15, ఏప్రిల్ 2014, మంగళవారం

పరిపూర్ణానంద స్వామి అమెరికా పర్యటన




సంస్కృతి సంప్రదాయాలకు కొత్త  భాష్యం చెబుతూ తన అద్భుత ప్రవచనాలతో, కార్యక్రమాలతో యువతీ యువకులను సయితం ఆధ్యాత్మికత వైపు ఆకర్షిస్తున్న శ్రీ పరిపూర్ణానంద స్వామి రేపు ఉదయం బయలుదేరి మూడు మాసాల పర్యటనపై అమెరికా వెడుతున్నారు. రేడియోలో, దూరదర్శన్ లో నా సీనియర్ సహచరులు శ్రీ ఆర్ వీ వీ కృష్ణారావు గారు స్వామి వెంట ఈ విదేశీ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్ లో ఈ సాయంత్రం స్వామీజీకి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు శ్రీ కృష్ణారావు గారు తెలియచేశారు. శ్రీ పీఠం తరపున నిర్మించిన టెలీ సీరియల్ 'గోమాత' ప్రీవ్యూ కూడా వుంటుంది.        

నవ్వో నవ్వకనో వొదిలేయండి!


ఇది కధ కాదు కానీ మొన్నీమధ్య ఓ ఫంక్షన్లో కలిసిన ఓ పెద్దమనిషి చెప్పిన కధ ఇది.
ఆ పెద్దమనిషి గారింటికి ఈ నడుమ ఏదో దేశం నుంచి అక్కడ ఏనాడో సెటిలై పోయిన  మరో తెలుగు పెద్ద మనిషి గారు వచ్చారట. మొదటి రోజు నిద్రలేచేసరికి బయట ఆరుబయట పత్రికలు చదువుతూ కనబడ్డారట. రెండో రోజు ఆయన ధోరణిలో  మార్పు మొదలై మూడో రోజుకల్లా అది విపరీత ప్రవర్తనకింద మారిపోయిందట. ఎందుకిలా అయ్యిందని ఇంటాయన భయపడిపోతుంటే ఇల్లాలు కల్పించుకుని చెప్పిందట.



'నేను మొదట్లోనే చెబుదామనుకున్నాను. ఒకదానితో ఒకటి పొంతనలేని అన్ని తెలుగు పేపర్లు ముందు పడేస్తే ఇలాగే ఏదో అవుతుందని. మనమంటే అలవాటుపడి ముదిరిపోయాము.  కానీ, దేశం కాని దేశం నుంచి వచ్చిన ఈ పెద్దమనిషి ఏం హరాయించుకుంటాడో ఏవిటో అని. నేను  భయపడ్డంతా అయింది. ముందా పేపర్లు తీసి బయట పడేయండి. ఆయనే సర్డుకుంటాడు'     

మరవతగని మనిషి మరుపున పడుతున్నాడా!



యాభయ్ ఐదేళ్ల  పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో గాంధీనగరం మునిసిపల్ స్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపు తధ్యం అని కోడై కూస్తున్న సమయంలో ఒకనాడు అ పార్టీకి పెద్దదిక్కు అయిన వాజ్ పాయ్ ఇప్పుడు ఎక్కడ వున్నారు, యెలా వున్నారు అన్నది జనంలో చాలామందికి తెలియని విషయం.  తెలుసుకుంటే మరింత బాధ కలిగించే ఈ సంగతులను గత నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది. ఆ కధనాన్ని సంక్షిప్తం చేస్తే:
ఢిల్లీ లోని అశోకా రోడ్డులో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వుంది. ఎప్పుడూ నాయకులు, కార్యకర్తలతో సందడిగా వుండే ఆ ప్రదేశానికి అయిదే అయిదు నిమిషాల నడక దూరంలో కృష్ణ మీనన్ మార్గ్ లోని ఓ  బంగ్లా  ఎస్పీజీ కాపలాలో కానవస్తుంది. అందులోకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. బయటకు వచ్చేవాళ్ళు అంతే. నీరవ నిశ్శబ్ధం తాండవించే ఆ భవనంలో చక్రాల కుర్చీలో కూర్చుని ఒక వృద్ధుడు టీవీలో వార్తలు చూస్తూ, పత్రికల్లో ప్రధాన శీర్షికలు చదువుతూ కానవస్తారు. తన వాగ్దాటితో ప్రత్యర్ధులను ఆకట్టుకున్న ఒకనాటి నేత వాజ్ పాయ్ ఆయనే అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే.
ఆయన ఏదో కష్ట జీవితం గడుపుతున్నారని కాదు కానీ ఆయన  ప్రస్తుత జీవన శైలి గమనించినప్పుడు ఎవరికయినా మనసు కష్టపడుతుంది.



