8, ఆగస్టు 2017, మంగళవారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (3) - భండారు శ్రీనివాసరావు


తరువాత సరస్వతక్కయ్యకు సంబంధాలు చూడడం మొదలయింది. మా వూరిలో చలువాది నరసింహం అనే షావుకారు వున్నారు. ఆమెకు ఒక్కటే కూతురు. ఆమెతో మా పెద్దక్క య్యలు ఇద్దరికీ తగని స్నేహం. ఆమె పేరు తిరుపతమ్మ. పొద్దునలేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేదాకా మా ఇంట్లోనే వుండేది. ఆమెను నందిగామ తాలూకాలోని తుర్లపాడు ఇచ్చారు. ఆ వూళ్ళో తిరుపతమ్మ అత్తగారి ఇల్లు, ఆ వూరి కరణం గారయిన  తుర్లపాటి భైర్రాజు గారి ఇల్లు పక్కపక్కనే వుండేవి. ఆ కరణం గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సత్యనారాయణకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పొలంలో పాము కరచి చనిపోయాట్ట. రెండోవాడు బియ్యే పాసయి ఎమ్మే చదువుతాను అన్నాట్ట. కాని కరణం గారు మాత్రం ‘నీ చదువు ఇక నా వల్లకాదు, పెళ్లి చేసుకుని మీ మామగారు చదివిస్తే చదువుకో అభ్యంతరం లేదన్నా’రట. చదువు మీది మమకారంతో కరణంగారి ఆ రెండో కొడుకు హనుమంతరావు కారేపల్లి సంబంధం  చేసుకున్నారు. పెళ్ళయిన కొన్నాళ్ళకు  పైచదువుల ప్రసక్తి తండ్రిదగ్గర తెస్తే ‘మన ఇంటి పరిస్థితులు నీకు తెలవనివి కావు కదా. ముందు ఏదన్నా నౌకరీలో కుదురుకుని ఆ తరువాత చదువుకో లేకపోతే మీ మామను అడుగు’ అని సలహా ఇచ్చారట. మామగారిని డబ్బు అడగడం ఇష్టం లేక ఇంట్లో చెప్పకుండా ఆయన సైకిల్ అమ్ముకుని కాశీ వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటూ ఎమ్మేలో చేరారు. ఫైనల్ పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో కారేపల్లిలో గర్భవతిగా ఆయన భార్య పురుడు కష్టమై పెద్ద ఆపరేషన్ చేయించినా ఉపయోగం లేక తల్లీ పిల్లాడు ఇద్దరూ పోయారట. పరీక్షల ముందు ఈ కబురు చెప్పడం ఇష్టం లేక, భార్య చావు కబురు  ఆయనకు తెలవనివ్వలేదు. పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన తరువాత చింతపల్లి వేంకటేశ్వర రావు అనే అతడిని పంపి ఆయన్ని కారేపల్లి తీసుకువెళ్ళారు. అక్కడికి పోయినదాకా ఆయనకు ఆ వార్త తెలవదు. ఆ షాకునుంచి కోలుకోవడానికి ఏడాది పట్టింది.
ఇంతలో ఆయన తండ్రి గారు  మాత్రం మళ్ళీ పెళ్ళంటూ వొత్తిడి మొదలు పెట్టారు. కారేపల్లిలో ఈయనకు పిల్లనిచ్చిన రంగారావు గారికి కూడా బాగా చదువుకున్న ఈ అల్లుడు అంటే ఎంతో అభిమానం. ‘మా అల్లుడు కాశీ వెళ్ళి పెద్ద పట్టా ఫస్టుక్లాసులో పాసయాడు తెలుసా’ అని అందరితో గర్వంగా చెప్పుకునే వాడు. చిన్న వయస్సులో భార్యాపిల్లలను పోగొట్టుకున్న ఈయనను చూసి ఆయన జాలిపడి మళ్ళీ   పెళ్ళిచేసుకోమని పోరు పెట్టేవారట. చివరకు భీమవరం అమ్మాయితో ఈయనకు రెండో పెళ్లి జరిగింది. ఆ అమ్మాయికి మనస్తిమితం లేని సంగతి దాచిపెట్టి పెళ్లి చేశారు. ఆమె పుట్టింటి వాళ్లు కూడా ఏదో గతిలేక అబద్ధం చెప్పి పెళ్ళయితే చేశారు కాని వారికీ మనసులో గుబులు అనిపించిందో యేమో ఒకరోజు వచ్చి పిల్లను తీసుకువెళ్ళి పోయారు. వాళ్ళూ మంచివాళ్ళే. ‘మిమ్మల్ని మోసం చేయాలని మాకూలేదు. ఏదో అలా జరిగిపోయింది. పెద్దమనస్సుతో మన్నించడ’నే అన్నారు. కానీ ఇదంతా ఆయన మనస్సును చీకాకు పరిచింది. ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి, బెజవాడలో ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టాలని తీర్మానించుకున్నారు.  