19, డిసెంబర్ 2014, శుక్రవారం

శాస్త్రి గారింట్లో పెళ్లి


రాత్రే మా వాడికి చెప్పాను ఉదయమే శాస్త్రి గారింట్లో పెళ్లి,  డ్రైవర్ కు చెప్పమని. పొద్దున్నే లేచి ఛానల్లో ఉదయ సంకీర్తన ముగించుకుని ఇంటికి వచ్చేసరికి డ్రైవర్ రెడీగా వున్నాడు. అల్పాహారం ముగించుకుని కారెక్కాను. మాదాపూర్ నుంచి మల్లాపూర్ వెళ్ళాలి. చాలా దూరం. అందుకే ముందుగా బయలుదేరాను. కార్లో చదువుదామని సిటీ ఎడిషన్ పేపర్లు పెట్టుకున్నాను. మెయిన్  ఎడిషన్ టీవీ ఛానల్లోనే అయిపోతుంది. చాలా దూరం వెళ్ళిన తరువాత 'ఫోటో వార్త' కనిపించింది.




"నాచారంలోని నామా ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ఆంద్ర భూమి ఎడిటర్ ఎంవీఆర్ శాస్త్రి కుమార్తె తన్మయి, దిలీప్ కుమార్ వివాహానికి హాజరయిన ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకరరావు"
మళ్ళీ చదివినా అదే వార్త. పైగా ఫోటో. మరి నేను బయలుదేరింది, ముందుగా ఏర్పాట్లు చేసుకున్నది అప్పటికే అయిపోయిందన్న మాట.
తిరుగు టపాలో ఇంటికి చేరిన నన్ను చూసి మా ఆవిడ ఒకే నవ్వు.
నేనూ నవ్వు కలిపాను ఏడవలేక.

18, డిసెంబర్ 2014, గురువారం

ఉగ్రవాదుల చేతుల్లో మోగుతున్న మరణ మృదంగాలు

(Published by 'SURYA' telugu Daily in its Edit Page on 21-12-2014, SUNDAY)

