17, జూన్ 2021, గురువారం

రాజకీయాల్లో అధినాయకత్వం పవర్ – భండారు శ్రీనివాసరావు

 అశోక్ గజపతి రాజు రాజవంశం వాడయినా రాచరికపు లక్షణాలను వంటబట్టించుకోలేదు. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నప్పటికీ రాజకీయ కాలుష్యానికి దూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన సచ్చీలత, నిరాడంబరత లోకవిదితం.

మాన్సాస్ ట్రస్ట్ తాజా పరిణామాల తర్వాత అశోక్ గజపతి రాజు మనసులో ఖేద పడుతున్నట్టు టీవీల్లో వచ్చింది. వంశపారంపర్యంగా ధర్మకర్తగా ఉంటున్న సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా తనను కలవడానికి ఇష్టపడడం లేదని ఆయన బాధ పడుతున్నారు. ఇది సహజం. ఆయన బాధ పడడం కాదు, అధికారులు అలా ప్రవర్తించడం.

ఒక్కసారి పీవీ గారెని గుర్తు చేసుకుందాం. కాంగ్రెస్ నాయకత్వంలో మైనారిటీ ప్రభుత్వాన్ని కేంద్రంలో అయిదేళ్ళ పాటు నడిపిన కార్యదక్షుడు. దేశాన్ని ఆర్ధికసంక్షోభం నుంచి బయట పడేసిన ధీమంతుడు. చివరికి ఆయన చనిపోతే, మాజీ ప్రధానిగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దేశ రాజధానిలో దక్కలేదు. కారణం, ఆయన పార్టీ అధినాయకురాలి అనుకూల దృక్కుల్లో లేకపోవడం.

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి, మరో దఫా అధికారం కూడా పార్టీకి కట్టబెట్టిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత ఆయన భార్య శ్రీమతి వై.ఎస్. విజయమ్మ రాష్ట్ర రాజధానిలో  పేవ్ మెంటు మీద ధర్నా చేస్తుంటే, ఒక్కరంటే ఒక్క మంత్రి ఆమెను చూడడానికి కూడా సాహసించలేదు. అధికారంలో వున్నప్పుడు ఆమె చుట్టూ చేరి ఫోటోలు దిగడానికి ఉబలాట పడిన వారెవ్వరూ ఆమెకు కనీసం సానుభూతి చూపించలేదు.

ఇక ఎన్టీఆర్. తనను పార్టీ నుంచి తొలగించిన తర్వాత నిండు (శాసన) సభలో ‘నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండని’ ప్రాధేయ పడితే, ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన వారెవ్వరూ ఆయనకు మద్దతుగా నిలబడలేదు.

ఇలాంటి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు.

ప్రజాస్వామ్యంలో పార్టీ అధినాయకత్వం పవర్ అది.

(17-06-2021)    

మెగా ఫ్యామిలి చుట్టూ ఏపీ రాజకీయాలు

గుడిలో ఏముంది? – భండారు శ్రీనివాసరావు

గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది.

వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. ఏదో కషాయాలు, చూర్ణాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి ఇప్పుడో! ఓ పక్క పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.
గుళ్ళు, గోపురాలు అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ‘గుడిలో ఏముందీ’ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమానమే.
ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. ఏదయినా అవి నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే.

16, జూన్ 2021, బుధవారం

భార్య (చెప్పిన) రహస్యం – భండారు శ్రీనివాసరావు

 ప్రధమ కబళే మక్షికాపాతః

అంటే మొదటి ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.

ఈ శీర్షికలో ముందు బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటేచూడ్డం మంచిదయిందిలేకపోతే పుట్టి పూర్తిగా మునిగేది. ఆ విధంగా కలిగిన జ్ఞానోదయంతో  తెలివినపడిన వాడినైఅర్జంటుగా ముందో  బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని యమర్జెంటుగా కూరిపెట్టి, ‘భార్య రహస్యం’ ఏవిటిఅనే దిక్కుమాలిన అనుమానాలు తలెత్తి సంసారపు పుట్టి నిండామునగకుండా నిండుదా  జాగ్రత్త పడ్డాను.