మొదట్లో ఓ నాలుగు నెలలు మాచవరంలో తుర్లపాటి సంగమేశ్వర రావు అనే దూరపు బంధువు  దగ్గర పనిచేసి ఆ తరువాత సొంతంగానే ప్రాక్టీసు పెట్టారు. గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, జైహింద్ టాకీసు నడుమ రాజగోపాలచారి వీధిలో చక్రవర్తి గారి తెల్లమేడ ఎదురుగా సోవమ్మగారి ఇంట్లో మూడుగదుల వాటా   ఇరవై రూపాయల అద్దెకు మాట్లాడి దిగిపోయారు. సున్నం ఇటుకలతో కట్టిన ఆ ఇంటికి గోడలు గిలాబు కూడా చేయించలేదు. బాతు రూము వుండేదికాదు. నాలుగు వాటాల వాళ్ళకీ కలిపి ఒకటే నీళ్ళ పంపు. బావి లేదు. బోరింగు లేదు. ఆ ఇంట్లో ఆయనా, తుర్లపాడులో తెలిసిన  స్నేహితుడు గురవయ్య కలసి వుండేవారు. ఈయన్ని గురించీ, ఈ ఇంటిని గురించి ఇన్ని వివరాలు మాకు యెలా తెలిసినవన్న అనుమానం రావచ్చు. మా అక్కయ్యకు  పెళ్లి సంబంధం తీసుకువచ్చిన తిరుపతమ్మే  ఈ విషయాలన్నీ మా వాళ్లకు చెప్పిందట.          
తుర్లపాడులో వుండే  ఆ తిరుపతమ్మ మావూరు  వచ్చి ‘మా కరణంగారి అబ్బాయికి పెళ్లి చేస్తారుట. ఇరవైఎనిమిది ఏళ్ళు. బాగా చదువుకున్నాడు. బుద్ధిమంతుడు. బెజవాడలో ప్లీడరీ చేస్తున్నాడు. మీ అమ్మాయిని అయితే తప్పకుండా చేసుకుంటారు’ అని మా నాన్నతో  చెప్పింది. రెండో సంబంధం అనగానే ఆయన ఇష్టపడలేదు.
ఇట్లావుండగానే ఆ తిరుపతమ్మ మొగుడు రమణయ్య,  పిల్లాడి తండ్రి భైర్రాజుగారు మా వూరు వచ్చి షావుకార్ల ఇంట్లో దిగి మా ఇంటికి కబురు పెట్టారు. మా నాన్న  వెళ్ళి వారిని ఇంటికి తీసుకువచ్చారు.
‘అతికితే గతకదు. మీఇంట్లో భోజనం చేసేది లేద’ని  ముందే చెప్పారు. అందుకని మా ఇంటికి పక్క వీధిలో వున్న గూడా రామచంద్రయ్యగారింట్లో వాళ్లకు భోజనం  ఏర్పాట్లు చేశారు. తరువాత  మా అక్కయ్యను చూపించారు. అప్పుడు మా ఇల్లు ఒక పెండ్లివాళ్ళ ఇల్లులాగా వుండేది. మా బామ్మ,  ఆమె తల్లి, మా మేనత్త, మా అమ్మ, పది మంది పిల్లలు. (అప్పటికి మా ఇంట్లో అందరికంటే  చిన్నవాడినైన నేను పుట్టనేలేదు). ఇంకా మా సీతంబామ్మ, సుబ్బయ్య తాతయ్య, జీతగాళ్ళు ఇట్లా ఇంతమందితో ఇల్లంతా ఎంతో సందడిగా వుండేది.  ఇదంతా చూసి  పిల్లాడి తాలూకువాళ్ళు ముఖ్యంగా పిల్లాడి తండ్రి భైర్రాజు గారు ‘ఈ సంబంధం  నాకు నచ్చింది’ అని అక్కడికక్కడే చెప్పేసారు.  ‘మా అబ్బాయిని పంపుతామ’ని చెప్పి వెళ్ళిపోయారు. తరువాత పది  రోజులకు తుర్లపాడు సంబంధం అబ్బాయి వచ్చవాయి వచ్చి జగన్నాధం బాబాయిని,  ఇంగువ రామకృష్ణయ్యగారిని, గురవయ్య గారిని వెంటబెట్టుకుని  కంభంపాడు వచ్చి మా అక్కయ్యను చూసారు. చూసి వెళ్ళిన తరువాత ఆయన తండ్రిగారు ‘మా అబ్బాయికి ఇష్టమయింది’ అని కబురు పంపారు. మా నాన్న వెంటనే బెజవాడ వెళ్ళి దోర్భల శేషాద్రి గారనే ప్లీడరును కలుసుకుని పెళ్లి కుమారుడి గురించి వాకబు చేశారు. ‘పిల్లాడు  మంచివాడు, బుద్ధిమంతుడు, తెలివికలవాడు’ అని ఆయన చెప్పారు. తరువాత కారేపల్లి  వెళ్ళి మొదటి సంబంధం వారిని కూడా మంచి చెడ్డలు కనుక్కున్నాడు. మా బామ్మ పెత్తల్లి కూతుర్ని కారేపల్లి రంగారావుగారి  బాబాయికి  ఇచ్చారుట.  అందుకని కంభంపాడు, కారేపల్లి కుటుంబాల మధ్య రాకపోకలు వుండేవి.  నాన్న  వెళ్ళి ‘తుర్లపాడు కరణంగారి పిల్లాడికి మా అమ్మాయిని ఇద్దామనుకుంటున్నాము’ అని చెప్పగానే వాళ్ళూ ఎంతగానో  సంతోషపడి  ‘వెంటనే వెళ్ళి లగ్గాలు పెట్టుకోండి. మీ అమ్మాయి ఇక మీ అమ్మాయి కాదు మా అమ్మాయి’ అని అన్నారుట.  ఆ భరోసాతో మా నాన్న కంభంపాడు వచ్చి లగ్గం  పెట్టుకోవడానికి రమ్మని తుర్లపాడు కబురు చేశారు. కార్తీక మాసంలో కంభంపాడులోనే ఇంటిముందు పందిరి వేసి పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి  కారేపల్లి నుంచి మా బావగారి మొదటి సంబంధం మామగారు  రంగారావు గారు, అనంతరాములు గారు, దుర్గాప్రసాదు గారు అంతా మా వూరు వచ్చారని మా అక్కయ్య చెప్పింది.