డిసెంబర్ పదహారు. పాకిస్తాన్ లోని పెషావర్ నగరంలో ఉగ్రవాదుల తూటాలకు అభం శుభం తెలియని 132మంది స్కూలు పిల్లలు బలయిన చీకటి రోజు. కనికరం ఇసుమంతయినా చూపని సాయుధ ఉగ్రవాదులు మొత్తం 148 మంది నిరాయుధులయిన అమాయకుల ప్రాణాలు హరించారు. పుస్తకాల సంచీతో ఆ రోజే మొదటిసారి  బడిలో అడుగుపెట్టిన అయిదేళ్ళ చిన్నారి నుంచి పద్దెనిమిదేళ్ళ వయసున్న, ఎంతో చక్కని భవిష్యత్తువున్న పిల్లలు అనేకమందికి తాము చదువుతున్న పాఠశాలే స్మశాన వాటిక అయింది.    
రాక్షసం, కిరాతకం, పాశవికం, దారుణం, అమానుషం, అతి హేయం ఈ పదాలన్నీ కలిపినా కూడా పెషావర్ మారణహోమాన్ని వర్ణించడానికీ, ఖండించడానికి  సరి తూగవు, సరిపోలవు. పెషావర్ ఊచకోత మొత్తం మానవేతిహాసానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. వందలాది తలితండ్రుల కడుపుకోతకు కారణమయింది. యావత్ ప్రపంచ ప్రజల్ని దిగ్భ్రమ పరచింది. మనం నివసిస్తున్నది నాగరికలోకంలోనా లేక జంతు ప్రపంచంలోనా అన్న సందేహాలకు తావిస్తోంది.   
సరిగ్గా పదేళ్ళ క్రితం రష్యన్ సమాఖ్యలోని బెస్లాన్ నగరంలో ఇదేవిధమైన ఉగ్రవాదుల దుశ్చర్యకు 385 మంది చనిపోయారు. సాయుధులయిన ఇస్లామిక్ ఉగ్రవాదులు కొందరు బెస్లాన్ లోని ఒక పాఠశాలలో ప్రవేశించి దాన్ని మూడు రోజులపాటు తమ అధీనంలో పెట్టుకున్నారు. 777 మంది విద్యార్ధులతో సహా మొత్తం 1,100 మందిని తమ బందీలుగా పట్టుకున్నారు. రష్యన్ సమాఖ్య నుంచి చెచన్యాకు స్వాతంత్ర్యం కోరుతూ జరుగుతున్న సాయుధ పోరాటంలో భాగంగా ఈ ముట్టడి మూడు రోజులపాటు సాగింది. మూడో రోజున రష్యన్ సైనిక దళాలు యుద్ధ ట్యాంకులతో స్కూలు భవనంలోకి  చొచ్చుకుపోయాయి. 186 మంది విద్యార్ధులతో సహా 385 బందీలు ఈ ఘటనలో అసువులుబాసారు. అనేకమంది గాయపడ్డారు. ఎంతమంది ఉగ్రవాదులు ఇందులో పాల్గొన్నారు, వారేమయ్యారు అన్న ప్రశ్నలకు ఇంతవరకు సంతృ ప్తికరమయిన  జవాబు లేదు.
దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు  ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఈ పదేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది.
బెస్లాన్ పాశవిక ఉదంతాన్ని తలదన్నే రీతిలో పెషావర్ మారణ కాండ సాగింది. 'జరిగిన దారుణాన్ని జీర్ణించుకోవడానికి మనసు మొరాయిస్తోంది' అని పాకేస్తాన్ లో బహుళ పాఠకాదరణ కలిగిన 'డాన్' పత్రిక తన సంపాదకీయంలో పేర్కొన్నది.
'ఈ పాశవిక దాడిలో అనేక పసి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం మొత్తం దేశాన్ని మానసికంగా కుదిపివేసింది. దీన్ని నుంచి కోలుకోవడం అంత సులభమేమీ కాదు' అని ఆ పత్రిక రాసింది.
ఒకే ఒక లక్ష్యాన్ని ఉగ్రవాదులు ఎన్నుకున్నారు. నిస్సహాయులు, నిరాయుధులు, తేలికగా దొరికిపోయే స్కూలు పిల్లలను తమ పగ, ప్రతీకారాలకు బలి పశువులుగా ఎంచుకున్నారు.  వారి సిద్దాంతాలు నమ్మకాలు ఎలా వున్నా, వారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎన్నుకున్న మార్గం మాత్రం దారుణం. తమపై సైనిక దాడులు జరపరాదంటూ, రాజ్యాంగేతర విధానాలతో తమను ప్రభుత్వాలు మట్టుబెట్టాలని చూస్తున్నాయని, వాటికి నిరసనగా ఈ మరణ కాండకు పూనుకున్నామని ఉగ్రవాదులు ప్రకటించడం మరీ ఆక్షేపనీయం. ప్రభుత్వాలపై పెంచుకున్న ప్రతీకారాన్ని పసిపిల్లల ప్రాణాలు హరించడం ద్వారా తీర్చుకోవాలని అనుకోవడం నీతి బాహ్యం.
ఇటువంటి సంఘటనలు జరగగానే 'ఉగ్రవాదాన్ని ఉక్కు పాదాలతో అణచివేస్తాం' అనే ప్రకటనలు కోకొల్లలుగా వెలువడతాయి. వీటివల్ల జరిగేది ఏమీ వుండదు, వొరిగేది ఏమీ వుండదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు. వీటిని నమ్మడం జనం ఎప్పుడో మానేశారు.
ఉగ్రవాదుల ఈ చర్యలను ఏదో ఒక మతానికి ముడిపెట్టడం కూడా సబబు కాదు. ఎందుకంటె ఏ మతమూ  ఏ రూపంలోనూ  హింసను  ప్రోత్సహించదు. కానీ ఒక మతం పేరుతొ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులు మాత్రం ఈ  వాస్తవాన్ని మరచిపోతున్నారు.
పెషావర్ సంఘటనకు సంబంధించి అందుతున్న ఓ సమాచారం దీన్ని రుజువు చేస్తోంది. మారణాయుధాలు ధరించి మిలిటరీ పాఠశాలలో ప్రవేశించిన ఉగ్రవాదులు, తుపాకులతో విద్యార్ధులను బెదరిస్తూ వారిని 'కలిమా' (ఇస్లాం ప్రార్ధన) చదవాల్సిందని ఆదేశించారుట. ఆ తరువాత విచక్షణారహితంగా వారిపై కాల్పులు జరిపారట. అంటే ముస్లిముల పవిత్ర గ్రంధం ఖుర్ ఆన్ లో ప్రవచించిన దానికి  విరుద్ధంగా ఉగ్రవాదులు ప్రవర్తించారన్న మాట. 'అల్లాను విశ్వసించిన వారిని ఎవరయినా కావాలని చంపినట్టయితే, అటువంటి వారికి నరకమే శిక్ష' అని ఖుర్ ఆన్ స్పష్టంగా చెబుతోంది. దీని ప్రకారం చూస్తె ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు కాని వారికి  ఇస్లాంతో కానీ, ఆ మత బోధనలతో కానీ  ఎలాటి సంబంధం లేదని పెషావర్ సంఘటన తెలుపుతోంది.
ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.
కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడుఅన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.



మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుందిఅనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం.

(18-12-2014)

NOTE: Courtesy Image Owner 

సతీ నీలాంబరి


నీలాంబరితో ఏకాంబరం పెళ్లి పెళ్లున జరిగిపోయింది. మొదటి రాత్రే ఏకాంబరం భార్యతో చెప్పాడు.
'మనం ఇద్దరం ఒక అవగాహనకు వద్దాం. నా మీద నీకు కోపం వస్తే కేకలు వెయ్యి. కానీ అప్పుడు  మనిద్దరం తప్ప మూడో వ్యక్తి వుండకూడదు. నేనూ అలాగే.  మరొకరు వున్నప్పుడు నీ మీద నోరు పారేసుకోను. అండర్ స్టాండ్?'
'అండర్ స్టాండ్. అల్లాగే' అన్నది నీలాంబరం.
భార్య సహకారం చూసిన  ఏకాంబరానికి ఆమె మీద ప్రేమ పూనకంలా తన్నుకు వచ్చింది.  
'నువ్వుంటే నాకు ఈ లోకంతో పనిలేదు. ఎదురుగా  ఎందరు వున్నా నా కంటికి నువ్వొక్కదానివే...' అంటూ గారాలు పోయాడు.
మర్నాడు కాఫీ తాగేటప్పుడు ఏదో విషయం మీద మాటా మాటా  వచ్చి మొగుడ్ని అత్తామామల ముందే కడిగి పారేసింది నీలాంబరి.  ఏకాంబరం బిత్తరపోయాడు. బిక్కచచ్చిపోయాడు.
ఆ రాత్రి వొంటరిగా వున్నప్పుడు  అడిగాడు 'అందరిముందు ఎందుకు అలా వొంటి కాలి మీద లేచావు' అని.
నీలాంబరి గారాలు పోతూ చెప్పింది.
'ఎవరున్నారు అక్కడ? మీరే కదా ఎదురుగా నేనుంటే ఇక  ఎవరూ  లేనట్టే అని'
ఏకాంబరం మరోసారి బిక్కచచ్చిపోయాడు.  

  

NOTE: Courtesy Image Owner 

17, డిసెంబర్ 2014, బుధవారం

ఇలా చేసి మాడండి !


"ఇలా చేసి చూడండి అని కిందటి వారం ప్రసారం చేసిన కార్యక్రమంపై శ్రోతల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం.
"ముందుగా మంగళవారప్పేట నుంచి మంగళగౌరీదేవి గారు రాసిన ఉత్తరం చూద్దాం.
"మీరు చెప్పినట్టే స్టవ్ మీద బాణలి పెట్టాను. నూనె పోసాను. పోపు గింజలు మీరు చెప్పినట్టే కొలిచి మరీ పోసాను. ఆ తరువాత మీరు చెప్పిన దానిని అక్షరం పొల్లుపోకుండా చెప్పింది చెప్పినట్టే చేసాను. రవ్వ ఉప్మా కాదు కదా రవ్వ జావ  కూడా తయారుకాలేదు,  అని మంగళగౌరీదేవి గారు రాశారు.
"చాలా సంతోషం మంగళగౌరీదేవిగారు,  మీరు మా కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడం  మాత్రమే కాకుండా ఆచరించి చూస్తున్నందుకు. కాకపొతే ఓ సందేహం. అదేమిటంటే,  మీరు స్టౌ వెలిగించడం మరచిపోయారని. యెంత రేడియో విని వంటచేసేవారికయినా ఈ కనీస  ప్రాధమిక సూత్రం తెలిసే వుంటుందన్న ఉద్దేశ్యంతో స్టౌ వెలిగించడం గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. నిజంగా అది మా పొరపాటే!"




(కార్టూనిష్ట్ 'లేపాక్షి' గారి సౌజన్యంతో)

విస్త'రణం'


(Published by 'SURYA' telugu daily in its edit page on 18-12-2014, Thursday)

