3, జులై 2011, ఆదివారం

వెనుకటి గుణమేలమాను – భండారు శ్రీనివాసరావు


వెనుకటి గుణమేలమాను – భండారు శ్రీనివాసరావు

మునుపటి రోజుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా తమ అధినాయకులను కలుసుకోవడానికి పడే ప్రయాస అంతా ఇంతా కాదని చెప్పుకునేవారు. ఇక అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీని కలవడం అంటే ముఖ్యమంత్రులకు సయితం బ్రహ్మ ప్రళయంగా వుండేది. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపుకోసం ఎదురుచూస్తూ ఏ పీ భవన్లో మన ముఖ్యమంత్రులు రోజుల తరబడి ఎదురుచూస్తూ పడిగాపులు పడిన సందర్భాలు అనేకం వున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్వ్యూ ఓ పట్టాన దొరక లేదంటే ఇక ఆ ముఖ్యమంత్రికి త్వరలోనే పదవీ గండం తధ్యం అనుకునే వాళ్లు. ఈ నేపధ్యం తెలిసినవారికి ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ విషయంలో చాలా అదృష్ట వంతులనే అభిప్రాయం కలగడంలో వింతేమీ లేదు. ముఖ్యంగా యూ పీ యే - 1 ప్రభుత్వ పాలనాకాలంలో ఈ మార్పు మరింత స్పుఠంగా కానవచ్చింది. సోనియా గాంధీ పట్ల ప్రజల్లో కొంత సానుకూల వైఖరి ప్రబలడానికి ఇది కొంత మేరకు దోహదం చేసింది. ఇందిరాగాంధీతో పోల్చి చూసుకుని సోనియాకు కొన్ని మార్కులు అదనంగా వేయడం కూడా మొదలయింది. కాంగ్రెస్ అధిష్టానం తన సహజ వైఖరి నుంచి క్రమంగా దూరం జరుగుతూ ప్రజాస్వామ్య విలువలకు కొద్ది కొద్దిగా దగ్గరవుతున్నదేమో అన్న భ్రమలు ప్రజల్లో కలగసాగాయి. యూపీయే మొదటి అయిదేళ్ళ పాలన పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడానికి సోనియా అనుసరించిన ఈ విధానం ఓ మేరకు ఉపయోగ పడిందనే చెప్పాలి. సహజంగా మృదు స్వ భావి, మంచివాడు అని జనసామాన్యంలో మంచి పేరున్న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన మానాన తన పని చేసుకుపోవడానికి కూడా దీనివల్ల వీలు పడింది. మరోవైపు, సోనియా గాంధీ తన అత్తగారు ఇందిరలా పేనుపెత్తనం చేయదన్న మంచి పేరు ఆమె ఖాతాలో జమ పడింది. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను పదేపదే మార్చడం వంటి అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలకు కాంగ్రెస్ అధిష్టానం స్వస్తి చెప్పినట్టేననన్న అభిప్రాయం ప్రజల్లో బలపడడం ప్రారంభమయింది. కీర్తిశేషులు రాజశేఖరరెడ్డి నిరాఘాటంగా మొదటి అయిదేళ్ళ పదవీ కాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడానికి అప్పట్లో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన ఈ మెతక విధానం ఆయనకు బాగా కలసివచ్చిందని అనుకునేవాళ్ళు కూడా వున్నారు. కానీ, ఖండాంతరాలకు తెలుగు ఖ్యాతిని విస్తరిస్తూ తొమ్మిదేళ్ళకు పైగా చంద్రబాబునాయుడు సాగించిన హైటెక్ పాలనకు ప్రజలు స్వస్తివాక్యం పలికేలా చేయడంలో రాజశేఖరరెడ్డి జరిపిన పాదయాత్ర, ప్రజాసమస్యలపై ఆయన చేసిన నిరంతర పోరాటాలు చాలావరకు ఉపయోగపపడ్డాయనడం వాస్తవానికి దగ్గరగా వుంటుంది.

సరే! ముఖ్యమంత్రుల హస్తిన యాత్రలు గురించి చెప్పుకోవాలంటే ఆ నాటి ముఖ్యమంత్రి రామారావు గురించి గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్తాయిలో రాజకీయ శక్తుల ఏకీకరణకు ఆయన చేసిన ప్రయత్నాలు ఇన్నీ అన్నీ కావు. ఎన్టీయార్ దురదృష్టం ఏమిటంటే ఆయన ముఖ్యమంత్రిగా వున్నన్ని రోజులూ

కేంద్రంలో ఆయనతో ఏమాత్రం పొసగని ఉప్పు నిప్పు లాటి కాంగ్రెస్ ఏలుబడి వుండేది. ఒక వేళ ఢిల్లీ యాత్ర పెట్టుకున్నా, అక్కడ వున్నసమయమంతా ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకులను కలుసుకుని సంప్రదింపులు జరపడంలోనే గడిచిపోయేది. ప్రధానమంత్రిని కానీ, కేంద్ర మంత్రులను కానీ కలుసుకోవాల్సివచ్చినా అది కేవలం మొక్కుబడిగా సాగిపోయేది. అయితే, ఆయన ఢిల్లీ లో ఎంతటి వున్నత స్తానంలో వున్న వ్యక్తులను కలుసుకోవాలని అనుకున్నాకానీ వేచిచూడాల్సిన అవసరం ఆయనకు ఎంతమాత్రం వుండేది కాదు. ముందుగా నిర్దేశించుకున్న అప్పాయింట్ మెంట్ల ప్రకారం ఎన్టీయార్ తన ఢిల్లీ పర్యటనను అనుకున్న వ్యవధిలో, అనుకున్న పద్ధతిలో ముగించుకుని తిరిగి వచ్చేవారు.

పోతే, ఆ తరువాత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన చంద్రబాబు నాయుడుకి మరింత చక్కని వెసులుబాటు లభించింది. ఎవరు ప్రధానిగా వున్నా, కేంద్ర ప్రభుత్వం ఆయన కనుసన్నల్లో నడిచేదే కాబట్టి ఢిల్లీలో పనులు చక్కబెట్టుకురావడం అన్నది ఆయనకు నల్లేరుపై బండి నడకలా వుండేది. ఎన్టీయార్ వొదిలివెళ్ళిన కాంగ్రెస్ వ్యతిరేక వారసత్వం పుణ్యమా అని ఢిల్లీ లోని ఏలికలందరూ చంద్రబాబు మాటకు ఎదురుచేప్పే సాహసం చేసేవారు కాదు. అందుకే దేశరాజకీయాల్లో చక్రం తిప్పగల సమర్దుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ఇక రాజశేఖరరెడ్డి విషయానికి వస్తే – ఆయన అధికారంలోకి వచ్చేసమయానికి ఢిల్లీ స్తాయిలో కాంగ్రెస్ అధిష్టానం తీరుతెన్నులే సమూలంగా మారిపోయాయి. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తరచూ మార్చే దుష్ట సంస్కృతికి సోనియా గాంధీ మంగళం పాడారు. కాంగ్రెస్ బలానికి తన సొంత బలాన్ని జోడించి, ప్రజలను కాంగ్రెస్ దిక్కుగా మళ్లించి ఇక కాంగ్రెస్ కు రాష్ట్రం లో పుట్టగతులు లేకుండా పోయాయని  అనుకుంటున్న విపత్కర తరుణంలో తెలుగు దేశాన్ని ఓడించి కాంగ్రెస్ కు మళ్ళీ పట్టం కట్టించిన వీరుడిగా అధిష్టానం మెప్పును రాజశేఖరరెడ్డి పొందగలిగారు. అందుకే మరోమాట లేకుండా పార్టీ అధినేత్రి ఆయనకు రాష్ట్ర పాలనా పగ్గాలను అందించారు. ఢిల్లీ పెద్దల అనుగ్రహం పూర్తిగా వుండడంతో రాష్ట్రంలో ప్రత్యేకించి సొంత పార్టీలో వైఎస్సార్ కు ఎదురుచెప్పేవారు లేకుండా పోయారు. కాంగ్రెస్ సంస్కృతిలో భాగమయిన అసంతృప్తి వెల్లుబికి వెల్లువెత్తకుండా నిరోధించగలిగారు. అక్కడక్కడా, అప్పుడప్పుడూ కొందరు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సన్నాయి నొక్కులు నొక్కడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అసంతృప్తి సెగలు ఢిల్లీ వరకు సోకకుండా ఒక స్తాయిలోనే అణిగిపోయాయి.

