25, ఫిబ్రవరి 2015, బుధవారం

పెళ్ళయిన కొత్తలో.....


'ఓ కప్పు కాఫీ పట్రా'
'ఒక్క క్షణంలో తెస్తాను వుండండి'
పదేళ్ళ తరువాత ..
'ఓ కప్పు కాఫీ ఇస్తావా?'
'ఓక్షణం ఆగండి. చేతిలో పని కాగానే పట్టుకొస్తాను'
మరో పదేళ్ళ తరువాత .....
'ఇదిగో! ఏమోయ్! తల నాదుగా వుంది. ఓ కప్పు కాఫీ ఏమైనా దొరుకుతుందా!'
'అదిగో. ఫ్లాస్క్ లో పోసి పెట్టాను. తాగండి'
ఇంకో పదేళ్ళ తరువాత....
'సరేగాని ఓ కప్పు కాఫీ...'
'ఏమిటి! ఏమిటీ అంటున్నారు. కాస్త గట్టిగా చెప్పండి''
'అబ్బే! ఏం లేదు. నేను కాఫీ పెట్టుకుంటున్నాను. నీకూ కావాలేమో అని. అంతే! అంతే!!'







(చట్టబద్ధమైన హెచ్చరిక: ఆడవారి కాలమానం అందరికీ ఒక్క లాగా వుండదు. కాలం కలిసిరాకపోతే ఈ మొత్తం సీనూ ఒక్క పదేళ్ళలోపే అనుభవం లోకి రావచ్చు' )

చిత్రకారులు 'శ్రీరామ్' గారికి కృతజ్ఞతలు  

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

హోదా గోదాలో రాజకీయ వస్తాదులు

(Published by "SURYA" telugu daily in it's edit page on 26-02-2015, THURSDAY)
రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, ఒక్క ఏడాదిలోనే  పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు చెదిరిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు  పండిత, పామరులనే  తేడా లేకుండా జనాలు ఉచిత వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఏడాది ముందు ఏం జరిగిందో మరపున పడిందన్న నమ్మకంతో కాబోలు,  పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటలు గుర్తులేనట్టు ఈనాడు నాయకులు మాట్లాడుతున్నారు. 'మీరలా  అన్నార'ని  ఒకళ్ళు అంటుంటే 'తామలా అన'నే లేదని మరొకళ్ళు బుకాయిస్తున్నారు. చట్టసభల రికార్డుల్లో మొత్తం వ్యవహారం పదిలంగా వుందని తెలిసికూడా మొండిగా వాదిస్తున్నారు.   రాజకీయ అభినయకళ ముందు, చతుష్టష్టి  కళల్లో మిగిలిన అరవై మూడూ వెలవెలబోతున్నాయి.
నిరుడు కేంద్రంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్లమెంట్ ఉభయసభల సమావేశాల తుది ఘడియల్లో ఆంధ్ర ప్రదేశ్ విభజన బిల్లును తెర మీదకు తెచ్చింది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు అయిదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించబోతున్నట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక సభ సాక్షిగా హామీ ఇచ్చారు. బిల్లు సానుకూలంగా నెగ్గే విధంగా చూడాలని కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులను అభ్యర్ధించారు. ఎందుకంటే బిల్లు  ఆమోదం పొందాలంటే  ప్రతిపక్ష బీజేపీ సహకారం కావాలి. 'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం' లాంటి ఆ బిల్లును అన్ని రాజకీయపార్టీలు ఇష్టం వున్నా లేకపోయినా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసం 'మమ' అనిపించి బిల్లును అప్పటికి గట్టెక్కించాయి. బిల్లు తెచ్చిన కాంగ్రెస్ సర్కారును ఒడ్డెక్కించాయి. లోపల ఏమున్నా బయటకు మాత్రం ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల పూర్తి ఆమోదంతోనో, పాక్షిక ఆమోదంతోనో జరిగిందనడం వాస్తవం.
నిరుడు ఫిబ్రవరి నెలలో ఏం జరిగిందో ఓసారి సింహావలోకనం చేసుకుందాం.
పార్లమెంటు సమావేశాలు ముగియనున్న తరుణంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లోకసభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టింది. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, తెలుగు దేశం సభ్యులు నిరసన తెలుపుతున్న నేపధ్యంలో,  ప్రత్యక్ష ప్రసారాలు నిలుపుచేసి, మూజువాణీ ఓటుతో  బిల్లును ఆమోదింప చేశారు.  హైదరాబాదు నగరాన్ని రెండు రాష్ట్రాలకు పదేళ్ళపాటు రాజధానిగా వుంచుతూ బిల్లులో పొందుపరచిన అంశంతో విభేదిస్తూ ఎంఐఎం ప్రవేశపెట్టిన సవరణ తిరస్కరణకు గురయింది. 'ఒక అనారోగ్య సంప్రదాయానికి తెర తీసినట్టయింద'ని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. బిల్లు ఆమోదం పొందిన సంబరంలో టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర రావు, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ అజాద్  ఆనందోత్సాహాలు వెలిబుచ్చుతున్న సమయంలోనే, 'భారత దేశ చరిత్రలోనే ఇది చీకటి అధ్యాయం అంటూ,  'పట్టపగలే ప్రజాస్వామ్యం  ఖూనీ అవడం కళ్ళారా చూస్తున్నామ'ని  వై.యస్.ఆర్.సీ.పీ.  నాయకుడు వై.యస్. జగన్ మోహన రెడ్డి అభివర్ణించారు.    
'సీమాంధ్రకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంద'ని నాటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సభలో ప్రకటించారు.
మరునాడే రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించింది. విభజనకు వ్యతిరేకం కాదంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పించాలని బీజేపీ కోరడం, అయిదు సంవత్సరాలకు మాత్రమే కాంగ్రెస్ అంగీకరించడం చచకా జరిగిపోయాయి. బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణా ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట్ర  కాంగ్రెస్ లో నిరసనలు మొదలయ్యాయి.  సీమాంధ్ర కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు తమ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడదే నాయకుడు నవజాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖ్యాతి దక్కించుకున్న  శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ నుంచి తప్పుకుని సొంత పార్టీ పెట్టుకున్నారు. దరిమిలా ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో పార్టీల తలరాతల్ని ప్రజలు మార్చేసారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పుణ్యమే అని బలంగా నమ్మిన సీమాంధ్ర ఓటర్లు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఇటు తెలంగాణాలో కూడా దాదాపు అదే పరిస్తితి. తెలంగాణా తెచ్చిన పార్టీగా టీ.ఆర్.యస్. పేరు దక్కించుకుంది.  కానీ తెలంగాణా ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ప్రజలు గుర్తించకపోవడంతో ఆ పార్టీ పని రెంటికీ చెడ్డ రేవడి చందం అయింది. కాంగ్రెస్ చేసిన రాజకీయం సీమాంధ్రలో తెలుగుదేశానికి కలిసివచ్చింది. విభజన తరువాత రాష్ట్రాన్ని పునర్నిర్మించగల చేవ  చంద్రబాబుకు వున్నదని గట్టిగా నమ్మడంతో అంతవరకూ అన్ని సర్వేల్లో అజేయంగా ముందుకు దూసుకువెడుతున్న వై.యస్.ఆర్.సీ.పీ.  ఆఖరు పరీక్షలో కుదేలయింది. ఆఖరి క్షణం వరకు చేతికందే దూరంలో వూరిస్తూ వచ్చిన అధికారానికి  దూరం అయింది.   
'రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా' అన్నట్టు ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు తలచుకోవలే కానీ ఎలాటి బిల్లులయినా చిటికెలో చట్టసభల ఆమోదం పొంది చట్టాలుగా మారతాయని అనడానికి, ఇన్ని పరిణామాలకు కారణం అయిన  ఆంధ్ర ప్రదేశ్ విభజన  తీరే  ఒక ఉదాహరణ.
నిరుడు ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించింది. మూడో రోజునే అంటే ఇరవయ్యో తేదీన  రాజ్యసభ ఆమోదం పొందింది. మార్చి ఒకటో తేదీన  రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. వెంటనే దాన్ని అధికారిక రాజపత్రం (గెజిట్)లో ప్రచురించారు. జూన్ రెండో తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి రావడం, ఆ తేదీనుంచే సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలుగా వేరుపడడం ఆఘమేఘాలమీద జరిగిపోయాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా ఇవన్నీ జరిగాయి. సరిగ్గా ఏడాది తరువాత తెరలేచిన తాజా పరిణామాలకు కూడా ఆ మహాత్ముడే సాక్షి కావడం కాకతాళీయం కావచ్చేమో!
ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోవడానికి కారణం వుంది. విభజన అనంతరం ఏర్పడే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రస్తుతం పాత్ర మారిపోయిన  కాంగ్రెస్, కొత్తగా  ప్రభుత్వంలోకి వచ్చిన బీజేపీని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం ఎదుట బడ్జెట్ సమావేశాల తొలిరోజునే కాంగ్రెస్ దీక్షా కార్యక్రమం నిర్వహించింది. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతూ, ఏపీ కాంగ్రెస్ కమిటీ కోటి సంతకాల సేకరణకు పూనుకుంది. అయిదేళ్ళు కాదు, పదేళ్ళ ప్యాకేజీ కోసం ఆనాడు పట్టుబట్టిన బీజేపీ ఈనాడు పాలకపక్షం పాత్ర ధరించి, ఆ హామీ విషయంలో పాత్రోచితంగా  మీనమేషాలు లెక్కబెడుతోంది. పాత్రలు తారుమారు కావడం అంటే ఇదే కాబోలు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల లభించే ప్రయోజనాలేమిటి? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  1969లో తొలిసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది.   ఐదు అంశాల ఆధారంగా ప్రత్యేక హోదా కల్పించాలని నాటి ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది.  మొదటిది ఈ హోదా కోరుతున్న రాష్ట్రం పర్వత ప్రాంతం అయివుండాలి. జన సాంద్రత తక్కువగా వుండడమే కాకుండా వున్న జనాభాలో గిరిజనుల సంఖ్య అధికంగా వుండాలి. ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రం అయివుండాలి. ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబడి వుండడం, ఆర్ధిక పరిస్తితి నిరాశాజనకంగా ఉండడం అనేవి కూడా ఈ హోదా పొందడానికి ఉపకరిస్తాయి. పోతే ప్రధాన మంత్రి, ఆయా  రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి అనే విషయాన్ని నిర్ధారిస్తుంది.  
చివరి రెండు అంశాలు మినహా ఈ హోదా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చే  నిబంధనలు ఏవీ లేవు.
మొదట అసోం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తరువాత అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ప్రత్యేక హోదా రాష్ట్రాల జాబితాలో చేర్చారు.
ఈ హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు నిధులు లభిస్తాయి. మొత్తం కేంద్ర సాయంలో ముప్పయి శాతం నిధులు ఈ పదకొండు రాష్ట్రాలకు కేటాయిస్తారు. మిగిలిన డెబ్బయి శాతం నిధులను తతిమ్మా రాష్ట్రాలు అన్నీ కలిసి పంచుకోవాలి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు,  ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు పొందుతాయి. ఎక్సైజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి.
ఇన్ని వెసులుబాట్లు వున్నాయి కనుకనే బీహారు మొదలయిన రాష్ట్రాలు ఈ ప్రత్యేక హోదా సాధన కోసం పట్టుబడుతున్నాయి. రెండేళ్ళ క్రితం బీహారు ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ ఏకంగా ఢిల్లీలోనే అధికారికంగా ఆందోళన నిర్వహించారు. అయినా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సుతరామూ అంగీకరించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎన్నో ఇబ్బందులు వున్నాయని బాగా తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు ఆ హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా ఆందోళనలకు దిగడం విడ్డూరం. అలాగే ఈ వాస్తవం ఎరిగుండీ ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపీ నాయకులు  కూడా అదేవిధమైన హామీలు ఇస్తూ పోతుండడం మరో విడ్డూరం. అన్నీ తెలిసినవాళ్ళే ఈ విషయంతో రాజకీయ క్రీడ ఆడుతుంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సయితం ప్రత్యేక హోదా సంగతి ప్రస్తావిస్తూ, అన్యాపదేశంగా బీజేపీ,  టీడీపీలకు హెచ్చరికలు చేస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం వీటిని మించిన విడ్డూరం. ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది మరింత విచిత్రమైన పరిస్తితి. ఆయన పాలనలో వున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం అనేది అందరికంటే ఆయనకే ఎక్కువ అవసరం. అందుకే ఆయన అనేకసార్లు హస్తిన ప్రయాణాలు కట్టారు. ఎక్కిన గడప దిగిన గడప చందంగా కలుసుకోవాల్సిన వాళ్ళను కలుసుకున్నారు. శాయంగల విన్నపాలు చేశారు.  కానీ ఫలితం పూజ్యం. కనీసం రాష్ట్రపతి ప్రసంగంలో అన్నా ప్రత్యేక హోదా ప్రస్తావన వుంటుందని అనుకుంటే అదీ నిరాశే అయింది. పార్లమెంటు సమావేశాలముందు ఆనవాయితీగా నిర్వహించే పార్టీ పార్లమెంటు సభ్యుల సమావేశంలో కూడా ఆయన ఈ విషయంలో గట్టి ప్రయత్నం చేయమని కోరినట్టు పత్రికల్లో వచ్చింది. స్వయంగా అధినాయకుడి ప్రయత్నాలకే దిక్కు లేకపోయినప్పుడు పార్టీ ఎంపీలు మాత్రం ఏం చెయ్యగలుగుతారు? మామూలుగా అయితే, ఆత్మ గౌరవం నినాదం కలిగిన తెలుగు దేశం పార్టీకి ఇది చక్కని అదును. కానీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నది మిత్ర పక్షం కావడంతో ఏమీ పాలుపోని స్తితి. మింగలేని కక్కలేని పరిస్తితి. 