(ఇంకా వుంది)

6, ఆగస్టు 2017, ఆదివారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (2) - భండారు శ్రీనివాసరావు


ఆ రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటినుంచే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు. మా ఇంట్లో పెద్దాడపిల్ల రాధక్కయ్య. ఆమెకు పదేళ్లు నిండకుండానే సంబంధాలు చూడడానికి తొందరపడేవాళ్లు. ఈ సంగతులు గురించి  సరస్వతక్కయ్య కొన్ని సరదా ముచ్చట్లు చెబుతూ వుండేది. పెళ్లి సంబంధాల వాళ్లు ఎవరు వచ్చినా సరే మా పెద్దక్కయ్యతో పాటు రెండోది శారదక్కయ్య కూడా పక్కనే కూర్చుని స్వాములవారు చెప్పిన హిందీ రామాయణం గడగడా చదివేసేది.
మావూరికి కొద్ది కోసులదూరంలో వున్న ఖమ్మం జిల్లా వల్లభినుంచి ఓ సంబంధం వచ్చింది. వరుడి పేరు రాంరావు. ఇంటిపేరు అయితరాజువారు. పెద్దమోతుబరులకింద లెక్క. పెళ్ళిచూపుల్లో ఇద్దరు అక్కయ్యలు కలసి మళ్ళీ హిందీ రామాయణం వినిపించారు. అంత పల్లెటూరులో హిందీ  తెలిసిన పిల్లలు వుండడం విచిత్రమనిపించిందో యేమో కాని మొత్తానికి మా రాధక్కయ్యకు వల్లభి సంబంధమే ఖాయమయింది. అయిదువందల రూపాయల కట్నం, అయిదు రోజుల పెళ్లి వొప్పుకుని వెళ్ళిపోయారు.
సంబంధం అయితే కుదిరింది కాని మా నాన్నకు కాలూ చేయీ ఆడని పరిస్తితి. చివరికి మూడెకరాలు అమ్మి పెళ్ళిచేశారు. పిల్లకు నూటయాభై కాసుల బంగారం పెట్టారు. పల్లెటూరు. దొంగల భయం ఎక్కువ. అంత బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలారా అని మా నాన్న  భయపడుతుండేవాడు. మొత్తం మీద ఎలాటి అవాంతరం లేకుండా పెళ్లి ఘనంగా జరిగిపోయింది.
సంవత్సరం గడిచింది. రెండో అక్కయ్య శారదక్కయ్యకు  పెళ్లి సంబంధాలు అంటూ ప్రత్యేకంగా చూడలేదట. మేనరికం ఇద్దామనుకున్నారు. మా పెద్ద మేనత్త గారు  శారదక్కయ్య   పుట్టగానే ‘ఇది నా కోడలు’  అని  డిక్లేర్ చేసింది.  రాధక్కయ్య పెళ్లి కావడం ఆలస్యం, వాళ్ల పెద్ద అబ్బాయి రామచంద్రరావుకు శారదను చేసుకుంటానని కబురుచేసిందిట. ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది కాని ఏదో గుబులు. ఆ రోజుల్లో శారదా చట్టం వుండేది. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. ఆరోజుల్లో మా లక్ష్మయ్య తాతయ్యకు మా కుటుంబానికీ నడుమ దాయాది తగాదాలు, ఏవేవో  కీచులాటలు వుండేవి. సంగతి తెలిసి ఆయన ఏమైనా పిటీషన్ పెడితే గోల అవుతుందనే భయంతో ఖమ్మం జిల్లా రెబ్బారం వెళ్ళి పెళ్లి చేసుకువచ్చారు. శారదక్కయ్యకు కూడా యాభయ్ కాసుల బంగారం పెట్టారు. పెద్దక్కయ్య పెళ్ళప్పుడు దొంగల భయం గుర్తు ఉందేమో, ఈసారి నాన్న బెజవాడ వెళ్ళి లల్లూరాం కంపెనీ వాళ్ల ఇనప్పెట్టె కొనుక్కుని వచ్చాడు.
పెద్ద రంగయ్య అనే మాస్టారు  పొరుగున వున్న పెనుగంచిప్రోలు నుంచి మా వూరు స్కూలుకు బదిలీపై  వచ్చారు. ఆయన దగ్గర కూడా మా అక్కయ్యలు  హిందీ నేర్చుకునేవాళ్లట.  ప్రాధమిక, మాధ్యమిక హిందీ పరీక్షలు రాయడానికి మా బామ్మ బండి కట్టించి వాళ్ళను మాచినేనిపాలెం తీసుకువెళ్ళి వచ్చేది. ఆడపిల్లలకు చదువెందుకు అనేరోజుల్లో మా ఇంట్లో పెద్దవాళ్ళు చదువు గురించి తీసుకున్న శ్రద్ధాసక్తులు అలాటివి.
మా పెద్దవాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆ తరువాత కొంత మార్పు వచ్చింది. పిల్ల సంవర్త అయినా పెళ్ళికి తొందరలేదనేవారు. అందువల్ల మా ఇంట్లో మిగిలిన ఆడ పిల్లల వివాహాలు పదహారేళ్ళు వచ్చిన తరువాతనే జరిగాయి. ఏడుగురు అక్కయ్యల్లో అయిదుగురి పెళ్ళిళ్ళు నేను పుట్టకమునుపే మా నాన్న చేతుల మీదుగానే జరిగాయి. ఇంట్లో చిన్నవాడిని కావడంవల్ల అనేక సంగతులు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్ల ద్వారానే నాకు తెలిసాయి.
పెనుగంచిపోలు నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అక్కడ చినకరణం గారు కొమరగిరి లక్ష్మీ కాంతారావు గారు. ఆయనకు ఒక్కడే కొడుకు. వెంకట అప్పారావు. బోలెడు ఆస్తి. అతగాడేమో ఇంట్లో చెప్పకుండా మిలట్రీలో చేరాడు. చేరినవాడు అక్కడ కాలు నిలవక తప్పించుకుని వచ్చాడు. మిలట్రీ నుంచి పారిపోయి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారంటు జారీ అయింది. తెలిసిన వాళ్లు కాబట్టి మా నాన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి కృష్ణమూర్తి అని పేరు మార్చి రెబ్బారంలో మా రెండో అక్కయ్య ఇంట్లో వుంచాడు. అక్కడి నుంచి కూడా మార్చి కొన్నాళ్ళు కేసు ఎత్తివేసేదాకా ఎలకలపల్లి అనే పల్లెటూర్లో పెట్టారు. అప్పారావు తలిదండ్రులు కాంతయ్య గారు, రంగమ్మ గారు. మా నాలుగో అక్కయ్య సరస్వతిని వాళ్ల పిల్లవాడికి చేసుకుంటామని కబురు చేశారు. కానీ మా నాన్న  సుతరామూ దానికి వొప్పుకోలేదు. ‘కేసు పూర్తిగా ఎత్తివేసినట్టు గవర్నమెంట్ నుంచి కాగితం వచ్చేదాకా పిల్లనిచ్చేది లేదని, పెళ్లి ప్రసక్తి తేవద్ద’ని  తెగేసి చెప్పాడు. (ఇంకా వుంది)