రాజశేఖరరెడ్డి మొదటి అయిదేళ్ళ పాలన అధిష్టానం జోక్యం అంతగా లేకుండానే అవిచ్చిన్నంగా సాగిపోయింది. వైఎస్సార్ 2004 లో కాకుండా అంతకుముందే అవకాశం లభించి ముఖ్యమంత్రి అయివుంటే గతంలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మాదిరిగానే ఒకటి రెండేళ్లు పాలించి మాజీ ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోవాల్సి వచ్చేదని భావించేవాళ్ళున్నారు. సరయిన సమయంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం వల్లనే ఆయనకు పూర్తి అయిదేళ్ల కాలం పరిపాలించగల అవకాశం చిక్కింది. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ అధిష్టానం తన వైఖరిని ఎంతో కొంత మార్చుకోవడమే దీనికి కారణం.

రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. అప్పటికే వైఎస్సార్ అధినేత్రికి చెక్ చెప్పగల స్తాయినీ, స్తోమతనూ సముపార్జించుకున్నాడన్న సమాచారాన్ని ఆయనంటే గిట్టని కొందరు ఢిల్లీకి చేరవేయడంతో వైఎస్ మరణంతో లభించిన అవకాశాన్ని తనకనుకూలంగా మార్చుకునే చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగానే మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు వుందని పరోక్షంగా ప్రకటించుకున్న వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ని పక్కన బెట్టి రోశయ్యను ముఖ్యమంత్రి గద్దె ఎక్కించింది. అది తాత్కాలికమయిన ఏర్పాటు కావచ్చన్న భ్రమలో జగన్ వర్గం – తాను తాత్కాలిక ముఖ్యమంత్రినే అన్న భావనలో రోశయ్య వుండగానే అధిష్టానం చకచక పావులు కదిపి  రాజశేఖరరెడ్డి కాలంలో  రాష్ట్ర పార్టీపై తాను కోల్పోయిన పాత పెత్తనాన్ని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునే ఎత్తుగడలకు పూనుకుంది. రోశయ్యను మార్చి ఆ స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి, మళ్ళీ వెనుకటి విధానాలకే మళ్లి పోతున్న సంకేతాలను ఇచ్చింది. దానితో, ఇక కుదిరేపనికాదనుకున్న జగన్ సొంత కుంపటి పెట్టి కడప ఉపఎన్నికల్లో చావుదెబ్బ కొట్టడంతో దిమ్మతిరిగి తెప్పరిల్లిన ఢిల్లీ మేధావులు తమ మేధస్సులకు పనిపెట్టి, పదును పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కాయకల్ప చికిత్స మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే, చిరంజీవి పార్టీకి మంగళం పాడించి ఆయనకు కాంగ్రెస్ తీర్ధం ఇవ్వడం, బొత్స సత్యనారాయణకు పీసీసీ పీఠం అప్పగించడం, డిప్యూటీ స్ప్పీకర్ నాదెండ్ల మనోహర్ కు స్పీకర్ గా పదోన్నతి కల్పించడం, తెలంగాణాకు చెందిన ఎస్ స్సీ కాంగ్రెస్ నాయకులు రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి, మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడం మొదలయిన చర్యలన్నీ రాకెట్ వేగంతో తీసుకున్నారు.

కానీ ఎన్ని చేసినా ఏదో ఇంకా మిగిలి పోయిందన్న గుబులే కాంగ్రెస్ ను పట్టి పీడిస్తోంది. జగన్ సమస్యకు పరిష్కారం కనుగొనగలుగుతామన్న ఆశ మినుకు మినుకుమంటూ వుండగానే తెలంగాణా అంశం పీకలమీదకు వచ్చింది. దాంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరోమారు హస్తిన సందర్శన తప్పలేదు. ఢిల్లీలో సోనియాతో సహా అధినాయకులనందరినీ కలిసి వచ్చానన్న సంతోషం ఆయనకు ఎంతో సేపు నిలవలేదు. ఈ లోగా, తెలంగాణా కాంగ్రెస్ నాయకులందరూ హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో సమావేశమై ఈ నెల నాలుగో తేదీన మూకుమ్మడి రాజీనామాలు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కే అందచేస్తామని మరో ఆఖరు గడువుతో పాటు ఆఖరి అస్త్రాన్ని కూడా ఒక్కుమ్మడిగా సంధించారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటనకే కేంద్రం కట్టుబడి వుండాలని, తెలంగాణా ఏర్పాటు మినహా తమకు మరేదీ సమ్మతం కాదనీ వారు తెగేసి చెప్పారు. ఈ వ్యవహారం తెగేదాకా సాగుతుందో, తెగకుండానే మరో ముడి పడుతుందో హైదరాబాద్ వచ్చివెళ్ళిన రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కే తెలియాలి. (01-07-2011)


1, జులై 2011, శుక్రవారం

గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు

గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు



ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం


భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్



‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం

గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.

ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రం లోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం ఇలా చెబుతారు.

• ఓం – భగవంతుడు సర్వ రక్షకుడు.

• భూ: - ఉనికి కలిగినవాడు

• భువః – జ్ఞాన రూపుడు

• స్వః – ఆనంద స్వరూపుడు అంటే దుఖః రహితుడు

• తత్ – అటువంటి లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు

• సవితు: - ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త

• వరేణ్యం – అందరితో ఆరాధింపబడేవాడు

• భర్గః – పరిశుద్ధుడు

• దేవస్యః – ఆవిధమయిన దివ్య గుణములు కలిగిన దైవ స్వరూపుడు

• ధీమహి – ఆత్మలో ఎకమయిన

• యః – ఆ పరమేశ్వరుడు

• నః ధ్యః – మా బుద్ధులను

• ప్రచోదయాత్ – సత్కర్మలలో ప్రేరేపించి శ్రేయస్సు పొందేవిదంగా సమర్ధులను చేయుగాక.

ఇక మూలార్ధం తీసుకుంటే దాని భావం ఇలా వుంటుంది.