       


ఉపశ్రుతి: నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిసి అన్నారో ఏవిటో తెలియదు కాని, సీమాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్  రాజ్యసభలో ప్రకటించారు. ఈ హోదాకింద బుందేల్‌ఖండ్‌కు దక్కిందెంతో తెలుసా? ప్రకటించింది 7,266 కోట్ల రూపాయలయితే,  వాస్తవంగా ఇచ్చింది కేవలం 3,450 కోట్లే. (25-02-2015)
NOTE: Courtesy Image Owner 

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

అమ్మయ్య! హైదరాబాదు మనదీ, మనందరిదీ!


(Published by 'SURYA' telugu daily in it's edit page on 22-02-2015, SUNDAY)

ఎన్నో ఏళ్ళక్రితమే, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్న కుటుంబాలు ఎన్ని వేలున్నాయో, లక్షలు వున్నాయో  ఆ లెక్క తెలియదు కానీ, వాళ్ళల్లో చాలామంది  మొన్న గురువారం రాత్రి గుండెలమీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోయివుంటారని  తేలిగ్గా చెప్పవచ్చు. తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు మంత్రించి ఒదిలిన మాటల మత్తు అలాటిది మరి.
'ఇక్కడ (హైదరాబాదులో) సెట్లర్స్ ఎవ్వరూ లేరు. వున్నవాళ్లందరూ హైదరాబాదీలే!'   
పుష్కరం పైచిలుకు తెలంగాణా ఉద్యమ ప్రస్థానంలో, ఏడుమాసాల టీ.ఆర్.యస్.పరిపాలనాకాలంలో ఇటువంటి  ఉపశమన వాక్యాలు వినడానికి నోచుకోని  హైదరాబాదీ ఆంధ్రులు, 'కలా నిజమా' అని తేల్చుకోలేని స్తితిలో పడిపోయారు. హైదరాబాదులో ఆంధ్రులతో పాటు, తమిళులు, కన్నడిగులు, మళయాళీలు, మరాఠీలు, మార్వాడీలు, రాజస్థానీలు ఇలా వాళ్ళూ వీళ్ళని కాదు సమస్త భారతదేశంలోని సమస్త ప్రాంతాలవాళ్ళు, సమస్త భాషల వాళ్లు, సమస్త సంస్కృతుల వాళ్లు  ఎన్నో ఏళ్లుగా ఈ నగరంలో  నివసిస్తూ 'ఇది మాది' అన్న భావనలోనే వుండిపోయారు.  ఈ మధ్య కాలంలో ఒక్క ఆంధ్రులకు మాత్రమే ఈ భావన దూరం అవుతూ వచ్చింది. 'హైదరాబాదు మాదీ' అని చెప్పుకోలేని పరిస్తితి. 'మేము కూడా హైదరాబాదీ'లమే అని ఒప్పుకోలేని దుస్తితి. 'ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే వుందాం' అంటూ ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నాయకులూ, ప్రత్యేకించి తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులూ ఉద్యమ కాలంలో ఎన్నిసార్లో ఉద్ఘాటించారు. కానీ అవేవీ హైదరాబాదులో నివసిస్తున్న సాధారణ ఆంధ్రులకు ఏమాత్రం ఉపశమనం కలిగించలేకపోయాయి. ఎంతమాత్రం భరోసా కల్పించలేకపోయాయి. తెలంగాణా ఏర్పడి, కేసీఆర్ నేతృత్వంలో కొత్త సర్కారు ఏలుబడి మొదలయి ఇన్ని నెలలు గడిచిపోతున్నా 'సెట్లర్లు' గా ముద్రపడిన ఆంధ్రులు  గుబులుగుబులుగానే  రోజులు గడుపుతున్నారు. అన్నింటికీ మించి హైదరాబాదులో నివసించే మరెవ్వరికీ లేని విధంగా 'సెట్లర్లు' అనే  ముద్రపడడం వారికి పుండు మీద కారం రాసినట్టుగా బాధపడిపోతున్నారు. ఉద్యమ స్పూర్తి కోసం, ఉద్యమ వేడి చల్లారకుండా చూడ్డం కోసం,  ఉద్యమ వ్యతిరేకులయిన బడా ఆంధ్రా బాబుల్ని తేలికపరచి మాట్లాడినట్టుగా,  తెలంగాణాను తమదిగా భావించి జీవనం గడుపుతున్న సాధారణ ఆంధ్రా పౌరులను  అలాగే హీనంగా చూడడం వారిని మరింత క్షోభ పెట్టి వుంటుంది. రాష్ట్రం విడిపోయింది. నిజమే.  కానీ, ఇప్పటివరకు ఏళ్లతరబడి హైదరాబాదులోనే వుంటున్న వారు తమ ఇళ్ళూ వాకిళ్ళూ ఒదులుకుని, ఎప్పుడో విడిచివచ్చిన ప్రాంతాలకు తరలివెళ్లడం అంత  ఆషామాషీ వ్యవహారం కాదు. భారతదేశ విభజన సమయంలోనే అనేకమంది ముస్లిం కుటుంబాలు పాకీస్తాన్ కు వెళ్ళకుండా హైదరాబాదులోనే వుండిపోయిన సందర్భాలను వారు గుర్తుచేస్తున్నారు. అంచేతే, అంతటి ఆందోళనలకు గురవుతూ వున్నందువల్లనే, కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో వాళ్లకు  ప్రాణాలు లేచివచ్చినట్టయింది. 'పరవాలేదు , ఇక మంచి రోజులు వచ్చేశాయ్' అన్న నమ్మకం కలిగింది. స్వయంగా టీ.ఆర్.యస్. అధినేతే  'ఇక్కడ సెట్లర్లు ఎవ్వరూ లేరు, వున్నవాళ్ళందరూ హైదరాబాదీలే' అన్న తరువాత దానికి తిరుగేముంటుంది? అదీ వారి ధీమా.
అయితే ఆయన మాటల్ని తేలిగ్గా తీసుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. 'హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయ్యేదాకా కేసీఆర్ ఇలాగే  మాట్లాడుతాడు, ఆ తరువాత మళ్ళీ షరా మామూలే' అని సన్నాయి నొక్కులు ఇప్పటికే మొదలయ్యాయి. బహుశా అలాటి వాళ్ళను దృష్టిలో పెట్టుకునే  కేసీఆర్ తన ప్రసంగంలో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'అబద్దాలు చెప్పడం తనకు నచ్చదనీ, చెప్పేది నూటికి నూరు శాతం చేసి చూపిస్తామనీ' అన్నారు.    
పత్రికల్లో ప్రచురితం అయిన దానిప్రకారం కేసీఆర్ ప్రసంగం ఇలా సాగిపోయింది.
'నిజాం పాలనకు ముందు నుంచీ ఇక్కడ (హైదరాబాదు) అన్ని ప్రాంతాలవాళ్ళు కలిసి జీవించారు. ఇప్పుడూ అలాగే ముందుకెళదాం. తెలంగాణా రాష్ట్రం మనదనే భావనతో సాగుదాం. మా ప్రభుత్వానికి ప్రాంతీయ బేధం లేదు. మీరు (హైదరాబాదులో వుంటున్న ఆంధ్రులు) సెటిలర్స్ కాదు. మీ తాతలు తండ్రులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, కాబట్టి సెటిలర్స్ అన్న భావన విడిచిపెట్టండి' అంటూ చెప్పుకొచ్చారు కేసీఆర్.
'సెటిలర్స్' అన్న ముద్ర వేసిన వాళ్ళే ఆ భావన విడిచిపెట్టాలని అంటుంటే అనుమానం కలగడం సహజం. ఈ విషయం తెలియనివారు కాదాయన. అందుకే సందేహ నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.
'ఉద్యమ సమయంలో కొన్ని సందర్భాలలో అవసరాన్నిబట్టి తేడాలు వచ్చాయి. ఇప్పుడా అవసరం లేదు. మీ కాలికి ముల్లుగుచ్చుకుంటే నా పంటితో తీస్తా'
ఏవన్నా అరకొర అనుమానాలు వుంటే ఇదిగో ఈ దెబ్బతో పటాపంచలు. మాటలను మంత్రించి ఒదలడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య.   
అయినా మనసు మూలల్లో ఏదో ఒకమూల సందిగ్ధం. అందుకే కాబోలు చివరి బాణం కూడా ఒదిలారు.
'నేను రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిని. అందరికీ రక్షణ కల్పించడం సీఎం గా నా బాధ్యత'.
అంతటితో ఆగితే అయన కేసీఆర్ యెలా అవుతారు?
అందుకే దానికి 'రాజధర్మం' అనే మాటకూడా జత కలిపారు.
అనుమాన నివృత్తి చేసిన విధానం మాత్రం, సీమాంధ్రకు చెందిన ఒక సీనియర్ జర్నలిష్టు అన్నట్టు, నూటికి నూరుపాళ్ళు మార్కులు పడేలావుంది.  
విన్నవాళ్లు కూడా  'అమ్మయ్య, ఇక భయం లేదు' అనుకునే వుంటారు.




