22, మే 2013, బుధవారం

రాజీవ్ గాంధీ ఈజ్ డెడ్



(మే ఇరవై ఒకటి రాజీవ్ గాంధీ వర్ధంతి)  
1991 మే 21 మధ్యాహ్నం మూడు గంటలు
              ఫోన్ మోగింది. ఆఫీసు డ్యూటీలో ఉన్న కొండా జగన్ మోహన్ వర్మ ( ఇప్పుడు కరాచీ లో పి టి ఐ ప్రతినిధిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా వాసి కె జె ఎమ్ వర్మ )  ఫోన్ చేశాడు. రిపోర్టర్స్ కొరత ఉంది కాబట్టి ఆఫ్ అయినా ఆఫీసుకు రావాలన్నది ఆ ఫోన్ సారాంశం. రాజీవ్ గాంధీ కార్యక్రమానికి హాజరయ్యే రిపోర్టర్ల కోసం తమిళనాడు కాంగ్రెస్ కమిటీ  ఏర్పాటు చేసిన వాహనం సరిగ్గా నాలుగ్గంటలకు పి టి ఐ ఆఫీసుకు వస్తుందని, నేను ఆ లోపు ఆఫీసుకు రావాలని చెప్పాడు. ఏజెన్సీ రిపోర్టర్స్ విషయంలో రాజకీయ పార్టీలు ప్రత్యేకమైన  శ్రద్ధ తీసుకోవటానికి కారణం వాళ్ళ ద్వారా అయితే దేశవ్యాప్తంగా అన్ని పత్రికలకూ వార్త అందుతుంది. ఇలాంటప్పుడు రిపోర్టర్స్ అందరికీ వాహనాలు ఏర్పాటు చేయటం మామూలే అయినా పి టి ఐ, యు ఎన్ ఐ వాళ్ళకు అదనంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. రోజూ ఒక రిపోర్టర్ ఆఫీసు డ్యూటీలో ఉండటం, ఫీల్డ్ లో ఉన్న రిపోర్టర్స్  చెప్పే వార్తలు రాసుకోవటం ఆనవాయితీ. ఆ రోజు సరిపడేంతమంది రిపోర్టర్స్ లేరు కాబట్టి వీక్లీ ఆఫ్ తీసుకున్న నన్ను పిలిపించటం తప్ప మార్గం లేదని వర్మకు అర్థమైనట్టుంది. బ్రహ్మచారినే కాబట్టి ఫోన్ చేసి రమ్మనగానే అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటానని వర్మకు తెలుసు.
           ఆఫీసుకు రావటం, టిఎన్ సిసి వాళ్ళ వాహనంలో ఐదు గంటలకల్లా రిపోర్టర్లు, కాంగ్రెస్ ప్రముఖులు మద్రాస్ మీనంబాక్కం విమానాశ్రయం చేరుకోవటం జరిగిపోయాయి. అప్పటికింకా రాజీవ్ విశాఖనుంచి బయల్దేరలేదు. ఆయన రావటం ఆలస్యమవుతుందని అక్కడికి చేరుకున్నాక గాని తెలియలేదు. అందరూ అక్కడే కూర్చొని వేచి చూస్తున్నారు. ఆయన రావటం కాన్సిల్ అయిందని చెప్పగానే బయల్దేరబోయాం. అంతలోనే ఆయన వస్తున్నారని చెప్పారు. అలా మరో గంటకు పైగా వేచి చూశాక రాజీవ్ విమానం దిగి నేరుగా విలేకరులున్న చోటుకే వచ్చి పత్రికాసమావేశంలో పాల్గొన్నారు. తెల్లటి కుర్తా పైజామా, లోటో షూస్ తో ఉన్న రాజీవ్ ను విలేకరులు చాలా దగ్గరగా చూశారు. తన శైలికి కాస్త భిన్నంగా రాజీవ్ బిజెపి మీద తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పుడే కాంగ్రెస్ లో చేరిన నటి జయచిత్ర ( చిల్లరకొట్టు చిట్టెమ్మ ఫేమ్ ) లాంటి వాళ్ళు వచ్చి ఆటోగ్రాఫ్ లు తీసుకున్న తరువాత రాజీవ్ గాంధీ కాన్వాయ్ శ్రీపెరంబుదూర్ వైపుబయలుదేరింది. ఆ కాన్వాయ్ లోనే రిపోర్టర్స్ వాహనాలూ ఉన్నాయి.
