IAS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
IAS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఏప్రిల్ 2022, బుధవారం

గద్దర్ టు గణేశా! – భండారు శ్రీనివాసరావు

 రెయిన్ బో ఇయర్స్. ఒక తెలుగువాడు రాసిన ఇంగ్లీష్ నవల. దీన్ని నవల అనాలా! లేక కాల్పనిక పాత్రలతో కూర్చిన ఒక వ్యక్తి వాస్తవ  జీవన చిత్రం అనాలా! రాసింది ఆషామాషీ వ్యక్తి అయితే ఇంత చర్చ అనవసరం. కర్నాటక కేడర్ లో అడిషినల్ చీఫ్ సెక్రెటరీ స్థాయివరకు ఎదిగిన ఓ సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి రాయడం వల్ల, పుస్తకం టైటిల్ కు CONFLICTS TO CONTENTMENT అనే ట్యాగ్ లైన్ జోడించడం వల్ల పెరిగిన ఆసక్తి కారణంగా ఈ పుస్తకం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది.

పుస్తక పరిచయ కార్యక్రమం నిన్న మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని టూరిజం ప్లాజాలో జరిగింది. మండుటెండ మాడుస్తున్నా సభామందిరం కిటకిటలాడింది. అనేకమంది విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారులు, రచయితలు, పాత్రికేయులు హాజరయ్యారు. హాజరీ ఈ స్థాయిలో ఉండడానికి ఈ పుస్తకం గురించి నిన్న ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో మావో నుంచి మహర్షి దాకా అనే శీర్షికతో శ్రీ కారుసాల వెంకటేష్ రాసిన సవివర సమీక్షా వ్యాసం  కూడా చాలావరకు కారణం అని చెప్పవచ్చు.  

పుస్తక రచయిత పేరు మాఢభూషి మదన్ గోపాల్. తెలంగాణా గడ్డ మనిషి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మదన్ గోపాల్ తండ్రి ఎం. వెంకటాచారి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. పుచ్చలపల్లి సుందరయ్యగారితో కలిసి పనిచేశారు.  వామపక్ష భావజాలంతో పుట్టి పెరిగిన మదన్ గోపాల్, మరో అడుగు ముందుకు వేసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ సానుభూతిపరుడిగా ఎదిగారు. ఇటువంటి వ్యక్తి  ఇండియన్ సివిల్ సర్వీసులో  ఐ.ఏ.ఎస్. హోదా పొందడం ఓ విచిత్రం.  నక్సలైట్ అభిమాని అనే కారణంతో కొన్నాళ్ళు సస్పెండ్ అయిన చరిత్ర కూడా వుంది.

నవలల్లో రచయిత కధని మలుపులు తిప్పినట్టే, ఊహకు అందని, మనిషి బుర్రకు చిక్కని  ఏదో  మానవాతీత శక్తి కూడా మనుషుల జీవితాలను అనేక మలుపులు తిప్పుతుంది. ఈ క్రమంలో   అనేకరకాల ఘర్షణలు, సంఘర్షణలు. (CONFLICTS).  మరి  CONTENTMENT సాధించడం ఎల్లా!

(ఈ పుస్తకం నేనింకా చదవలేదు. అంచేత ఇందులో పేర్కొన్న అంశాలు ఒక క్రమంలో ఉన్నాయా లేదా అనేది నాకు తెలియదు.  సభలో మాట్లాడిన దాన్నిబట్టి. ఆ తర్వాత ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్నప్పుడు చెవినపడ్డ విశేషాలు ఇవి)

మదన్ గోపాల్ కి  చలం గురించి ఎవరు చెప్పారో తెలియదు. తిరువన్ణామలైలో ఉంటున్న గుడిపాటి వెంకటాచలంతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలు పెట్టారు. ఆ ఉత్తరాలు చదివిన చలం, నీ రాతలతో నా తల తినడం ఆపేసి ఓసారి నా దగ్గరకు రా అని ఓ కార్డు ముక్కమీద జవాబు రాసిపడేసారు.