కార్పొరేషన్ ఎన్నికల అవసరం అలా  చెప్పించిందో, రాజకీయ చాణక్యం అలా  మాట్లాడించిందో, ఏమైతేనేం, సెట్లర్స్ అనే ఆంధ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపశమన వాక్యాలు సాక్షాత్తూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షడు, తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నోటనే వెలువడడం ఆహ్వానించదగ్గ పరిణామం.
'గతం గతః వెనుకటి రోజులు మరిచిపోదాం' అని చెప్పి, కొద్ది రోజులు కూడా  గడవకముందే దానికి కొనసాగింపుగా కేసీఆర్  చెప్పిన ఈ వూరడింపు మాటలు హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్రులకు అవసరమైన మనోధైర్యాన్ని ఇచ్చేవుండాలి. రాష్ట్ర విభజన జరిగిన తీరు పట్ల ఆంధ్ర ప్రాంతం వాళ్లు ఎంతగా రగిలిపోతున్నారో ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్తితి చూసిన ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యే వుంటుంది. ఈ విషయం అర్ధం చేసుకోగల రాజకీయ పరిపక్వత కేసీఆర్ లో పుష్కలం. రాష్ట్ర విభజన జరిగిపోయి, కోరుకున్న విధంగా పరిపాలనా పగ్గాలు చేతికి వచ్చినప్పుడు చేసే యుద్ధం రాజకీయ పార్టీలతో చేయాలి కానీ, అమాయకులయిన జనాలతో కాదన్న వాస్తవం బోధపడి వుండాలి. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రజలకు చెప్పిన బహిరంగ క్షమాపణ, ఎన్నికల వేళ ప్రత్యర్ధి  నేతల తల రాతల్నే మార్చివేసింది. యేమో! టీ.ఆర్.యస్. అంటే ఏ కోశానా ఇష్టం లేనివాళ్ళు కూడా కేసీఆర్ మాటలతో మనసు మార్చుకుంటారేమో  అనే ఆలోచన కూడా ఈ మార్పుకు దోహదం చేసి వుండొచ్చు. మార్పు కోసం వేస్తున్న అడుగు, చెబుతున్న మాటలు జనం మంచికోసమే అయినప్పుడు అందులో కాదనడానికి ఏముంటుంది? అని సమాధానపడేవాళ్ళు సమాజంలో పుష్కలం. పోనీ,  ఎన్నికలకోసమే ఇలాటి బులిబుచ్చకపు మాటలు చెప్పి, తరువాత  మాట తప్పారే అనుకోండి, ప్రజలదగ్గర అంతకంటే పదునయిన ఆయుధమే 'ఓటు' రూపంలో వుంది.     
నిజానికి కేసీఆర్ చెప్పిన 'సెట్లర్ల' సంగతే మరునాడు పత్రికలకు  ప్రధాన శీర్షిక కావాలి. మీడియాకు ఇదే ముఖ్యమైన చర్చనీయాంశం కావాలి. కానీ మరుసటి రోజు  తెలుగు పత్రికలు ఈ వార్తకు ప్రాధాన్యం ఇచ్చి మొదటి పుటలోనే ప్రచురించినప్పటికీ అసలు ప్రాధన్యాన్ని కాస్తా  మరో సంచలన వార్త తన్నుకుపోయింది. దానికి కూడా కేసీఆరే కేంద్ర బిందువు కావడం కాకతాళీయం కావచ్చు.
తెలంగాణా సచివాలయంలోకి మీడియాకు 'నో ఎంట్రీ' అంటూ పత్రికలు, టీవీలు మొత్తం దృష్టిని అటు మరల్చేలా చేసాయి. నిజానికి అది నిర్ణయం కాదు. ఒక ఆలోచన మాత్రమే. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో వుంటూ అలాటి ఆలోచన కూడా చేయకూడదనే  ఎవరయినా ఆశిస్తారు.
సచివాలయంలోకి మీడియాను అనుమతించని రాష్ట్రాలు లేకపోలేదు. ఉదాహరణకు నిన్నగాక మొన్న ఢిల్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో అపూర్వ విజయం సాధించి మీడియాచేత వేనోళ్ళ కొనియాడబడిన  కేజ్రీవాల్ మహాశయులే అధికార పీఠం ఎక్కగానే చేసిన మొదటి పనుల్లో ఒకటి మీడియా మీద ఆంక్షలు విధించడం. అదేమని ప్రశ్నిస్తే మీడియాకంటే తనను నమ్ముకున్న  ప్రజలే ముఖ్యమని చెప్పడం.
మీడియా చేసుకున్న దురదృష్టం ఏమిటో కానీ ఏ పార్టీ అధికారానికి దూరమైనా వారు దగ్గరకు తీసేది మీడియానే. పోగొట్టుకున్న పూర్వ వైభవాన్ని తిరిగి పొందడం కోసం అనండి, లేదా ప్రజలకు దగ్గర కావడానికి మీడియాను మించిన సాధనం లేదన్న నమ్మకంతో కానివ్వండి ఆ పార్టీలు ముందు చేసే పని మీడియాను మాలిమి చేసుకోవడమే. అవే పార్టీలు  అధికారానికి వచ్చిన మరుక్షణం నుంచీ చేసే మొదటి పని కూడా  మీడియాను ఎడం  పెట్టడమే.  ఈ విషయంలో మినహాయింపు ఇవ్వగల ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదనడం సత్య దూరం కాదు.
ఇక్కడ మరో విషయం కూడా ప్రభుత్వంలో వున్నవాళ్ళు గమనించాలి. సచివాలయానికి వచ్చే జర్నలిష్టులు లేదా విలేకరులు చాలావరకు ప్రభుత్వ కార్యక్రమాలు, పధకాలకే తమ వార్తల ద్వారా ప్రచారం కల్పిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాణీ ఖర్చులేని ప్రచారం. పార్టీ కార్యాలయాల వార్తలు సేకరించే విలేకరులు కేవలం రాజకీయ  మసాలా వున్న వార్తలకోసమే వెతుకుతుంటారు. వాటితో పోలిస్తే సచివాలయం బీటు చూసే పత్రికల వాళ్ళే కొంత నయం అనుకోవాలి.
ఈ విషయంలో ప్రభుత్వం కొంత పునరాలోచనలో పడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాసం సిద్ధం అవుతున్న సమయానికి కేసీఆర్ ప్రెస్ అకాడమీకి వెళ్ళి జర్నలిష్టులతో సంప్రదిస్తారని వార్తలు వస్తున్నాయి. ముందే చెప్పినట్టు, మనిషి మారినా, విధానాలు మార్చుకున్నా అది మంచికోసమే అయినప్పుడు దాన్ని స్వాగతించాలి. (20-02-2015)