ఇంతకీ అసలు విషయం ఏవిటంటేమా ఆవిడ బయట వర్షం పడొచ్చనే వాతావరణ హెచ్చరికలు నమ్మినదై, బయట పెత్తనాలకు పోలేకాలోపల కరెంటులేని కారణంగా  టీవీ సీరియల్ చూసే అవకాశం బొత్తిగా లేకయున్నూఇత్యాది బలమైన అనేక  కారణాల కారణంగా విధిలేని స్తితిలో ఇంటిపట్టునే వుండిపోయి, తప్పనిసరై  నాతో మాటవరసకు మాటలు కలిపి వాటి మధ్యలో ఒక తూటా పెట్టి  పేల్చింది. ఆ మాట  అన్నది మా ఆవిడ కాబట్టిఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు  ఉన్నట్టుండి తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన ఎప్పుడో  చెప్పాడు. సాధారణంగా పక్కింటాయనతోనోఎదురింటాయనతోనో (వాళ్ళ సంపాదనలతో సుమా) పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు నొక్కడం పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా వాళ్ళతో కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తోటి. ‘ఆయనకూ   మీకూ  తేడా ఏమీ  కనబడడం లేదండీ’ అని ఉన్నట్టుండి   అనేసింది. ‘అమ్మ భడవఖానా. నన్నంటే ఏదో మొగుడుముండావాడ్ని సరిపుచ్చుకుంటాను కాని నన్ను ప్రధాన మంత్రితో పోల్చడంకాదు కాదు సాక్షాత్తు ప్రధాన మంత్రిని నాతో పోల్చడం  ఏవిటి అసాధ్యం కూలా’ అనుకున్నాను.

ఏవిటో  అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.

“నరేంద్ర మోడీ గారి లాగే  నేను మొండివాడ్ని(ట). కాదునాలాగే ఆయన మొండివాడు. ఎవరి మాటా వినడు” ఆవిడ ఉవాచ. కాదంటే కుదరని మాట.

“ఎవరు ఏమైనా  పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే  తరహా ఆయన్దిమీలానే” అని లా పాయింటు తీసింది.

“హౌరా!” అనుకున్నాను నాలో నేనే.

“అన్ని ధరలు పెరిగాయి కాస్త నెల బడ్జెట్ పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని  మీలాగే నిక్కచ్చిగా తెగేసి చెప్పేరకం.” ఏమనడానికి ఏముందినిజమే కదా!

ఇంతవరకు బాగానే వుంది అనుకుంటూ వుంటే ఆఖరి తూటా పేల్చింది.

“మీరు బయట టీవీల్లో మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”

“అందుకే మీకూ ఆయనకూ తేడాలేదనేది” అనేసింది పేపరు మడిచి పక్కనపడేస్తూ.   

 

ఇంకేం అననుఅనాల్సింది అంతా తానేఅనేసిన తరువాత. (11-11-2015)

 

NOTE: "మీ ఆవిడ పోయి రెండేళ్లు దాటింది కదా!" అనే సందేహాత్మకులు  కింద రాసిన తేదీని మరోసారి గమనించండి.

పిడికెడు బియ్యం – భండారు శ్రీనివాసరావు

  అరవై ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట రవిస్ కాలువ వంతెన దగ్గరలో అన్నదాన సమాజం అనే ఒక సంస్థ వుండేది. ఈ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కొందరు రోజూ భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు అన్నం వొండిపెట్టేవారు. ఆ అన్నం తిన్న వాళ్ళు తప్ప అన్నదాన సమాజం వారిని తలచుకునే ఇతరులు ఉంటారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటె చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప, చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు కదా!