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ......భండారు శ్రీనివాసరావు


“ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో”

రుక్మిణీ  కళ్యాణంలో  పద్యం శ్రావ్యంగా వినబడుతోంది. పాడుతున్న అమ్మాయికి పన్నెండేళ్ళు వుంటాయేమో. వింటున్న వాళ్లు మాత్రం ఆరుపదులు దాటిన  వాళ్ళే. పుస్తకం అవసరం లేకుండా కంఠతా వచ్చిన పద్యాన్ని రుక్మిణీ దేవే స్వయంగా ఆవహించి పాడుతున్నదా అన్నట్టుగా ఆలపిస్తున్నది మా అన్నపూర్ణక్కయ్య. మధ్యలో మంచంలో చేతిలో తావళంతో మా బామ్మ, కొంత దూరంలో మరో మంచంలో మా  బామ్మ అమ్మ చెల్లాయమ్మ అమ్ముమ్మ. ముక్కాలిపీట  పై కాలు మీద కాలువేసుకుని తన్మయంగా వింటున్న మరో శ్రోత మా లలితమ్ముమ్మ. వొంటింట్లో పనిచేసుకుంటూనే ఓ చెవి ఇటు వేసి వింటున్నది మా అమ్మ.  ఈ దృశ్యం ఆ ఇంట్లో పరిపాటే.
ఆ ఇల్లే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు. చిన్నప్పటి ఈ సంగతులు గురించి మా అక్కయ్యలు, అన్నయ్యలు  చెప్పగా వినీ వినీ  అవన్నీ నా మనసులో ముద్రపడి పోయాయి. అరవై ఏళ్ళ కిందటి ముచ్చట్లు, ఏళ్ళు గడిచినా మనసులో అలా పచ్చగా వుండిపోయాయి.
ఇప్పటికీ కుగ్రామంగా వున్న మా వూరు కంభంపాడు అప్పుడు  ఎలావుండి వుంటుందో  వూహించుకోవాల్సిందే.
మా నాన్నగారు వూరికి కరణం. పేరుకు బోలెడు ఆస్తి. వూరిచుట్టూ ఎటు చూసినా ఎంతదూరం వెళ్ళినా మా పొలాలే. ఐదో అక్కయ్య అన్నపూర్ణ అక్కయ్యను పక్కవూరు పెనుగంచిప్రోలు  పెద  కరణం గారి అబ్బాయి అప్పారావుకుకు  ఇచ్చి పెళ్లి  చేశారు. ఈ సంగతి  ఇప్పుడెందుకంటే కొత్త అల్లుడు పొరుగూరు నుంచి  గుర్రం మీద అత్తగారింటికి మా ఊరు  వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని మేతకు వొదిలేవారు. ఇక  అది తిరిగి మేసినంత మేరా మా పొలాలే. కానీ ఏం లాభం? వందల ఎకరాల భూమి మీద వచ్చే అయివేజు మాత్రం అంతంత మాత్రమే. కరణీకం మీద వచ్చే జీతం రాళ్ళు నాలుగే, ఇంటి ఖర్చుకు ఆధారం. వర్షాలు లేక పంటలు పండక రైతులు సర్కారుకు శిస్తుకట్టలేక ఇళ్ళూ పొలాలు వొదులుకుని వూళ్ళు వొదిలి వెళ్ళే రోజులవి.
అలాటి రోజుల్లో మా బాల్యం గడిచింది. అలాటి పల్లెటూరిలో మా చిన్నతనం నడిచింది.
మా నాన్నకు  ఏడుగురు ఆడపిల్లలు.  నలుగురు మగపిల్లలం.
ఇంతమందికే కాదు, ఇంకా ఇంతమంది ఇంట్లో  విస్తళ్ళు వేసే సమయానికి భోజనాలకు సిద్ధంగా వుండేవారు. పూటకూళ్ళ ఇల్లు లేని వూరు. ఎవరొచ్చినా చేయి కడిగేది వూరి కరణం గారింట్లోనే.
మా అమ్మా నాన్న, బామ్మ, ఆమె తల్లి గారు, పెనిమిటి వొదిలిపెట్టిన ఒక మేనత్త, ఇద్దరు జీతగాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు ఇంతమందికి మా అమ్మే వండి వార్చేది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేవరకు నడుం వాల్చే వీలు వుండేది కాదు. దీనికి తోడు నిప్పులు కడిగే ఆచారం మా బామ్మది. వూరి పొలిమేరలో చెరువుకట్ట దగ్గర వున్న మంచినీళ్ళ బావినుంచి తడి చీరెకట్టుకుని బిందెలతో నీళ్ళు పట్టుకురావడంతో మా అమ్మ డ్యూటీ మొదలయ్యేది. మైలకు పనికొచ్చే నీళ్ళు ఆడపిల్లలు తీసుకువచ్చేవాళ్ళు.
మా ఇంటి వెనుక ఉసిగె వాగు. దాన్ని ఆనుకుని శివాలయం. అందులోనే హనుమంతుడి గుడి. పక్కనే పూడిపోయిన కోనేరు. దాని వెనుక లక్ష్మయ్య తాతయ్య పొలాలు. దాన్ని ఆనుకుని మా అప్ప పొలం నల్లగడ్డ. దానిపక్కనే తుమ్మల వాగు. ఆ వాగు దాటుకుని వెడితే సుబ్బయ్య తాతయ్య గరప చేను. అందులో స్వాములవారి ఆశ్రమం. శివుడి గుడి. అందులో కాశీ నుంచి తెచ్చి స్వాములవారు ప్రతిష్టించిన శివలింగం.
ఇంట్లో పెద్దవాళ్ళు నా చిన్నతనంలో చెప్పుకునే మాటలు  ఒకటీ అరా అలా గుర్తుండి పోయాయి. పెద్దక్కయ్యలు రాధక్కయ్య, శారదక్కయ్య హిందీ నేర్చుకోవడానికి వూరి పొలిమేరల్లో వున్న స్వామి గారి ఆశ్రమానికి వెళ్ళేవాళ్లు. చిన్నక్కయ్యలు సరస్వతక్కయ్య, అన్నపూర్ణక్కయ్య  బామ్మతో తోటకు వెళ్ళి కూరలు కోసుకువచ్చేవాళ్ళు.  శివరాజు నాగభూషణం గారి అరుగు బడిలోనే అందరి చదువులు. ఆయన పొద్దున్నే లేచి, స్నానాదులు ముగించుకుని –
హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా|
అంటూ కంచుకంఠంతో కృష్ణ శతకం వూరంతటికీ వినబడేటట్టు ఎలుగెత్తి చదివేవారు.
అదే మా  క్లాసు బెల్లు.
(ఇంకా వుంది)