తెలంగాణా మంత్రివర్గం విస్తరణలో ఆఖరి పంక్తి  వడ్డన కూడా పూర్తయింది. రాజ్యాంగం ప్రకారం శాసన సభ మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహీను శాతం వరకు మంత్రులను నియమించుకునే తతంగం కూడా ముగిసింది. ముఖ్యమంత్రితో కలుపుకుని మొత్తం పద్దెనిమిది మందితో మంత్రివర్గం కొలువుతీరింది.  ఇక పంచడానికి మిగిలింది ఏమీ లేదు. ఆశావహుల ఆశలపై  నీళ్ళు చల్లినట్టే. అయితే  చీకట్లో చిన్న కాంతి కిరణం ఏమిటంటే, మంత్రి పదవి రాలేదని కినుక వహించిన ఒక సీనియర్ టీ.ఆర్.యస్. నాయకుడిని  బుజ్జగిస్తూ, త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్తీకరణ  ఉంటుందనీ, అప్పుడు తప్పక న్యాయం చేస్తాననీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు వెలువడిన వార్తకధనాలే. వీటిల్లో నిజమెంతో తెలియదు కానీ, ఆశలు  పెంచుకుని నిరాశకు గురయిన వారు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసినట్టు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పుటంగా కానవచ్చింది. అయిన వాళ్ళకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో అనే నానుడిని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఒక కొత్త సంప్రదాయానికి కూడా  కేసీయార్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ని  మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందే ఆయన తన శాసన  సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ పంపారు. అంటే మరో ఉప ఎన్నికకు రంగం సిద్దమవుతున్నట్టే.  
ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు మొహం చాటేయడం సహజమే కాని పాలక పక్షానికి చెందిన వారిలో పెక్కురు గైర్ హాజరు కావడం, ముఖ్యంగా  తెలంగాణా అసెంబ్లీలో చీఫ్ విప్ గా నియమితులయిన కొప్పుల ఈశ్వర్ వంటి సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రాకపోవడం పాలక పక్షానికి కొంత  ఇబ్బంది కలిగించే విషయమే. అదే రోజు ఉదయం విదేశీ పర్యటన నుంచి నగరానికి తిరిగి వచ్చిన రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కేసీయార్ కుమారుడు  కే.టీ. రామారావు సయితం మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాకపోవడం ఆ పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలకు సంకేతం అని వాదించేవారున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సాంప్రదాయంగా గవర్నర్ తో కలిసి దిగే  మంత్రివర్గం ఫోటోలో కూడా కేటీఆర్ కనిపించలేదు. చీఫ్ విప్, విప్పులు, పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం గురించి జీవోలు వెలువడ్డాయి కానీ, ఆ పదవుల్లో నియమితులయిన వారిలో అనేకమంది మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు.  గైర్హాజరుకు ఎవరికి వుండే కారణాలు వారికి వున్నా, కేసీయార్ వ్యవహార శైలి నచ్చని ఆ పార్టీవారి చేతికి ఒక ఆయుధం అందించినట్టు అయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ అప్పుడే విమర్శల దాడి ప్రారంభించాయి. కొత్త మంత్రులలో అధికులు  తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాళ్ళు కావడం సరి కొత్త విమర్శలకు,  మీడియాలో విస్తృత చర్చలకు దారితీసింది. 'తెలంగాణా మంత్రి వర్గాన్ని చూస్తుంటే రాష్ట్రాన్ని పాలిస్తోంది మా పార్టీ యేమో అన్న సందేహం కలుగుతోంద'ని టీటీడీపీ సీనియర్ నాయకుడొకరు చమత్కరించడం కొస మెరుపు.
మంగళవారం నాడు జరిగిన మంత్రివర్గ విస్తరణ అనంతరం,  ఇది నిజమేనేమో  అన్న అభిప్రాయం కలిగే అవకాశం వుంది. ముఖ్యమంత్రి కాకుండా తెలంగాణా మంత్రులు పదిహేడు మందిలో ఎనిమిదిమంది వేరే పార్టీలకు చెందినవారు. వారిలో ఎక్కువమంది  తెలుగుదేశం పార్టీలో ప్రముఖులుగా పేరుపొందిన వారు కావడం విశేషం.
