పష్టంగా  ‘భండారుఅనే రాసారు.) కనుక భండారు వీరేశం లేక భండారు వీరేశలింగం అనే ఆయన కంభంపాడులో భండారు వారికి మూలపురుషుడు అనడంలో సందేహం లేదు. కంచెల గ్రామంలో కాని, వేములపల్లిలో గాని ఎవరయినా వంశ వృక్షాలు రాయించి దాచి  వుంటే వీరేశం గారి పూర్వీకుల గురించి తెలుసుకునే వీలువుంటుంది. అయితే వేములపల్లిలోని వంశ వృక్షాలను  గురించి కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  అగ్రహారం పంపకాలలో కోర్టు కెక్కి అక్కడివారు తమ తమ సానుకూలాన్ని బట్టి వంశ వృక్షాలు రూపొందించి ఉంటారని కొందరి వూహ. వేములపల్లి భండారు వారు లింగాలను ధరించారు. అయితే కంచెల, పల్లగిరి భండారు వారు, వారివలె  లింగధారులు  కారు. ఆరువేల నియోగులు. స్మార్తులు. యజుస్మాఖాధ్యాయులు. ఆపస్తంభ సూత్రులూను. (ఇంకా వుంది)

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ అన్నయ్య గారు శ్రీ పర్వతాలరావు గారు పేర్కొన్న శ్రీ భండారు లక్ష్మయ్య కులకర్ణి గారి పేరులోని "కులకర్ణి" బట్టి చూస్తే భండారు వంశం వారికి మహారాష్ట్ర మూలాలు ఉండుండచ్చనే అనిపిస్తోంది. నిజానికి కొన్ని ఆరువేల నియోగుల వంశాల విషయంలో అదే చెబుతారు. అలాగే, సంపన్న (ఆరోజులకి 🙂) ఆరువేలనియోగి కరణాల కుటుంబాలను దేశపాండేలు అని కూడా జనాలు అనే వారని మా తండ్రి గారు చెబుతుండేవారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు గారు: మీరన్నది నిజమే కావచ్చు. ధన్యవాదాలు