5, ఆగస్టు 2017, శనివారం

శ్రద్ధాంజలి – కృతజ్ఞతాంజలి



ఈ రోజు మా అమ్మగారు శ్రీమతి వెంకట్రావమ్మ గారి ఆబ్దీకం.


ఆమె కాలం చేసి రెండు దశాబ్దాలకు పైగా గడిచిపోయాయి. ఆమె చనిపోయిన రోజు ఇంకా కళ్ళకు కట్టినట్టు వుంది.  శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఆవిడకు వొంట్లో బాగా లేదని తెలిసి అంతా వచ్చారు. ఇంటి కోడళ్ళు అందరూ శుక్రవారం నోములకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆవిడ వారి నోములకు, వాయినాలకు ఆటంకం కలిగించకుండా అన్నీ పూర్తయ్యేవరకు వుండి ఆ తరువాత కన్ను మూసింది. దహన సంస్కారాలు పూర్తికాగానే, మా పెద్దన్నయ్య పర్వతాలరావుగారు ఆమె అపరకర్మలు కాశీలో జరపాలని ప్రతిపాదించడం, అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు, బావగార్లు అందరం వారణాసి వెళ్లి ఆ పవిత్ర ప్రదేశంలో గంగా తీరంలో పిండ ప్రదానాలు చేసి తర్పణాలు విడవడం అంతా ఓ కలలా జరిగిపోయింది.
మా నాన్నగారు రాఘవరావు గారు చనిపోయి అనేక దశాబ్దాలు దొర్లిపోయాయి. నా చిన్నతనంలోనే కన్నుమూయడం వల్ల,  ఆయన రూపం కూడా నాకు గుర్తు లేదు.  ఆయన ఆబ్దీకాలను మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు అత్యంత శ్రద్దాసక్తులతో  ప్రతియేటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వచ్చారు. మా స్వగ్రామంలో వరుసగా నలభయ్ యాభై ఏళ్ళపాటు జరుగుతూ వచ్చిన  ఈ ఆబ్దీకాలు,  కాలక్రమంలో  వాస్తవంగా ఒక పండుగ మాదిరిగా మారిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో చుట్టపక్కాలందరూ ఓ శుభకార్యానికి వచ్చినట్టు హాజరయ్యేవారు. పిల్లలు, వారిపిల్లలు, వారి పిల్లలు  ఇలా అందరూ,  అదొక తద్దినం అనే  కన్నా కూడా నలుగురు కలిసి  పెద్దలను సంస్మరించుకునే ఒక అవకాశంగా భావించి,  ఒకరికొకరు  కూడబలుక్కుని  ఆరోజుకల్లా అంతా ఠంచనుగా ఓ దారీతెన్నూ లేని  ఆ చిన్న పల్లెటూరు మా వూరు  కంభంపాడు చేరుకునేవారు. నిజానికి ఈ యావత్ కార్యక్రమానికి వెన్నుదన్ను మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గారు. ఆయన మా వూరు కరణీకం చేసేవారు. ప్రతియేడూ మా నాన్న తద్దినానికి పెళ్ళికి పంపినట్టు అందరికీ పేరుపేరునా  వర్తమానాలు పంపేవారు. మా నాన్న ఆబ్దీకం అంటే మా వూళ్ళో ఓ సందడి. వూరబంతి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళ కంటే తద్దినాలు ఘనంగా జరిగేవని చెప్పుకునేవారు.
ఇన్నేళ్ళ తరువాత కొన్ని విషయాలు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. అన్ని సంవత్సరాలుగా అంత శ్రద్ధగా ఘనంగా మా అమ్మానాన్నల తద్దినాలను బాధ్యతగా  నిర్వహిస్తూ వచ్చిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వర రావుగారు ఈ నాడు మా మధ్యన లేకపోవడం మేమందరం  తట్టుకోలేకపోతున్న ఓ విషాద పరిణామం. మూడో అన్నయ్య ఏకంగా మా వూరిలో అమ్మానాన్నల గుడినిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడా గుడి పక్కనే వారిద్దరి స్మారక చిహ్నాలు నిర్మించి మా అన్నయ్య పిల్లలు ఆయన ఋణం కొంతమేర తీర్చుకున్నారు.