ఈ విస్తరణతో తెలంగాణాలోని మొత్తం  పది జిల్లాలకు మంత్రి వర్గంలో స్థానం లభించినట్టయింది. తొలి విడతలో అవకాశం దక్కని  రెండు జిల్లాలకు ఈ సారి ప్రాతినిధ్యం లభించింది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, సీ. లక్ష్మారెడ్డి, ఖమ్మం జిల్లా నుంచి  తుమ్మల నాగేశ్వరరావులను కేసీయార్ మంత్రులుగా తీసుకున్నారు. తెలంగాణాలో కొన్ని చోట్ల  బలంగా వున్న ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికే తుమ్మలను మంత్రిని చేసారనీ, కేవలం హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తలసాని శ్రీనివాస యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చారనీ ఇప్పటికే విమర్శలు బయలుదేరాయి కూడా.           
ఎవరెన్ని అనుకున్నా, తాను  అనుకున్న పద్దతిలోనే ముందుకు సాగడం కేసీయార్ తత్వం. అన్ని విషయాలను అందరితో  చర్చిస్తూనే, కొన్ని అంశాలలో ఆయన తనకు తనుగానే నిర్ణయాలను తీసుకుంటారు. ఎన్నో ఆటుపోట్లు నేర్పిన సుదీర్ఘ రాజకీయ అనుభవం వల్ల కావచ్చు, పర్యవసానాలు ఎలా వున్నా ఎదుర్కునే గుండె నిబ్బరం ఆయనకు పుష్కలంగా అలవడింది. నాయకుడిగా ఎదగడానికీ, నిలదొక్కుకోవడానికీ ఈ రకమైన దృఢచిత్తం, ఏకపక్ష నిర్ణయాలు  అక్కరకు రావచ్చుకాని  ప్రస్తుతం ఆయనకు  వీటి అవసరం  బొత్తిగా లేదు. టీ.ఆర్.యస్. పార్టీకి సంబంధించినంతవరకు కేసీయారే కర్తా,కర్మా, క్రియా. ఆయన మాటని కాదనేవారు లేరు. కాదనుకుని నిలబడగలిగిన వారూ లేరు. మొత్తం పార్టీకి కేసీయారే సర్వం సహా చక్రవర్తి. ప్రాంతీయ పార్టీ అధినాయకులను ఎవరిని తీసుకున్నా ఇదే విధమైన వైఖరి కానవస్తుంది. దీనికి భిన్నంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రాంతీయ పార్టీలను నడిపిన నాయకులతో పాటు, ఆ పార్టీలు కూడా  చరిత్ర గతిలో కలసిపోయిన విషయం కూడా కాదనలేని సత్యం.
మంత్రివర్గం కూర్పు అనేది  పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టాఇష్టాల  మీదే ఆధారపడి వుంటుంది. ఎవర్ని మంత్రులుగా తీసుకోవాలి, ఎవరిని మంత్రివర్గం నుంచి తప్పించాలి, ఎవరికి ఏ శాఖలు అప్పగించాలి ఈ నిర్ణయాలు అన్నీ ముఖ్యమంత్రి అభీష్టం ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు అలాగే జరిగింది కూడా.
సహజంగానే, మరీ  ముఖ్యంగా మరో అవకాశం ఇక లేదు అనుకున్న నేపధ్యంలో అసంతృప్తులు పెరగడం కూడా సహజంగానే జరుగుతుంది. 'మరో నాలుగున్నర ఏళ్ళ వ్యవధానం వుంది కదా! ఏదన్నా జరక్కపోతుందా, గుర్రం ఎగరకపోతుందా' అని వోపిగ్గా వేచి చూసే సహనం నేటి తరం రాజకీయుల్లో నానాటికీ లుప్తమవుతోంది. 'ఇలా పార్టీ టిక్కెట్టు సంపాదించు కోవడం, అలా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం, వెనువెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసెయ్యడం' ఇలా సాగిపోతాయి వారి కలలు. దీనికి తోడు, ఉద్యమ పార్టీ అయిన టీ.ఆర్.యస్.లో ఆదినుంచీ పార్టీకు అన్నుదన్నుగా నిలబడి పోరాడిన వారికి, ఎట్టకేలకు తెలంగాణా కల సాకారమై, బంగారు తెలంగాణా నిర్మాణంలో పాలుపంచుకునే సువర్ణావకాశం  కోసం ఆరు మాసాలుగా ఎదురు చూస్తున్నవారికి, అందినట్టే కనబడిన మంత్రి పదవులను,  ఉద్యమంతో సంబంధం లేనివాళ్ళు ఆఖరు నిమిషంలో ఎగరేసుకుపోవడం మరింత బాధ కలిగించడం అసహజమేమీ కాదు.                                 
పుష్కర కాలానికి పైగా వొంటి చేత్తో ఉద్యమం నడిపి, దుష్కరమనుకున్న ప్రత్యెక రాష్ట్రాన్ని సాధించిన కేసీయార్ కు ఈ విషయాలు తెలియవని అనుకోలేము. ఇటువంటి వాటిని ఎలా నిభాయించుకు రావాలన్నది ఆయనకు కొట్టిన పిండి. ఎవర్ని ఎలా బుజ్జగించాలో, ఎవర్నిఎక్కడ, ఎలా హద్దుల్లో ఉంచాలో తెలిసిన నాయకుడు కాబట్టే ఇన్నేళ్ళు ఉద్యమం సెగ తగ్గకుండా చూడగలిగారు. అలా అని చెప్పి అన్ని రోజులూ ఒకే విధంగా నడిచిపోతాయి అనే అభిప్రాయం  పెంచుకోవడం కూడా సరయిన నాయకుడి లక్షణం కాదు. నొప్పించే నిర్ణయాన్ని కూడా సహచరులకు నచ్చచెప్పి వొప్పించే కుశలత నాయకుడికి చాలా  అవసరం. 'గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకనే' సూక్తి రాజకీయ నాయకులకు పూర్తిగా వర్తిస్తుందని జనం చెప్పుకునేది ఇందుకే. 