“ఓ భగవాన్!
ఏకకాలంలో సమస్త ప్రదేశాలలో వుండగలిగిన ఓ విశ్వరూపీ! అపరిమితమయిన శక్తికలిగిన ధీశాలీ! పరమేశ్వరా!
ఈ చరాచర ప్రపంచంలో లభ్యమయ్యే సమస్త జ్ఞానం నువ్వే. సర్వ ప్రకాశానివి నువ్వే. వరప్రదాతవు నువ్వే.
మాలో భయాన్ని పోగొట్టేది నువ్వే. ఈ విశ్వానికి సృష్టికర్తవు నువ్వే. సర్వోత్తముడివి నువ్వే. శిరసు వంచి నమస్కరిస్తున్నాము. మా మనస్సు, మేధస్సు సత్కర్మలవైపు ఆకర్షించబడేలా చూస్తూ సన్మార్గంలో నడిచేలా మాకు మార్గం చూపు.”

గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.

ఆదునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి.

ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.

మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.

• ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)

ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.

గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం.

అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.

ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.

తత్స వితుర్వరేణ్యం

తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.

ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు.

ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.

ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు.  విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే.

గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు.

భర్గో దేవస్య ధీమహి

భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు.
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.

దియోయోనః ప్రచోదయాత్

ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.

భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.

కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.


ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద

(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)- (29-06-2011)







24, జూన్ 2011, శుక్రవారం

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

కాంగ్రెస్‌ ఇల్లు చక్కబడుతుందా ? - భండారు శ్రీనివాసరావు

(24-06-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)


- కొనసాగుతున్న కాంగ్రెస్‌ ‘సంస్కృతి’

- మళ్ళీ మొదలైన అధిష్ఠానం పట్టు

- వై.ఎస్‌. వ్యతిరేకులకు వరం!

- తెలంగాణలో విశ్వసనీయత ప్రశ్నార్ధకం

- కోస్త, సీమల్లోనూ దయనీయ స్థితి

- పక్కలో బల్లెంలా జగన్‌ సవాళ్ళు



బహుశా రాష్ట్ర కాంగ్రెస్‌ చరిత్రలో మున్నెన్నడు కనీ వినీ ఎరుగని స్వేచ్ఛనూ, వాక్స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్‌ వాదులు నేడు అనుభవిస్తున్నారనుకోవాలి. పార్టీకి చెందిన సీనియర్‌ ఎంపీలు లగడపాటి రాజగోపాల్‌, పొన్నం ప్రభాకర్‌ ఇటీవల టీవీ తెరలపై చేసిన మాటల యుద్ధం చూసిన వారికి ఈ అభిప్రాయం కలగడం సహజం. మువ్వ న్నెల కాంగ్రెస్‌ కండువాలను మినహాయిస్తే, వారిద్దరెవరో తెలియని వారికి ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందినవారంటే నమ్మడం కష్టం. రాష్ట్ర మంత్రి శంకరరావు, మరో కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ సర్వే సత్యనారాయణ ఇదేమాదిరి మరో అంకానికి తెరలేపారు.



హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వారిద్దరూ ప్రచురణార్హం కాని భాషలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా పుణ్యమా అని ఈ సన్నివేశాన్ని ఇంటిల్లిపాదీ ఇళ్ళల్లో కూర్చుని వీక్షించగలిగారు. కాకపొతే, ఈ రకమయిన దూషణ ఘట్టాలు తరచు సాగిపోవడానికి కాంగ్రెస్‌ నాయకులు గత రెండేళ్లుగా శక్తివంచన లేకుండా సాయపడుతూ వస్తున్నారు. జగన్‌ పార్టీని విమర్శించే క్రమంలో కొందరు, ప్రాంతీయ తత్వంతో మరికొందరు, పదవులపై ఆశ పెంచుకుని అది తీరేదారి దొరకక ఇంకొందరు- ఈ మార్గాన్నే ఎంచుకుని బుల్లితెరలకు అవసరమయిన ముడి సరుకుని పంచిపెట్టడంలో తలమునకలుగా ఉన్నారు.



గతంలో కూడా రాష్టక్రాంగ్రెస్‌ నాయకులు తమ పొరపొచ్చాలను దాచిపెట్టుకుని వ్యవహరించిన దాఖలాలు లేవు. పైపెచ్చు రాజకీయాలలో ఈ విధమయిన ధోరణికి ‘కాంగ్రెస్‌ సంస్కృతి’ అనే ముద్దు పేరు కూడా జత పడింది. అలనాటి కాంగ్రెస్‌ కురువృద్ధులు ప్రకాశం పంతులు, సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదాదిగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరూ అసమ్మతిని పెంచిపోషించిన వారే. ముఠా సంస్కృతిని అక్కున చేర్చుకున్నవారే. అరవయ్యవ దశకం చివర్లో జరిగిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం సభ్యుల ఎన్నిక సందర్భంలో కాకాని వెంకటరత్నం, మూర్తిరాజుల నడుమ జరిగిన భీకర పోరు కాంగ్రెస్‌లోని ముఠా తగాదాలను బట్టబయలు చేసింది.



ఆ తరువాతి తరంలో రాష్ట్ర రాజకీయాలను తమదైన శైలిలో శాసించిన చెన్నారెడ్డి, రాజశేఖరరెడ్డి వంటి ఘనాపాఠీలు కూడా తమ పూర్వీకుల బాటలోనే మరికొంత ముందుకు సాగారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు వారికి కలసి వచ్చాయి. అధిష్ఠానానికి అనుకూలంగా ఉంటూనే రాష్ట్రంలో తమ మాటకు ఎదురులేకుండా చూసుకోగలిగారు. ఈ విషయలో చెన్నారెడ్డి కంటే రాజశేఖరెడ్డి చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఆయన జీవించి ఉన్నంత కాలం పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు ఆయన వైపు కన్నెత్తి చూడలేని స్థితి, పన్నెత్తి ఎదిరించలేని పరిస్థితి.



రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి తలకిందులైంది. వైఎస్‌ఆర్‌ హయాంలో రాష్ట్ర పార్టీపై ఆజమాయిషీ చేయలేకపోయిన అధిష్ఠానం మళ్ళీ తన పట్టు బిగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్టీలోని వైఎస్‌ వ్యతిరేకులకు ఇది కలసివచ్చింది. మూసుకుపోయిన నోళ్ళు మళ్ళీ తెరుచుకున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీలో ముసలం పుట్టింది. దీనికి తోడు వైఎస్‌ మరణానంతరం ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ విశ్వసనీయతను ప్రశ్నించే స్థాయికి తీసుకు వెళ్ళింది.



శ్రీకృష్ణ కమిటీ వంటి కంటి తుడుపు చర్యలు ఆ ప్రాంత ప్రజల మనోభావాలను మార్చలేకపోగా ఉద్యమం మరింత ఊపందుకుంది. మరోపక్క వైఎస్‌ఆర్‌ సెంటిమెంటును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిన ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి తన కొత్త పార్టీతో కాంగ్రెస్‌కు పక్కలో బల్లెంగా తయారవడంతో కోస్త, సీమల్లో కూడా పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కడప ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం కాంగ్రెస్‌కు మరింత గడ్డుపరిస్థితిని తెచ్చి పెట్టింది.నాయకుల బలహీనత, చోటా నాయకులకు బలంగా మారింది. పట్టుమని నలుగురు అనుచరులు కూడా లేని చిన్ననాయకులు ముఠా సంస్కృతి పుణ్యమా అని బడానాయకుల అవతారం ఎత్తారు. పదవికి అర్హత సంపాదించుకోవడం కంటే పదవిని అడ్డదార్లలో సంపాదించుకునే క్రమంలో ఆరితేరారు. నాకళ్ళముందు రాజకీయాల్లోకి వచ్చినవాడు అంత పెద్ద పదవిని అందుకోగాలేనిది నేనేనా తక్కువతిన్నదన్న పోటీ మొదలై, అర్హత అనే పదం రాజకీయ పరమ పద సోపా నపఠంలో పెద్దపాము నోట్లోపడి అట్టడుక్కు చేరింది.