పోతే, చావంటే ఏమిటో తెలియని రోజుల్లోనే తండ్రిని పోగొట్టుకుని, తద్దినం అంటే ఏమిటో అర్ధం కూడా తెలియని స్తితిలో పెరుగుతూ వచ్చిన నేను,  వూహ తెలిసే నాటికే తద్దినం పెట్టే కర్త  తమ్ముడి పాత్రలో వొదిగిపోయాను. మా రెండో అన్నయ్య  రామచంద్రరావు గారు దత్తు పోవడం వల్ల, చివరికి మిగిలింది నేనే కావడం వల్ల ఏటా మా అమ్మానాన్నల తద్దినాలు కర్తగా కూర్చుని  పెట్టే అవకాశం, ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి, నాకు లభించింది. దాదాపు కాపురానికి వచ్చింది లగాయతు మా పెద్ద వొదినె గారు శ్రీమతి  సరోజినీ దేవి, రెండో వొదినెగారు శ్రీమతి  విమలాదేవి, మూడో వొదినెగారు శ్రీమతి  అరుణా దేవి మడికట్టుకుని  తడిబట్టలతో ఎంతో శ్రద్ధతో  ఈ పవిత్ర కార్యానికి తోడ్పడుతూ వచ్చారు. గత కొన్నేళ్ళుగా ఈ బాధ్యతను  మా ఆవిడ నిర్మలాదేవి నెత్తికెత్తుకుంది.
దాదాపు   అరవై ఏళ్ళుగా  మా నాన్నగారి ఆబ్దీకం, సుమారు రెండు దశాబ్దాలకు పైగా మా అమ్మగారి తద్దినం క్రమం తప్పకుండా నిర్వహించే భాగ్యం   నా పూర్వజన్మ సుకృతం.  కొన్నేళ్ళ క్రితం అమెరికా వెళ్ళినప్పుడు కూడా మా పెద్దవాడు సందీప్  పూనుకుని ఏర్పాట్లు చేయడం వల్ల అక్కడ కూడా ఏలోటూ రాకుండా ఈ పవిత్ర కార్యాన్ని నిర్వర్తించగలిగాను.
ఇందుకు సహకరిస్తూ వచ్చిన అందరికీ కృతజ్ఞతాంజలి. గతించిన పెద్దలకు శ్రద్ధాంజలి.


1, ఆగస్టు 2017, మంగళవారం

ఆంధ్రపత్రిక మళ్ళీ వస్తోంది!


యాభయ్ అరవై ఏళ్ళ క్రితం, మా వూళ్ళో గూడా సత్యనారాయణ సిద్ధాంతిగారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి మర్నాడు  సాయంత్రం అయ్యేది. అయినా, సరే అది చదువుతుంటే  ఏ రోజు వార్తలు, ఆరోజే తెలుసుకుంటున్న ఫీలింగ్‌ కలిగేది. ఊరు మొత్తానికి కలిపి ఇద్దరు ముగ్గురు మాత్రమే చందా కట్టి పత్రిక తెప్పించుకునేవారు. పోస్ట్ మాన్ చేతిలో ఆంధ్రపత్రిక కనబడగానే మా అందరికీ ప్రాణాలు లేచొచ్చేవి.
‘అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఫిట్జరాల్ద్  కెనెడీ ఎన్నిక, ఓటమి అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన’ అంటూ పత్రికలోని వార్తలను స్కూలు మేష్టరుగారు శివరాజు అప్పయ్య పంతులు గారు ఉచ్చైస్వరంతో చదివి వినిపిస్తుంటే ఊరి వారందరూ పోగయి చెవులప్పగించి వినేవారు.
బెజవాడ గాంధి నగరంలో ఆంధ్రపత్రిక ఆఫీసు వుండేది. దాన్ని మద్రాసు నుంచి బెజవాడ తరలించినప్పుడు మా దగ్గరి బంధువు పినపాక ప్రకాశరావు గారు పత్రిక సంపాదకత్వ బాధ్యతలు చూస్తుండేవారు. ప్రముఖ రచయిత వీరాజీ కూడా అప్పుడే  మద్రాసు నుంచి మకాం బెజవాడకు మార్చుకున్నారు. బెజవాడలో సమాచార శాఖ అధికారిగా పని చేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారి ఆఫీసుకు వస్తుండేవారు. సి.కనకాంబర రాజు (సికరాజుగా, ఆంద్ర భూమి వారపత్రిక సంపాదకుడిగా ప్రసిద్ధుడు) కూడా నాకు అక్కడే పరిచయం.
తదుపరి నేను హైదరాబాదులో రేడియోలో చేరిన తరువాత బషీర్ బాగ్ చౌరస్తాలో ఆంధ్రపత్రిక ఆఫీసుకు వెడుతుండేవాడిని. సీ.వీ. రాజగోపాలరావు గారు రెసిడెంట్ ఎడిటర్. బ్యూరో చీఫ్ ముక్కు శర్మగారు, పాపయ్య శాస్త్రి గారు, సుందరం, (ఇప్పుడు లేరు), పాశం యాదగిరి, కే.వేణుగోపాల్, ములుగు రాజేశ్వర రావు, చుట్ట రాంప్రసాద్, విద్యారణ్య అక్కడ పనిచేస్తూ వుండేవారు. ఆ భవనం అంతెత్తున ఒక రాజ మహల్ ని తలపించేదిగా వుండేది. అంతటి భోగం అనుభవించిన ఆంధ్రపత్రిక చివరికి  గగన్ మహల్ లో ఒక  అద్దె ఇంటిలో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పటికే అది అవసాన దశకు చేరుకున్నట్టే. కాశీనాధుని నాగేశ్వరరావు, శివలెంక సంభుప్రసాద్, శివలెంక రాధాకృష్ణ చేతుల్లో పెరిగి పెద్దదయిన తెలుగువారి మొట్టమొదటి పూర్తిస్థాయి దినపత్రిక  ఆంధ్రపత్రిక, విద్యారణ్య మాటల్లో చెప్పాలంటే, ‘శివ సాయుజ్యం’ పొందింది.

