26, ఏప్రిల్ 2014, శనివారం

పల్లెకు పోదాం


"Back to village"

'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.  చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.


(మా స్వగ్రామంలో మా ఇల్లు)


25, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఏకంగా నా పోటీ జంధ్యాల మీదే!


డెబ్బయ్యవ దశకానికి ముందు మా అన్నయ్య పర్వతాలరావు గారికి ఖమ్మం నుంచి బెజవాడ బదిలీ కావడం వల్ల నేను ఎస్సారార్  కాలేజీలో,  బీ కామ్ మొదటి సంవత్సరంలో చేరాను. చేరిన కొత్తల్లోనే విద్యార్ధి సంఘం ఎన్నికల్లో భాగంగా లాంగ్వేజ్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. మా క్లాసులో శతమానం భవతి అన్నట్టు వంద మంది. అదే కాలేజీలో బీ ఎస్సీ చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు పూనికపై నేను కూడా పోటీ చేస్తున్నట్టు పేరు ఇచ్చాను. మాచవరం నుంచి ఇద్దరం రిక్షాలో కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని తెలిసిన సైక్లోస్టైల్ షాపుకు వెళ్ళి తెలుగులో అక్కడికక్కడే ఒక గేయం రాసి టైపు చేయించి కాలేజీకి  తిరిగి వచ్చి వాటిని క్లాసులో పంచిపెడుతుండగానే గంట మోగింది. వందలో నాకు పదిహేడు ఓట్లు వచ్చినట్టు జ్ఞాపకం. దండిగా ఓట్లు తెచ్చుకుని గెలిచినదెవరంటే జేవీడీఎస్ శాస్త్రి. అంటే ఎవరో కాదు మనందరి అభిమాన ఆహ్లాద సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల.


ఆ 'ఒక్కక్షణం' అనే  గేయం ఇలా సాగుతుంది.
"ఒక్క క్షణం తొందరపడి ఓటు వృధా చేయకు - నిప్పుకణికెలాంటిదది నిర్లక్ష్యము చేయకు - మాటలాడబోవుముందు ఒక్కసారి యోచించు - ఓటు వేయబోవుముందు కొద్దిగ ఆలోచించు - స్నేహితునకు ఇవ్వదగిన బహుమానము కాదు ఓటు - శత్రువైన సరే నీకు! అర్హతున్నవానికేయి - చేతులు కాలిన పిమ్మట ఆకులకై  వెదుకకు - మంచికైన చెడుకైన నీదే బాధ్యత మరువకు -  అర్హుడైన వాని గెలుపు నిజము సుమ్ము నీ గెలుపే"

ఎందుకో మా తరగతిలో చాలామంది నా మాట మన్నించారు. చివరి పాదంలో చెప్పినట్టు జంధ్యాలను గెలిపించారు.               

1973 లో అగ్గిపెట్టె పదిపైసలు

మా పాత డైరీల్లో రాసుకున్న పాత విషయాలు
న్యూ ఇయర్  గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31  వ తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే సుమారుగా నలభయ్ ఏళ్ళకిందటి మాట)
నూనె : Rs.3-25
నెయ్యి:Rs. 2-75
పెరుగు: Rs.0-20
టమాటాలు:Rs. 0.55
అగ్గిపెట్టె: Rs. 0.10
సబ్బు: Rs.1-00
రిక్షా: Rs. 0-50
వక్కపొడి పొట్లం: Rs. 0-10
(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా ఐ నో సీ ఎం - ఐ నో పీఎం బాపతు)

24, ఏప్రిల్ 2014, గురువారం

యస్ సర్ నో సర్ - భండారు శ్రీనివాసరావు


ముప్పయ్ అయిదేళ్ళ క్రితం చండప్రచండుడిగా పేరు తెచ్చుకున్న ఒక ముఖ్యమంత్రిగారి పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి గారనే ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. చెప్పిన పని వెంటనే చేయకపోయినా, నలుగురిలో వుండగా ఏదయినా ఫైల్ విషయంలో కుదరదని (నో) చెప్పినా ఆయన ఎగిరిపడతారని ఆ అధికారికి బాగా తెలుసు. అందుకని ఎవరయినా పనిమీద సీఎంని కలిసి ఏదయినా అడిగితె,  అప్పటికి 'యస్ సర్' అనేవారు. తరువాత ఆ ఫైల్ సీఎం పేషీకి   వచ్చినప్పుడు ఎవరూ లేకుండా చూసి దాన్ని యెందుకు ఆమోదించకూడదో వివరంగా చెప్పి 'నో సర్' అంటూ 'నో'  చెప్పేవారట. అందులో విషయం వుందని అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి కూడా మారుమాట లేకుండా ఆ అధికారి చెప్పిన దాన్ని వొప్పుకునేవారట. అందుకని (ఎస్సార్ ) రామమూర్తి గారిని తోటి అధికారులు 'ఎస్ సర్ రామమూర్తి', 'నో సర్ రామమూర్తి' అనేవారట. (తదనంతర కాలంలో రామమూర్తి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు)    

23, ఏప్రిల్ 2014, బుధవారం

"రెండు నిమిషాలు నాకు దానం ఇవ్వండి"