ఈ నేపథ్యం కొందరికయినా ఇందిరాగాంధీ నాటి కాంగ్రెస్‌ రోజులను గుర్తుకు తేవడం సహజం. ఆమె శకం మొదలయిన తరువాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తనకు వ్యతిరేకులని లేశమాత్రం అనుమానం కలిగినా సరే, ఇందిర వారిని నిర్దాక్షిణ్యంగా అణిచి వేసేవారు. చదరంగం బల్లపై పావులను కదిపినట్టు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి మార్చివేసేవారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇలాటి ప్రయోగం తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి, దరిమిలా కాంగ్రెస్‌ అవిచ్ఛిన్న పాలనకు ప్రజలు మంగళం పాడడానికి దారితీసింది. ఇందిర హయాంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తమలో తాము ఎన్ని గిల్లికజ్జాలు పెట్టుకుని ఎంత రచ్చ చేసుకున్నా ఢిల్లీలోని అధినాయకుల జోలికి మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు.



అధిష్ఠానం అంటే బెరుకూ, భయం పైనుంచి కిందిదాకా పాకిపోయాయి. కానీ ఇప్పుడలా కాదు, ఏకంగా అధినేత్రి సోనియా గాంధీ జాతీయతనే ఎత్తిచూపే విధంగా మీడియా ముందు మాట్లాడినా అడిగేవాళ్ళు లేకుండా పోయారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనే తేడాలేకుండా వరసపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే విస్తుపోవడం జనంవంతవుతోంది. పార్టీలోని ప్రత్యర్ధులను విమర్శించడానికి వాడుతున్న భాష వెగటుకలిగిస్తోంది. నిజంగా మనసులో మాట చెబుతున్నారా లేక మీడియా దృష్టిని ఆకర్షించడానికా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.



పైపెచ్చు ఈ అపభ్రంశపు పదప్రయోగాలకు అసెంబ్లీ ఆవరణనో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్నో వేదికగా చేసుకుంటున్న తీరు మరీ విడ్డూరంగా ఉంది. ఇక బుల్లితెరలపై అనునిత్యం జరిగే చర్చల్లో పాల్గొనే కాంగ్రెస్‌ నాయకులు అవకాశం దొరికిన ప్రతి సందర్భాన్ని ఇందుకోసం చక్కగా వాడుకుంటున్నారు. ఈ విషయంలో ఏ పార్టీ వెనుకబడి లేదు కానీ, కాంగ్రెస్‌కు మాత్రం అగ్రతాంబూలం ఇవ్వకతప్పదు. ఎందుకంటె తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అందరికంటే ఎక్కువ అని తమకు తామే కితాబు ఇచ్చుకుంటూ, ఆ ముసుగులో మరిన్ని గుద్దులాటలకు దిగే వీలూ చాలూ వారికే ఎక్కువ కనుక.



అలాగని రాష్ట్ర పార్టీపై ఢిల్లీ నాయకులకు పూర్తిగా అదుపు లేకుండా పోయిందని చెప్పలేము. ఇందుకు తాజా ఉదాహరణ, కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులు తెలంగాణ వాదాన్ని అధిష్ఠానం ముందు మరోమారు బలంగా వినిపించే ఉద్దేశంతో జరిపిన ఢిల్లీ యాత్ర. దేశ రాజధానిలో పార్టీ అధిష్ఠాన దేవతలను కలుసుకుని తమ గోడు వినిపించుకోవడానికి వాళ్లు పడ్డ పాట్లు వర్ణనాతీతం. చివరికి ఢిల్లీ దొరలకు మరో గడువు పెట్టి తిరిగి రావాల్సిన పరిస్థితి. ఈ పరిణామాలు వారికి కూడా కొరుకుడు పడడంలేదు. వారి స్వరం పెరుగుతోంది. ఆవేదన స్తానంలో ఆక్రోశం చోటుచేసుకుంటోంది. అది ఆగ్రహంగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్య అలాటిది. అట్టడుగునుంచి వారిపై నానాటికీ ఒత్తిడి ఎక్కువవుతోంది.



తిరిగి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇచ్చినా గెలిచి చట్టసభల్లో కాలుమోపుతామన్న ఆశ అడుగంటుతోంది. ఇక టీవీ చర్చల సంగతి సరేసరి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అధిష్ఠానం ముక్కలనే ముక్కున పెట్టుకుని తిరిగి మీడియా ఎదుట వల్లెవేయడానికి నానా అవస్థ పడుతున్నారు. తాము చేస్తున్న ప్రతి ఢిల్లీయాత్రా మరో డెడ్‌ లైన్‌ ప్రక టించడానికి తప్ప విషయం తేల్చడానికి ఉపయోగపడడం లేదన్న అబిప్రా యం వారిలో కలుగుతున్నట్టుంది. ఇప్పుడు కోస్త, సీమ కాంగ్రెస్‌ నాయకు లదీ అదే పరిస్థితి. మొన్నటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పగల మొనగాళ్ళం తామేఅని పెంచుకున్న నమ్మకం వారిలో సైతం సడలుతున్న ట్టుంది. మంత్రి శైలజానాథ్‌ నాయకత్వంలో ఢిల్లీ వెడదామని అనుకుంటు న్నట్టు సీనియర్‌ కాంగ్రెస్‌ ఎంపీ లగడపాటి చేసిన ప్రకటన దీనికి అద్దం పడుతోంది.



మరో వారం పది రోజుల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలను విస్తరిస్తారన్న సమాచారం ఒక్కటే వారిలో కొందరిని అధిష్ఠానం ముందు అదిమి పెడుతోంది. కానీ ఢిల్లీనుంచి తాజాగా అందుతున్న వార్తలు వారిని మళ్ళీ నిరాశలోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులను బట్టి 2014 ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు మొండి చేయి చూపడం ఖాయమన్న అంచనాలకు వచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను పక్కనబెట్టే అవకాశాలు లేకపోలేదన్నది ఆ వార్తల సారాంశం. భావిభారత ప్రధానిగా రాహుల్‌ గాంధీని ప్రతిష్ఠించాలని కలలు కంటున్న కాంగ్రెస్‌ అధిష్ఠాన దేవత గెలుపోటముల బేరీజులో ఆంధ్రప్రదేశ్‌ ను చిన్నచూపుచూసే ప్రమాదం ఉందని పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.



రాహుల్‌ గాంధీ ఆలోచనలు సైతం ఇదే క్రమంలో సాగుతున్నాయన్న వార్తలు నిజమయితే, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మన రాష్ట్రానికి మళ్ళీ మొండిచేయి ఖాయం. ఎందుకంటె, పందెం కాసేవాడు గెలుపు గుర్రాన్నే ఎంచుకుంటాడు. కొడిగడుతున్న కాంగ్రెస్‌ ఆశలకు అధిష్ఠానం తలపెట్టిన కాయకల్ప చికిత్స ఏమేరకు పనికి వస్తుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, పీసీసీ కొత్త అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కలసికట్టుగా పనిచేయడం మీదనే పార్టీ భవిష్యత్తు కొంత ఆధారపడి ఉంది. ఇంకా మూడేళ్ల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. వీరిద్దరూ విభిన్న అధికారకేంద్రాలుగా మారిపోకుండా పార్టీ తలరాతను మారుస్తారా లేక తమనే అధిష్ఠానం మార్చే పరిస్థితి కొని తెచ్చుకుంటారా అన్నది వేచి చూడాల్సిన విషయం.