మదన్ ఆ పిలుపు పట్టుకుని రమణాశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. ఆ సమయంలో చలం,  వచ్చిన వాళ్ళని కలుసుకుంటున్నారు. మదన్ గోపాల్ వెళ్లి ఎదురుగా నిలబడితే ఎవరు నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు అనే ప్రశ్న ఒక్కటి కూడా వేయకుండా, వెంటనే  ఆయనకు బస ఏర్పాటు చేశారు. పొద్దున్నే ఉపాహారం కాసేపు తోటపని. పగలు చలం చెంత గడపడం. శ్రీ రమణుని బోధనలు గురించి తెలుసుకోవడం. అప్పుడు అనిపించింది. జీవితం అంటే వేరే ఒకటి వుందని. దాని ద్వారా లభించే CONTENTMENT  ఒకటి ఉంటుందని. మూఢ భక్తి వేరు, ఆధ్యాత్మిక చింతన వేరు . ఆధ్యాత్మికత అంటే తనను తాను తెలుసుకోవడం. అదే శ్రీ రమణుని భక్తిమార్గం అని అప్పుడే తెలిసింది.

సరే ముందు మొదలు పెట్టిన గద్దర్ టు గణేశా ఏమిటి అంటే!

పుస్తక పరిచయ కార్యక్రమం మొదలు కాబోతున్న తరుణంలో వచ్చిన ప్రజా గాయకుడు గద్దర్ ని మదన్ గోపాల్  గద్దర్ లోగడ పాడిన ఓ పాట పాడుతూనే  సగౌరవంగా ఆహ్వానించారు. ఆ తర్వాత గణపతి ప్రార్ధనతో సభ మొదలయింది.

నా ఈ రాతలో కూడా కొన్ని CONFLICTS  కనిపించివుంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే, నేనింకా CONTENTMENT   దశకు చేరుకోలేదు.

తోకటపా: కొత్త పుస్తకం కోసం వెడితే పాత మితృలు, పాత పరిచయస్తులైన అనేకమంది ..ఎస్. అధికారులు కనిపించారు. మిత్రుడు జ్వాలా కోరికమీద రచయిత మదన్ గోపాల్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్,  తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, 108 సర్వీసు మాజీ సీఈఓ వెంకట్ చంగవల్లి, 104 సర్వీసు  మాజీ సీఈఓ డాక్టర్ ఉట్ల బాలాజీ అందరం కలసి జ్వాలా ఇంటికి వెళ్లాం.

మా మేనకోడలు, జ్వాలా శ్రీమతి అయిన వనం  విజయలక్ష్మి,  వండనలయదు నేవురువచ్చిరేని నన్నపూర్ణకు నుద్దియౌనతని గృహిణి” అనే ప్రవరాఖ్యుని ఇల్లాలు బాపతు కాబట్టి, మా అందరికీ అప్పటికప్పుడు వండివార్చిన వేడి వేడి విందుభోజనం నిన్నటి మా కలయికలో నిజంగా హై లైట్.

కింది ఫొటోల్లో : అష్టగ్రహ కూటమి అంటే మేమే. మేము ఎనిమిదిమందిమి అన్నమాట.

PHOTOS COURTESY: JWALA










(20-04-2022)

 