జర్నలిష్టులకు నో ఎంట్రీ


సచివాలయం - కొన్ని జ్ఞాపకాలు  
1975 నవంబర్ లో నేను హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా చేరిన నాటి నుంచి కొన్ని దశాబ్దాలపాటు ఒకటే దినచర్య. నేను వుంటున్న చిక్కడపల్లి నుంచి బయలుదేరి రెండు బస్సులు మారి రేడియో స్టేషన్ కు రెండు  స్టాపుల ముందే, సరోవర్ హోటల్ దగ్గర  దిగిపోయేవాడిని. నేను పనిచేసేది రేడియో స్టేషన్ అయినా నా కార్యస్థానం మాత్రం సచివాలయమే. ఆరోజుల్లో సెక్రెటేరియట్ ప్రధాన ద్వారం, రాజసం ఒలకబోసే ఇనుపకమ్మీలతో ప్రస్తుతం ఫ్లై ఓవర్ మొదలయ్యే ప్రధాన రహదారిలో వుండేది. దాని ఎదురుగా ఆంధ్ర జ్యోతి సిటీ బ్యూరో ఆఫీసు. ఆదిరాజు వేంకటేశ్వర రావు గారు దానికి విలేకరి. ఆంధ్ర జ్యోతి పత్రిక మాత్రం బెజవాడలో అచ్చయ్యేది. ఆయన ఇక్కడనుంచే టెలిప్రింటర్  లో వార్తలు పంపేవాడు. నేను రేడియోలో చేరకముందు ఒకసారి ఆయనతో కలిసి సచివాలయానికి వెళ్లాను. అంతకుముందు ఎప్పుడూ అందులో అడుగు పెట్టిన అనుభవం లేదు. ఆదిరాజు పేరులోనే కాకుండా వేషభాషల్లో  కూడా. ఫుల్ సూటు. నెక్ టై. చేతిలో బ్రీఫ్ కేసు. ఢిల్లీలో ఎక్కువకాలం వుండడం వల్ల అలవడ్డ అలవాట్లు కాబోలు. సచివాలయం గేటు దగ్గర కాపలా మనిషి ఆదిరాజుని చూడగానే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. అయన వెంట వస్తున్న నన్ను చూసి  కనీసం ఎవరని కూడా అడగలేదు. సిగరెట్ వెలుగుతున్న చేయిని విలాసంగా వూపుతూ ఆదిరాజు లోపలకు వెళ్లాడు. ఆయనతో పాటే నేనూ. ఆ తరువాత రేడియో విలేకరిగా నాకు సచివాలయం మొదటి కార్యస్థానంగా మారిపోయింది. ప్రతి రోజూ ముందు హాజరు అక్కడే. ఆ తరువాతే రేడియో. ఎందుకంటే రేడియో వార్తలకి  అవసరం అయ్యే అధికారిక సమాచారం యావత్తూ అక్కడే దొరికేది. కాలక్రమంలో  గేటు మనిషి నుంచి ముఖ్యమంత్రివరకు అందరితో ముఖపరిచయాలు. ఎక్కడికయినా గేటు (తలుపు) తోసుకుని వెళ్ళగల చనువూ, వెసులుబాటు, వీటికి తోడు రేడియో విలేకరి  అన్న ట్యాగు లైను.
గతంలో ముఖ్యమంత్రుల కార్యాలయం  వున్న పాత (హెరిటేజ్) భవనం వెనుకపక్కనే ప్రెస్ రూమ్. విశాలంగా వుండేది. ఒకటి రెండు సోఫాలు, కుర్చీలు. పక్కనే భోషాణం మాదిరి చిన్న చెక్క బీరువా. అందులో ఫోను. ఈ ఫోను కోసమే చాలామంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే అది డైరెక్ట్ ఫోను. సచివాలయం టెలిఫోన్ ఆపరేటర్ తో సంబంధం లేకుండా నేరుగా ఫోను చేసి మాట్లాడుకోవచ్చు. ఆరోజుల్లో చాలామంది సీనియర్ జర్నలిష్టులకు సయితం ఇళ్ళల్లో ఫోన్లు వుండేవి కావు. ఒకరిద్దరికి వున్నా ఆఫీసు బిల్లు కట్టే పద్దతి వుండేది కాదు. అంచేత వార్తా సేకరణకోసం ప్రెస్ రూమ్ ఫోను బాగా పనికి వచ్చేది. పేపర్లవాళ్ల కంటే నాకు బాగా ఉపయోగంగా వుండేది. వాళ్లు వార్త సుదీర్ఘంగా రాయాలి కనుక ఆఫీసులకి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. రేడియోకి మూడు ముక్కలాటే కనుక వార్తల టైముకు ముందుగా ఫోను చేసి చెప్పేవాడిని. ప్రెస్ రూములో రేడియో కూడా వుండేది. ఫోనులో చెప్పిన వార్త అప్పటికప్పుడే రేడియోలో రావడం కొంతమందికి ఆశ్చర్యంగా వుండేది.
ప్రెస్ రూములో   టీ, కాఫీలు తెచ్చి పెట్టడానికి ఒక అటెండరు. డెక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ సింహం (నరసింహారావు) ఒక సోఫాలో నిద్రపోతూ వుండేవారు. కానీ ఆయనది కాకి నిద్ర. చటుక్కున లేచి కూర్చునే వారు. ప్రెస్ మీట్ లో అవతలవాడు మంత్రికానీ, ముఖ్యమంత్రి కానీ ప్రశ్నలతో సింహం మాదిరిగానే విరుచుకు పడేవాడు. ఈనాడు శాస్త్రి గారు, ఆంధ్ర పత్రిక (ముక్కు) శర్మ గారు, హిందూ రాజేంద్రప్రసాద్   పీ.యస్. సుందరం (ముందు ఆంధ్ర పత్రిక విలేకరి, తరువాత ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్), శ్రీకాంత్ విఠల్, యూఎన్ఐ పార్ధసారధి, పీటీఐ జమాల్, యెన్ ఎస్ ఎస్ లక్ష్మారెడ్డి, కల్యాణి, ఆంధ్ర జ్యోతి వెంకట రావు గారు, ఎన్.ఇన్నయ్య, దామోదరస్వామి, ఉడయవర్లు, ఆంధ్ర ప్రభ నంద్యాల గోపాల్, ఇలా ఎంతో మంది జర్నలిష్టులతో పరిచయాలు బలపడడానికి ప్రెస్ రూమ్ దోహదం చేసింది. జమాల్, కల్యాణి, లక్ష్మారెడ్డి ఎప్పుడూ కలిసి తిరుగుతుండే వారు.  వారి పేర్లలో మొదటి అక్షరాలతో వారిని 'జాకాల్' అని ముద్దు పేరు పెట్టి పిలిచేవాళ్ళు. వీళ్ళల్లో నలుగురయిదుగురు మినహా మిగిలిన వాళ్ళు కాలం చేశారు. చాలా కాలం అయింది కాబట్టి కాస్త మతిమరపు సహజం. ఎవరి పేర్లు అయినా మరచిపోతే క్షంతవ్యుణ్ణి.
అంతా ఒక కుటుంబం మాదిరిగా మధ్యాహ్నం దాకా సచివాలయంలో గడిపి, వార్తలు సేకరించుకుని, తోటి వారితో పంచుకుని, అనుమానాలు వుంటే తీర్చుకుని ఎవరి ఆఫీసులకు వాళ్ళం వెళ్ళేవాళ్ళం. ఈరోజు చాలామంది అడుగుతుంటారు, 'మీరు యెందుకు మార్నింగ్ వాక్ చేయరు' అని. ఎందుకంటే ఒక జీవితానికి సరిపడా నడక  ఆ రోజుల్లో సచివాలయంలోనే  నడిచాను కనుక.  ఒక బ్లాకు నుంచి మరో బ్లాకుకు, ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి, ఎక్కే మెట్లు, దిగే మెట్లు, నడకే, నడక, పరుగే  పరుగు.
ఇప్పుడా ప్రెస్ రూమే లేదు. మేము నడయాడిన పాత భవనాలు లేవు, ఈరోజు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం తెలంగాణా సచివాలయంలోకి ప్రవేశించడానికి 'జర్నలిష్టులకు నో ఎంట్రీ' అంటున్నారు (ట). సచివాలయంతో మూడు దశాబ్దాల పైచిలుకు అనుబంధం పదేళ్ళ క్రితం పదవీ విరమణ చేసినప్పుడే తెగిపోయింది. జీతభత్యాల విషయంలో ఈనాటి జర్నలిష్టులకు సాటి రాకున్నా, పోలిక లేకున్నా  ఆ రోజుల్లో జర్నలిష్టులుగా పొందిన గౌరవాభిమానాలు మాత్రం వెలకట్టలేనివి. అవే మరపురాని, మరవలేని జ్ఞాపకాలుగా మిగిలాయి. 



ఇక నో ఎంట్రీ సంగతి అంటారా?
రవి కాంచని చోట కవి కాంచును అన్నారు అందుకే. జర్నలిష్టులకు కాస్త పనిభారం పెరుగుతుంది.                  

 (వచ్చే ఆదివారం సూర్య పత్రికకి వ్యాసం రాయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్న సమయంలో విన్నకోట నరసింహారావు ఈ అంశంపై బ్లాగులో రాయమని సూచించారు. ఈ నాలుగు ముక్కలు అయన చలవే - భండారు శ్రీనివాసరావు) 

18, ఫిబ్రవరి 2015, బుధవారం

హననం కాదు కావాల్సింది సహనం

(Published in 'SURYA' telugu daily on Thursday, 19-02-2015)

