1969
సుమారుగా యాభయ్ ఏళ్ళ కిందటి మాట. అప్పుడు నేను ఎస్సారార్ కాలేజీలో చదువుతున్నాను.
మహాత్మాగాంధీ శతజయంతి వేడుకలను
పురస్కరించుకుని గాంధీపై పరిశోధన చేయడానికి జర్మనీలోని ప్రఖ్యాత
విశ్వవిద్యాలయం హైడెల్ బర్గ్ యూనివర్సిటీ నుంచి శర్మ మార్ల అనే ఒక ప్రొఫెసర్
వచ్చారు. వారిది కాకినాడ. చిన్నప్పుడే చదువులకోసం జర్మనీ వెళ్లి, అక్కడే జర్మన్ అమ్మాయిని పెళ్ళాడి అక్కడే స్థిర పడ్డారు.
గాంధీ గారి గురించి నగరాల్లో,
పట్టణాల్లో, మారుమూల పల్లెల్లో జనం ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవడానికి
శర్మగారు వారి యూనివర్సిటీ పనుపున ఈ పరిశోధనకు పూనుకున్నారు. ఈ యజ్ఞంలో నన్ను ఆయన
తన సహాయకుడిగా తీసుకున్నారు. సెలవుల్లో ఆయన వెంట తిరగడం, ఆయన ఏ వూరు వెడితే ఆ
వూరికి తోడుగా వెళ్ళడం, ఆ వూరిలో నా వంటి విద్యార్ధులను మరి కొంతమందిని వెంట
బెట్టుకుని ఆయన తయారు చేసిన ప్రశ్నావళి ప్రకారం ప్రజాభిప్రాయాన్ని నమోదు చేయడం ఇలా
అన్నమాట.
ఈ క్రమంలో నాకు గాంధిగారి గురించి నాకు
తెలియని విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది.
కొన్ని ఊళ్లలో గాంధి గారి ఫోటోను
ఇళ్ళల్లో పూజామందిరాలలో పెట్టుకుని పూజిస్తున్న వైనం నన్ను ఆశ్చర్య పరచింది. శాంతి
మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తిగా గాంధి గురించి తెలిసిన
నాకు ఆయన కొందరి దృష్టిలో భగవత్ స్వరూపంగా మారడం ఒకింత వింత గానే అనిపించింది. ఒక
దారీ తెన్నూ లేని మూలగట్టు పల్లెటూళ్ళలో కూడా గాంధీ అనే పేరు విన్నట్టు చెప్పారు
కానీ కొందరికి ఆయన ఎవ్వరన్నది తెలవదు.
‘దేశానికి (వాళ్ళ దృష్టిలో వాళ్ళ
ప్రాంతానికి) ఏదో చేసాడట కదయ్యా, మనకిక మంచి రోజులు వస్తాయని మా నాయనమ్మ చెప్పింది
నిజమేనా’ అని మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా వున్నారు.
‘ఆయన్ని కాల్చి చంపిన కబురు చెవిన పడిన
తర్వాత మా వూళ్ళో ఎవరింట్లో పొయ్యి వెలిగించలేదు’ అని ఒక వూళ్ళో బాగా వయసుమళ్ళిన
ఒక వ్యక్తి చెప్పారు.( ఆయన ఉద్దేశ్యం ఆ
మర్నాడు జనవరి ముప్పయి ఒకటిన అని. గాంధీ చనిపోయింది ముప్పయ్యో తేదీనే అయినా వారికి
ఆ కబురు చేరేసరికి ఒక రోజు గడిచి పోయిందిట)
నేను పుట్టిన మూడేళ్ళలోపునే మహాత్మా
గాంధి గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. శర్మ గారి ధర్మమా అని గాంధి గురించి ఒక
అవగాహనకు వచ్చే అవకాశం నాకు విద్యార్ధి దశలోనే లభించింది.