4, జనవరి 2013, శుక్రవారం

వ్యక్తిత్వ వికాసం బోధించే హిందూ దేవుళ్ళు




వ్యక్తిత్వ వికాసం బోధించే హిందూ దేవుళ్ళు







ఈ రోజు భక్తి టీవీ ఛానల్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.
పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ చక్కని ముక్కలు చెప్పారు.
శ్రీ దేవి అంటే లక్ష్మీదేవి. సకల సంపదలు అనుగ్రహించే దేవత. భూదేవి అంటే భూమాత. చరాస్తికి ప్రతిరూపం శ్రీదేవి. స్తిరాస్తికి సంకేతం భూదేవి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ ఇద్దరు దేవేరులను తన వక్షస్థలంపై కుడి ఎడమల  ప్రతిష్టించుకున్నాడు. తనను దర్శించ వచ్చే భక్తులకు   భౌతిక సుఖాలకు నెలవయిన ఈ ఇద్దరినీ కాకుండా   వామ హస్తంతో తన  పాదాలను చూపిస్తుంటాడు. చరాస్తులు, స్తిరాస్తులు ప్రధానం కాదు మనిషి అనేవాడు తన సొంత ప్రతిభతో  సొంత కాళ్ళపై నిలబడాలని  వ్యక్తిత్వ వికాస బోధకులు ప్రబోధించే సూత్రాన్ని స్వామి ఆ విధంగా భక్తులకు బోధిస్తున్నాడన్న మాట.
ఇక పరమేశ్వరుడిని తీసుకుంటే ఆయన వొంటిపై అన్నీ పాములే. ఒక సర్పాన్ని చూస్తేనే వొళ్ళు జలదరిస్తూ వుంటుంది. అలాటిది అన్ని నాగుపాములను ధరించి కూడా శాంత మనస్కుడిగా వుండగలగడానికి కారణం ఆయన సిగలో నెలవయిన గంగమ్మ తల్లి. అన్నిరకాల ఉద్రికతలను ఉపశమింపచేయడానికి మెదడును ఎల్లప్పుడు చల్లగా, ప్రశాంతంగా  వుంచుకోవాలని చెప్పడమే శివతత్వం.
పోతే కృష్ణుడు. గోవులను కాచే గోపాలకుడు. గోవర్ధన గిరిధారి. హిందీలో గోవర్  అంటే గోమయము. (ఆవు పేడ) ధన్ అంటే ధనము. ఏడాది పాటు లభించే  ఒక్క ఆవుపేడతో కొన్ని ఎకరాల భూమిని సారవంతం చేయడానికి వీలుపడుతుంది. అలా పరిపుష్టమయిన భూమిలో  పంటలు బాగా పండుతాయి. దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వుంటుంది. ఆహారానికి కొరత వుండదు. ఆవిధంగా   సస్యశ్యామలమయిన పల్లెటూళ్ళే దేశానికి ఆయువుపట్లు.
ఇలా హిందూ దేవతలనుంచి వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే మంచి విషయాలను నేర్చుకోవచ్చని పరిపూర్ణానందస్వామి వాక్రుచ్చారు.
మంచి మాటలు నాలుగు చెవిన వేసుకోవడం మంచిదే కదా!
శుభం! 
(04-01-2013) 

1 కామెంట్‌:

BHAARATIYAVAASI చెప్పారు...

ఆవుని పూజించే బదులు తినటం వల్లనే అతగాడికి అలాంటి ఉన్మాదపు మాటలు వచ్చాయని పరిపూర్ణానంద స్వామి గారు చాలా చక్కగా చెప్పారు.