పరమాచార్య పావన గాధలు - భండారు పర్వతాలరావు


"మీరందరూ నా వద్దకు అనేక కానుకలు తీసుకువస్తున్నారు. పుష్పఫలాదులు తెస్తున్నారు. ధనమిస్తున్నారు. వీటిని వేటినీ నేను కోరుకోవడం లేదు.
"దినానికి రెండు నిమిషాలు మాత్రం నాకివ్వండి. ఆ రెండు నిమిషాలు భక్తితో పరమేశ్వరుని ధ్యానించండి. అదే నాకు అత్యంత ప్రీతికరమైన కానుక.
"దినమంతా మీరు లౌకిక వ్యాపారాలతో గడుపుతారు. ఓ రెండు నిమిషాలు ఈ బీద సన్యాసికి దానమివ్వలేరా!
"నాకు కావలసింది అంతే!"
-పరమాచార్య 

21, ఏప్రిల్ 2014, సోమవారం

పరమాచార్య పిడికెడు బియ్యం పధకం

పరమాచార్య పావన గాధలు - భండారు పర్వతాలరావు


"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అల్లా పోగుపడే బియ్యాన్ని సేకరించండి.మీ పేటలోని ఏ ఆలయంలోనైనా  ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర  అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది " - కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి అనుగ్రహభాషణ

ఎన్నికల్లో ధన ప్రవాహం - దాని ప్రభావం


ఏ ఛానల్లో చూసినా ఇదే చర్చ. అసలు ఎన్నికల్లో పెట్టే ఖర్చు ఏవిధంగా వుంటుంది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, మీటింగులు, రోడ్డు షోలు, జనాల తరలింపులు, పత్రికల్లో టీవీల్లో ప్రకటనల ప్యాకేజీలు, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు చూసారు అదే వోట్ల కొనుగోళ్ళు. చిత్రం ఏమిటంటే ముందు జాబితాలో  పేర్కొన్న అంశాలపై  పెట్టే ఖర్చుతో పోలిస్తే చివరి ఐటంపై పెట్టేది అంతవుండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాని కాకి గోలంతా దీని గురించే కావడం విచిత్రం.


ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు చివరివీ కావు ఇవే మొదటివీ కావు. నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచీ ఏవో ఎన్నికలు జరుగుతూనే వున్నాయి. ప్రతి ఎన్నికలో ఈ డబ్బు ప్రసక్తి వస్తూనే వుంది. వోటు అమ్ముకోవద్దు అనే నీతి వాక్యాలు ప్రతిసారీ వినబడుతూనే వున్నాయి. అదేదో సినిమా పాటలో చెప్పినట్టు 'మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి' అన్నట్టు, పైకి ఒప్పుకోకపోయినా,  ప్రతి పార్టీ వోట్ల కోనుగోలు విషయంలో ఎంతో కొంత ఖర్చు చేస్తూనే వస్తోంది.
వోటు కొనుగోలు అంటే అర్ధం ఏమిటి? డబ్బు తీసుకున్నవాడు దానికి ప్రతిఫలంగా డబ్బు ఇచ్చిన అభ్యర్దికో లేదా పార్టీకో వోటు వేయడం. అలా జరిగితే అందరూ గెలవాలి కదా! కొందరే యెందుకు గెలుస్తున్నారు. అంటే అర్ధం ఏమిటన్న మాట. ఓటుకు ఇంత అని డబ్బు తీసుకున్న ఓటరు కూడా తనకు నచ్చినవాడికే ఓటు వేస్తున్నాడు అనుకోవాలి. లేకపోతే ఎమర్జెన్సీ తరువాత ఇందిరా గాంధి ఓడిపోయేదా! ఆ తరువాత గద్దె ఎక్కిన జనతా పార్టీ కుమ్ములాటల్లో చిక్కుకుని వున్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో యెందుకు ఓడిపోయింది. ఎన్టీయార్ తెలుగుదేశం ఇందిరా ప్రభంజనాన్ని అడ్డుకుని గెలవకలిగి వుండేదా! ఆ తరువాత కొన్నేళ్లకు అదే ఎన్టీయార్ పరాజయాన్ని యెలా మూటగట్టుకున్నారు.  ఓడించిన ప్రజలతోనే తిరిగి కిరీటం యెలా పెట్టించుకోగలిగారు. చంద్రబాబు, వాజ్ పాయ్ కాంబినేషన్ కు  జనం బ్రహ్మరధం యెలా పట్టారు. తరువాత పదేళ్లు తిరక్కముందే వారిని యెలా తిప్పికొట్టారు. ఓటర్లు కేవలం డబ్బుకు ప్రలోభపడి వుంటే ఇవన్నీ సాధ్యం అయివుండేవా!
దీనర్ధం ఓట్ల  కొనుగోలును సమర్ధిస్తున్నట్టు ఎంతమాత్రం కాదు. ఎన్నికల్లో ధన ప్రవాహం వుండొచ్చు కానీ దాని ప్రభావం ఎన్నికల ఫలితాలమీద వుండకపోవచ్చు అని మాత్రమే!
మనతోపాటు స్వాతంత్రం వచ్చిన అనేక ఇరుగు పొరుగు దేశాల్లో, ఎప్పుడో ఒకప్పుడు, ఎంతో కొంత కాలం ప్రజాస్వామ్యం మరుగున పడి, అవి సైనిక నియంతృత్వ  పాలనలోకి మళ్ళిన దృష్టాంతాలు వున్నాయి. ఒక్క మనదేశంలోనే వోటరు,  ఓటుద్వారా తనకు నచ్చిన వారికి పట్టం కడుతున్నాడు. నచ్చకపోతే గద్దె నుంచి దింపుతున్నాడు. వారిలో ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు వుండవచ్చు. కానీ వారి పరిణతి చాలా గొప్పది.
NOTE: Courtesy cartoonist