    
ఇక ఇప్పుడు తెలంగాణాకు పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పడింది. రేపో మాపో అధికారుల విభజన ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వస్తుంది. కాబట్టి సాకులు చెప్పకుండా కాలయాపన లేకుండా పనులు  జరిగేలా చూడాలి. కలలు కంటున్న బంగారు తెలంగాణా సాకారం కావాలంటే ఎలాటి అలసత్వం కూడదు. పొరుగు రాష్ట్రంతో పొరపొచ్చాలు తగ్గించుకుని, అవసరమైన సహకారం అడిగయినా తీసుకుని వడివడిగా అడుగులు వేయాలి.
రాజకీయ పరిణామాలు, పర్యవసానాలు గురించి ఆలోచించకుండా, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం, వెనువెంటనే మంత్రి వర్గ  సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ  సత్వర కార్యాచరణకు ఆయత్తమైన కేసీయార్ వైఖరి  మెచ్చదగినదే. తాను పెట్టుకున్న లక్ష్యాలలో కొన్నింటినయినా వెంటనే చేసి చూపించగలిగితే ఇప్పుడు వినవస్తున్న విమర్శలు దూదిపింజల్లా కొట్టుకుపోతాయి. నాయకులకు పదవులు ప్రధానం కావచ్చు కానీ, ప్రజలకు అభివృద్ధి ముఖ్యం. చెప్పింది చేసి చూపించడం ఒక్కటే విమర్శకుల నోళ్ళు మూయించడానికి సరయిన మార్గం.    
రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు ఇక రాష్ట్రాభివృద్ధి అనే ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేయగలిగితేనే  రాష్ట్ర విభజన వల్ల ఏదైనా మంచి జరిగే వీలుంటే అది జరుగుతుంది. లేనిపక్షంలో ఈ ప్రయోగం విఫలమవుతుంది.
తోక టపా: తెలంగాణా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడిందన్న మాటే కాని, 'ఆకాశంలో సగం' అని గొప్పగా చెప్పుకునే మహిళలకు అందులో రవంత స్థానం లభించకపోవడం ఏవిధంగాను ఆమోదయోగ్యం కాదు, సమర్ధనీయమూ కాదు. ఇది నిష్టుర సత్యం.
(17-12-2014)