      పావుగంటకల్లా కాన్వాయ్ పోరూరు చేరుకుంది. అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు కాన్వాయ్ ని అడ్డుకొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సిందిగా రాజీవ్ ను కోరారు. ఆయనలా దిగి ఆ పనిలో ఉండగా నేను కారు దిగి దగ్గర్లో ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గరికి పరుగెత్తికెళ్ళి రాజీవ్ విలేకరుల సమావేశం విశేషాలు కొంతమేరకు చెప్పా. వర్మ ఆ పాయింట్స్ ఆధారంగా మొదటి భాగం వార్త తయారుచేసి పంపి ఉంటాడు. ఇక్కడ కాన్వాయ్ బయలుదేరుతుండగా పరుగున వెళ్ళి కారెక్కా. మరికాసేపటికి పూనమల్లి చేరుకున్నప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆపారు. ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటై ఉందక్కడ. రాజీవ్ కారు దిగి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటుండగా మళ్ళీ నేను అక్కడున్నఒక  టెలిఫోన్ బూత్ నాశ్రయించి వర్మకు మరికొంత సమాచారం చెప్పా.. మళ్ళీ కాన్వాయ్ కదులుతుండగా బయల్దేరా.
     శ్రీపెరంబుదూర్  ఊరికి ఇంకా ఒకటిన్నరకిలోమీటర్ల దూరం ఉందనగా ఎడమవైపున ఒక విశాలమైన స్థలంలో రాజీవ్ బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. రాత్రి 10 గంటల సమయంలో వాహనాలన్నీ అక్కడికి చేరుకున్నాయి. రాజీవ్ దిగి నడక మొదలెట్టగానే రిపోర్టర్లం కూడా వాహనాలు దిగి ఆయన వెంట వెళ్ళేందుకు వేగంగా అడుగులేస్తున్నాం. సభావేదిక ముందు వరుసలో ప్రత్యేకంగా పత్రికలవాళ్ళకోసం సీట్లుంటాయిగాని ఒక్కోసారి ఇలాంటి రద్దీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వాటిని ఆక్రమించుకుంటారు. అందుకే సకాలంలో చేరుకోవటానికి రిపోర్టర్లు హడావిడి చేస్తుంటారు. అలా మేం ముందుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం గాని రాజీవ్ గాంధీనే ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపి దండలు వేస్తున్నట్టనిపించింది. అంతలోనే ఒక్కసారిగా భారీ విస్ఫోటం... అరుపులు, కేకలు.. అంతా అయోమయ వాతావరణం.. దట్టమైన పొగ.. దేహాలు మాంసం ముద్దలై కమిలిన వాసన.. ఏం జరిగిందో కూడా ఆలోచించుకునే సమయంలేక రిపోర్టర్లు కూడా జనంతోబాటే దాదాపు వందగజాలు వెనక్కు పరుగుతీశారు. ఐదు నిమిషాలు గడిచాక పొగ తగ్గి ఆ ప్రదేశాన్ని గుర్తించగలిగే పరిస్థితి రాగానే కాంగ్రెస్ నాయకులు మూపనార్, జయంతీ నటరాజన్ లాంటివాళ్ళు దగ్గరగా వెళ్ళి చూసి రాజీవ్ ను గుర్తుపట్టి  భోరున ఏడుస్తున్నారు. శారు.  రిపోర్టర్లం కూడా వెళ్ళి చూశాం. దాదాపు 20 మృతదేహాలు.. సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఛిద్రమై పడి ఉన్నరాజీవ్ మృతదేహం.. పేలుడు ఎలా జరిగిందన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఆ తీవ్రత కూడా చాలా భయంకరంగా ఉంది. అంతకు మించి మరేమీ తెలియదు.
              ఒక్కసారిగా రిపోర్టర్లలో కలకలం మొదలైంది. విధ్యుక్త ధర్మం గుర్తుకొచ్చింది. ఎవరికి వాళ్ళం ఈ దారుణఘటనను అఫీసులకు తెలియజేయాలన్న ఆతృత పెరిగింది. వెనక్కి తిరిగి చూస్తే జనమంతా హాహాకారాలు చేస్తూ శ్రీపెరంబుదూరు వైపు పరుగులు తీస్తూ కనిపించారు. కొన్ని వాహనాలు మద్రాసు నగరం వైపు వెళుతున్నాయి.  ఏం జరుగుతుందోనన్న భయం ఒకవైపు.. వీలైనంత త్వరగా ఇళ్ళకు చేరుకోవాలన్న తాపత్రయం మరోవైపు.  జనం ఆలోచనలు ఇలా ఉంటే, దగ్గర్లో ఉన్న శ్రీపెరంబుదూర్ వెళ్ళి అక్కడినుంచి ఫోన్ చేసి ఆఫీసులకు చెబుదామనేది జర్నలిస్టుల ఆలోచన. అక్కడ ఎంత వెదికినా మద్రాసు నుంచి మమ్మల్ని తీసుకు వచ్చిన వాహనాలు కనిపించలేదు. డ్రైవర్లు అప్పటికే భయంతో వాహనాలు తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. ఇక ఎంతమాత్రమూ  ఆలస్యం చేయకూడదని రిపోర్టర్లందరూ శ్రీ పెరుంబుదూర్ ఊరి వైపు పరుగందుకున్నారు.
           శ్రీపెరంబుదూర్ వెళ్ళటం వలన ప్రయోజనం ఉండదని నాకర్థమైంది. వీలైనంత త్వరగా మద్రాస్ వైపు వెళితే లోకల్ ఫోన్ దొరికే పూనమల్లి చేరగానే వార్త చెప్పవచ్చుననుకున్నా. అలా పరుగుతీస్తూ ఆ దారిన వెళ్ళే వాహనాలను లిఫ్ట్ అడిగినా దాదాపు పది నిమిషాలు ఫలితం కనిపించలేదు. కాసేపటికి ఒక వాహనం ఆగగానే బతిమాలి దాన్ని పట్టుకొని పూనమల్లి చేరుకున్నా. అక్కడే ఒక పెట్రోల్ బంక్ దగ్గరున్న టెలిఫోన్ బూత్ దగ్గరికి పరుగుతీసి ఆఫీస్ నెంబర్ డయల్ చేశా. ఫోనందుకున్న వర్మ ఏంటి రంగా, థర్డ్ పార్ట్ చెప్పటానికి ఇప్పుడు తీరిందా? అనడిగాడు. అప్పటికే అసహనంగా ఉన్న నేను, “ Varma, be serious. Rajiv Gandhi is dead“  అని చెప్పా. ఉలిక్కిపడ్డట్టున్నాడు, వర్మకు నోటమాటరాలేదు. “ Varma, are you able to hear me ? “  మరింత అసహనంగా అడిగా. ప్రతిక్షణమూ ఎంతో విలువైంది మరి.  కోలుకున్న వర్మ ఈ సారి నా గొంతు నిర్థారించుకోవాలనుకున్నాడు.  “ Are you Ranga?  What is the colour of your shirt ? “  అని అడిగాడు పిచ్చి కోపమొచ్చింది నాకు. అయినా సరే ఓపిగ్గా సమాధానమిచ్చి వార్త చెప్పా.  Varma, do what I say. Type only one sentence. Rajiv Gandhi is dead. “  అలా చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే అక్కడో ఆటో పట్టుకొని మద్రాస్ నగరంలోకి బయల్దేరా. వార్త నగరంలో పాకేకొద్దీ నా ప్రయాణానికి ఇబ్బంది అవుతుందని గ్రహించి అలా హడావుడిగా వెళ్ళక  తప్పలేదు.
పి టి ఐ ఆఫీసు ( వర్మ )
పిటిఐ ఆఫీసులో ఆపరేటర్ ను అప్రమత్తం చేసి ఫ్లాష్ న్యూస్ టైప్ చేయమని చెప్పా. ఏజెన్సీ వార్తల్లో ఫ్లాష్ న్యూస్ అంటే కొన్ని స్టార్స్ వచ్చి ఆ తరువాత స్పేస్ ఎక్కువ ఇస్తూ వార్త టైప్ అవుతుంది. పైగా అలా టైప్ చేసినప్పుడు పత్రికాసంస్థల్లో ఉన్న టెలిప్రింటర్లలో ఒక ప్రత్యేకమైన శబ్దం వస్తుంది కాబట్టి అలర్ట్ అవుతారు. తీరా ఆ ఆపరేటర్ కు వాక్యం చెప్పగానే అతడి చేతులు వణికాయి. అప్పటిదాకా రాజీవ్ వార్త టైప్ చేసిన మనిషి ఒక్కసారిగా రాజీవ్ మరణవార్త టైప్ చేయాల్సి వచ్చేసరికి తీవ్రంగా కలతచెందాడు.  అతణ్ణి మెల్లగా కుర్చీలోనుంచి లేపి పక్కనే కూర్చోబెట్టి నేనే స్వయంగా టైప్ చేశా. క్షణాల్లో పి టి ఐ సర్వీసు ఉన్న ప్రతిచోటా టెలిప్రింటర్ మీద
                             F L A S H     F L A S H     F L A S H