ఇప్పుడది లేదని చెప్పడానికి అక్కడికి వెళ్లి చూడనక్కరలేదు. ప్రభుత్వాల దయాధర్మం వల్ల ఎదిగే సంస్థలు అయితే నాలుగు కాలాలు వర్దిల్లేవి, ఏ మంచి పనీ చేయకుండా, ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ.

కానీ అన్నదాన సమాజం ఆ బాపతు కాదు కదా!

కంచి పరమాచార్య కూడా ఈ పిడికెడు బియ్యం గురించే చెప్పారు.

స్వామి ఏమన్నారంటే:

"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అల్లా పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ ఆలయంలోనైనా ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది "

14, జూన్ 2021, సోమవారం

పెద్ద పాము నోట్లో… పడుతుంది అనుకుంటే – భండారు శ్రీనివాసరావు

 

“భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య” అనే నా తెలుగు బ్లాగుకి వీక్షకులు పది లక్షలు దాటారు. ఇది కాదు విషయం.
వీక్షకుల సంఖ్య కోసం వున్నవి ఆరే ఆరు గళ్ళు. నిన్న అది 999999 కి చేరింది. ఆ తర్వాత మరో ఒకటి చేరితే ఏడో గడి దర్శనం ఇచ్చి 1000000 (పదిలక్షలు) అనే అంకె కనబడుతుందా లేదా అనేది ఇప్పటివరకు ఎదురైన లక్ష డాలర్ల ప్రశ్న. దానికి ఈరోజు సమాధానం దొరికింది. 999999 అంటే తొమ్మిది లక్షల తొంభయ్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభయ్ తొమ్మిది మంది వీక్షకులు నా బ్లాగును చూసిన పిదప 1000000 లక్షల అంకె ఇక ‘రాదు రాదు’ అని ఖచ్చితం అని బ్లాగు ప్రపంచంలో తలపండిన వారు కొందరు తేల్చి చెప్పారు.
పరమపద సోపాన పఠంలో (మేము చిన్నప్పుడు ఈ ఆటని పాముల పఠం అనే వాళ్ళం) చిన్న చిన్న నిచ్చెనలు ఎక్కుతూ, చిన్న చిన్న పాముల నోటపడకుండా తప్పించుకుంటూ పై దాకా వెళ్లి, చివరాఖర్లో పెద్దపాము నోట్లో పడి జర్రున కిందికి జారి, ఆట మొదలు పెట్టిన చోటికే చేరినట్టు, ఇప్పుడు బ్లాగులో కూడా అదే జరుగుతుందని గట్టిగా అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా 999999 వరకు వెళ్ళడం, మరో బాక్సు రావడం, ఎంచక్కగా వీక్షకుల సంఖ్య 1000002 అని కనపడడం జరిగింది.






మొత్తం మీద నేను బ్లాగు ప్రపంచంలో చేరిన తర్వాత మొదటిసారి పది లక్షల ఒత్తుల నోము పూర్తి చేసుకున్నాను, వాయినాలు ఇవ్వకుండానే.
(14- 06-2021)

రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చు కదా! – భండారు శ్రీనివాసరావు

 బాధలు, ఇబ్బందులు రెలెటివ్ (సాపేక్షం) అని  తీర్మానించాడు ఒకాయన.

నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో మరో చోటికో. అసలానౌకరీయే తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని జీతం పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల వల్ల, ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో ఇబ్బందులను స్కూటరు వాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. ఇలా బోలెడు జీవితం సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం సంతరించుకున్నాయి. సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా గుర్తున్నాయి.

ఏతావాతా చెప్పేది ఏమిటంటే ఇబ్బందులు, కష్టాలు రెలెటివ్. మేం అనుకునే ఇబ్బందులు వేరు, మా పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా వుంటున్నామంటే అందరూ అలా వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే కావచ్చు వారికి పెద్దవి కావచ్చు. అలాటివారిని చిన్నబుచ్చడం పెద్దరికం అనిపించుకోదు.

తినడానికి రొట్టె లేక ఆకలితో ఓ అమ్మాయి ఏడుస్తుంటే ‘ రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే!