25, జులై 2022, సోమవారం
కార్పొరేట్ దోపిడీ
వరద రాజకీయం
పుట్టింట్లో కొన్ని ఘడియలు
వార్తా వంటకాలు - భండారు శ్రీనివాసరావు
విషయం ఒక్కటే. కానీ చూసే ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే, వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త, వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే, అందుకు కారణాలు ఏమిటో చదువరులకు యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి, వేర్వేరు పత్రికలు, వేర్వేరు కోణాల్లో, వార్తలు 'వండి వారుస్తున్న' తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. ఏ ఛానల్ మార్చి చూసినా యిదే వరస.
ఎవరయినా తాము చదివే పత్రిక, చూసే ఛానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు ఛానళ్ళ శకం మొదలయినప్పుడు, జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో కాకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
యిరవై నాలుగ్గంటల నిరంతర న్యూస్ ఛానళ్ళ పుణ్యమా అని ఈ రోజుల్లో పనికొచ్చే సమాచారం, పనికిరాని సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ ఛానల్ల వాళ్ళే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే, టీవీ ఛానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి, ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో, రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!
24, జులై 2022, ఆదివారం
లోకం చుడుతున్న వీరుడు రాజేష్ వేమూరి
వేమూరి
రాజేష్ గారిని నేను ఇంతవరకు చూడలేదు. కానీ నేను చూడాలని బలంగా కోరుకున్న
వ్యక్తుల్లో రాజేష్ ఒకరు.
రాజేష్
వేమూరి అనే పేరు వినగానే నాకు అల్లసాని పెద్దన విరచిత స్వారోచిత మనుసంభవం అనే
మనుచరిత్ర కావ్యంలోని ప్రవరుడు, మహాకవి ధూర్జటి రచించిన శ్రీ
కాళహస్తీశ్వర శతకం గుర్తుకు వస్తాయి.
ప్రవరాఖ్యుడి
గురించి ఖమ్మం కాలేజీలో మా తెలుగు లెక్చరర్ ఆదినారాయణ గారు చెప్పేవారు.
అరుణాస్పదపురం
అనే ఓ మారుమూల కుగ్రామంలో కాపురం
చేసుకుంటూ,
తలితండ్రులను పోషించుకుంటూ త్రికాల సంధ్యాదులు సక్రమంగా క్రమంతప్పకుండా నిర్వర్తించుకుంటూ కాలం గడిపే ఓ శోత్రియ శ్రేష్టుడు
ప్రవరుడు. అతడికి తన ఇల్లే కైలాసం. ఊరు
దాటి ఎరుగడు. కానీ లోకం చూడాలనే కోరిక. పొలిమేర దాటలేని ఆశక్తత. అంచేత ఊరిలోకి ఏ
కొత్త వ్యక్తి వచ్చినా ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చేవాడు. అతిథి మర్యాదల అనంతరం
తాను చూడాలని అనుకుని చూడలేని ప్రదేశాల విశేషాలు వారినుంచి వింటూ తృప్తి పడేవాడు.
ఈ క్రమంలో యువకుడు అయిన ఓ యువ సిద్ధుడు తటస్థ పడడం, పరాయి ప్రదేశాలను గురించి అతడు
చెప్పిన సంగతులు వింటూ, ఇంత
చిన్న వయస్సులో అన్ని ప్రాంతాలు ఎలా తిరిగాడని అబ్బుర పడడం,
సరే ఈ కధ ఇంతవరకే చెప్పుకుందాం. తర్వాత కధ తెలియని వాళ్ళు వుండరు.
ఇదెందుకు
చెప్పాను అంటే, ఈ
కావ్యంలోని ప్రవరుడి వంటి వారు అనేకమంది ఈ నాటికీ వుంటారు. దేశాలు చుట్టి రావాలని
వారికి వుంటుంది, కానీ అందుకు అనేక అవరోధాలు. అంచేత
రాజేష్ వంటి వారు దేశాలు చుట్టి రాసే పుస్తకాలు చదివి,
సంతోషించడం. ఇంత చిన్న వయస్సులో ఇన్ని దేశాలు ఎలా తిరిగారని ఆశ్చర్యపడడం.
మనుచరిత్రలోని సిద్ధుడి వద్ద, అనుకున్నదే తడవుగా లోకాలు చుట్టి రావడానికి పాదలేపనం అనే దివ్యమైన
పసరు వుంది. మరి రాజేష్ దగ్గర ఏముంది. తిరగాలనే ఆకాంక్ష
వుంది. దాన్ని నెరవేర్చుకునే పట్టుదల వుంది. పట్టుదలకు తగ్గట్టు సహకరించే భార్య
భార్గవి వున్నారు. పోదాం పద డాడీ అంటూ
సంచి సర్దుకుని, నేనూ
రెడీ అనే చిన్నారి హన్ష్ ప్రోద్బలం
వుంది. అన్నింటికీ మించి రకరకాల దేశాలు చూడాలి, అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలి
అనే బలమైన కోరిక వుంది. విశాలమైన హృదయం వుంది. ఏతావాతా జరిగింది ఏమిటి అంటే ఇరవై
రెండు దేశాల వీసా స్టాంపులు వాళ్ళ పాసుపోర్టుల్లో భద్రంగా వున్నాయి. కాణీ
ఖర్చులేకుండా మనల్ని కూడా ఆ పుస్తకాల ద్వారా ఆ దేశాలు తిప్పారు. ఈ పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పండి.