                       R A J I V     G A N D H I      I S     D E A D
అని ప్రత్యక్షమైంది. పత్రికల కార్యాలయాల్లో ఒకటే అలజడి. అప్పటికే దూరప్రాంతాలకు వెళ్ళాల్సిన పత్రికలు ప్రింటయిపోయి వ్యాన్లలో బయలుదేరాయి. సంపాదకులు అప్పటికప్పుడు ఆ మార్గంలో ఉన్న ఏజెంట్లను అప్రమత్తం చేసి వ్యాన్లను వెనక్కి పంపాల్సిందిగా ఆదేశించి తగిన ఏర్పాట్లు మొదలుపెట్టుకున్నారు. ఎక్కువ సమాచారమేమీ లేకపోయినా పతాకశీర్షికకు అంతకు ముందు విశాఖ ప్రసంగాన్ని, చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన అంశాలు, డిల్లీ లో సోనియా, పిల్లలు ఆ సమయంలో ఎక్కడున్నారనే విషయాలు జోడించి వార్త రూపొందించు కోవటానికి సిద్ధమయ్యారు.
మొదటి ఫ్లాష్ పంపిన ఐదు నిమిషాల్లోనే రంగా మళ్ళీ ఫోన్ చేశాడు. దారిలో ఆగి మాట్లాడాడు. శ్రీపెరుంబుదూరు బహిరంగ సభావేదిక వద్దకు వెళుతున్న సమయంలో జరిగిన భారీ విస్ఫోటంలో రాజీవ్ సహా20 మంది చనిపోయారు  అంటూ మరికాస్త వివరణ ఇచ్చాడు రంగరాజ్. అది కూడా టైప్ చేశా. ఆ రాత్రికి పత్రికలకు అందిన సమాచారం ఇది మాత్రమే.
* * * * *     
     అప్పుడు తమిళనాట రాష్ట్రపతిపాలన సాగుతోంది. రాజ్ భవన్ లో పిటిఐ టెలిప్రింటర్ మీద ఈ వార్త చూసిన సిబ్బంది వెంటనే గవర్నర్  భీష్మనారాయణ్ సింగ్ కు తెలియజేశారు. ఆయన డిజిపి కి ఫోన్ చేసి అడిగితే తనకూ పిటిఐ ద్వారానే తెలిసిందన్నాడు. ఇంతపెద్ద విషయం పోలీసులకు తెలియకుండా పి టి ఐ కి మాత్రమే తెలిసిందని చెప్పడానికి సిగ్గనిపించటం లేదా అని కోపంతో ఊగిపోయారాయన. ఆ తరువాత ఫోన్ కాల్ పి టి ఐ మేనేజర్ నారాయణస్వామి కి వెళ్ళింది. రాజ్ భవన్ నుంచి ఫోన్ వచ్చాక గాని ఆయన కూడా చూసుకోలేదు. ఇంట్లో ఉన్న టెలిప్రింటర్ లో వార్త చూశాడు. తనకూ పూర్తి వివరాలు తెలియవని సంజాయిషీ ఇచ్చుకుంటూ, ఆఫీసుకు ఫోన్ చేసి కనుక్కుంటానని మాత్రమే చెప్పగలిగాడాయన.  ఇలాంటి సున్నితమైన అంశాలను గవర్నర్ కు, పోలీసులకు చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు వేస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందేమోనని కనీసం ఆలోచించరా మీరు అంటూ గవర్నర్  కోప్పడ్డారు. సహజంగానే చాలా నిదానస్తుడయిన  నారాయణ స్వామి బాగా కంగారు పడి వర్మకు ఫోన్ చేసి  ఏంటి వర్మా. మాటమాత్రమైనా చెప్పలేదని గవర్నర్ గారు కోప్పడుతున్నారు.. నాక్కూడా చెప్పనేలేదు అంటూ చిన్నబుచ్చుకున్నారాయన.  వార్త స్వయంగా మన రిపోర్టర్ నుంచి అందిన తరువాత ఆగాలనిపించలేదు. పైగా. వాళ్ళకు తెలియకపోతే వాళ్ళ ఇంటలిజెన్స్ అధికారుల వైఫల్యమే కదా.. మన విధి మనం నిర్వర్తించాం  అని వర్మ నచ్చజెప్పారాయనకు.  రిపోర్టర్స్ అందరినీ పిలిపించి గవర్నమెంట్ ఆస్పత్రికి, విమానాశ్రయానికి పోలీస్ కేంద్రకార్యాలయానికి పంపుతూ డ్యూటీస్ పంచానని చెప్పి ఆయనను చల్లబరచారు.
            మరోవైపు శ్రీపెరంబుదూర్ పరుగు తీసిన పోలీసులకు, విలేకరులకు ఫోన్ దొరకలేదు. ఉన్న ఒకే ఒక్క పోస్టాఫీసు ఫోన్ కోసం పోటీ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయం కాబట్టి అక్కడ పోలీసులదే పై చేయి అయింది. కానీ వాళ్ళు ట్రంకాల్ బుక్ చేసి విషయం చెప్పేలోపే పి టి ఐ వార్త అందింది. రిపోర్టర్లు ఫోన్ కోసం ఆ ఊళ్ళో ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరూ కనికరించలేదు. తెలిసిన వార్తను కూడా ఆఫీసుకు తెలియజేయలేని నిస్సహాయత. కానీ శ్రీపెరంబుదూర్ నుంచి ఆకాశవాణికి వార్తలు పంపే పార్ట్ టైమ్ రిపోర్టర్ కూడా ఈ వార్తను మద్రాస్ ఆకాశవాణి కేంద్రానికి తెలియజేసినా, వారు ఆ వార్తను ప్రసారం చేయటానికి సాహసించలేదు. పిటిఐ వార్తను ఉటంకిస్తూ బిబిసి ప్రసారం చేసిన వార్తవల్లనే అర్థరాత్రికల్లా దేశమంతటా ఈ వార్త తెలిసింది.
            ( 1994 లో దక్షిణ  భారత జర్నలిస్టుల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్    
           చిత్తూరు జిల్లా శాఖ సంయుక్తంగా తిరుపతిలో నిర్వహించిన మూడు రోజుల వర్క్ షాప్ లో రంగరాజ్,
           వర్మ చెప్పిన అనుభవం ఆధారంగా )
తెలుగు టీవీ ఇన్ఫో – తోట భావనారాయణ సౌజన్యంతో -----


