1, అక్టోబర్ 2016, శనివారం

పాక్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు మెరుస్తాయా కురుస్తాయా

  
గత శుక్రవారం తెల్లవారినప్పటినుంచి  జాతి వ్యాప్తంగా  జనులు మాట్లాడుకుంటోంది ఒకే  విషయం. పాక్ ఆక్రమిత  కాశ్మీర్  భూభాగంలోకి భారత సైనికులు చొరబడి అక్కడి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్త్రైక్స్) జరిపి తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి  చేయడం గురించే. కుల,మత, ప్రాంత, రాజకీయ విబేధాలు పక్కనబెట్టి ప్రజానీకం యావత్తూ  భారత సైనికులపై  ప్రశంసలు కురిపిస్తూ వుండడం అనేది  భారతీయుల్లో జీర్ణించుకుని వున్న ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే విశిష్ట లక్షణాన్ని ప్రస్పుటంగా ఎత్తిచూపుతోంది. మనల్ని మనం భుజం చరుచుకుని పరస్పరం అభినందించుకోవాల్సిన శుభ తరుణం ఇది. అలాగే ఒప్పజెప్పిన బృహత్తర లక్ష్యాన్ని అనుకున్న వ్యవధిలో, అనుకున్న విధంగా జయప్రదంగా సాధించిన  భారత సైనిక కమాండోలకు జాతి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఈ  విజయానికి ఇటువంటి అపూర్వ స్పందన రావడానికి ఓ నేపధ్యం వుంది.
ఇటీవలే పాక్  ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ లోకి జొరబడి భారత సైనిక శిబిరంపై దొంగదెబ్బ తీశారు. పందొమ్మిదిమంది ప్రాణాలను పొట్టన బెట్టుకున్నారు. ఆ ముష్కర చర్యతో దేశం యావత్తు దిగ్భ్రాంతి చెందింది. మనమేమీ చేయలేమా అనే  ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా ఆ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి జరిపారు. ఖచ్చితంగా ఆ చర్య పొరుగు దేశంపై యుద్ధం చేయడమే, అలా ఆ స్థాయిలో తెగించినవారిపై గట్టి చర్య తీసుకునివుంటే ఇప్పుడీ పరిస్తితి తలెత్తేది కాదు అనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ఉరీ సంఘటన జరిగినప్పుడు కూడా మన దేశ నాయకులు ‘ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామనే భారీ  ప్రకటనలు చేసారు. అవి షరా మామూలు ఊకదంపుడు ప్రకటనలనే విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం మేకతోలు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అన్నవారూ వున్నారు. అలా అన్న పక్షం రోజుల్లోనే భారత సైనికులు ఈ మెరుపు దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని అయిదు ఉగ్రవాద స్థావరాలపై దెబ్బతీసి తమ ఆధిక్యతను అద్భుతంగా ప్రదర్శించారు. దేశ గౌరవాన్నిఅంతర్జాతీయ స్థాయిలో  నిలబెట్టారు.  కాశ్మీర్ లోని ఉరీలో ఉగ్రవాదుల చర్యకూ, శుక్రవారం రాత్రి భారత్ కమాండోల చర్యకూ ఒక స్థూలమైన బేధం వుంది. ఉరీ సంఘటనకు బాధ్యులైన వాళ్ళు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు. వాళ్ళు దొంగచాటుగా మన దేశంలోకి చొరబడి పందొమ్మిదిమంది సైనికులను బలితీసుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను దెబ్బతీయడానికే వ్యూహ రచన చేసింది. మూలంపై దెబ్బ కొట్టడం ద్వారా ఉగ్రవాదులకు ముకుతాడు వేసే ప్రయత్నం చేసింది. వారికి మద్దతు ఇస్తున్న పాకీస్తాన్ కు కూడా ఈ విధంగా గట్టి హెచ్చరికతో కూడిన సంకేతం ఇచ్చింది. అదే సమయంలో అక్కడి సాధారణ పౌరులకు ఈ మెరుపుదాడుల వల్ల హాని కలగకుండా కేవలం లక్ష్యబేధనే గురిగా ఎంచుకుంది. ఇలా చేయడానికి ఎన్నో ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకోవాలి. మెరుపు దాడులు చేయడానికి  తగిన  శిక్షణ పొందిన, అనుభవం కలిగిన  కమాండోలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కటిక చీకట్లో కూడా చూడగలిగిన కంటి పరికరాలను, గురి చూసి కొట్టగలిగిన ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చాలి. అన్నింటికంటే ప్రధానం లక్ష్య నిర్దేశం. శత్రువు స్థావరాన్ని ఎలాటి పొరబాటుకు అవకాశం లేకుండా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవడం, అలాగే ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా లక్ష్యాన్ని చేరుకోవడం. ఈ విషయంలో  భారత సైన్యం ఎంతో కసరత్తు చేసింది. భారత ఉపగ్రహాల సాయం తీసుకుని ఉగ్రవాద స్థావరాల ప్రాంతాన్ని ముందుగానే గుర్తించింది. అంచేతే,  అర్ధరాత్రి తమ కదలికలను ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లి, ఒప్పగించిన బాధ్యతను నూటికి నూరు పాళ్ళు పూర్తి చేయగలిగింది.                
భారత సైన్యం జరిపిన మెరుపుదాడి పూర్వాపరాలను గురించి అనేక ఆసక్తి కరమైన కధనాలు వెలువడుతున్నాయి. సైన్యం ఎంతవరకు చేయాలో అంతవరకే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. ఆ కర్తవ్య పాలన గురించి ఎంతవరకు చెప్పాలో అంతవరకే అధికారులు చెబుతారు. అంచేత జరిగినదాన్ని గురించి పలు కధనాలు మీడియాలో, ప్రత్యేకించి  సోషల్ మీడియాలో  వస్తున్నాయి. అయితే ఇవన్నీ పూర్తిగా ఆధార రహితం అని చెప్పేందుకు కూడా వీలులేదు.
ఆ శుక్రవారం రాత్రి జరిగిన దాన్ని గురించి, ముఖ్యంగా ఆంగ్ల పత్రికల్లో వస్తున్న వార్తలు వింటుంటే, యుద్ధ నేపధ్యం కలిగిన  ఒక అద్భుతమైన చలన చిత్రం చూస్తున్న అనుభూతి కలుగుతుంది.   
ఈ సందర్భంలోనే సర్జికల్ స్త్రైక్స్ అనే అంశం గురించి కూడా ఆసక్తికరమైన చర్చ మీడియాలో సాగుతోంది. ఎవరికి తోచిన అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు.
సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో  ప్రాణాంతక వ్యాధి కారకమైన కణం ఎక్కడ వున్నా, మిగిలిన శరీర  భాగాలకు ఇసుమంత  హాని కూడా  కలగకుండా, శస్త్రచికిత్స ద్వారా  ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్త్రైక్స్ లక్ష్యం కూడా  అలాంటిదే.
మహాభారతం పౌస్తిక పర్వంలో కూడా ఇటువంటి అస్త్ర శస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్ని,  పాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ, పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ద్రుష్టద్యుమ్నుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆవాహన చేసి ‘అపాండవం భవతు’ అంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన  ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉప సంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినా,  బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్రలక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భ విచ్చిత్తికి మళ్ళించి లోక నాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు.  
ఇక ప్రస్తుత కాలానికి సంబంధించి కూడా  ఓ చక్కటి ఉదాహరణ వుంది.
1976 లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని పాలస్తీనా ఉగ్రవాదులు దారి మళ్ళించి దాన్ని ఉగాండాలోని ఎంటెబే విమానాశ్రయంలో బలవంతంగా దింపేశారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెలీ ప్రయాణీకులందరినీ చంపేస్తామని బెదరించారు. నాటి ఉగాండా నియంత ఇదీ అమీన్ ఆ హైజాకర్లకు వత్తాసు పలకడంతో బందీలను కాపాడడం అన్నది ఒక  పెద్ద ప్రశ్నార్ధకమైంది. అప్పుడు ఇజ్రాయెలీ సైన్యాధికారులు ఇప్పటి భారత సైన్యం  మాదిరిగానే పకడ్బందీ వ్యూహం రచించి, రెండు రవాణా విమానాల్లో కమాండోలను తరలించారు. ఆ విమానాలు దాదాపు రెండువేల మైళ్ళు ప్రయాణించి నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి, మెరుపు దాడి చేసి, ఉగాండా సైనికులను, విమానం దారిమళ్లించిన హైజాకర్లను వధించి, బందీలను విడిపించి తమ దేశానికి తీసుకువెళ్ళారు. థందర్ బోల్ట్ అనే గుప్త నామం కలిగిన ఈ యావత్తు ఆపరేషన్ ప్రక్రియను ఇజ్రాయెలీ కమాండోలు తొంభయ్ నిమిషాల వ్యవధిలో విజయవంతంగా పూర్తి చేసారు. పాలస్తీనా హైజాకర్లను, ఉగాండా సైనికులను తప్ప వాళ్ళు ఎవ్వరికీ హాని చేయలేదు.
పొతే, భారత పాకీస్తాన్ సరిహద్దుల్లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి మెరుస్తున్నాయి. అవి కురుస్తాయా లేదా అనేది కాలమే చెప్పాలి. (01-10-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్ : 98491 30595                          