5, జనవరి 2015, సోమవారం

స్వచ్ఛ భారత్ స్వప్నం సాకారం కావాలంటే


సూర్యదేవర రామచంద్రరావు అంటే చాలామందికి తెలియకపోవచ్చు, యస్.ఆర్. రావు అంటే గుర్తురాక పోవచ్చు. కానీ, సూరత్ మునిసిపల్ కమీషనర్ రావు అనగానే  చప్పున గుర్తొస్తారు ఈ 1978  బ్యాచ్ గుజరాత్ క్యాడర్  ఐ.ఏ.యస్. అధికారి. తదనంతర కాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా కేంద్రంలో సయితం ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. అయితే,  సూరత్ మునిసిపల్ కమీషనర్ గా పనిచేసిన కాలమే ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టింది.
1994 లో సూరత్ పట్టణాన్ని ప్లేగ్ వ్యాధి అతలాకుతలం చేసింది. అసలే సూరత్ కు దుర్గంధ నగరం అనే పేరు. దానికి తగ్గట్టు, ప్లేగ్ వ్యాధి జరిపిన ముట్టడితో మరింత మురికి పేరు, సూరత్ పేరులో పేరుకుపోయింది. ఆ నేపధ్యంలో యస్.ఆర్.రావు అనే యువ ఐ.ఏ.యస్.  అధికారిని ప్రభుత్వం 1995  లో సూరత్ మునిసిపల్ కమీషనర్ గా నియమించింది. పన్నుల వసూళ్లు, రహదారుల నిర్మాణాలు కాదు ఆయన మీద మోపిన బాధ్యత. ప్లేగ్ వ్యాధి తాకిడితో తలకిందయిన నగర పారిశుధ్యాన్ని తిరిగి గాడిలో పెట్టడం అనే పెను బాధ్యతను ఆయన భుజస్కంధాలపై పెట్టింది.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే  ఏమాత్రం కాలయాపన చేయకుండా ఆయన నేరుగా  రంగంలోకి దిగిపోయారు. ముందు  సూరత్ నగరానికి వున్న మురికి పేరును వొదిలించడం మొదటి పనిగా పెట్టుకున్నారు. అయితే  ఇందుకోసం అయన చీపురు పట్టుకుని వీధుల్లోకి రాలేదు. మునిసిపాలిటీ నిధులు వెచ్చించి వాక్యూం క్లీనర్లు కొనలేదు. సాధారణంగా ఐ.ఏ.యస్. అధికారుల్లో కానవచ్చే బ్యూరోక్రాట్ మనస్తత్వం ఆయనలో లేకపోవడమే ఆయనకు కలిసివచ్చిన అంశం.  అంచేత  బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఆయన ప్లేగ్ వ్యాధిపై యుద్ధం ప్రకటించారు. నగరాన్ని దుర్గందానికి దూరం చేసి, పరిశుద్ధ నగరంగా చేయడానికి కసితో పని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయనపై ఎన్నో రాజకీయ వొత్తిళ్ళు వచ్చాయి. స్థానిక నాయకులు ఆయన ప్రతిపనికీ అడ్డం పడ్డారు. కానీ ఆయన దేనినీ ఖాతరు చేయలేదు. ఎవరినీ లెక్కచేయలేదు. తను అనుకున్నది అనుకున్నట్టు చేస్తూ పోయారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు,  చోటా మోటా రాజకీయ నాయకులు వారి అనుచరులు అందరూ రావుగారికి వ్యతిరేకమే, ఒక్క సూరత్ ప్రజలు తప్ప, ఆ వూరిలో మురికివాడల్లో నివసించే జనాలు మినహా. ఏడాదిన్నర కూడా గడవక ముందే రావు ప్రజలకు దైవసమానుడిగా మారిపోయారు. ఆయన కనిపిస్తే చాలు నోట్లో వున్న పాన్ రోడ్డుమీద  ఉమ్మేయడానికి పౌరులు  సంకోచించేవాళ్ళు. చెత్త కాగితం కానీ, వాడేసిన సిటీ బస్సు టిక్కెట్టు కానీ  బయట