18, జూన్ 2011, శనివారం

సాధించడమా ? సాగిలబడడమా ? బీసీలే తేల్చుకోవాలి! – భండారు శ్రీనివాసరావు

సాధించడమా ? సాగిలబడడమా ? బీసీలే తేల్చుకోవాలి! – భండారు శ్రీనివాసరావు


(18-06-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

బడుగులపై రాజకీయ పార్టీలు కురిపిస్తున్న ప్రేమ కేవలం నీటి బుడగలేనా ? అగ్రవర్ణ పాలకుల వోటు బాంకు నిర్మాణానికి ఉపయోగపడే పునాది రాళ్ళా వాళ్లు ? స్తానిక సంస్తల ఎన్నికల్లో బీ సీ రిజర్వేషన్ లకు సంబంధించి ఆయా పార్టీలు ప్రదర్శిస్తున్న వైఖరులు గమనిస్తుంటే ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అనిపిస్తోంది.


ఈ ఎన్నికల పట్ల వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీ ఆర్ ఎస్ వంటి పార్టీలకు తప్ప మిగిలిన వాటికి ఎలాటి ఆసక్తి లేదన్న సంగతి జగమెరిగిన విషయమే. కడప ఉప ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఊపులోవున్న జగన్ పార్టీ స్తానిక సంస్తల ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత త్వరగా మరోసారి తన తడాఖా చూపించాలని వువ్విళ్ళూరుతోంది. అలాగే, అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే తెలంగాణా అంశాన్ని కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని ఆశించి భంగపడిన టీ ఆర్ ఎస్, సహజంగానే స్తానిక సంస్తల ఎన్నికల్లో మరో సారి తన సత్తా ప్రదర్శించి పాలక పక్షం పై వొత్తిడి పెంచాలని అనుకోవడంలో విడ్డూరమేమీ లేదు. విజయం పై ధీమా ఈ రెండు పార్టీలకు వున్నట్టుగా మిగిలిన పార్టీలకు లేకపోవడంవల్లనే- ఈ ఎన్నికలు ఏదో విధంగా వాయిదా పడితే బాగుండు అన్న ధోరణితో అవి వున్నాయి. పాలక పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే వున్నట్టు కానవస్తోంది. స్తానిక పోరుకు ఏ నిమిషంలోనయినా తాము సిద్ధం అన్నట్టు ఈ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మేకపోతు గాంభీర్యాన్ని తలపిస్తున్నాయి. ఎందుకంటె కడప ఉప ఎన్నికల్లో ఏమి జరిగిందో మరచిపోయేంత సమయం ఇంకా కాలగర్భంలో కలిసిపోలేదు. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే మళ్ళీ ఎన్నికలను ఎదుర్కోవడం అంటే కొరివితో తల గోక్కోవడమే. ఈ తరుణంలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఈ పార్టీలకు కలసివచ్చింది. స్తానిక సంస్తల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులవారికి కల్పించిన 34 శాతం రిజర్వేషన్లకు గండి కొట్టేందుకు ఆ రిజర్వేషన్లనే ఒక ఆయుధంగా వాడడానికి రంగం సిద్ధం అయిందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్లు యాభయ్ శాతానికి మించకూడదన్న సర్వోన్నత న్యాయస్తానం తీర్పు నేపధ్యంలో బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టే కుట్రకు శ్రీకారం చుట్టారన్నది వారి అభిప్రాయం. సర్పంచుల సంఘం పేరుతొ న్యాయస్తానంలో కేసు వేయించడం వెనుక ప్రభుత్వ హస్తం వుందని, కర్నాటకకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మన రాష్ట్రానికి అన్వయించడం సరికాదని బీసీ నాయకుల వాదన.


రాష్ట్రంలో బీసీ జనాభాకు సంబంధించిన వివరాలు 2001 లో నిర్వహించిన మల్టీ పర్పస్ హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడయ్యాయి. ఆ సర్వే ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో బీసీలు 43 శాతానికి మించి వున్నట్టు తేలింది. బహుశా కడచిన ఈ పదేళ్లలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఈ జనగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 43 శాతానికి పెంచాలన్నది ఆ సంఘాల నేతల అంతరంగంగా కానవస్తోంది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలన్నది కూడా వారి అభిప్రాయంగా వుంది. ఇంత భారీగా కోరడంలో భావ్యత, సంభావ్యత అటుంచితే,
చావుకు  పెడితే లంఖణానికయినా వస్తుందన్న నానుడి ప్రకారం బీసీలకు ఏదో ఒక మేరకు లబ్ది చేకూరగలదన్నది వారి భావన కావచ్చు.


మరో విషయం ఏమిటంటే - కర్నాటకలో ఈ రకమయిన సర్వే అప్పట్లో జరగలేదు. ఆ కారణంగా సుప్రీం తీర్పు మన రాష్ట్రంలో చెల్లుబాటు కాదని చెప్పడానికి కూడా వీలుంది.


ఎన్నికలపట్ల ఆసక్తి లేకపోయినా బీసీల పట్ల లేని ప్రేమను ఒలకబోయడానికి సరయిన అదునుగా భావించి ఎస్టీలకు 8.2 శాతం, ఎస్సీలకు 18.30 శాతం,బీసీలకు 34 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఒక జీవోను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ సర్పంచుల సంఘం తరపున రామ్మోహన రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ కు తొలిదశలోనే ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజులు విచారణ జరిపిన హైకోర్ట్ సింగిల్ జడ్జి -రిజర్వేషన్ శాతాల విషయంలో జోక్యం చేసుకోలేమని తెలుపుతూ, ఆ పిటీషన్ ను తోసిపుచ్చారు. స్తానిక సంస్తల ఎన్నికలను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేయడంతో ఇక ఎన్నికలకు మార్గం సుగమం అయినట్టేనని అంతా సంతోషించారు. తమ హక్కులకోసం పోరాడుతున్న బడుగులు ఆ తీర్పును తమ తొలి విజయంగా భావించారు. ఇది జరిగింది ఈ నెల 14 తేదీ మంగళ వారం నాడు. కోర్టు తీర్పు గురించి తెలియగానే, ఎన్నికల నిర్వహణకు తాము సంసిద్ధంగా వున్నామనీ, అయిదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ , జులై 21 కల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామనీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమాకాంత రెడ్డి ప్రకటించారు కూడా.


ఇరవై నాలుగ్గంటలు గడవకముందే పరిస్తితి తలకిందులయింది. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ ఎదుట పిటీషన్ దాఖలు కాకముందే , ఆ మరునాడే అంటే బుధవారంనాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి జీవోను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని విచారించింది. పిర్యాది తరపు వాదనలు విన్న ధర్మాసనం జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దశలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎలాటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


న్యాయస్తానం ఉత్తర్వుల ధర్మమా అని స్తానిక సంస్తల ఎన్నికలకు బ్రేక్ పడ్డట్టయింది. రోగి కోరిందే వైద్యుడు ఇచ్చినట్టయింది.