  

3 కామెంట్‌లు:

sarma చెప్పారు...

Let us wait and see

చంద్ర చెప్పారు...

పాకీవోడి పిచ్చికి ఒక గ్రామం, లేదా ఒక మండలం, లేదా ఒక రాష్ట్రం లేదా రాష్ట్ఱాలు నాశన మవ్వచ్ఛు లేదా ఏమీ జరగక పోవచ్ఛు. ఏదేమైనా భరింఛడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది ముఖ్యం. ప్రస్తుతం చాలామంది అన్నీమూసుకుని కుర్ఛుని, పాకీవోడు ఏదైనా బాంబేసి చంపితే అప్పుడు మన ప్రభుత్వం చేసిన పనివల్లే పాకీలు ఈపని చేశారని సమర్ధించడానికి నక్కల్లాగ కాసుక్కూర్ఛున్నారు. దేశభవిష్యత్తు కోసం దేనికైనా సంసిద్ధంగా ఉండాలి. ఒక సాధారణ పౌరులుగా మన కర్తవ్యం మన ప్రభుత్వానికి సైన్యానికి మద్దతివ్వడం , చివరి ఏంజరిగినా "వియ్ డోంట్ కేర్".

అజ్ఞాత చెప్పారు...

Sickular media like the Hindu and ndtv are causing more harm to India than terroristan