పారేయడానికి సందేహపడేవారు. పరిసరాల పరిశుభ్రత పట్ల పౌర  సమాజంలో  ఆయన కల్పించిన అవగాహనా ఫలితం అది. రావుగారి పాలనలో సూరత్ ప్లేగ్ వ్యాధినుంచి శాశ్వితంగా విముక్తమయింది. పరిసరాలన్నీ పచ్చని  చెట్లతో అలరారడం మొదలయింది. పన్నుల వసూళ్లు స్వచ్చందంగా పెరిగాయి. తాము కట్టే పన్నులన్నీ తమకు  ఉపయోగపడే పనులకే ఖర్చు చేస్తారు అన్న ఆలోచన పౌరుల్లో  పెరగడమే పన్నుల వసూళ్ళ పెరుగుదలకు కారణం అని వేరే చెప్పనక్కరలేదు.  అనతికాలంలోనే దేశం మొత్తంలో చండీగర్ తరువాత అత్యంత పరిశుభ్ర నగరంగా సూరత్ ఎంపికయింది. ఇది సాధించడానికి ఏళ్ళూ పూళ్ళూ పట్టలేదు. వందలకోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టలేదు. ఒక అధికారి పట్టుదలతో, ప్రజలు అందించిన సహకారంతో ఇది సాధ్యపడింది. 'మన ఇంటిని శుభ్రంగా వుంచుకుందాం' అని ప్రతివారు అనుకుంటారు. 'మన పరిసరాలను కూడా అలాగే చక్కగా వుంచుకుందాం' అనే స్పృహ కల్పించడం  చాలా కష్టం. కృష్ణాజిల్లాలో జన్మించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న సూర్యదేవర రామచంద్రరావు ఈ అద్భుతాన్ని చేసి చూపారు. అందుకు  ఆయన అనుసరించిన విధానం కూడా చాలా చాలా మామూలుది. మునిసిపాలిటీలో పనిచేసే అధికారులు  ఆఫీసుల్లోని ఏసీ గదుల్ని వొదిలిపెట్టి ఉదయం ఏడుగంటలకల్లా వీధుల్లోకి వెళ్లగలిగితే సగం  సమస్య పరిష్కారం అయినట్టే అని ఆయన భావించారు. ఆయనా అలాగే చేశారు. తన అధికారులు, సిబ్బందితో చేయించారు. ఫలితం కనబడింది. అట్లా ఇట్లా కాదు  అద్భుతంగా కనబడింది.  పారిశుధ్య సిబ్బందికీ,  వారిపై అఆమాయిషీ చేసే అధికారుల నడుమ చక్కని కమ్యూనికేషన్ ఏర్పడింది. కలిగిన ఆసామీ ఎవరయినా ఇంటిముందే  రోడ్డుమీద చెత్త పారబోస్తుంటే అదేమని అడిగే ధైర్యం  మామూలు స్వీపర్ చేయలేడు. కానీ వెంట ఉన్నతాధికారి వుంటే, అలా అడిగే  ధైర్యం అదే వస్తుంది. ఇదీ, మనస్తత్వ శాస్త్రం చదివిన రావు గారి థియరీ.
అప్పటివరకు స్థానిక దినపత్రికల్లో సూరత్ అధ్వాన్నపరిస్తితుల గురించీ, అధికారుల అలసత్వం గురించీ కోకొల్లల్లుగా కధనాలు వెలువడేవి. కొద్దికాలంలోనే వార్తల స్వరూపస్వభావాల్లో ఎంతో తేడా వచ్చింది. విమర్శల పాలు పూర్తిగా తగ్గిపోయి,  ప్రశంసల జోరు పెరిగిపోయింది.
అనతికాలంలోనే అయన సూరత్ పట్టణాన్ని చక్కని పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దారు. అత్యంత పరిశుద్ధమైన భారతీయ నగరాల్లో దానికి రెండో స్థానం కల్పించారు. ఈ బృహత్తర కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వర్తించినందుకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అరుదయిన పద్మశ్రీ అవార్డు బహుకరించింది. ఒక  సివిల్ సర్వీసు అధికారికి అటువంటి 'పద్మ' పురస్కారం లభించడం కూడా అరుదయిన విషయమే.