NOTE :  Courtesy Image Owner   

15, డిసెంబర్ 2014, సోమవారం

ఓ తండ్రి అప్పగింతలు


"మిమ్మల్ని ఎలా సంబోధించాలో నాకు బోధపడడం లేదు. మా అమ్మాయి తరపు కొత్త కుటుంబం అనుకోనా. లేదు లేదు అమ్మాయికి పెళ్ళయిపోయింది కాబట్టి మీరే ఆమె కుటుంబం.
"ఇప్పటిదాకా మా అమ్మాయి మా ఇంటి దీపం. ఇకనుంచి అది వెలిగేది, వెలుగు ఇచ్చేది మీ ఇంట్లోనే.
"ఒక మాట అడుగుతున్నాను తప్పుగా భావించకండి. నేను కోరేది ఒక్కటే. మా అమ్మాయి ఎక్కడ వున్నా ఆనందంగా హాయిగా ఉండాలని. నిజానికి ప్రతి తండ్రీ కోరుకునేది ఇదే, నాకు బాగా నమ్మకం. మా ఇంట్లోకంటే మా అమ్మాయి మీ దగ్గరే మరింత సంతోషంగా ఉంటుందని. అయినా ఆడపిల్ల తండ్రిని. అందుకే పదేపదే చెబుతున్నాను, ఆమెను సంతోషంగా ఉంచమని. పుట్టి ఇన్నేళ్ళవుతోంది కానీ ఏనాడు మమ్మల్ని బాధ పెట్టలేదు, భారంగా మారలేదు. అది చెంగుచెంగున  ఇల్లంతా తిరుగుతూ వుంటే ఇల్లూ మనసూ తేలికయ్యేవి. నేను ఇంత  హాయిగా శ్వాస తీసుకుంటున్నాను అంటే కారణం యేమిటనుకుంటున్నారు? నేనిలా మనసారా నవ్వుకుంటున్నాను అంటే కారణం ఏమిటనుకుంటున్నారు? మా అమ్మాయే. అమ్మాయి వున్నచోట అంతా ఆనందమే. అంతా సంతోషమే. మాకు ఇకనుంచి ఆ ఆనందం  దూరమవుతోంది.  కానీ సంతోషం ఏమిటంటే ఇంత  మంచి వాళ్ళు కాబట్టి  మీకది దగ్గరవుతోంది.
"ఆడపిల్ల ఎన్నాళ్ళు పెంచినా 'ఆడ' పిల్లే  కాని 'ఈడ'పిల్ల కాదు. ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళిచేసి అత్తవారింటికి పంపక తప్పదు. అది ప్రకృతి ధర్మం.
"నేనూ దానికి కట్టుబడే పెళ్ళిచేసి పంపుతున్నాను. ఒక రకంగా నా మొత్తం ప్రపంచాన్నే నేను మీకు ఇచ్చేస్తున్నాను. అది వెళ్ళిపోయిన  తరువాత మాకు మిగిలేది శూన్యమే. మీ దగ్గర అది సంతోషంగా ఉంటోంది అన్న భావనే ఇక మమ్మల్ని బతికిస్తుంది.  
"మేము దాన్ని ఒక రాజకుమారి మాదిరిగా పెంచాము. మీరు దాన్ని రాణి మోస్తరుగా చూస్తారని నమ్మకం.
"ఒక మాట చెబుతున్నాను నన్ను నమ్మండి.
"ఒక చక్కని వ్యక్తిత్వంతో కూడిన మనిషిగా తీర్చి దిద్దడానికి నేను అహరహం కష్టపడ్డాను.  మా నమ్మకాన్ని అది వమ్ము చేయలేదు. అదిప్పుడు ఒక సంపూర్ణ  మహిళ. అత్తమామల్ని గౌరవంగా చూసుకుంటుంది. మరదుల్ని, ఆడపడుచుల్నీ ప్రేమగా లాలిస్తుంది. తన భర్తను మీ బిడ్డగా మీకు మరింత దగ్గర చేస్తుంది. ఇవన్నీ నేర్చుకునే మీ ఇంట కుడికాలు మోపబోతోంది. ఏదో ఆశించి ఇవన్నీ చేయబోవడం లేదు, తన కర్తవ్యం  అనుకుని చేస్తుంది. బదులుగా ఆమెకు నగలూ, నాణ్యాలు అక్కరలేదు, చీరెలూ సారెలూ అవసరం లేదు, మీ కుటుంబంలో అందరితో పాటుగా ఇంత ప్రేమను పంచండి చాలు.
"నిజమే పొరబాట్లు చేయని మనుషులు వుండరు. ఒకవేళ పొరబాటున ఏదైనా పొరబాటు చేసి మీ మనస్సును నొప్పిస్తే దాన్ని తప్పుగా ఎంచకుండా మన్నించండి. మళ్ళీ మళ్ళీ ఆ పొరబాటు చేయకుండా మీ మన్నింపే దానికి అక్కరకువస్తుంది.
"ఎప్పుడయినా నలత అనిపిస్తే ఒక్క మంచి మాట చెప్పండి. ఏ మందులూ మీ అనురాగ పూరిత పలుకులకు సాటికావు. సాటి రావు.
"నెలలు తరబడి నేను దాన్ని చూడకపోయినా బాధ పడను. రోజూ  దానితో మాట్లాడాలని ఆరాటపడను. కాకపోతే,  అది మీ దగ్గర హాయిగా ఉంటోంది అన్న ఒక్క చల్లని కబురు తెలిస్తే చాలు. అంతే కాదు, అది మమ్మల్ని కూడా మరచిపోయెంతగా మీతో కలిసిపోతే అదే పదివేలు.
"అల్లుడు గారు ఒక్కమాట.
"ఇప్పుడు ఈ మాటలన్నీ మీకు కాస్త గందరగోళంలా ఉండవచ్చు. అయితే రేపు దేవుడి దయవల్ల ఒక బంగారు తల్లికి తండ్రి అయిన నాడు నా ఈ మాటల్లోని సత్యం మీకు బోధపడుతుంది. మీ గుండెలోని అణువణువూ, మా అమ్మాయి ఎక్కడున్నా చల్లగా వుండాలి,  ఆనందంగా ఉండాలనే ఘోష పెడతాయి. అది అనుభవం మీద కానీ అర్ధం కాదు.
అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. మళ్ళీ మళ్ళీ అర్ధిస్తున్నాను. నా బంగారు తల్లిని మీ ఇంట హాయిగా వుంచండి."