కోర్టు తీర్పు దరిమిలా రాష్ట్ర ఎన్నికల సంఘం తన వైఖరిని సవరించుకుంది. ప్రభుత్వం రిజర్వేషన్ లు ప్రకటించే వరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే, ప్రభుత్వం తలచుకుంటే నాలుగయిదు రోజుల్లో ఈ విషయంలో నోటిఫికేషన్ జారీచేయవచ్చంటూ రమాకాంతరెడ్డి బంతిని ప్రభుత్వం కోర్టులోకి నెట్టేశారు.
ఏతావాతా ఏమయితేనేం మొత్తం మీద స్తానిక పోరుకు తెర పడిందనే అనుకోవాలి.
కోర్టు తీర్పులను పాలక పక్షాలు తమకు అనువుగా మలచుకోవడానికి ప్రయత్నించడం కొత్తేమీ కాదు. ఎన్నికలు వాయిదా వేయడానికి వీలయిన కారణాల అన్వేషణలో వున్న ప్రభుత్వానికి హై కోర్టు డివిజన్ బెంచి తీర్పు ఊరట ఇచ్చింది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లితీరుతుందనీ, కోర్టు జోక్యంతో ఎన్నికలు వాయిదాపడే అవకాశం వుందని ఆలోచించే ఉభయతారకమయిన ఈ ఎత్తుగడకు ప్రభుత్వం పూనుకుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ రిజర్వేషన్ లపై ఎవరయినా కోర్టుకు వెళ్ళిన పక్షంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుందని మంత్రి జానారెడ్డి అంతకు చాలా రోజులముందు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పేర్కొన్నాయి.
కాకపొతే ఈ ఎన్నికలు సర్కారుకు అవసరం లేకపోయినా ఆ అవసరం జగన్ పార్టీకి వుంది. అందుకే ఆ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన రెడ్డి ఒక సరికొత్త కోటా ప్రతిపాదన ముందుకు తెచ్చారు. సుప్రీం తీర్పుకు భంగం కలగకుండానే బీసీలకు 34 శాతం కోటా అమలు చేయవచ్చన్నది దాని సారాంశం. బీసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ లు కల్పించాలని వాదిస్తున్న రాజకీయ పార్టీలు – జనరల్ స్తానాల్లో సయితం బీసీ అభ్యర్ధులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించవచ్చన్నది ఆయన అభిప్రాయం. ఆ విధంగా చేస్తే సకాలంలో ఎన్నికలు జరుపుకోవచ్చనీ, ఈ ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేయాలని జగన్ మోహన రెడ్డి సలహా ఇచ్చారు. ఆయనకున్న రాజకీయ అవసరాల దృష్ట్యా ఆయన ఈ విధమయిన సూచన చేసి వుండవచ్చు. అన్ని పార్టీలు దీనికి కట్టుబడి నిర్దేశిత జనరల్ సీట్లలో బీసీ అభ్యర్ధులను పోటీకి నిలబెట్టినప్పుడే బీసీలకు న్యాయం జరిగే వీలుంటుంది. అలాకాకుండా జనరల్ స్తానాల్లో కొన్ని పార్టీలు బీసీలను నిలబెట్టి, మరి కొన్ని పార్టీలు ఆర్ధిక,సామాజిక బలాలు దండిగావున్న అభ్యర్ధులను పోటీకి పెడితే ఉపయోగం వుండదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పార్టీ బీసీల పట్ల సానుభూతి ఒలకబోస్తుంది. వారికి రాజకీయ అధికారం అప్పగించడమే తమ ధ్యేయమని బల్ల గుద్ది చెబుతుంది. తీరా సమయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గి బీసీలకు మొండి చేయి చూపడం వాటికి మామూలయిపోయింది. రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి కొరవడితే ప్రధాన పక్షాల పబ్బం గడవడం మినహా ఈ ప్రతిపాదన వల్ల బీసీలకు ఒరిగేదేమీ వుండదు. పైగా బీసీల ఆత్మ గౌరవంతో ముడిపడిన అంశం ఇది.
రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాల్స్సిన హక్కుని ఇతరుల దయాదాక్షిణ్యాల ద్వారా పొందడం వారికి రుచించక పోవచ్చు.
అయితే, ఇక్కడ ఒక విషయాన్ని గమనంలో వుంచుకోవడం మంచిది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకడుగు ముందుకు వేసి రెండడుగులు వెనక్కు వేయాలని వామపక్షవాదులు తరచూ పేర్కొంటుంటారు. అంతిమ లక్ష్యమయిన రాజకీయాధికారాన్ని తద్వారా రాజ్యాధికారాన్ని అడ్డదోవలో సాధించుకోవాలా లేక నిర్విరామ పోరాట పద్ధతుల ద్వారా రాజ్యాంగ బద్ధంగా పొందాలా అన్నదే ఈ నాడు బీ సీ సంఘాలముందు నిలచిన సమాధానం లేని ప్రశ్న. (17-06-2011) 

12, జూన్ 2011, ఆదివారం

ఎంతో చిన్నది జీవితం! – భండారు శ్రీనివాసరావు

ఎంతో చిన్నది జీవితం! – భండారు శ్రీనివాసరావు



స్నేహం అనేది నీటి మీద రాత కాదు రాతి మీద గీత.


ఇద్దరు మిత్రులు అడవి మార్గం లో ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఓ నది దాటుతుండగా వారి నడుమ ఏదో విషయంలో వాదప్రతివాదాలు మొదలయ్యాయి.


మాటామాటా పెరిగింది. వాటిలో తీవ్రత పెరిగింది. అందులో ఒకడు కోపం పట్టలేక రెండో వాడిని చాచి లెంపకాయ కొట్టాడు.


దెబ్బతిన్నవాడు ఖిన్నుడయ్యాడు. కానీ స్నేహితుడుపై తిరిగి చేయిచేసుకోలేదు.



మౌనంగా తల దించుకుని చేతి వేళ్ళతో నీటిమీద ఓ వాక్యం రాసాడు.


“ఈ రోజు నాకు చాలా దుర్దినం. మంచి స్నేహితుడు అనుకుంటున్న వ్యక్తి నా చెంప పగలగొట్టాడు”


దెబ్బకొట్టినవాడికి స్నేహితుడు రాసినదేమిటో అర్ధం అయింది. కానీ ఏమీ మాట్లాడలేదు. ప్రయాణం సాగుతోంది. కానీ వారి నడుమ మాటలే నిలచిపోయాయి. నీటిలో నడుస్తుండగానే ఉన్నట్టుండి ఓ అల విసురుగా వచ్చింది. దాని తాకిడికి దెబ్బతిన్న వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. రెండోవాడు ప్రమాదాన్ని పసికట్టి ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న స్నేహితుడ్ని కాపాడి వొడ్డుకు చేర్చాడు.


త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నవాడికి, ప్రాణం కాపాడిన వాడికి కృతజ్ఞతలు యెలా చెప్పాలో తెలియలేదు. తీరం చేరగానే కనిపించిన ఓ రాతిపై తన మనసులోని భావాన్ని చెక్కాడు.


“ఈ రోజు నా జీవితంలో మరవలేని రోజు. నా స్నేహితుడు తన ప్రాణాన్ని సయితం లెక్క చేయకుండా నా ప్రాణాన్ని కాపాడాడు. ఈ రోజునూ, అతడు నాకు చేసిన సాయాన్నీ ఎన్నటికీ మరువలేను.”


అది చదివి ఆశ్చర్యపోవడం రెండోవాడి వంతయింది.