కాకతాళీయం అనండి యాదృచ్చికం అనండి ఇంకేదయినా అనండి పరస్పర విరుద్ధం, పరస్పర సంబంధం వున్న వార్తలు నిన్న బుధవారం వార్తాపత్రికల్లో దర్శనం ఇచ్చాయి.
అందులో ఒకటి ఢిల్లీలో క్రైస్తవ మతాధికారుల కార్యక్రమానికి హాజరయిన సందర్భంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం.
ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాటి సందర్భాలలో  ఏవిధంగా మాట్లాడుతారో అదే విధంగా అది  సాగిపోయింది, కాకపోతే మోడీ తరహా కొన్ని చమత్కారాలతో (సబ్ కా సాత్ ...సబ్ కా వికాస్).
ప్రధాని ప్రసంగం సాగిన తీరు పత్రికల్లో ఇలా వచ్చింది.
'మతపరమైన హింసపై కఠినంగా వ్యవహరిస్తాము. మత విద్వేషం ప్రేరేపించేవారు ఎవరయినా సరే సహించేది లేదు. ఈ దేశంలో ఎవరయినా తమకు నచ్చిన మత విశ్వాసాలను పాటించేందుకు పూర్తి స్వేచ్చ వుంది. ఈ విషయంలో ఎలాటి వొత్తిళ్లు పనిచేయవు. మెజారిటీ వర్గం అయినా, మైనారిటీ వర్గం అయినా బాహాటంగా కాని, చాటుమాటుగా కాని అన్య మతానికి వ్యతిరేకంగా విద్వేషానికి పాల్పడినా, కుట్రలు చేసినా సహించేది లేదు. అలాటి చర్యలను ఉక్కు పాదంతో అణచి వేస్తాము'
మన దేశానికి చెందిన కురియా కోస్  అలియాస్ చవర, మదర్ యాప్రేసియాలకు సెయింట్ హుడ్ ప్రకటించిన సందర్భంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం కాబట్టి దానికి అనుగుణంగానే ప్రధాని ప్రసంగించారు. ఇటీవల ఢిల్లీలో క్రైస్తవులకు చెందిన చర్చీల మీద జరిగిన దాడుల నేపధ్యం దృష్టిలో వుంచుకుంటే,  ప్రధాని వ్యక్తపరచిన ఈ అభిప్రాయాలకు ప్రాముఖ్యం వుంటుంది. ఈ విషయంలో ఆయన మొదటిసారి పెదవి విప్పారని అనుకోవాలి. మోడీ భారతీయ జనతా పార్టీకి నాయకుడు అయినప్పటికీ, మొత్తం దేశానికీ అయన ప్రధాన మంత్రి. అంచేత అటువంటి సమావేశాల్లో వేరే విధంగా మాట్లాడే అవకాశం లేదు. మత ఘర్షణలు జరక్కుండా చూడడానికి, మతం పేరుతొ ఉగ్రవాదులు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందనీ, అటువంటి అనాగరిక చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామనీ ప్రతి ప్రధానమంత్రి నొక్కివక్కాణించడం  ఒకరకంగా పరిపాటిగా మారిపోయింది. సరే. అదలా వుంచితే, లౌకిక రాజ్యంగ  వ్యవస్థను ఎంచుకున్న భారత దేశాన్ని పాలించేవారికి దేశంలోని మైనారిటీ ప్రజల్లో అభద్రతా భావాన్ని దూరం చేయడం కూడా ఒక కర్తవ్యమే. ఆవిధంగా ప్రధాన మంత్రి మోడీ మాటలవల్ల అలాటి ఫలితాలు వస్తే అంతకంటే కావాల్సింది లేదు.
కానీ అదే రోజు పత్రికల్లో మరో వార్త వచ్చింది. అదే ఈ వ్యాసానికి ప్రేరణ.
'భారత దేశాన్ని హిందూ దేశం చేస్తారా' అంటూ సున్నీ ఉలేమా కౌన్సిల్, ఆర్.యస్,యస్. మైనారిటీ వ్యవహారాల ఇంచార్జ్  ఇంద్రేష్ జీ ని   నిలదీసినట్టు ఆ వార్త సారాంశం.
కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి హాజీ మహమ్మద్ నేతృత్వంలో కొంత మంది మత పెద్దలు ఇంద్రేష్ జీని కలుసుకున్నారు. ఈ సమావేశంలో మైనారిటీలలో పెరుగుతున్న అభద్రతాభావాన్ని గురించి తెలియచేశారు.
'మా దేశ భక్తిని  నిరూపించుకోవాలంటే ఏం చెయ్యాలి? వందేమాతరం గీతాన్ని ఆలపించాలా? ఇది మా దేశం  అనుకుంటున్నాము.  గాంధీని మా నాయకుడిగా భావిస్తున్నాము' అని ఈ సమావేశంలో తెలియచెప్పినట్టు ఆ తరువాత హాజీ మహమ్మద్ విలేకరులతో చెప్పారు.
'1947 లో దేశ విభజన సమయంలో మా పూర్వీకులు జిన్నా వాదనతో, పాకీస్తాన్ వైఖరితో  ఏకీభవించకుండా ఈ దేశంలోనే  వుండిపోయారు. భారత రాజ్యాంగంపై  విశ్వాసం వుంచారు. ఇలా భారత్ నే నమ్ముకునివున్న  మావంటి ముస్లిం ల నుంచి ఆర్.యస్.యస్.  ఏమి ఆశిస్తోంద'ని  ఆయన ప్రశ్నించారు.
ఎం.ఐ.ఎం. నాయకుడు అసదుద్డీన్ ఒవైసీ వ్యాఖ్యలపట్ల యెలా స్పందిస్తారని ఇంద్రేష్ తమని ఎదురు ప్రశ్నించినట్టు చెబుతూ, 'సాధ్వీ నిరంజన్ జ్యోతి, సాక్షి మహారాజ్ ఎలాగో ఒవైసీ కూడా అంతే. ఒక ఎంపీ మాత్రమే' అని హాజీ మహమ్మద్ బదులిచ్చారు.   
ఇంతవరకు బాగానే వుంది, ఓ పక్క తాము భారతీయులమని చెబుతూనే, ఆర్.ఆర్.యస్. రూపం ఇచ్చిన భరతమాత చిత్ర పఠానికి నమస్కరించడం తమకు సుతరామూ మనస్కరించదని తేల్చి చెప్పారు. అలా చేయడం ఇస్లాం కు విరుద్ధం అన్నారు.
మన దేశం సంగతి ఇలా వుంటే అటు అమెరికాలో హిందూ దేవాలయం గోడలమీద విద్వేషం రెచ్చగొట్టే నినాదాలు కానరావడం మరో వివాదాంశం అయింది. అక్కడి హిందూ సంఘాలు ఈ సంఘటనపై మండిపడుతున్నట్టు వార్తలు వచ్చాయి.


కాగా, గత ఆదివారం మరో భయంకరమైన ఉగ్రవాద చర్య చోటు చేసుకుంది. దాదాపు ఓ డజను మంది ఈజిప్షియన్ క్రిష్టియన్లను, ముస్లిం ఉగ్రవాద సంస్థ - ఐ.యస్.ఐ.యస్. కు చెందిన వారు,  సముద్ర తీరంలో బహిరంగంగా తలలు నరికి మట్టుబెట్టారు. ఆ దృశ్యాలను  యూ ట్యూబ్ లో పెట్టారు. ఇవి  చూసిన వారికి 'మనం నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నామా లేక పాత  రాతి యుగంలోనే వుండిపోయామా' అనే సందేహాలు తలెత్తుతున్నాయి.     
ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.
కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.

మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుంది అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం. ఇప్పుడు మానవాళికి కావాల్సింది మానవ  హననం కాదు, కాసింత సహనం.
'సహనావవతు' అనేది వేద కాలం నుంచి వినవస్తున్న హితోక్తి.

(18-02-2015)
NOTE: Courtesy Image Owner 

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

చంద్రునికో నూలుపోగు


Published by 'Namaste Telangana' Telugu Daily on 17th Feb.2015, Tuesday.
(ఫిబ్రవరి 17 -  తెలంగాణా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు)