(ఒక ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner  

రాజధాని (?) కబుర్లు


నవ్యాంధ్ర ప్రదేశ్ కు విజయవాడ అధికారికంగా కొత్త రాజధాని కాకపోవచ్చు. కానీ రాష్ట్ర విభజన
 జరిగిన జూన్ రెండో తేదీ నుంచి రాజధాని అన్నప్పుడల్లా బెజవాడ పేరే వినిపిస్తూ వస్తున్నదేమో నిన్న విజయవాడలో ఒక రోజు వున్నప్పుడు నాకూ అదే భావన కలిగి 'రాజధాని కబుర్లు' అని మొదలు పెట్టాను.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వూళ్ళో ఆకస్మిక తనిఖీలు చేసి అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన మరునాడే నేనా వూరు వెళ్లాను, మా మూడో  అక్కయ్యగారి సంవత్సరీకాలకోసం. చిన్నప్పుడు చదువుకున్న వూరు కావడం వల్లా, కాస్త వ్యవధానం దొరకడం వల్లా  పొద్దున్నే లేచి వూళ్ళో నాలుగయిదు చోట్లు -  గవర్నర్ పేటలోని చక్రవర్తి రోడ్డు, మ్యూజియం రోడ్డు, అలంకార్ టాకీసు, ఏలూరు కాలువ వంతెన, గాంధీ నగరం లోని సన్యాసి రాజు వీధి, జింఖానా రోడ్డు అలా అలా నడిచి తిరిగాను. బెజవాడలో మరో సౌలభ్యం ఏమిటంటే అలా కాలినడక మీదే  చాలా ప్రాంతాలు చుట్టబెట్టి రావచ్చు.బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు బాగానే  వున్నాయి. మిగిలిన చోట్ల పారిశుధ్యం పరిస్తితి ఘోరం అనిపించింది. 


(విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు)

అందుకే కాబోలు మునిసిపల్ మేయర్, కమీషనర్ తమ విధులను పొద్దటి నుంచీ మొదలు పెట్టాలని సీ.ఎమ్. ఆదేశించినట్టు ఆరోజే పత్రికల్లో కూడా  చదివాను. ఉరుకులు పరుగులు పెట్టి అలసిపోయి,  రేపటినుంచీ చూసుకుందాం అనుకున్నారేమో వీధులన్నీ కాస్త కంపరం కలిగించేలానే వున్నాయి. మరీ అంత ఉదయమే చూస్తె అన్ని ఊళ్లల్లో అలానే వుంటాయి అని వాదించవచ్చు కాని, హైదరాబాదులో పొద్దున్నే కలయ తిరగడం ఛానల్ల చర్చల పుణ్యమా అని నాకు అలవాటే.  మరీ గొప్పగా లేకపోయినా,  వెగటు కలిగించే పరిస్తితులు హైదరాబాదులో లేవని మాత్రం చెప్పవచ్చు. బెజవాడలో నా  చిన్నప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అంకురార్పణ జరిగింది. మరి గాంధీనగరం వంటి చోట్ల కూడా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువలు కనిపించాయి. బహుశా వర్షపు నీరు పోవడానికి ఏర్పాటు కావచ్చు కానీ వాటిల్లో కనిపించింది మురికి నీరే. నగరానికి వస్తున్న భవానీ భక్తుల కారణంగా హైదరాబాదు నుంచి వచ్చే వాహనాలను దుర్గ గుడి వైపునుంచి కాకుండా వేరే మార్గాల్లో మళ్లించినందు వల్ల అంతకు  ముందు రోజు సాయంత్రం  ఓ గంట సేపు అదనంగా వూళ్ళో తిరగాల్సివచ్చింది. పాత బస్తీ, చిట్టి నగర్ ఇలా అనేక ప్రాంతాలను చుట్టబెడుతూ మా నగర సందర్శన సాగింది. ఒకచోట ఎవరినో దారి అడిగితె 'నేరుగా వెళ్ళండి మూడు వంతెనలు వస్తాయి, దాటిన  తరువాత వంద ఫీట్ల రోడ్డు ఎక్కండి' అని సలహా చెప్పాడు. అన్నట్టే మూడు వంతెనలు తగిలాయి. నాకూ వాటి సంగతి తెలియదు. అవి ఎలా ఉన్నాయంటే వాటిని దాటేలోగా కూలిపోతాయేమో అనేంత  పాతపడి, మాంధాతల కాలంలో కట్టినట్టుగా వున్నాయి.
కొత్త రాజధాని నిర్మాణం ఎక్కడ జరిగినా, అందులో విజయవాడకు ఎంతో కొంత ప్రాధాన్యం, పాత్ర తప్పకుండా వుంటాయి. కాబట్టి అ నగరం మంచి చెడ్డలు గురించి మరింత ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందేమో అని కూడా అనిపించింది. అందుకే ఈ నాలుగు ముక్కలు.

NOTE: PHOTO COURTESY SAKSHI