ఆంధ్రపత్రిక లేకుండానే తెలుగు పత్రికారంగానికి  ఏండ్లు గడిచిపోయాయి. ఆ పత్రికలో పనిచేసి పేరు తెచ్చుకున్న జర్నలిష్టులందరూ వేరే పత్రికలకు మరలిపోయారు.  మళ్ళీ ఇన్నాళ్టికి ‘మహానగర్’ అనే ఓ చిన్న పత్రికను యజ్ఞంలా నడుపుకుంటున్న మనసున్న మారాజు ‘పాంచజన్యం’,  పెద్ద మనసు చేసుకుని ఆంధ్రపత్రికకు ఊపిరులూదాడు. ఆంధ్రుల కొత్త రాజధాని అమరావతిలో ఈ మధ్యనే వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమై  మళ్ళీ జనం మధ్యకు వస్తోంది. సంతోషం!         

29, జులై 2017, శనివారం

ముసలితనం, పసి తనం, రెండింట్లో కామన్ మొండితనం

  
చిన్నప్పుడు మా బామ్మను చూసినప్పుడు నేనెప్పుడు ఇంత పెద్దవాడిని అవుతానో కదా అనుకునేవాడిని.  ఆమె పోయిన నలభయ్ అయిదేళ్లకల్లా  నాకామె వయసు ఈజీగా నా ప్రమేయం లేకుండానే  వచ్చేసింది. ఇంట్లో అందరికంటే వయసులో చిన్నవాడినేకావచ్చు, కానీ నేనూ ఇప్పుడు పెద్దవాడినే!
పుట్టిన ప్రతివాడికి బాల్యం వుంటుంది కాని ముసలి వయసు అనేది  ఆయుస్సునిబట్టి వుంటుంది. ఇంకో చిత్రం ఏమిటంటే మొండితనం అనే ఒక లక్షణం మాత్రం  పసితనానికి, ముసలితనం ఈ రెండింటికీ కామన్.
చిన్నప్పుడు ‘అలా చేయోద్దురా’ అనే పెద్దవాళ్ళు వుండేవాళ్ళు. ‘ఏమిట్రా అలా ముందూ వెనకా చూసుకోకుండా ఆ గెంతులు. పడితే కాలో చెయ్యో విరుగుతుంది. సిమెంటు కట్టు కట్టుకుని ఆటా పాటా లేకుండా మంచం మీద పడి వుండాలి, జాగ్రత్త!’ అంటూ వుంటారు. ‘ఏవిటో ఈ పెద్దవాళ్ళు, అనవసరంగా అన్నింటికీ కంగారు పడుతుంటారు’ అనుకుంటారు పిల్లవాళ్ళు. నేనూ అలాగే చెప్పిన మాట వినకుండా ఒకరోజు సైకిల్ మీద నుంచి పడి  చెయ్యి విరగగొట్టుకున్నాను. సర్కారు దవాఖానాలో సిమెంటు కట్టు వేస్తే దాన్ని మెడకి తగిలించుకుని మోస్తూ నలభయ్ రోజులు తిరిగాను. ‘ఇంకా నయం కాలు విరిగింది కాదు’ అనుకున్నాను. అంతే కాని ‘కాళ్ళూ చేతులు విరగగొట్టుకోవద్దు’ అన్న పెద్దల మాటలు చెవి కెక్కించుకోలేదు.
ఇప్పుడు మళ్ళీ సీను రివర్స్. ‘కాస్త జాగ్రత్త’ అంటారు పిల్లలు. ‘ఆ మాత్రం తెలియదా’ అంటుంది మనలోని మొండితనం.
‘వద్దమ్మా! అలా మిట్ట మధ్యాన్నం వరకు పూజలూ అవీ చేస్తూ కడుపు మాడ్చుకోకు. అసలే నీకు, సుగరు, బీపీ. డాక్టరు ఏం చెప్పాడు, పొద్దున్నే ఏదో ఇంత  తిన్న తరువాతనే ఏ పని అయినా అని చెప్పాడా లేదా. మళ్ళీ ఏదైనా అయితే ఇబ్బంది పడేది నువ్వే’ అంటుంటారు పిల్లలు. అందరి మాటా అంతవరకూ వింటూవచ్చి, ‘మంచి అమ్మ’  అని నలుగురి చేతా అనిపించుకున్న ఆ అమ్మ మాత్రం పిల్లలు చెప్పిన ఆ మంచి మాట వినదు.  పైగా ‘ఆ మాత్రం నాకు తెలవదా’ అనుకుంటుంది. ‘మనం పెద్దవాళ్ళం కదా పిల్లవాళ్ళ మాట వింటే ఇక మన పెద్దరికం ఏముంటుంది’ అని కూడా అనుకుంటుంది. నిజానికి ఏదైనా జరిగితే ఇబ్బంది పడేది నిజమే అయినా, అసలు ఇబ్బంది పిల్లలది.
మొన్నీమధ్య తెలిసిన దంపతులు పిల్లల్ని చూడ్డానికి అమెరికా వెళ్ళారు. ఆమెకు బీపీ, సుగరూ పుట్టింటి కట్నంగా వచ్చాయి. కావాల్సిన మాత్రలు అవీ తీసుకు వెళ్ళారు. తల్లీ తండ్రికి అమెరికాలో నాలుగు ప్రదేశాలు చూపించాలని ముచ్చటపడి పిల్లలు,  ఎక్కడికో విహార యాత్రకు తీసుకువెళ్ళారు. ఈసందడిలో మాత్రలు వెంట  పట్టుకుపోవడం మరచిపోయారు. నాల్రోజులు మాత్రలు వేసుకోకపోతే ఏం కొంప మునుగుతుందని పిల్లలకి ఆ విషయం చెప్పలేదు. చెబితే ఏదైనా ప్రయత్నం చేసేవాళ్ళేమో! చివరికి నిజంగానే కొంప మునిగింది. జబ్బున పడ్డ తల్లిని ఆసుపత్రిలో చేర్చి బయటకు తీసుకురావడానికి వాళ్ళ లెక్కలో అటూ ఇటూగా ఓ యాభయ్ లక్షలు ఒదిలాయని చెప్పుకున్నారు.  కాబట్టి ఏమిటట! చిన్నప్పుడు పిల్లల మొండితనం మనకు యెంత కోపం తెప్పించేదో గుర్తుకు తెచ్చుకుని పెద్దతనంలో మనం కాస్త మొండితనం తగ్గించుకోవాలి. ‘ఈ రోడ్డే కదా దాటి అవతల ఉన్న గుడికి వెళ్ళలేమా!’ అంటే వెళ్ళవచ్చు. అదే ఖర్మం కలిసిరాక ఏదైనా జరిగితే మంచాన పడేది పిల్లలు కాదు, మనమే  అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి.
చలికాలం వస్తే మూడంకె వేసి దుప్పటి కప్పుకుని పడుకుంటాం.  ముసలి తనం కూడా అలాగే. ఆ వయసుని బట్టి దానికి తగ్గట్టు మన  మనసును కాస్త వీలుగా ముడుచుకోవాలి.
కాదూ కూడదంటే కలిగేవి ఇబ్బందులే. మనం పడడంతో సరిపోదు ఇతరులను కూడా అనవసరంగా ఇబ్బందుల పాలు చేయాల్సిరావచ్చు.