రెండు దశాబ్దాల నాటి ఈ నేపధ్యాన్ని యెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందో దానికి కారణం ఏమిటో విపులంగా వివరించాల్సిన అవసరం లేదు. ఈనాడు దేశం నలుమూలల్లో 'స్వచ్ఛ భారత్' అనే నినాదం మారుమోగిపోతోంది. ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఈ పిలుపుకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.  పత్రికల్లో, మీడియాలో ఈ కార్యక్రమానికి అపూర్వమైన ప్రాచుర్యం దొరుకుతోంది. ప్రధాని మోడీ ప్రభ నలుదిక్కులా వెలిగిపోతూవుండడం కూడా ఒక కారణం కావచ్చు. దేశం నాలుగుచెరగుల్లో తమ ప్రతిభతో జనాలను ప్రభావితం చేయగల సమర్ధులు, తమ తమ రంగాల్లో అశేష  శేముషీ విభవం కలిగిన ప్రముఖులు అనేకమంది  స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొని విశేష ప్రచారం అందిస్తున్నారు. సెలెబ్రిటీలు తలచుకుంటే ప్రచారానికేం కొరత.  మడత నలగని దుస్తులు ధరించి చీపుర్లు పట్టుకుని వీధులు వూడుస్తుంటే చూసేవారికి కన్నుల పండువ. అయితే ఇదంతా కనిబెట్టి  చూస్తున్నవారికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా మిగిలిన అన్ని సర్కారు పధకాల మాదిరిగా ఒక ప్రచారార్భాటంగా మారిపోతుందేమో అనే భయసందేహాలు కలక్కమానవు.
స్వచ్ఛ భారత్ అనేది ఒక చక్కటి కార్యక్రమం. సందేహం లేదు.  మోడీని విధానపరంగా వ్యతిరేకించేవారు సయితం దీన్ని తప్పుపట్టలేరు. తప్పుపట్టే పరిస్తితి వస్తే, అలాటి స్తితి తెచ్చుకుంటే  మాత్రం అది సర్కారు తప్పే అవుతుంది.
మన దేశంలోనే కాదు విదేశాల్లో వుండే భారతీయులు, ప్రత్యేకించి వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు స్వచ్ఛ భారత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్ధిక సంస్కరణల  పుణ్యమా అని అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో మాదిరిగానే సకల సౌకర్యాలు మన దేశంలో కూడా  దొరుకుతున్నాయి. దొరకనిదల్లా స్వచ్చమైన వాతావరణం. పరిశుభ్రమైన పరిసరాలు. మాతృ దేశానికి తిరిగివచ్చేయాలన్న వారి బలమైన కాంక్షను బలంగా అడ్డుకుంటున్న కారణం ఇదొక్కటే.
సంస్కరణల ప్రభావం దేశంలో అన్ని రంగాల మీదా, పౌరులందరి మీదా పడింది. చదువుకుండే ఆడపిల్లల సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు, ఉపాధుల పేరుతొ గడప దాటి వెళ్ళే ఆడంగుల సంఖ్యా బాగా పెరిగింది. ఇలాటివారిలో కాస్త కలిగిన ఆడవారికి ఎదురయ్యే ఇబ్బందులు తక్కువ. వాళ్లు పనిచేసే కార్యాలయాల్లో అన్ని సౌకర్యాలు వుంటాయి. ఉన్నత కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు చదువుకునే స్కూళ్ళు కూడా అన్ని సదుపాయాలతో వుంటాయి.  పోతే, సర్కారు బళ్ళల్లో చదువుకునే ఆడపిల్లలకు,  పొద్దున్నే లేచి వెళ్ళి  పనిపాటులు చేసుకునేవారికీ, వీధుల్ని శుభ్రం చేసే ఆడవారికి అవసరమైనప్పుడు కాలకృత్యాలు తీర్చుకోగల వెసులుబాటు వుండదు. అలాటి వారు తమ ఇబ్బందిని ఎవరికీ చెప్పుకోలేరు. బలవంతంగా అణచుకుని లేనిపోని అనారోగ్యాలకు గురవుతుంటారు. స్వచ్ఛ భారత్ సంకల్పం చెప్పుకున్నప్పుడే  ప్రధాని మోడీ మనస్సులో కూడా ఈ అంశం  మొలకెత్తకపోలేదు.  యుద్ధప్రాతిపదికన పాఠశాలల్లో  ఆడపిల్లలకు మరుగు దొడ్లు నిర్మించాలని ఆయన  తలపెట్టారు. ఆలోచన మంచిదే. కానీ ఆచరణ మాత్రం అనుకున్నంత వేగంగా సాగుతున్నట్టు లేదు.
గొప్ప గొప్పవాళ్ళు చేత చీపుర్లు పట్టి వీధులు వూడవడం తప్పని ఎవ్వరూ అనరు. కానీ, ఏదో మొక్కుబడి తంతుగా సాగినప్పుడు మాత్రమే ప్రతికూల ఫలితాలు వస్తాయి. కార్యక్రమం యెంత మంచిదయినా అమల్లో నీరుకారిపోయేది చిత్తశుద్ధి కరువయినప్పుడే.
ప్రస్తుతం మన దేశంలో తీవ్రమైన కొరత వున్నది  'చిత్తశుద్ధి' ఒక్కదానికే అని  అందరికీ తెలుసు.(05-01-2015)

NOTE: Courtesy Image Owner