ముందు ముందు మరిన్ని దేశాలు తిరుగుతారు. మరిన్ని పుస్తకాలు రాస్తారు. మనమూ వాటిని చదువుతూ వారితో పాటు ఆయా దేశాలు
ఉత్తపుణ్యానికి చదువుతాము. ఉభయతారకం అన్నమాట.
ఇంతకీ
దూర్జటి పద్యం గురించి ప్రస్తావించారు కానీ ఆ ప్రసక్తి రాలేదేమిటి అనుకుంటున్నారా!
అక్కడికే వస్తున్నాను. ముగింపు కోసం అట్టే పెట్టాను.
శ్రీ
కాళహస్తీశ్వర శతకంలో ఆఖరి నూరో పద్యం ఇది.
“దంతంబుల్పడనప్పుడే
తనవునం దారూడి యున్నప్పుడే
కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే
విన్తల్మేన
చరించనప్పుడే కురుల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె
నీ
పదాంబుజములన్ శ్రీ కాళ హస్తీశ్వరా!”
ప్రతిపదార్ధం
అవసరం అనుకోను.
తిరగగలిగిన
వయసులో తిరగకుండా,
తిరగాలనే కోరిక ఉన్నప్పటికీ తిరగలేని అశక్తత కలిగిన మా వంటి వారి గురించే
ఆ పద్యం రాసారని అనిపించింది.
అయినా
భక్త గోపన్న అన్నట్టు, తక్కువేమి
మనకు, రాజేష్
పుస్తకం చేత వున్నవరకు.
23, జులై 2022, శనివారం
అసలేముంది రాజకీయంలో - భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha on 24-07-2022, SUNDAY)
ఈ కింది సంభాషణలు చిత్తగించండి:
“ఐ.ఐ.టి. టాపర్ అయిన మీరు ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”
“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ
సేవ చేయడానికి వీలుంటుందని అప్పట్లో భావించాను”
“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి, ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో
చేరదామని అనుకుంటున్నారు?”
“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా
ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో
చేరుతున్నాను”
“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా
ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”
“అలా అయితేనే మనం అనుకున్న విధంగా
ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”
“దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే
మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చంద సంస్థలకు కోట్ల రూపాయలు భూరివిరాళాలుగా ఇస్తుంటారు. మరి రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది”
“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ
చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”
“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు
లేరు. మీకు మీరే సాటి అనే పేరుంది. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మధన్యం అనుకునే వీరాభిమానులు మీకు లక్షల్లో వున్నారు.
ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. మరి ఈ వయసులో రాజకీయ అరంగేట్రం చేసి, ఎండనకా, వాననకా
ప్రజాసేవ అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”
“ఎంత సంపాదించినా, ఎంతమంది
అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం
ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే సరైన మార్గం”
“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక
కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ.గా
వున్నారు. వృత్తిపరంగా అనేక దేశాలు
అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ ప్రవేశం ఎందుకు
చేసినట్టు”
“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన
ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా
రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”
“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద
రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం. అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం
ఆశ్చర్యంగా వుంది”
“మనం ఎన్ని రాసినా, ఎన్ని
హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ
కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను”
ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు
సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!
చివరికి ప్రజాసేవ కూడా సోషలిజంలాగా
అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.
మరో అర్ధం కాని విషయం వుంది. ఇప్పుడు
చెప్పుకున్న వాళ్ళు ఎవరూ డబ్బులు లేని వాళ్ళు కాదు. మరిన్ని ఎక్కువ సొమ్ములు సంపాదించేందుకు
రాజకీయాల్లో చేరుతున్నారా అంటే అదీ కాదు. మరి ఎందుకోసం ఈ యావ!
ఎందుకంటే రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం
వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన
వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ
కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో
వున్నన్ని రోజులూ అధికారచక్రం అలవోకగా తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.
అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయనీటికి ఎగబడే చేపల చందంగా రాజకీయ కండువాలు
కప్పుకోవడం కోసం తహతహలాడేది అందుకే.
ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం!
‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది.
కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు
పడిగాపులు కాస్తుంటారు. కానీ బయటకు
తెలియని విషయం ఒకటుంది. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు
చల్లడానికి ఒక్క బీట్ కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా
యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్
చేస్తే చాలు, షూటింగ్ పర్మిషన్ ఒక్కటే
కాదు, కస్టడీలో ఉన్న మనిషికూడా దర్జాగా బయటకు వస్తాడు. ఇక మా
ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోవాలి? అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ అనేది ఓ ప్రముఖ సినీనటుడి మన్ కీ బాత్.
‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు
తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు
అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్
లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు మరుక్షణంలో
క్లియర్ అవుతాయి. కానీ మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మేము
ఎంత గట్టి ఆఫీసర్లం అయినా సరే, పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము
కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. అయినా ఒక్కోసారి మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం. అంతరాత్మ
చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేస్తాం. సాయంత్రానికల్లా ఆ
అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి
అలాంటి పోస్టులు చేసే బదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే
వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా, కాలం గడుస్తున్నకొద్దీ తత్వం బోధపడి సర్దుకుపోవడమే మేలనే స్తితికి
చేరుకుంటాము. కానీ ఎక్కడో మనసు మూలల్లో బాధ. ఇంత చదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ
పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే
ఏమిటి? మేము అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన
అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ అనేది
ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.
“ఏళ్ళ తరబడి కష్టపడి సువిశాల వ్యాపార,
వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాను. నెలకు లక్షలు లక్షలు జీతాలు తీసుకునే
సిబ్బంది నా దగ్గర వేల మంది అనేక దేశాల్లో పనిచేస్తున్నారు. వాటిని చుట్టి
రావడానికి సొంత విమానాలు వున్నాయి. బస చేయడానికి ఏడు నక్షత్రాల హోటళ్ళకు ఏమాత్రం తీసిపోని సొంత అతిథి గృహాలు అన్ని నగరాల్లో లెక్కకు మిక్కిలిగా వున్నాయి. కానీ ఏం లాభం.
గవర్నమెంటులో ఒక్క చిన్న ఫైలు
కదిలించడానికి మా సీనియర్ అధికారులు సచివాలయం చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు
హోటల్లో ఇచ్చే టిప్పు పాటి చేయని నెల జీతాలు తీసుకునే ప్రభుత్వ గుమాస్తాల ముందు
చేతులు కట్టుకుని నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తుంటారు. ఓ చిన్నపాటి రాజకీయ
నాయకుడు కల్పించుకుని పై వాళ్లకు ఓ మాట చెబితే ఆ ఫైలు ఆఘమేఘాల మీద కదిలి, అన్ని సంతకాలతో ఆమోద ముద్ర
వేసుకుని బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురయినప్పుడు అనిపిస్తుంది, ఎందుకీ పనికిరాని వైభోగాలు, సిరి సంపదలు అని. అసలైన అధికారం మా దగ్గర
లేదని తేలిపోయింది. ఎక్కడ ఉన్నదో కూడా తెలిసిపోయింది. అందుకే రాజకీయ
రంగప్రవేశానికి అడుగులు వేస్తోంది” ఒక వ్యాపారవేత్త అంతరంగం.
“ఒక చిన్న వీధి రౌడీ దగ్గర కుడి భుజంగా
చాలా కాలం వున్నాను. అతడు చెప్పిన పనల్లా చేస్తూ పోయాను. చాలాసార్లు పోలీసులకు దొరికిపోయి నానా అవస్థలు పడ్డాను.
వాళ్ళు నన్ను నన్ను నడి బజారులో
తన్నుకుంటూ స్టేషన్ కు తీసుకు వెడుతుంటే మిన్నకుండిపోయాను. ఇక ఎన్నాళ్ళీ కష్టాలు
అని ఓ శుభ ముహూర్తం చూసుకుని రాజకీయ నాయకుడి దగ్గర అనుచరుడి అవతారం ఎత్తాను. కొంత పేరు వచ్చిన తర్వాత నన్ను
అడిగేవాడే లేడు, అడ్డుకునే వాడే లేడు. నన్ను పట్టుకునే పోలీసు పుట్టలేదు, నన్ను పెట్టే జైలు కట్టలేదు అనే తరహాలో రొమ్ము విరుచుకుని తిరిగే అవకాశం
నాకీ కొత్త వృత్తి ఇచ్చింది” అని ఓ మాజీ గ్యాంగ్ లీడర్ తన గోడు వెళ్ళబోసుకుంటాడు.
అంటే వీరందరినీ రాజకీయాల వైపు బలంగా లాగుతోంది వ్యవస్థలో ఉన్న లోపం అనుకోవాలి.
తోకటపా:
ఇలా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు పైకి
చెప్పే ప్రజాసేవ అనేది ఒక పడికట్టు పదం మాత్రమే. అసలు కారణాలు మాత్రం వేరే అనిపిస్తే తప్పేముంది!
నిజానికి ప్రజాసేవే చేయాలి అనుకుంటే అంటే
రాజకీయ పదవులు అవసరమా!
ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకే
వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.
ఆ రోజులు అలా ఉండేవి
‘మీ
పేరు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కాదు, ధనార్జనరెడ్డి అంటారు,
నిజమేనా?’
జర్నలిస్ట్
డైరీ సతీష్ బాబు రూపకల్పనలో గతంలో ప్రసారం
అయిన ధర్మపీఠం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్ధన
రెడ్డిని ఒక విలేకరి సూటిగా అడిగిన ప్రశ్న ఇది.
ఇబ్బంది
పెట్టే ప్రశ్న వేసినా ఇబ్బంది పడకుండా నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పడం ఆ నాటి
నాయకుల లక్షణం.
అందుకే
చెప్పేది, ఆ
రోజులే వేరని.