3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

చాలా గగుర్పాటు కలిగించే లా ఉన్నదండీ ఈ వార్తా టపా.

అప్పట్లో ముఖ్యమైన సమాచారం ఫోన్ చేసి చెప్పే వీలు లేక పోవడం, ఓ ఇరవై ఏళ్లలో ప్రతి చెత్తా ఫ్లాష్ న్యూజ్ క్రింద 'మొబైల్ లో ఫ్లాష్ అవడం ఇవంటా చూస్తూంటే చాలా విచిత్రం గా అనిపిస్తుంది.

అట్లాంటి క్రిటికల్ పొజిషన్ లో ఉండి వార్తల్ని ఇవ్వగలిగిన జర్నలిస్ట్ లు ఇవ్వాళ చానెల్స్ లో వచ్చే వార్తలని చూస్తే నవ్వేస్తా రను కుంటా (ఫ్లాష్ న్యూజ్ లని చూసి!)

జిలేబి

Saahitya Abhimaani చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Saahitya Abhimaani చెప్పారు...

Thanks for sharing this behind the news items. I came to know about the news only the next day early in the morning when my brother woke me up stating that there was disturbance in the street and rumours are rife with some assasination of both Rajiv Gandhi and Jayalalitha. Still half sleeping immediately, I switched on my Radio and tuned to BBC (naturally not to AIR as we know its reputation of delaying the news) and from the cool voice their news Reader (as against the stuttering and stammering fellows we see today giving a tone as if narrating a horror story)the sad news was realised.

Assasination of Rajiv Gandhi had tremoundous effect in favour of Congress on the elections that were held in the subsequent phase(by that time 1 phase was already completed).