‘ఇదేమిటి? దెబ్బ కొట్టినప్పుడు నీటి మీద గెలికాడు. ఇప్పుడేమో రాతి మీద చెక్కాడు.’


మనసులో మెదిలిన సందేహాన్ని మనసులోనే దాచుకోకుండా స్నేహితుడి ముందు బయట పెట్టాడు.


‘చెప్పు మిత్రమా! నాతో దెబ్బతిన్నప్పుడేమో నీటిమీద రాశావు. ఇప్పడేమో రాతిమీద రాశావు. ఏమిటి ఇందులోని మర్మం.’


రెండోవాడు ఇలా జవాబు ఇచ్చాడు.


“ఎవరయినా మనల్ని బాధ పెట్టినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోకూడదు. నీటి మీద రాసిన రాత ఎంతమాత్రం నిలవదు. మరచిపోవాల్సిన విషయం కనుక అలా రాసాను. పోతే నీవు చేసిన సాయం అంటావా. ఒకరోజుతో మరచిపోయేది కాదు. జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి. రాతి మీద గీతలా కలకాలం గుర్తుండిపోవాలి. అందుకే అలా రాశాను”


అందుకే పెద్దలంటారు.


జీవితంలో ఓ విశిష్ట వ్యక్తిని కలుసుకోవడానికి ఓ క్షణం పట్టకపోవచ్చు. వారిని గురించి ఓ అవగాహనకు వచ్చి మెచ్చుకోవడానికి మరో గంట పట్టవచ్చు. వారిని అర్ధం చేసుకుని ఆరాధించడానికి ఓ రోజు తీసుకోవచ్చు. కానీ అలాటి వారిని మరచిపోవడానికి మాత్రం మొత్తం జీవిత కాలం చాలదు.


జీవితమనేది మనకు ఒక్కసారిమాత్రమే భగవంతుడు ప్రసాదించే వరం. దాన్ని వృధా చేయకుండా జీవిత సారాన్ని పూర్తిగా అనుభవించాలి.జీవితంలో తారసపడిన వైభోగాలకు విలువ ఇవ్వవద్దు. మీ అనుకున్నవారికి, నా అనుకున్నవారికి విలువ ఇవ్వండి.


ఇతరులని ద్వేషిస్తూ కూర్చుంటే జీవితం సరిపోదు. ఎందుకంటే –


‘ఎంతో చిన్నది జీవితం!’



10, జూన్ 2011, శుక్రవారం

వయసు నవ్వింది – భండారు శ్రీనివాసరావు

వయసు నవ్వింది – భండారు శ్రీనివాసరావు




రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.


చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే. బస్సెక్కి తుర్రున వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె - నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. ఓ అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు. టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల ఊరోచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.


పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి.అరచేతిమందాన  మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.


రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్న గీత గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు నాగేశ్వర్రావులా వుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు. నవ్వుకోవడం నా వంతయింది.


రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు. తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు. కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. చూశారా నా స్పెషాలిటీ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.


రామారావుకు మెల్లమెల్లగా వయసు మీద పడుతోంది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. కానీ, ఎవరో అతికించినట్టు ఎప్పటిలాగానే పెదాలపై చెరగని చిరునవ్వు. అయితే అందులో జీవమేదీ ?


రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కాదు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.


ఎందుకంటె నా పేరు ‘వయస్సు’ కనుక. (10-06-2011)

ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు


ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు

(10-06-2011 నాటి ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)


తిరుపతి మొక్కు తీర్చుకున్న తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సజావుగా జరిగిపోవడం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నిబంధనల సాకుతో సోదిలో లేకుండా పోవడం - ఇవన్నీ ముఖ్యమంత్రికి సానుకూల పరిణామాలే. స్పీకర్ ఎన్నిక ద్వారా ‘రుజువయిన విశ్వాసం’ ఆయనలో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది. పరిపాలనపై పట్టు పెంచుకునే దిశగా ఆయనతో అడుగులు వేయిస్తోంది. రైతు సదస్సుల పేరుతొ జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పనిలో పైగా పార్టీ కార్యకర్తల సమావేశాల్లో స్వరం పెంచి మాట్లాడేలా చేస్తోంది. దీనికి ఉదాహరణ శ్రీకాకుళంలో ఆయన చేసిన ప్రసంగం. ఆ ప్రసంగంలో జగన్ అనుకూల కాంగ్రెస్ నాయకులను గురించి ఆయన చేసిన ప్రత్యేక ప్రస్తావన. పార్టీలో జగన్ కోవర్టులుగా అభివర్ణిస్తున్న వారికి ముఖ్యమంత్రి కొత్తగా ఇంటి దొంగలని నామకరణం చేశారు. ‘ఇంటి దొంగల్ని ఈశ్వరుడయినా పట్టలేడు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్న వాళ్లు దయచేసి వెళ్ళిపొండి. లేని పక్షంలో మీ పాత స్తానాలకు మేమే పంపిస్తాం.’ అన్న రీతిలో ఆయన ప్రసంగం సాగింది. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వారు కూడా శ్రీకాకుళం లో ఆయన చూపిన తెగువను చూసి ఆశ్చర్య పోయివుంటారు. బహుశా, ఆయన ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తరువాత పార్టీ లోని జగన్ అనుకూల వర్గం వారిపై ఈ విధంగా విరుచుక పడడం ఇదే మొదటి సారి. పైగా శ్రీకాకుళం జిల్లాలో జగన్ వర్గం ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందిన ధర్మాన కృష్ణ దాస్, కొర్ల భారతి ముఖ్యమంత్రి ప్రసంగించిన రైతు సదస్సుకు హాజరయిన వారిలో వున్నారు. ఆ తరువాత జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ముఖ్యమంత్రి తన విమర్శల ప్రస్తావనకు వేదికగా చేసుకోవడం విశేషం.


అయితే, ముఖ్యమంత్రి హెచ్చరికలను ‘నిస్పృహతో చేసిన వ్యాఖ్యలు’ గా రాజకీయపరిశీలకులు పరిగణిస్తున్నారు. స్పీకర్ ఎన్నికతో తన ప్రభుత్వం పట్ల శాసన సభ ‘విశ్వాసం’ రుజువయిందని సంబరపడుతున్న ముఖ్యమంత్రి, అదే నోటితో పార్టీలో ‘ఇంటి దొంగల’ ప్రస్తావన తీసుకురావడం ఆయనలోని ద్వైదీభావానికి అద్దం పడుతోందని అంటున్నారు. అలాగే, ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నియామకం ముఖ్యమంత్రి అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పైపెచ్చు అధిష్టానం ఎంపిక చేసిన బొత్స సత్యనారాయణ సాదా సీదాగా కనబడే అసాధారణ రాజకీయ నాయకుడు. సామాజిక కోణం నుంచి చూసినా లేక ఈనాటి రాజకీయాలకు అవసరమయిన ఇతర కోణాలనుంచి చూసినా బొత్స సత్యనారాయణ అన్ని విధాల ముఖ్యమంత్రికి సమ ఉజ్జీ అనే చెప్పాలి. జగన్ మోహన రెడ్డిని దీటుగా ఎదుర్కొనగల సత్తా వున్న మనిషిగా పార్టీ అధిష్టానం బొత్సను గుర్తించి పీసీసీ పీఠం అప్పగించింది. అందర్నీ కలుపుకుపోయే బొత్స తత్వం పార్టీ పటిష్టానికి ఉపయోగపడవచ్చు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు పట్ల ఆయన గతంలో వెల్లడించిన సానుకూల భావాలే పార్టీ కొత్త అధ్యక్షుడు కావడానికి సానుకూలంగా మారాయని చెప్పవచ్చు. ఒక్క వి.హనుమంతరావును మినహాయిస్తే తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులెవ్వరు ఆయన ఎంపిక పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అలాగే టీ ఆర్ ఎస్ కూడా. ఇవన్నీ ముందు ముందు బొత్సకు కలిసొచ్చే అంశాలే. దానికి తోడు, పదవి రాగానే, ఢిల్లీ నుంచి తిరిగొస్తూనే, అస్వస్తత నుంచి కోలుకుంటున్న కాకా మొదలుకుని సొంత పార్టీ – ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసి కొంగొత్త భ్రమలతో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న చిరంజీవిని కూడా ఇంటికి వెళ్లి కలిసి తనతో కలుపుకోగల కలుపుగోలుతనం బొత్స సొంతం.


సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి ఉత్తరాంధ్రకు చెందిన బొత్సకు అధిష్టానం పీ సీ సీ అధ్యక్ష పీఠం అప్పగించడానికి ఇతరత్రా కారణాలు కూడా వున్నాయి. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలవరపెడుతున్న అంశాలలో తెలంగాణాతో పాటు అంతటి ప్రాధాన్యం కలిగింది జగన్ మోహన రెడ్డి స్తాపించిన కొత్త పార్టీ. ఈ పార్టీవల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ భవితవ్యానికి ఎదురుకాగల ముప్పు ఎలాటిదన్నది కడప ఉప ఎన్నికలలో ఎదురయిన ఘోర పరాజయంతో దానికి అర్ధం అయింది. పైకి ఎన్ని బీరాలు పలుకుతున్నా రాష్ట్రంలో ఆ పార్టీని ఎదుర్కోవడం రాజకీయంగా కాంగ్రెస్ కు పెనుసవాలే అన్నది ఆ పార్టీ నాయకులే ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరిస్తున్న సత్యం. అందుకే, కడప ప్రభావాన్ని కనీసం ఉత్తరాంధ్రలోనయినా నిలువరించగలిగితే రానున్న ఎన్నికల నాటికి కాంగ్రెస్ పడవను వొడ్డు ఎక్కించవచ్చన్నది ఆ పార్టీ వ్యూహంగా కానవస్తోంది. ఉత్తరాంధ్రలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న బొత్స ద్వారా కొంత మేరకయినా నష్టాన్ని పూడ్చుకోవడం అన్నది ఆ పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా తోస్తోంది. వై ఎస్ జగన్ హవాకు అడ్డుకట్ట వేయడం ప్రధాన కర్తవ్యంగా మారిన కాంగ్రెస్ అధిష్టానం కంటికి బొత్స అవసరానికి పనికి వచ్చే తురుపు ముక్కగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.


రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ పట్ల బొత్స అనుసరిస్తున్న వైఖరి కూడా బొత్సకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదపడి వుంటుంది. రాజశేఖరరెడ్డికి అనుంగు శిష్యుడయిన బొత్స- తన విధేయతను కానీ, విశ్వాసాన్ని కానీ ఆయనవరకే పరిమితం చేసి, ఆయన అనంతరం జగన్ మోహన్ రెడ్డిని ఎడంగా వుంచి వ్యవహరించడం అప్పట్లో వై ఎస్ అభిమానులకు కొరుకుడు పడలేదు కూడా. కానీ, ఇప్పుడదే అధిష్టానం వద్ద మార్కులు సంపాదించడానికి బొత్సకు ఉపయోగపడిందని అనుకోవాలి.


అయితే, ఆయనలోని చొరవా చురుకుదనం ఎలాటి ముఖ్యమంత్రికయినా ఇబ్బంది కలిగించే లక్షణాలే. క్రమంగా బలపడుతున్నానన్న ఆశలు కదలాడుతున్న తరుణంలో జరిగిన బొత్స నియామకం కిరణ్ కుమార్ రెడ్డికి ఏ విధమయిన బలమిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటె, సహజంగా మాటకారి అయిన బొత్సను, ముభావంగా ముక్తసరిగా మాట్లాడే ముఖ్యమంత్రితో పోల్చిచూసుకోవడం మొదలవుతుంది. పైపెచ్చు, రాజకీయ పరమపద సోపానపఠంలో నిచ్చెనలన్నీ త్వరత్వరగా ఎక్కేసి మరెన్నో ఎత్తులకు ఎదగాలన్న కాంక్ష బలంగా వున్న బొత్స తదనుగుణంగానే రాజకీయ ఎత్తులకు పూనుకుంటే ఆశ్చర పడాల్సింది ఏమీ వుండదు. పీ సీ సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా వుండాలని బొత్స పట్టుబట్టడం వెనుక ఏదయినా ముందు చూపు కూడా వుండివుండవచ్చు. సీ ఎం కావాలన్న కోరికను కూడా దాచుకోని నైజం ఆయనది.


మామూలు పరిస్థితుల్లో అయితే పీసీసీ అధ్యక్ష పీఠం అన్నది అలంకారప్రాయమే. ఎన్నికల సమయంలో మాత్రం ఈ పదవికి ఎంతో కొంత ప్రాధాన్యత వుంటుంది. పార్టీ అభ్యర్ధుల ఎంపిక సమయంలో కొందరి విషయంలో నయినా పీసీసీ అధినేత మాట చెల్లుబాటు అయ్యే అవకాశం వుంటుంది. ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వుంది. పోనీ, స్తానిక సంస్తల ఎన్నికలయినా కనుచూపు మేరలో వున్నాయనుకుంటే, ఆ ఆశ కూడా కనబడడం లేదు. కడప ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో స్తానిక సంస్తల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంటుందనే ఆశలు ఆవిరవుతున్నాయి. పాలక వర్గాలు రద్దయిన స్తానిక సంస్తలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించే ఆర్డినెన్స్ ఇవ్వాళో రేపో జారీ అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో అనుభవంలోకి వచ్చిన ఉద్రిక్త క్షణాలు ముఖ్యమంత్రిని ఇంకా కలవరపెడుతూనే వుండి వుండవచ్చు. ఆ ఎన్నికలో సాధించిన విజయం కేవలం సాంకేతిక మైనదే అన్న విషయం ఆయనకు తెలియంది కాదు. ప్రజారాజ్యం విలీనంతో పెరిగిన బలం, మజ్లిస్ పార్టీ మద్దతు, అనర్హత వేటు పడుతుందన్న భయంతో జగన్ అనుకూల వర్గీయులయిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వత్తాసు పలకడం – అధికార పార్టీ అభ్యర్ధుల గెలుపుకు దోహదం చేసాయి. అయినా కూడా రావాల్సిన వోట్లకన్న అత్తెసరు వోట్ల ఆధిక్యం మాత్రమే లభించడం ఆ పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేసింది. ప్రస్తుతానికి బయటపడినా ముందు ముందు మరోసారి ఇదే పరీక్ష ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అవిశ్వాసం అనే కత్తి ముఖ్యమంత్రి నెత్తిమీద వేలాడుతూనే వుంటుంది. మరో అగ్ని పరీక్ష తెలంగాణా రూపంలో తయారుగా వుంది. (09-06-2011)