నీతి: పెద్దతనంలో మొండితనాన్ని అటక ఎక్కించాలి. లేకపోతే ‘పడక’ వేయాల్సి వస్తుంది. 

కల్యాణం కమనీయం



పూర్వాశ్రమంలో ఒక దినపత్రికలో పనిచేసేరోజుల్లో అంటే నలభయ్ ఏళ్ళకిందట రాష్ట్రంలో వేసవి వచ్చిందంటే చాలు అనేక చోట్ల అగ్నిప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉండేవి. ఒకోసారి ఒకే రోజు అనేకచోట్ల నుంచి ఈ ప్రమాద వార్తలు అందేవి. వాటినన్నిటినీ కలిపి ‘వాడవాడలా అగ్నిప్రమాదాలు’ అనే ఒకే శీర్షిక కింద హోల్ మొత్తం ఫుల్ పేజీలో ఒకే చోట ప్రచురించేవారు. వేసవిలోనే పెళ్లి ముహూర్తాలు కూడా ఎక్కువగా వుంటాయి. పలానా వారి పెళ్లి పలానా వారితో పలానా రోజున జరిగిందని పత్రికలో ప్రచురించే సాంప్రదాయం ఒకటి వుండేది. అదీ చాలా ముఖ్యులు అనుకునేవారి విషయంలోనే దీన్ని పాటించేవారు. అయితే కాలక్రమంలో పత్రికలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వాళ్ళ పెళ్లి పత్రికలు పట్టుకొచ్చి, ఆ శుభలేఖలోని తేదీ ప్రకారం  పలానా రోజున పలానావారి  పెళ్లి ఘనంగా జరిగిందనే వార్త  ఆ ‘పెళ్ళిళ్ళకాలమ్’ లో అచ్చయ్యేలా తమవంతు ప్రయత్నం చేసుకునేవారు. అది ఎంతవరకు విస్తరించింది అంటే ‘వాడవాడలా వివాహాలు’  అనే శీర్షిక కింద పెళ్ళిళ్ళ వార్తలు  ప్రచురించే దుస్తితి దాపురిస్తుందేమో అని చెప్పుకుని నవ్వుకునే వాళ్ళం. అయితే చివరికి ఈ అంటు వ్యాధికి అడ్డుకట్ట ఒక పెళ్లి వార్త రూపంలోనే పడింది. పెళ్లి పత్రికల దాకా వచ్చిన ఒక పెళ్లి, పెళ్లి పీటల దాకా వెళ్ళకుండానే ఏదో కారణంతో వాయిదా పడడం, ఆ విషయం తెలియక ఆ పెళ్లి జరిగినట్టు పత్రికలో రావడం ఒక చర్చనీయాంశం అయింది. అప్పటి నుంచి ఈ ముందస్తు పెళ్లి వార్తల ప్రచురణకు ఎడిటర్ గారు స్వస్తి పలకడంతో అప్పటికా కధ ఆవిధంగా  ముగిసింది.