'కేసీఆర్' అనే ఒక బక్కపలచటి రాజకీయ నాయకుడి గురించి చాలా బాగా తెలుసు అని అనుకునేవాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఇలాటి వారికి కూడా ఆయన గురించి పూర్తిగా తెలుసు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కేసీఆర్ అర్ధం అయినట్టు అనిపించే అర్ధం కాని మనిషి. అలా అనిచెప్పి,  ఆయన పైకి ఒక రకంగా లోపల మరో రకంగా వ్యవహరించే వ్యక్తి అని అర్ధం కాదు.   
నవజాత  తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన తొలినాళ్ళలోనే కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి చెందిన అధికారుల సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం - ఆయన్ని దగ్గరగా ఎరిగిన అనేకమందిలో కూడా, ఈయన మనకు తెలిసిన చంద్రశేఖర రావుగారేనా  అన్న అభిప్రాయం కలిగించింది.   
ఆ రోజు, ఆ సమయంలో కరెంటు వుండడం వల్ల నేను కేసీఆర్  ప్రసంగాన్ని ఆసాంతం టీవీ తెరపై ఇంట్లో కూర్చుని  చూడగలిగాను. 'మాటల మాంత్రికుడ'ని, 'మాటలతో ఎదుటి వారిని బురిడీ కొట్టిస్తార'ని ఆయన గురించి అనుకోవడం కద్దు.  అయితే ఆ రోజు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో  నవ తెలంగాణా లక్ష్యాలు వివరిస్తూ, తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన  ప్రసంగానికి శ్రోతలుగా వున్నది అంత ఆషామాషీ వ్యక్తులు కాదు. మొత్తం తెలంగాణా అధికారయంత్రాంగం ఆయన మాటల్ని ఆలకించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
బహుశా వారిలో చాలామందికి తాము ఎరిగివున్న కేసీఆర్ కు బదులు కొత్త కేసీఆర్ కనబడివుంటాడని టీవీలో ఆయన ప్రసంగాని చూస్తూ, వింటున్న నాకు అనిపించింది. 'నవ తెలంగాణా యెలా వుండాలి' అనే దానిపై ఆయన అభిప్రాయాలు యెలా వుంటాయన్న దానిపై అప్పటికే  నాకు అవగాహన వుంది. ఎందుకంటే నిరుటి అసెంబ్లీ ఎన్నికలకు చాలా పూర్వమే తెలంగాణా జర్నలిస్టులు ఏర్పాటుచేసిన ఒక సమావేశంలో ఆయన చేసిన అంతరంగ ఆవిష్కరణకు నేనూ ఒక  ప్రత్యక్ష శ్రోతను. అంచేత ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను. చెప్పదలచుకున్న అంశాలను సంగ్రహంగా, సూటిగా, అరటి పండు వొలిచి చేతిలో పెట్టిన చందంగా చెప్పగలిగే చతురత కేసీఆర్  కు వున్నట్టు వర్తమాన రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఎవరికీ వున్నట్టు లేదు. 'తెలంగాణా సమస్యలపట్ల తనకు అవగాహన హెచ్చు' అని చెప్పుకుంటూనే, కొన్ని కొన్ని గణాంకాల ప్రస్తావన  వచ్చినప్పుడు ఎలాటి భేషజాలకు పోకుండా పక్కనే కూర్చున్న సేద్యపు నీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు గారిని అడిగి తెలుసుకుని సరిదిద్దుకున్న విధానం గమనించినప్పుడు ఆయనలోని నిజాయితీ అధికారులకు తెలిసివచ్చి వుండాలి. 'కింది అధికారులతో, సిబ్బందితో తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీష్ లో అడిగి బెదరగొట్టకండి' అంటూ జిల్లా కలెక్టర్లకు సూచనలు చేసిన పద్దతి కూడా బాగుంది. 'అందర్నీ కలుపుకు పోవడం ద్వారా మాత్రమే కన్న కలలు నిజం చేసుకోగలుగుతామ'ని ఓ పక్క సుతిమెత్తగా చెబుతూనే, 'ప్రతి విషయంలో ఆలోచన, ఆచరణ రెండూ కూడా కేవలం తెలంగాణాను దృష్టిలో పెట్టుకుని సాగాల'ని అధికారులకు దిశానిర్దేశం చేసిన తీరు పరికించినప్పుడు రానున్న రోజుల్లో ఆయన అనుసరించబోయే ఎత్తుగడలు యెంత కఠినంగా వుండబోతున్నాయో కూడా అవగతమైంది.
సరే. అవి  అధికారంలోకి వచ్చిన మొదటి రోజులు. చూస్తూ వుండగానే ఎనిమిదిన్నర పైచిలుకు మాసాలు గడిచిపోయాయి. అయినా ఆయన మాట తీరు కానీ, నడక తీరు కానీ లవలేశం కూడా మారలేదు.   కేసీఆర్ కి కలిసివచ్చిందీ, రానిదీ కూడా ఆయనలోని ఈ విలక్షణ లక్షణమే.  
కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తొలినాళ్ళనుంచే టీ.ఆర్.యస్.  ప్రత్యర్ధులు, ప్రత్యేకించి తెలంగాణా టీడీపీ  నాయకులు తమ విమర్శలకు పదును పెడుతూ వచ్చారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నకొన్ని నిర్ణయాలు చర్చనీయాంశాలుగా మారడం వారికి కలిసివచ్చింది. కాంట్రాక్ట్  ఉద్యోగుల సర్వీసులను  ఖాయం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణా విద్యార్దులలోనే అలజడులు రేపింది. అలాగే, రెండు ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేస్తూ తెలంగాణా కేబులు టీవీ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం కావాలని ఉదాసీన  వైఖరి అవలంబిస్తోందని కొన్ని జర్నలిష్టు సంఘాలు చేస్తున్న విమర్శలు జాతీయ స్థాయిలో  కూడా ప్రకంపనలకు దారితీయడం  కొత్త ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగిస్తున్న  విషయమే. ఇక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన ఇంటింటి  సర్వే కూడా  ప్రతికూల పవనాలను సృష్టించింది. కాకపొతే ఈ సర్వే వల్ల సర్వత్రా కొంత ప్రతికూలత కనబడ్డప్పటికీ,  పరిపాలన విషయంలో సర్కారు తీసుకునే నిర్ణయాలపట్ల సామాన్య జనాలకున్న భయం భక్తీ  తేటతెల్లం అయ్యాయి. ఈ సర్వేతో  సాధించింది ఏవిటన్నది ఇప్పటికీ ప్రశ్నగానే వుంది. కానీ, రాజకీయ ప్రత్యర్దులపై బాణాలు ఎక్కుపెట్టడానికి కేసీఆర్ ఎంతమాత్రం వెనుకాడరన్న అభిప్రాయం కలిగించడంలో ఆయన కృతకృత్యులు అయ్యారనే  చెప్పొచ్చు. కాకపోతే,  ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేకానేక అసాధ్య వాగ్దానాలు నెరవేర్చే విషయంలో కొత్త ప్రభుత్వం వేస్తున్న కప్పదాట్లు ముందు ముందు గుదిబండగా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా  వ్యక్తం అవుతున్నాయి.