వాజ్ పాయ్ కవితలు రాస్తారు. వాటిని వినడానికి ఒకప్పుడు పార్టీ నాయకులు ఎగబడేవారు. ఇప్పుడు ఆ ఇంటి గడప తొక్కేవారే కరువయ్యారు. క్రమం తప్పకుండా వచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు వాజ్  పాయ్ కి అరవై ఏళ్ళుగా తెలిసిన ఎన్ ఎం గటాతే కాగా మరొకరు బీజేపీ మూలస్థంభాల్లో ఒకరయిన ఎల్ కే అద్వానీ.   పార్టీ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన బీ సీ ఖండూరీ కూడా అప్పుడప్పుడు వచ్చి వాజ్ పాయ్ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తెను అడిగి తెలుసుకుంటూ వుంటారు. పోతే, మాజీ ప్రధాని జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి వెళ్ళే వ్యక్తి మరొకరు వున్నారు. ఆయనే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.
వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళే ఆయన స్నేహితుడు గటాతే  చెప్పేదాని  ప్రకారం ప్రస్తుతం వాజ్ పాయ్ రోజువారీ దినచర్యలో  ఎక్కువ సమయం ఫిజియో తెరపిష్టులతో గడిచిపోతుంది. మాట సరిగా రాకపోవడం వల్ల సంభాషణల్లో పాలుపంచుకోలేరు. పత్రికలు చదవరు కానీ హెడ్ లైన్స్ తిరగేస్తారు.
భాష అర్ధం కాని  వారిని సయితం  తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.

(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

14, ఏప్రిల్ 2014, సోమవారం

ఇంకేం కావాలి సాక్ష్యం ?


'ఓటుకు నోటు తీసుకున్నా కేసు' - రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ( ఈరోజు ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ రెండో పేజీలో వార్త. ఆపక్కనే 'డబ్బులిస్తూ దొరికిపోయారు' అంటూ ఫోటోతో సహా మరో వార్త. మరి భన్వర్ లాల్  ఏంచేస్తారో చూడాలి)




పాత విన్నపమే మరో సారి : నేను సాధారణంగా పార్టీలు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించను. ఒక వార్త వచ్చినప్పుడు దానిపై వ్యాఖ్యకు మాత్రమే నా స్పందన పరిమితం. భన్వర్ లాల్ గారు నోటు తీసుకున్నా కేసు పెడతాం అన్నారు. ఇక్కడ ఇస్తున్న వారితో పాటు తీసుకున్నవారు కూడా చిత్రంలో వున్నారు.పైగా ఎక్కడ అన్నది కూడా వార్తలోనే తెలియచేసారు. ఇంత స్పష్టంగా వున్నప్పుడు ఒక్క కేసుని స్పెసిమన్ గా తీసుకుని చర్య తీసుకుంటే మళ్ళీ ఇలాటి వార్తలు, ఫోటోలు పత్రికల్లో చూసే దుస్తితి తప్పుతుందన్నది మాత్రమే నా ఉద్దేశ్యం.



సొరకాయల కొరత

ఇప్పుడే అందిన వార్త


వివిధ ప్రధాన రాజకీయ పక్షాలు తమ తమ ఎన్నికల ప్రణాలికలను విడుదల చేసిన నేపధ్యంలో రాష్ట్రంలో సొరకాయలకు విపరీతమైన కొరత ఏర్పడినట్టు మార్కెట్ వర్గాలు తెలియచేస్తున్నాయి.

13, ఏప్రిల్ 2014, ఆదివారం

మా మేనల్లుడు చెప్పిన మా బావగారి కధ


మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. కొద్దికాలం అస్వస్థులుగా వుండి కన్ను మూశారు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా వూర్లో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే -
ఈరోజు బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మా మేనల్లుడు అంటే రామచంద్ర రావుగారి కుమారుడు ఓ వృత్తాంతం చెప్పాడు. మా బావగారు సుస్తీ చేసి ఆసుపత్రిలో వున్నప్పుడు ఆయన్ని అడిగాడట. 'నాన్నా! మీలాటివాళ్ళు లక్షల మంది నానా కష్టాలు పడితే ఈ స్వాతంత్రం వచ్చింది. మీరు నిజంగా కోరుకున్నది ఇలాటి దేశాన్నేనా'
ఆయన ఇలా జవాబు చెప్పారట.


(కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు)


'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో  నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మంది బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ అని. బహుశా ఆరోజు గట్టిగా కాదుకూడదు అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేదికాదేమో!  ఫ్రీ ఇండియా అంటే  జనాలకు  అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం దీని లాభనష్టాలన్నీ  మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో  మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

వాహ్వ్

జంపుజిలానీల మీద, పార్టీ మార్పిళ్ళ మీద, తిరుగుబాటు అభ్యర్ధుల మీద  అనేకానేక జోకులు, కార్టూన్లు వస్తున్నాయి. వాటిల్లో ఉత్తమం అనతగ్గ ఓ కార్టూన్ ఈరోజు ఆంధ్ర జ్యోతిలో వచ్చింది. కార్టూనిష్ట్ 'సరసి' గారికి ధన్యవాదాలతో-