ఎమ్సెట్ పరీక్ష, 1956 నిబంధన, అయ్యప్ప సొసైటీలో ఇళ్ళ కూల్చివేతలు, కృష్ణా జలాల వివాదం, సచివాలయం తరపింపు నిర్ణయం   ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వివాదాస్పద అంశాలు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న నీలాపనిందలు.           
అయితే, పుష్కర కాలానికి పైగా తెలంగాణా ఉద్యమాన్ని వేడి తగ్గకుండా నిభాయించుకుంటూ వచ్చిన చంద్రశేఖరరావుగారికి ఇలాటి విమర్శలను ఖాతరు చేయకపోవడం కొత్తేమీ కాదు. వీటిని ఆయన తన సహజసిద్ధ ధోరణిలోనే కొట్టిపారవేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. టీ.ఆర్.యస్.  అనే దీపానికి  తెలంగాణావాదం  'చమురు' లాటిది. ఈ విషయం కేసీఆర్ కి పూర్తిగా తెలుసు. తెలంగాణా రావడంతోనే తెలంగాణా వాదానికి విలువ లేకుండా పోయిందనే వాదాన్ని ఆయన విశ్వసించరు. ఆ వాదం కొడిగట్టిపోకుండా  చూసుకోవడం యెంత అవసరమో ఆ ఉద్యమ నాయకుడిగా ఆయనకు మంచి అవగాహన  వుంది.  అందుకే ఆయన చేసే ప్రతి ఆలోచనలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో, మాట్లాడే ప్రతి మాటలో  అది నిరంతరంగా  రగులుతూనే ఉండేట్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ నిర్ణయమైనా, ఏ పధకం అయినా దాని వెనుక 'తెలంగాణా స్పూర్తి' ఉండేలా చూసుకోవడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య,   
ఆయన తరచుగా మాట్లాడే మాటలను బట్టి ఒక విషయం నిర్ధారణగా అర్ధం అవుతోంది. తెలంగాణా ఏర్పాటు అన్న కల సాకారమైన తరువాత, ఆ కొత్త తెలంగాణాను ఏ రూపంలో ఆవిష్కరించుకోవాలి అనేదానిపై ఒక నిర్దిష్టమైన అవగాహనకు ఆయన వచ్చినట్టు కనబడుతోంది. 'బంగారు తెలంగాణా' అని పదే పదే చెప్పడంలో కొంత రాజకీయ వ్యూహం, ప్రయోజనం ఉన్నప్పటికీ, కొత్త విధానాలు, కొత్త వ్యవస్థతోనే  తెలంగాణా భవిష్యత్ చిత్రపఠం తయారుచేయాలన్న తాపత్రయంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. పాత పద్దతులను అనుసరిస్తూపొతే,  తాను  అనుకున్న అడుగులు అనుకున్నట్టు వేయలేనన్న ఉద్దేశ్యంతోనే, కొంత  ఆలస్యం అయినా కొత్త బాట పట్టడానికే ఆయన కృతనిశ్చయంతో వున్నట్టు ఆయన చేతలు తెలుపుతున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా తోసిరాజని ఇంటింటి సర్వే నిర్వహించిన తీరు ఇందుకు అద్దం పడుతోంది. కొంత మొండిగా అనిపించినా ఈ ఆలోచనల్లో హేతుబద్ధత లేకపోలేదు. సవాలక్ష  సమస్యల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త ఇల్లు సదురుకోవడం ఒక ఎత్తయితే, పాత కాపురం కొనసాగింపుగా మిగిలిన సమస్యలు మరికొన్ని. ఈ నేపధ్య కోణం నుంచి చూస్తే, 'కేసీఆర్ తరచుగా మాట మారుస్తారు, ఒకసారి చెప్పినదానికీ, మరోసారి అన్నదానికీ పొంతన వుండదు,  అది అయన అసలు నైజం' అనే వారూ వున్నారు. అయన ఏది చేసినా అది బంగారు తెలంగాణా కల నెరవేర్చుకోవడం కోసమే అని మనః స్పూర్తిగా నమ్మేవారు కూడా అధిక సంఖ్యలోనే వున్నారు.  రాజకీయంగా అస్థిర పరిస్తితులు లేకున్నా, పొంచి వున్న రాజకీయ ప్రత్యర్ధుల ఎత్తుగడల నడుమ,  అత్తెసరు మెజారిటీ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం కత్తి మీద సాము అన్న ఎరుక కలిగిన రాజకీయ దురంధరుడు కేసీఆర్. ముందు ముందు ఎలాటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందు చూపుతో, నైతికం అనైతికం  అన్న వాదనలను లెక్కపెట్టకుండా, అన్ని పార్టీలనుంచి స్థానికంగా బలంగా వుండే రాజకీయ నాయకులను టీ.ఆర్.యస్. లోకి రప్పించే అంశానికే ఆయన పెద్దపీట వేసినట్టు కనబడుతుంది. ఇతర పార్టీలకు చెందిన  అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు  టీ.ఆర్.యస్. తీర్ధం పుచ్చుకునేలా చేయడమే ఇందుకు ఉదాహరణ. అధికారంలో లేకపోతే   ప్రజాసేవ చేయడం కష్టం అనే అభిప్రాయం పెంచుకుంటున్న రాజకీయ నాయకుల సంఖ్య అన్ని పార్టీల్లో పెరుగుతున్నప్పుడు 'ఆకర్ష్' పధకం అమలుచేయడానికి పెద్ద కష్టపడనక్కరలేదన్న విషయం ఆకళింపు చేసుకున్న రాజకీయవేత్త  కేసీఆర్. అందుకే, అధికార పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లోనే ఈ జంప్ జిలానీల సంఖ్య ఈ విధంగా పెరుగుతోంది. తమ పార్టీని బలపరచుకోవడం అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది. అయితే అవతల పార్టీలను బలహీన పరచడం  ద్వారా తాము బలపడే కొత్త రాజకీయ సంస్కృతి ఇటీవలి కాలంలో అన్ని పార్టీల్లో బలంగా వేళ్ళూనుకుంటోంది. 'కాంగ్రెస్ రహిత భారతం' అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన నినాదంలో దాగున్న నిజం ఇదే. కాబట్టి, అందరూ చేస్తున్నది అదే అయినప్పుడు, 'పదుగురాడుమాట పాడియై ధరజెల్లు'  అన్న వేమన  సూక్తికి తగ్గట్టే ఈ పార్టీ మార్పిళ్లు అన్ని పార్టీల్లోనూ నిస్సిగ్గుగా జరిగిపోతున్నాయి.
ఇన్ని నెలల పరిపాలనలో ఒక ముఖ్యమంత్రిగా సాధించింది ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన చెబుతూ వస్తోంది ఒక్కటే. ఏమి చేశామన్నది కాదు ఏమి చేయాలి అన్నదానిపై ఆయన నిత్యం కసరత్తు చేస్తూ వస్తున్నారు. చేయాల్సినవి ఇంకా చాలా వున్నాయంటున్నారు. అందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయంటున్నారు. పిండిని బట్టి రొట్టె కాకుండా,  ఎన్ని రొట్టెలు అవసరమో ముందు  లెక్క తేల్చుకుని ఆ తరువాత యెంత పిండిని  సమీకరించుకోవాలో లెక్కవేసుకుంటామని కూడా అంటున్నారు. ఆయన ఆలోచనలు కొన్ని అబ్బురపరిచేవిగా వుంటాయి.  మరొకొన్ని 'ఇవన్నీ అయ్యే పనేనా' అన్న సందేహాలను రేకెత్తిస్తాయి.
సరే! కేసీఆర్ ను, ఆయన నడిపే తెలంగాణా  సర్కారును ఆ పనిలో ఉండనివ్వండి. కానీ,  ఈ లెక్కలు డొక్కలు తేల్చుకునే క్రమంలో, పాలన కుదురుకోలేదనే నెపంతో  రోజులు వెళ్ళదీసే ఆలోచన చేయకూడదనే అందరూ కోరుకునేది.

కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కొంత వ్యవధానం ఇవ్వడం  అవసరం.  కానీ విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా చూసుకోవడం  ప్రభుత్వానికి కూడా  అంతే అవసరం.  
తెలంగాణా ముఖ్యమంత్రిగా తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్న కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. తెలంగాణా రాష్ట్రం తొలి పుట్టిన రోజుకల్లా ఆయన తన కలల్లో కొన్నింటినయినా సాకారం చేయాలనీ, చేయగలగాలని కోరుకుందాం!

(15-02-2015)  

16, ఫిబ్రవరి 2015, సోమవారం

ఈ పాడు మొగుళ్లని యెందుకు ప్రేమించాలంటే.....


పనీపాటా బొత్తిగా లేని ఏకాంబరం ఓ రోజు భార్య పీతాంబరాన్ని పక్కన  కూర్చోబెట్టుకుని 'భర్త గీత' బోధించడం మొదలెట్టాడు.
'ఈ విశాల విశ్వంలో నువ్వు ప్రేమించదగ్గ మనిషి నీ భర్త ఒక్కడే. అంటే ఎవరో అనుకునేవు. అది నేనే! యెలా అంటావా? ఇలా!
'నువ్వు వూపిరి తిరగని పనితో  సతమతం అయ్యేటప్పుడు, ఓ కప్పు కాఫీ కలిపి పట్రా అన్నాననుకో. ఎందుకనుకున్నావు. నీకు ఇబ్బంది అని తెలియక కాదు. ఆఫీసులో అలసిసొలసి ఇంటికొచ్చిన నాకు, నువ్విచ్చిన కాఫీ తాగగానే ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇక  అప్పుడు ఎంచక్కా నువ్వు ఇరుగింటి, పొరుగింటి అమ్మలక్కల  కబుర్లన్నీ ఏకబిగిన ఏకరువు పెట్టినా నాకేమీ అనిపించదు కనుక.
'నీతో కలిసి బజార్లో వెడుతున్నప్పుడు పక్కనుంచి ఓ అందమైన అమ్మాయి వెడుతుంటే నా  చూపులు ఆటోమేటిగ్గా అటే తిరిగిపోతాయి. ఏం చెయ్యను చెప్పు మగాడ్ని కదా! దాన్ని చూసి నువ్వు కంగారు పడిపోతుంటావు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే,  అలా బయట ఆడవాళ్ళను కొరుక్కుతినేలా చూస్తుంటానని నువ్వు నన్ను అస్తమానం కొరుక్కుతింటూ, ఆ నడిబజారులోనే ఉతికి ఆరేయాలని చూస్తావు.  కానీ నీకు తెలియంది ఒకటుంది. నీ అందం ముందు ఎవ్వరి అందాలయినా దిగదుడుపే. ఆ విషయం  ఒకటికి రెండు సార్లు  నిర్ధారించుకునేందుకే ఆడవాళ్లకేసి అలా చూస్తుంటాను.  పిచ్చి మొహానివి. నీకు అర్ధం అయి చావదు.
'నీ చేతివంట చెత్త అని అప్పుడప్పుడు అంటుంటాను. నిన్ను తప్పు పట్టాలని కాదు. నా రుచిపచుల్లో ఏవన్నా తేడాపాళాలు వస్తున్నాయేమో తెలుసుకోవాలని మాత్రమే అలా వంకలు పెడుతుంటాను.
'నిజమే. రాత్రి పూట నేను పెట్టే గురక కర్ణ కఠోరంగా వుంటుందని నాకూ తెలుసు. నేను అంత హాయిగా గురకపెట్టి నిద్ర పోతున్నానూ అంటే ఏమిటి అర్ధం.  నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా నేను యెంత ప్రశాంతంగా వున్నానో నీకు అర్ధం కావాలనే.
'మొన్న నీ పుట్టిన రోజు మరచిపోయిన మాటా నిజమే. చిన్న కానుక కూడా కొనుక్కురాని మాటా నిజమే. ఇల్లెగిరిపోయేటట్టు నానా యాగీ చేసావు కానీ నీకు తెలియని విషయం చెబుతా విను. గిఫ్టుల మీద తగలేసే డబ్బు నేనేమన్నా కట్టుకుపోతానా చెప్పు. ఏది మిగిలినా అది నేను తాళి కట్టి కట్టుకున్న నీకే కదా!
'నేను చెప్పే ఈ భర్తగీత  నీకు ఏమాత్రం నచ్చలేదన్న సంగతి నీ చేతిలో వున్న అప్పడాల కర్రే చెబుతోంది. ఇక ఆఖరుగా ఒక మాట చెబుతా. వినేసి, అప్పడాలకర్ర కింద పడేస్తావో, కింద వున్న కత్తిపీట చేతిలోకి తీసుకుంటావో అది నీ ఇష్టం.
'నన్ను నిలువునా నరికి ఉప్పు పాతర వేయాలని నీకు అనిపిస్తోంది. అయితే, హత్యానేరానికి, అందులోను మూడుముళ్ళు మెడలో వేసి, ఏడడుగులు కలిసి నీతో నడిచి నలుగురు ముందు పెళ్ళాడిన భర్తనే చంపడం అంటే అందుకు పడే శిక్ష ఏమిటో తెలుసా? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ...........'


(బాపూ గారికి వేనవేల కృతజ్ఞతలతో)

(నెట్లో సంచారం చేస్తున్న ఆంగ్ల గల్పికకు స్వేచ్చానువాదం)